Tuesday 16 October, 2007

విజయదశమి కానుక: వరల్డ్‍స్పేస్ రేడియోలో చందమామ కథలు

శుభవార్త:

చందమామలో గత యాభై యేళ్లకు పైగా ఆబాలగోపాలాన్ని అలరిస్తున్న బేతాళ కథలు ఇప్పుడు వరల్డ్‍స్పేస్ శాటిలైట్ ఛానెల్ నం. 107, రేడియో ’స్పందన’పై నాటికలుగా ప్రసారం కానున్నాయి. విజయదశమి నుంచి ప్రతి 2వ ఆదివారం ఉదయం 8.30-9.00 మధ్య ప్రసారమయ్యే బేతాళకథానాటికలను విని ఆనందించండి. ఇవి తిరిగి ప్రతి 4వ ఆదివారం పునఃప్రసారమవుతాయి. (గతంలో పరోపకారి పాపన్న కథలు దూరదర్శన్ లో టెలిసీరియల్ గా వచ్చాయి.)

అందరికీ విజయదశమి శుభాకాంక్షలు!!!

Friday 31 August, 2007

రెండు అనాగ్రములు

వీని భామేవమి వైవాఠకుంసా?
’Weird Dream Revives Skit’
'Dear! Sweeter, vivid smirk.'

(ఒక క్లూ: ఈ టపాలో కనిపిస్తున్న తేదీ, సమయం గమనించండి)

Wednesday 8 August, 2007

వైవీయూలో ఎరుకల భాష

ఎరుకల భాషకు నిన్నమొన్నటిదాకా అసలు లిపే లేదని మీకు తెలుసా? కడప నగరం బహుజన నగర్ కు చెందిన రామకోటేశ్వర రావుకూ తెలియదు - ఆయనకు ఎరుకలతో పరిచయం ఏర్పడేదాకా. పది భాషల్లో ప్రావీణ్యమున్న ఆయనకు ఆ విషయం తెలియగానే ఆశ్చర్యమనిపించింది. ఆయన తెలుగు, హిందీ, ఆంగ్ల లిపుల ఆధారంగా కొత్త లిపిని తయారు చేశాడు. (దీనికి ఆయన 2005లో పేటెంటు కూడా పొందాడు.) ఎరుకల భాష నేర్చుకునే వారి కోసం ఆ లిపిలోనే ఐదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలు కూడా తయారుచేశాడు. ఇంత చేసిన రామకోటేశ్వరరావు ఉండేది ఒక గుడిసెలో! ఆ గుడిసెకు విద్యుత్ సౌకర్యం కూడా లేదట!!

ఎరుకల భాష కోసం ఆయన చేసిన కృషిని గుర్తించిన యోగి వేమన విశ్వవిద్యాలయం (YVU, కడప) కులపతి (వైస్ ఛాన్సలర్) ఎ. రామచంద్రారెడ్డి ఆయన్ను విశ్వవిద్యాలయంలో స్నాతకోత్తర విద్యార్థులకు, పూర్వ విద్యార్థులకు ఎరుకల భాష నేర్పడానికి టీచింగ్ అసిస్టెంటుగా నియమించారు. ఎరుకల భాష లిపిని మరింత సరళం చేయడానికి ప్రభుత్వం లేదా విశ్వవిద్యాలయం నుంచి సహకారం లభించగలదని ఆశిస్తున్నాడు రామకోటేశ్వరరావు.

(ఈరోజు హిందూలో వచ్చిన వార్త ఆధారంగా)

Thursday 5 July, 2007

చందమామ రావే...జాబిల్లి రావే...

నేను నెల కిందట రాసిన ఆ వచ్చే నెల వచ్చేసింది. కానీ అందుకు సంబంధించిన తదుపరి విశేషాల గురించి తెలియకపోవడంతో రానారె "ఏదీ!!? చందమామరావే అని పాడితే వస్తుందా? :)" అని చమత్కరించాడు. వివరాలు తెలుసుకుందామని అందరిదీ ఒకటే ఆతృతన్నమాట! అసలిది ఎవరూ అడక్కముందే రాయవలసింది. కానీ రానారె అడిగినాక రెండురోజులు గడిచేదాకా రాయడానికి వీలు కుదరలేదు. అనివార్య కారణాల వల్ల ఈ విషయం గురించి బ్లాగడం నాలుగురోజులు ఆలస్యమైనందుకు చింతిస్తున్నాను. :)

ఆ టపా శీర్షికలో వచ్చే నెలలో డిజిటల్ చందమామ తర్వాత వేసిన ప్రశ్న గుర్తు, లోపల ఉన్న "వివరాలు జూలై 2007 సంచికలో ప్రచురిస్తామని ప్రచురణకర్తలు పేర్కొన్నారు." అనే వాక్యం కాస్త పెద్దక్షరాల్లో చదువుకోవాలి. ఇక ఈ నెల ప్రచురించిన వివరాలు:
"చందమామ 61వ సంవత్సరంలోకి అడుగుపెడుతూన్న శుభసందర్భంలో పాఠకులను అలరించనున్న వినూత్న పథకాలు" గా ప్రకటించినవి:
సిడిలు - డివిడిలు:
  • పాత సంచికల నుంచి ఉత్తమమైన కథలు, వింతలు విశేషాలు.

కథల సంకలనాలు:

  • జానపద కథలు
  • బేతాళ కథలు
  • సీరియల్ కథలు
  • కామిక్స్ రూపంలో సుప్రసిద్ధ కథలు.

కాబట్టి వీటన్నిటినీ విడివిడిగా గానీ, కలిపి గానీ కొనుక్కోవచ్చన్నమాట. :) కాకపోతే ఇవి ఎప్పటి నుంచి లభ్యమౌతాయో చెప్పనేలేదు.

డిజిటల్ రంగ ప్రవేశం:

  • ఆసక్తికరమైన ఇంటరాక్టివ్ పేజెస్ తో వెబ్‍సైట్. ఇందులో మీ సృజనాత్మక సామర్థ్యాలను ప్రదర్శించడానికి మీరూ పాల్గొనవచ్చు.
  • కంప్యూటర్ ప్రియులకు ఈ-మేగజైన్

ప్రత్యేక సంచికలు:
  • ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని మరిన్ని శీర్షికలతో, ఎక్కువ పేజీలతో ప్రత్యేక సంచికలు వెలువరిస్తారట.


(వీట్లో మొదటిది ఈ నెల సంచికే! చందమామ షష్టి పూర్తిని మించిన సందర్భమేముంటుంది? :) ఈ సంచికలో డా. వై.యస్.రాజశేఖర్ రెడ్డి సందేశం ఉంది. ’మరి అబ్దుల్ కలామ్ సందేశం లేదా?’...అని మీరూ నాలాగే అనుకుంటున్నారా? అది కూడా ఉంది, కాస్త విభిన్నంగా.. ఇక అరవయ్యేళ్ళ చందమామ ప్రస్థానం గురించి ఆసక్తికరమైన ప్రత్యేక కథనం కూడా ఉంది.)
ఈ సంచికలో "నాకు నచ్చిన కథ" అని ఒక కొత్త శీర్షిక మొదలుపెట్టారు. దాంట్లో మొదటగా తనకు బాగా నచ్చిన కథ చెప్పింది అబ్దుల్ కలామ్! ఆయనకు నచ్చిన కథ పేరు "ప్రాణాన్ని కాపాడిన నిజం".

పర్యావరణ పరిరక్షణ - ఆవశ్యకత, సంబంధిత అంశాల గురించి హిందూ, హిందూ వార్షిక పర్యావరణ నివేదిక (Hindu Survey of the Environment), ది హిందూ - బిజినెస్ లైన్, ఫ్రంట్‍లైన్, పయనీర్, హిందూస్థాన్ టైమ్స్, దక్కన్ హెరాల్డ్, చందమామ, www.indiatogether.org తదితర పత్రికలు, వెబ్ సైట్లలో విస్తృతంగా రాసే కల్పవృక్ష సభ్యురాలు కాంచీ కోహ్లీ "ఆ రోజు జ్ఞాపకాలు" అంటూ ఒక కథ లాంటి తన అనుభవాన్ని గురించి చెప్తూ, పల్లెటూళ్ళలో ఉండే ప్రజలు నీళ్ళకోసం పడే కష్టాలను వివరించి, చెట్లు కనుమరుగైపోవడమే వర్షపునీరు వృథాగా వెళ్ళిపోవడానికి, భూగర్భజలాలు అడుగంటిపోవడానికి, తద్వారా వచ్చే నీళ్ళ కరువుకు కారణమని చెప్పారు.

ముఖ్యమంత్రి సందేశంలో నుంచి:

"బాలసాహిత్యం అరుదుగా వస్తున్న సమయంలో ఆ కొరతను తీరుస్తూ నెలనెలా సరికొత్త జానపద కథలతో, రంగుల బొమ్మలతో 13 భాషల్లో బాల బాలికలకు వినోదాన్ని, మనోవికాసాన్ని కలిగించే "చందమామ" తన పేరును సార్థకం చేసుకుంది.

"నాకు చిన్నప్పటి నుంచి "చందమామ" అంటే వల్లమాలిన ఇష్టం. పిల్లలందరికీ ఈ పత్రిక అంటే ప్రత్యేక అభిమానం వుంటుందని నా నిశ్చితాభిప్రాయం. ముఖ్యంగా విక్రమార్కుడి సాహసాన్ని, వివేకాన్ని ఆకర్షణీయంగా వర్ణించి, పిల్లల మేథస్సుకు పదును పెట్టే బేతాళ కథలంటే నాకు బాల్యంలో చాలా ఆసక్తి వుండేది.

"సత్యం, ధర్మం, నీతి, నిజాయితీ వంటి సామాజిక విలువలకు అద్దం పట్టే కథలను ప్రచురిస్తూ, బాల బాలికల మనస్సుపై చెరగని ముద్ర వేయడంలో "చందమామ" కృతకృత్యమైందనడంలో ఎలాంటి సందేహం లేదు.

"చిన్న పిల్లలతో బాటుగా, అన్ని వయస్సులవారికీ ఆనందాన్ని కలిగించే చందమామ మరెన్నో తరాల వారిని అలరించగలదని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను."

Monday 25 June, 2007

కవితలు రాయడమే నేరమా?

ఈ రాజకీయనాయకుల వాచాలతకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. మొన్న శరద్ పవార్, లాలూ ప్రసాద్ యాదవ్, నిన్న ఎ.బి.బర్ధన్.

“The President said he was deeply wounded by the attack on him after he decided to accept our offer to contest. He has been deeply hurt by the statement of those in high positions. The kind of boorish and churlish language that has been used amounts to denigration of the high post of President and does not befit the high positions held by those [Union Ministers] who have used such language.”

వాళ్ళ అతివాగుడుకు రాష్ట్రపతి నొచ్చుకున్నారని తెలిసీ - ఆయన పోటీ చెయ్యబోనని తేల్చి చెప్పిన తర్వాత కూడా - "రాష్ట్రపతి పని కవితలు రాయడం కాదు" అంటూ ఇంకా ఏమేమో వాగుతున్నాడొకాయన. కవితలు రాయడమే కలామ్ గారు చేసిన తప్పన్నట్లు మాట్లాడుతున్నాడీ సిగ్గులేని పెద్ద మనిషి. ఉన్నతపదవుల్లో ఉన్నవారి గురించి ఇంత హేళనగా, దురుసుగా మాట్లాడ్డమేనా ఈ రాజకీయనాయకుల సంస్కారం? వీరిదే మరో అమృతవాక్కు: రాజకీయానుభవం లేనివాళ్ళు రాష్ట్రపతిగా ఉండతగరట! రాజకీయులే నేరం చేసినా....క్షమించాలి, ఈ పుణ్యభూమిలో రాజకీయులేం చేసినా, ఏం వాగినా అది నేరం కాదుకదా? స్వార్థప్రయోజనాల కోసం, మూర్ఖపు పట్టుదలలు నిలుపుకోవడం కోసం ప్రజాభీష్టానికి, ప్రజాశ్రేయస్సుకు వ్యతిరేకంగా పనిచెయ్యడం రాజకీయులకే కదా సాధ్యం?

అసలు రాష్ట్రపతి చేయవలసిన పనేమిటి? రాజకీయులు తీసుకునే నిర్ణయాల్లో దేశప్రజలకు ఏది మేలు చేస్తుందో, ఏది రాజ్యాంగస్ఫూర్తికి అనుగుణంగా ఉందో, ఏది విఘాతం కలిగిస్తుందో తెలుసుకోవడానికి రాజకీయానుభవం అవసరమా? కలామ్ గారిని వీళ్ళు కేవలం కవితలు రాసేవాడిగానే చూస్తున్నారంటే వీళ్ళ గురించి ఏమనుకోవాలి? లేక...కవితలు రాయడాన్ని వీళ్ళు అనర్హతగా భావిస్తున్నారనుకోవాలా? అసలు ప్రజాస్వామ్యదేశంలో ప్రజల మనోభావాలను తుంగలో తొక్కిన ఈ రాజకీయ నాయకులు ఇలా ఈ దేశపు ప్రథమ పౌరుడు, సర్వసైన్యాధ్యక్షుడిపై ఇలా అవాకులు, చెవాకులు పేలుతున్నా వీళ్ళను అదుపు చేసేవాళ్ళే లేరా? తాము విమర్శిస్తున్నది సాక్షాత్తూ ఈ దేశాధ్యక్షుణ్ణే అనే స్పృహ వీరికేమాత్రమైనా ఉందా? ఈ దేశంలో ఇంకా గౌరవాన్ని నిలుపుకున్న పదవి రాష్ట్రపతి పదవొక్కటే. రాజకీయులు ప్రస్తుతం దాని గౌరవాన్నీ దిగజార్చే పనిలో ఉన్నారు.
అసలు ఈ రాష్ట్రపతి, ఉపరాష్ట్రతి పదవులకు సంబంధించి ఏది సంప్రదాయం, ఏది కాదు అనేవిషయం గురించి కూడా అధికారంలో ఉన్నవాళ్ళు తమ వాదనకు ఏది అనుకూలంగా ఉంటే దానికి "సంప్రదాయం" అని పేరు పెట్టి అడ్డగోలుగా వాదించేస్తున్నారు.

స్వాతంత్ర్యమొచ్చిన నాటి నుంచి తొలి పాతికేళ్ల కాలంలో రాజకీయనాయకులెవరూ రాష్ట్రపతులు కాలేదు. ఇప్పుడేమో రాజకీయనాయకులకు తప్ప ఇతరులకు ఆ అర్హత లేదంటున్నారు. ఈ కొత్త 'సంప్రదాయం' ఎక్కణ్ణించి వచ్చింది?

ఒకే వ్యక్తి రాష్ట్రపతిగా రెండుసార్లు ఉండకూడదంటున్నవాళ్ళు ఆమేరకు రాజ్యాంగసవరణ ఇన్నేళ్ళూ ఎందుకు చెయ్యలేదు? అవున్లే, 'సంప్రదాయం' అని పేరు పెడితే, అవసరమొచ్చినప్పుడు తమకు నచ్చిన విధంగా వాడుకోవచ్చు, అవసరం లేనప్పుడు "ఈ ఒక్కసారికీ" అని మినహాయించుకోవచ్చు, లేదా "అబ్బే, అదసలు సంప్రదాయమే కాదు! ఒకవేళ సంప్రదాయమే ఐనా పాటించనక్ఖర్లేదు" అని చేతులు దులుపుకోవచ్చు. రాజ్యాంగసవరణ చేస్తే ఆ అవకాశముండదు కదా?

Sunday 17 June, 2007

చెప్పుకోండి చూద్దాం

మొన్న రానారెకు పుట్టిన నవ్వే ఈపొద్దు నాకూ పుట్టింది. (అసలు ఇది ఎప్పుడో... పుట్టాల్సిన నవ్వ!) కాచుకోండి:

1. "కుయ్యో మొర్రో" అనడం అందరికీ తెలుసు. పోతన కూడా శ్రీమహావిష్ణువు గజేంద్రుడి "కుయ్యాలించి సంరంభియై" సిరికింజెప్పక పరిగెత్తుకొచ్చినాడని రాసినాడు. మరి కుయ్యి అంటే ఏమిటి?
2. అబాపురి = ?
3. అబ్బి = ?
4. అమ్మి = ?
5. ఓదె = ?
6. కూసం ? (కుబుసం కాదు)
7. తీటగందెరాకు ?
8. పదును ? (పదను కాదు)
9. బెట్ట ?
10. మడవ ?
11. మాసూళ్ళు ?
12. మెట్టు ? (stair కాదు)
13. లెక్క ? (గణిత సంబంధ పదం కాదు)
14. వారు ? (ఏకవచనమే!)
15. సరివాల ?



అసలివన్నీ తెలుగు పదాలేనా అన్న అనుమానం కూడా మీకు వచ్చి ఉండొచ్చు... (ముగ్గురు నలుగురికి తప్ప)! నవ్వ మాదిరే ఇవి కూడా (మొదటిది తప్ప) కడప జిల్లాలోని వాడుక పదాలు. వాటిలో కూడా వ్యవసాయ సంబంధ పదాలు ఎక్కువగా ఉన్నాయి.
(2, 7, 15 పదాల ఉచ్చారణలో తేడాలుండవచ్చు)

Thursday 7 June, 2007

ద్రౌపది ప్రేమ

స్వాతి కుమారి రాసిన కవిత గురించి సాహిత్యం గుంపులో రాస్తూ రానారె "మహాభారతంలో ద్రౌపది ఒకసారి కృష్ణుని అడుగుతుందిట - (బహుశా కర్ణునికూడా భర్తగా పొందాలనే తన కోరికను వెల్లడించే సన్నివేశంలో)" అన్నారు. ద్రౌపది కర్ణుణ్ణి కూడా భర్తగా పొందాలనుకోవడమేమిటి? నేనిది ఎక్కడా చదవలేదు, వినలేదు - ఒక్క దానవీరశూరకర్ణ సినిమాలో తప్ప. సినిమాలు వ్యాపారదృక్పథంతో తీసేవి (అన్నీ కాకపోయినా చాలా మట్టుకు). వాస్తవఘటనలను ఆధారంగా చేసుకుని తీసినవాటిలో కూడా వాస్తవాలకంటే అతిశయోక్తులు, వక్రీకరణలే ఎక్కువ. ద్రౌపది విషయానికి వస్తే ఆమెకు కర్ణుడి మీద ఆ దృష్టి ఎంతమాత్రమూ లేదనేందుకు తిరుగులేని ఆధారం స్వర్గారోహణపర్వంలో ఉంది. పాండవులు రాజ్యం వారసులకు అప్పగించి ద్రౌపదీసమేతంగా హిమాలయాల్లో పడి పోతున్నప్పుడు ముందుగా ద్రౌపది నేలకూలుతుంది. అయినా అర్జునుడితో సహా నలుగురు పాండవులు తిరిగైనా చూడకుండా స్వర్గం వైపు వెళ్తుంటే భీముడు ఆమె చనిపోయినందుకు విలపిస్తూ 'ఎందుకిలా జరిగింది?' అని అడిగితే యుధిష్టిరుడు ఇలా అంటాడు: "ఆమెకు మిగిలిన తన భర్తలకంటే అర్జునుడి మీదే ప్రేమ ఎక్కువ. (అదే ఆమె చేసిన పాపం. అందుకే ఆమె చచ్చిపోయింది)". అసలు ద్రౌపది ప్రేమించిందీ, పెళ్ళాడాలనుకున్నదీ అర్జునుడొక్కణ్ణే. అప్పటివరకూ బ్రతికాడో చచ్చాడో తెలియని అర్జునుడు కట్టెదుట కనిపించేసరికి ఆనందపరవశురాలైన అయిన ఆమె 'అతణ్ణి పెళ్ళాడాలంటే మమ్మల్నందరినీ కూడా పెళ్ళాడకతప్పదు' అని యుధిష్టిరుడు పెట్టిన నిబంధనకు తలొగ్గింది. 'ఇదెక్కడి అన్యాయం?' అని అప్పుడే నిలదీయకుండా పరిస్థితులతో రాజీపడింది. అలాంటామె తన ప్రేమను జీవితాంతం ఐదుగురు భర్తలకు "సమానంగా" పంచి ఇవ్వడం ఎలా సాధ్యమౌతుంది? అలా ఉండాలనుకోవడం ఘోరమైన అన్యాయం కాదా?
ఆమె కర్ణుణ్ణి కోరుకున్నమాటే నిజమైతే ఇక్కడ యుధిష్టిరుడి సమాధానమెలా ఉండేదో మీరే ఊహించవచ్చు. ఒక పరపురుషుణ్ని కోరుకున్న పాపానికి అసలు ఆమెను స్వర్గలోక ఛాయలకైనా రానిచ్చి ఉండేవారు కాదు.

ఇంతకూ అక్కడ రానారె అడిగిన ప్రశ్నకు సమాధానం నాకు తెలియదు. మీకేమైనా తెలిస్తే చెప్పండి.

Sunday 3 June, 2007

మన నగరాలు

రోము నగరానికి 2760 ఏళ్ళు నిండాయని సంవత్సరం పాటు ఉత్సవాలు నిర్వహించారు. అవి ఇటీవలే ముగిశాయి. ఈ లెక్క చారిత్రక ఆధారాలను బట్టి కాదు-రోమన్ కావ్యాల ప్రకారం. ఈ సందర్భంగా మన నగరాల గురించి చరిత్ర ఏం చెబుతుందో విందాం:

ముందుగా ఢిల్లీ గురించి:

ఢిల్లీలో పురానా ఖిల్లా అని ఒక కోట ఉంది. (ఢిల్లీలో లెక్కలేనన్ని కోటలున్నాయి. శతాబ్దాల పాటు అనేక పాలకుల/రాజవంశీకులకు రాజధానిగా ఉంది కాబట్టి అది సహజమే! అందువల్ల ఢిల్లీని కోటల నగరం - city of forts - అని కూడా అంటారు.) ఆ పురానా ఖిల్లా సమీపంలో పేరుకు తగినట్లే కనీసం మూడువేలయేళ్ల కిందటికాలానికి చెందిన పాతరాతియుగం నాటి జనావాసాలు బయటపడ్డాయి. అలా కాక మనం మహాభారతంలోని ఇంద్రప్రస్థాన్నే నేటి ఢిల్లీ నగరంగా తీసుకుంటే ఆ నగరం క్రీ.పూ.3150 నాటిదనుకోవాలి. అంటే దాదాపు 5150 సంవత్సరాలనాటి నగరమన్నమాట. ఈ నగరం మౌర్యుల కాలం (క్రీ.పూ.౩౦౦) నుంచి దినదినప్రవర్ధమానమౌతూ వచ్చింది.

తోమార రాజవంశీకులు ఇక్కడ క్రీ.శ. 736లో లాల్ కోట్ పేరుతో నగరాన్ని నిర్మించారు. అప్పట్నుంచి ఈ నగరాన్ని లెక్కలేనన్ని సార్లు విస్తరించడం జరిగింది - ఒక్కో పాలకుడు ఒక్కోవైపు. అలాంటి విస్తరణల్లో అతి ముఖ్యమైనవి మధ్యయుగంలోని ఢిల్లీ సుల్తానులు/మొఘలు చక్రవర్తుల కాలంలో జరిగిన ఏడు భారీ విస్తరణలు. అవి ఒక్కొక్కటీ ఏకంగా ఒక్కో నగరాన్నే సృష్టించి ఢిల్లీలో కలిపేశాయి. వాటిని 7 cities of Delhi అంటారు. ఆ తర్వాత బ్రిటిష్ కాలంలో ఎడ్వర్డ్ లుటియెన్స్ అనే ఆర్కిటెక్టు కొత్త ఢిల్లీకి రూపకల్పన చేశాడు. దాని కేంద్రభాగంలో గొప్ప వాణిజ్యకేంద్రాలుగా విలసిల్లుతున్న ప్రాంతాలు: కన్నాట్ సర్కిల్, కన్నాట్ ప్లేస్. ఇక ఇండియా గేటుకెదురుగా పార్లమెంటు భవన సముదాయాన్నానుకుని రైసీనా హిల్ మీద రాచఠీవితో వెలిగే రాష్ట్రపతిభవన్ లో అబ్దుల్ కలామ్ తర్వాత కొలువుదీరబోయేది ఎవరా అని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

కలకత్తా నగరం: కలకత్తా నగర నిర్మాతగా జాబ్ చార్నాక్ అనే ఆంగ్లేయుడి పేరును చెప్పుకున్నారు చాలా ఏళ్ళ పాటు. ఐతే కలకత్తా నగరానికి కూడా సుదీర్ఘమైన (రెండువేలయేళ్ళ పైబడిన) చరిత్ర ఉందని, జాబ్ చార్నాక్ ను కలకత్తా నగర నిర్మాతగా పేర్కొనడం తప్పని ఒక చరిత్రకారుడు కలకత్తా హైకోర్టులో కేసువేసి, సరైన ఆధారాలతో నిరూపించడంతో ఆ మేరకు చరిత్రపుస్తకాలన్నిటిలోనూ మార్పులు చెయ్యమని హైకోర్టు తీర్పునిచ్చింది.

ముంబాయిదింకో చరిత్ర: మన దేశంలో ప్రతి ఊరికీ ఒక గ్రామదేవత ఉన్నట్లే ఈ నగరానికీ ఒక దేవత ఉంది. ఆమె పేరు మహా అంబ లేక ముంబాదేవి. నగరంలోని ముంబాదేవి ఆలయంలో ఇప్పటికీ పూజలందుకుంటోంది. ఎలా పుట్టిందో తెలియని "బాంబే" అనే అపభ్రంశపు పేరును మార్చి తిరిగి ఆమె పేరుమీదుగానే ఈ నగరానికి ముంబాయి అని పేరుపెట్టారు. ఇది ఏడు దీవుల మీద నిర్మించబడిన నగరం. క్రీ.పూ. 250లో టాలెమీ దీన్ని Heptanesia లేక సప్తద్వీపనగరం అన్నాడు. ఉత్తరముంబాయిలో రాతియుగం నాటి ఆవాసాలున్నట్లు ఆధారాలున్నాయి. 1534లో దీన్ని బహదూర్ షా అనే గుజరాత్ నవాబు నుంచి ఆక్రమించుకున్న పోర్చుగీసువారు 1661లో ఈ నగరాన్ని కట్నం కింద బ్రిటిష్ రాజుకివ్వడం, ఆయన దాన్ని 1668లో ఈస్టిండియా కంపెనీకి లీజుకివ్వడం (సంవత్సరానికి 10 పౌండ్లకు!) తెలిసిన విషయాలే.

Friday 25 May, 2007

వచ్చే నెలలో డిజిటల్ చందమామ!

1947 జూలైలో మొదలైన చందమామకు ఈ నెలతో 60 సంవత్సరాలు నిండాయి. ఈ సందర్భంగా వచ్చే నెలలో డిజిటల్ రూపంలో చందమామను అభిమాన పాఠకులకు అందించే ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయి. వివరాలు జూలై 2007 సంచికలో ప్రచురిస్తామని ప్రచురణకర్తలు పేర్కొన్నారు. పోయిన్నెలలో కథానిలయం వెబ్సైటు ప్రారంభోత్సవ సమావేశంలో సిలికానాంధ్ర అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ "ప్రపంచవ్యాప్తంగా విశేషంగా అమ్ముడుపోయిన/పోతున్న హారీ పోటర్ కథలు గతంలో చందమామలో వచ్చిన శిథిలాలయం సీరియల్ కంటే గొప్పవేం కావని" అన్నారు. శిథిలాలయం గురించి నాకు అప్పుడే తెలిసింది. ఈనెల చందమామలో పాఠకుల లేఖల్లో ఒకరు శిథిలాలయం సీరియల్ ను మళ్ళీ ప్రచురించమని కోరారు. ఇలాంటి విషయాలు విన్నప్పుడు, చదివినప్పుడు ఆ శిథిలాలయం చదవాలనే కోరిక కలగడం సహజం - అందులోనూ నాలాంటివాడికి. ఆమాటకొస్తే నేను చదవాలనుకొంటున్నవాటిలో "విచిత్రకవలలు" కూడా ఉంది. అందుకే పాత చందమామలు అందుబాటులోకి వచ్చే రోజు కోసం నేను చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నాను.

చందమామలో బాపుబొమ్మలు


ఈమధ్య ఆర్కుట్లో చందమామ కమ్యూనిటీ సభ్యుడొకరు ఆసక్తికరమైన ప్రశ్నడిగినారు - చందమామలో బాపు ఎప్పుడైనా బొమ్మలేసినారా? వేస్తే ఎప్పుడు? అని. నేను పుట్టకముందెప్పుడో చందమామలో ముళ్ళపూడి వెంకటరమణ కథలు రాయడము, వాటికి బాపు బొమ్మలెయ్యడమూ జరిగినాయి. అవి నాకెట్లా తెలుస్తాయి? :)

రచన శాయి ప్రచురించిన, బాపు-రమణలు శాయికే అంకితమిచ్చిన ఉద్గ్రంథం "బాపు-రమణల బొమ్మల కథలు" గత డిసెంబర్లో హైదరాబాదులో వంగూరి ఫౌండేషన్ వారు నిర్వహించిన ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో ఆవిష్కరించడం, ఆ సదస్సుకు హాజరైన సుధాకర్, చదువరి, రమణ, నేను తలా ఒక బుక్కు కొనుక్కుని వాటిలో మొదటి పేజీలో బాపు-రమణల సంతకాలు తీసుకోవడం జరిగింది.

ఆ ఉద్గ్రంథం వెలికితీసి వెతికితే బాపు బొమ్మలేసిన రమణ కథలు 1960-1972 మధ్యకాలంలో చందమామలో వచ్చినట్లు తెలిసింది. బాపు కార్టూనులు కూడా చందమామలో 1960 నవంబర్లో వచ్చాయి. ఇవి "చందమామలో బాపు బొమ్మలు." అలా కాకుండా ఆ ప్రశ్ననే కాస్త మార్చి "చందమామ కథలకు బాపు ఎప్పుడు బొమ్మలేశారు?" అనడిగితే పై సమాధానం సరిపోదు. ఎందుకంటే బాపు చందమామ కథలకు చందమామలోనే కాకుండా బయట కూడా బొమ్మలేశారు కాబట్టి. అది ఎట్లనగా:

విద్వాన్ విశ్వం గారు ద్విపదరూపంలో రాసిన పంచతంత్రం 1950 లలో చందమామలో వచ్చింది. తర్వాత అదే పంచతంత్రం చందమామలో కథల రూపంలో కూడా సీరియల్ గా వచ్చింది. చందమామలో ఆ కథలకు బొమ్మలేసింది వపా అనుకుంటా. ఆ ద్విపద పద్యాలు, వచనం ఎంత బాగున్నాయంటే అప్పట్లోనే వాటిని పుస్తకరూపంలో తెద్దామనుకున్నారు చందమామ ప్రచురణకర్తలు. ఐతే ఎందుకనో వీలుపడలేదు. తర్వాత విశ్వం గారు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల సంపాదకుడుగా ఉన్నప్పుడు ఆయన పంచతంత్రం గురించి నాగిరెడ్డిగారిని కదిలిస్తే ఆయన "వాటిని మీరేరకంగా ప్రచురించినా నాకు మహదానందమే!" అని ప్రచురణహక్కులు ఆయనకే ఇచ్చేశారు. అప్పుడు విశ్వం గారు వాటికి బాపు చేత బొమ్మలేయించి తి.తి.దే. తరపున ద్విపదలోను, వచనంలోను ఒకే పుస్తకంగా ప్రచురించారు. అరుదైన ఈ పుస్తకం ఒకసారి హైదరాబాదు పాత పుస్తకాల షాపులో నాకంటబడి నా పంటపండింది.


ఒక పిట్టకథ: ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో "బాపు-రమణల బొమ్మల కథలు" కొన్నప్పుడు మొదటిపేజీలో బాపు-రమణల సంతకాలు తీసుకున్న మేము పనిలోపనిగా చివరిపేజీలో కార్టూనిస్టులు బాలి, చంద్రల సంతకాలు కూడా తీసేసుకున్నాం.

సరిగ్గా అప్పుడే అక్కడికి తనికెళ్ళ భరణి వచ్చాడు. సదస్సుకు బ్రహ్మానందం కూడా వచ్చాడనుకోండి - కానీ మనకు చిక్కే ఆనందాలు మూడేనట కదా: సదానందం, చిదానందం, పరమానందం. అందుకేనేమో ఆయన మాకు చిక్కలేదు. :( బాలి, చంద్ర సంతకాలు చేసిన పేజీలోనే ఆటోగ్రాఫివ్వమని నేను తనికెళ్ళ భరణిని అడిగాను. ఆయన పైనున్న సంతకాలను చూసి "వాళ్ళంటే చిత్రకారులయ్యా. మరి నేను?" అని ప్రశ్నించాడు. నేను (అతి?)తెలివిగా "మీరు రచయిత సార్!" అన్నాను - ఆయన సినీనటుడవక ముందే రచయిత కాబట్టి, పైగా అది "సాహితీ" సదస్సు కాబట్టి. ఆయన సంతోషించినట్లే కనబడ్డాడు. 'భరణి' అని సంతకం చేశాడు.

అన్నట్లు ఇంకో విషయం: ఆర్కుట్లో చందమామ కమ్యూనిటీలో 4 పోల్సు (అంటే 4 రకాల ఓట్లన్నమాట) జరుగుతున్నాయి. ఆర్కుట్లో అకౌంటున్నవారెవరైనా ఓట్లెయ్యొచ్చు. చందమామ కమ్యూనిటీలో సభ్యత్వం ఉండనక్ఖర్లేదు.

Thursday 24 May, 2007

నా IQ, నా ధోరణి

సత్యసాయి గారేమో గొప్పవాళ్ళ సరసన చేరారు. :) నేనెక్కడుంటానో కనుక్కుందామని చెయ్యి చూపించుకుంటే అది నన్ను పుసుక్కున "బిల్ గేట్స్ అంతటివాడివి" అనేసింది. ఔరా ఏమి దీని వాచాలత? అనిపించినా ఇంకా ఏమంటుందో విందామని చెవి ఒగ్గాను - ఏం లేదులెండి నన్ను సాయిగారిసరసన ఎందుకు చేర్చలేదో తెలుసుకుందామని. :)

నేను లెక్కల్లో ఫస్టట. అది నాకు ముందే తెలుసోచ్.

నా పదసంపద తిరుగులేనిదట. సంతోషం! :) (ష్...వినయం! వినయం!!)

ఇంకా నాకేమో బోలెడంత జ్ఞాపకశక్తట. :ఓ... ఇది అర్ధసత్యం మాత్రమే!

ఎందుకంటే నేను సాధారణంగా పొద్దునేం తిన్నానో మధ్యాహ్నానికి మర్చిపోతుంటా. :) చిన్నవాడినైనా ఇది చాలదా ప్రొఫెసరుగారిని, నన్ను ఒకే వర్గంలో చేర్చడానికి? ;-)

ఇకపోతే నేను దారుణంగా దెబ్బతిన్నది Visual-Spatial Intelligence లో. దీంట్లో నాకు 70%-80% మాత్రమే వచ్చాయి. :(

ఎలాగూ "కోహమ్?" అంటూ బయలుదేరాను కాబట్టి ఇంకొక టెస్టు - నువ్వెలాంటి వెధవాయివో తెలుసుకో మంటుంటే అదీ ప్రయత్నించాను. అది ఇలా అంది:

What Be Your Nerd Type?
Your Result: Literature Nerd
 

Does sitting by a nice cozy fire, with a cup of hot tea/chocolate, and a book you can read for hours even when your eyes grow red and dry and you look sort of scary sitting there with your insomniac appearance? Then you fit this category perfectly! You love the power of the written word and its eloquence; and you may like to read/write poetry or novels. You contribute to the smart people of today's society, however you can probably be overly-critical of works.

It's okay. I understand.

Science/Math Nerd
 
Social Nerd
 
Musician
 
Artistic Nerd
 
Drama Nerd
 
Anime Nerd
 
Gamer/Computer Nerd
 
What Be Your Nerd Type?
Quizzes for MySpace




PS: ఈ మధ్య నేను ఊళ్ళో లేని సమయంలో జనాలు బ్లాగుల్లో పరపరా రాసిపారేశారు. దాంతో నేను చదవాల్సినవి, చదవకుండా వదిలేసిన టపాలు పేరుకుపోయాయి. దాన్ని కొంచెం తగ్గించడం కోసం ఇలా ట్రాఫిక్ డైవర్షన్ కోసం ఈ టపా. ;-) మీరు కొంతకాలం కొత్తటపాలు రాయడం మాని ఈ పరీక్షలు మీ గురించి ఏమంటాయో తెలుసుకుంటూ ఉండండి. ఈలోపు నేను మీరు ఇటీవల రాసినవి చదివేస్తా. :)

Monday 23 April, 2007

జయహో ఇస్రో!




నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నీవెగిరిపోతె నిబిడానందంతో మేము!
చల్లని చందమామపై నువ్వడుగిడితే మురిసిపోవాలనీ మేమె!!
Photo: ISRO

Friday 13 April, 2007

నదిరే, పుదిరే

గమనిక 1: ఇది సినిమా పాట గురించి కాదు.
గమనిక 2: అనిల్ బ్లాగులో నటురె, ఫుటురె, చదవగానే ఇది గుర్తొచ్చి బ్లాగాలనిపించింది. ఇది చదివే ముందొకసారి విహారి గారి బ్లాగులో మొట్టిక్కాయలు చదవవలసిందిగా మనవి. వాళ్ళిద్దరికీ ముందుగా ధన్యవాదాలు.

ముచ్చటగా మూడోమాట: చిన్నప్పుడు మా బళ్ళో సెక్షన్లు, మొట్టికాయలు మినహా హిందీ విషయంలో విహారి గారి అనుభవాలు, నా అనుభవాలు ఒకటేనని తేలడం వల్ల కత్తిరించి అతకడం కంటే ఒక లంగరెయ్యడం సుఖమని భావించి పైన ఆ పనే చేశాను.

ఇక చదవండి:



నేను ఢిల్లీలో ఉన్నప్పుడు సిటీబస్సుల మీద బోర్డులు నాకు అర్థం కాని భాషలో ఉండడం వల్ల నాకు అసలు అర్థం అయ్యేవి కావు. (నాకు అర్థం కాని భాష అనగా హిందీ అని నా భావము. మరియొక విధమ్మున జెప్పవలెనన్న ఆంధ్రము, ఆంగ్లము దక్క ఇతరభాషలన్నియు నాకర్థము గానివే)

పాడగా పాడగా రాగమైనప్పుడు చూడగా చూడగా ఏమౌతుంది? నా తలకాయవుతుంది. (నా తలకాయలో ఏమీ ఉండదని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు.) అందువల్ల నేనెంత చూసినా ఆ బోర్డులు నాకు అర్థమయ్యేవి కావు. అలా నాకు అర్థంకాని బోర్డులు బోలెడు! అవన్నీ తమకు అందిన బస్సులెక్కి నగరవీధుల్లో ఊరేగుతూ ఉండేవి. అలాంటి బోర్డుల్లో ముఖ్యమైనవి రెండు: నదిరే స్టేశన్, పుదిరే స్టేశన్.

స్టేశన్ ఏమిట్రా? రాన్రానూ రాజుగారి గుర్రం గాడిదౌతోందే అని ఆగ్రహించకండి. [ఇంకో మనవి: రాజుగారి గుర్రమా అదెక్కడుంది? అని వెదక్కండి. చెప్పాలంటే నాకు వినయం అడ్డొస్తుంది. ;-)] పవిత్ర ఉత్తరభారతదేశంలో అంథే! మనం ప్రసాద్ అంటామా? వాళ్ళు ప్రషాద్ అంటారు. మనం నమస్కారం అంటాం. వాళ్ళేమో నమష్కార్ అంటారు. దాంతో చిరాకేసి ఇరిటేషన్ అంటామా? వాళ్ళేమో నింపాదిగా ఇరిటేసన్ అంటారు. శ, ష, స లలో ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు వాడతారో తెలియక వినే దాక్షిణాత్యులకు పిచ్చెక్కిపోవాల్సిందే! ఇలాంటి పిచ్చి మా ఆఫీసులోనాకు రోజూ ఎక్కుతుంది. ఎందుకంటే ఆఫీసులో నా పక్కసీటమ్మాయిది బీహారు. ఐతే ఏంటట? మాది రాయలసీమ. ఎవరి గొప్ప వారిది. ;-) ప్రతిరోజూ ఏదో ఒక విషయమ్మీద ఆ అమ్మాయికి, నాకు గొడవవుతుంది - ఉత్తరభారతదేశానికి, దక్షిణభారతదేశానికి గల తేడాల మూలంగానో లేక ఆ తేడాల మీదనో. మా ఇద్దరికీ పనీపాటా లేనప్పుడు 'బీహారు ఉండేది ఉత్తరభారతదేశంలోనేనా కాదా?' అని కూడా వాదించుకుంటాం. ఏడుగురు అక్కచెల్లెళ్ళను మినహాయించి వింధ్యపర్వతాలకు అవతలుండేదంతా 'ఉత్త'రభారతదేశమేనంటాను నేను. ఎంతమాత్రమూ కాదు - మాది తూర్పు భారతదేశమంటుంది ఆ అమ్మాయి. తెలుగు రాదు కదా? అందుకే 'East India' అని ఒకసారి, 'పూరబ్ భారత్ దేష్' అని ఒకసారి... ఆ గొడవ మాకొదిలేయండి. మళ్ళీ ఢిల్లీ నగర వీధుల్లో నా వెతలు చూతము రారండి.

"ఆ బోర్డు మీద ఏమని రాసుంది?" అని ఎవరినైనా అడిగేటంత హిందీ మనకు రాదు కదా? ఆక్కడికీ సాహసం చేసి ఒకసారి హృదయమున్న ఒక 'దిల్లీ'వాసిని "ఓ క్యా హై?" అనడిగేశాను. "ఓ బోర్డ్ హై" అని చెప్పేసి చక్కా వెళ్ళిపోయాడు ఆ ఢిల్లీవాసి.

ఇక "ఆ బోర్డు మీద ఏముంది?" అనడిగేటంత హిందీ మనకు వచ్చిందెప్పుడు? "ఉస్,బోర్డ్, మే, మై, తుస్, బుస్..." అని నాలో నేను గొణుక్కోవలసిందే! ఇలా కుదరని చాలా రోజులు కష్టపడి నాకు తెలిసిన హిందీ అంతా గుర్తుతెచ్చుకుని, తెచ్చుకుని 'మీద'ను హిందీలో 'ఊపర్' అంటారని ఊహించాను. 'ఉస్ బోర్డ్ ఊపర్ క్యాహై?' అని ఇంకొకరోజు ఇంకొక 'దిల్'వాలాను అడిగాను. ఆయన నా వైపు విచిత్రంగా చూసి పలక్కుండానే వెళ్ళిపోయాడు. "అంత కష్టమెందుకు? చక్కగా ఇంగిలీసులో అడగొచ్చు కదా?" అని మీరంటారని నాకు తెలుసు. కానీ దిల్లీలో ఇన్లాండు లెటరును కూడా అంతర్దేశీయ్ పత్ర్ అంటారు. అలాంటి పవిత్ర నగరంలో (హైదరాబాదులో తెలుగురాని దుకాణదార్లను అడిగినట్లు) ఇంగ్లీషులో అడగాలంటే నాకు తెలియకుండా నాకే సిగ్గేసేది. :(

నాకసలే మతిమరపు ఎక్కువ. అందువల్ల రోడ్లమీద చూసినప్పుడే తప్ప ఇల్లు చేరాక ఈ నదిరే, పుదిరే ల గురించి గుర్తుండేది కాదు. అందువల్ల ఆ సందేహం చాలారోజులు అలాగే ఉండిపోయింది.


చివరకు న.ది.రే., పుదిరే ల మిష్టరీ విచ్చిపోకముందే ఒక శుభదినాన హైదరాబాదుకు తిరుగుప్రయాణమయ్యాను. రైలెక్కడానికి న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ కు వెళ్ళడానికి ఏ బస్సు ఎక్కాలని అడిగి కనుక్కుంటే రూట్ నంబరెంతో చెప్పారు. తీరా చూస్తే ఆ బస్సు మీద న.ది.రే. స్టేశన్ అని ఉంది. దారి పొడవునా దాని గురించే తీవ్రాతి తీవ్రంగా ఆలోచిస్తూ న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర ఆ బస్సు దిగి ఎదురుగా కనిపిస్తున్న "యీ దిల్లీ రేలవే స్టేశన్" అనే బోర్డు చూడగానే డిటెక్టివు కేయాస్ పెట్టిన రెండో కేక వినబడింది. (మొదటి కేక ఎప్పుడు వినబడింది? అనే సందేహం మీకొస్తే మీకు "బావా...చీ" అన్న మరదలు పిల్ల గురించి తెలియదన్నమాట. :)) అంటే డిటెక్టివు కేయాస్ రెండో కేసు విజయవంతంగా విచ్చగొట్టేశాడని అర్థం.

ఇంతకూ ఆ కేక వెనకనున్న రహస్యం: న.ది.రే. స్టేశన్ అంటే నయీ దిల్లీ రేల్వే స్టేశన్ అని, అలాగే పు.ది.రే. స్టేశన్ అంటే పురానీ దిల్లీ రేల్వే స్టేశన్ అని తెలియడమే! ఆ విధంగా అభినవ డిటెక్టివు కేయాసు రెండో కేసు విజయవంతంగా మూతపడింది అనగా క్లోజైంది.

నాకు నచ్చిన మరియు చచ్చినా నచ్చని ప్రకటనలు

నేను టీవీ పెద్దగా చూడను. ఐనా టీవీలో ఇటీవలి కాలంలో నేను చూసిన వాణిజ్య ప్రకటనల్లో నాకు నచ్చినవి, నచ్చనివి కొన్ని:
(వాణిజ్య ప్రకటనల గురించి సంభవామి బ్లాగులో రాసింది చదివాక)


చిన్నపిల్లలతో తీసిన ప్రకటనలన్నీ నాకు బాగా నచ్చుతాయి. మచ్చుకు కొన్ని -

సర్ఫ్ ఎక్సెల్ ప్రకటనలు:
మరక మంచిదేగా! - (శక్తి కొద్దీ బురదతో పోట్లాడి, విజయోత్సాహంతో "సారీ చెప్తున్నాడు" అని చెప్పేదొకటి, షూ లేసులతో కుస్తీపట్టి దుమ్ములో మునిగితేలేదొకటి),

కోల్గేట్ వారి చిన్నపిల్లల ప్రకటన :
"మ్...దంతక్షయం!"
":( అక్కా?"
"నేను డెంటిస్ట్ ని"
..."దంతక్షయం కావడం కష్టం డాక్టర్!",

అలాగే హగ్గీస్ "వాటర్ ఫాల్" ప్రకటన...ఎంత అందంగా ఉంటుందో కదా?

కొంతకాలం కిందట వచ్చిన రిలయన్సు వారి ఇన్సూరెన్సుకు సంబంధించిన ప్రశ్నల ప్రకటన:

"నువ్వు చాక్లెట్లు ఎందుకు తింటావు?"
"నీకు కూడా గడ్డం వచ్చేస్తేనో??".

(ఇది చూసినంతసేపూ ముద్దొస్తుంది గానీ చివర్లో చిన్నపిల్లలడిగేవి అర్థం లేని ప్రశ్నలనడమే బాలేదు.)

ఇలాంటివే మరికొన్ని ప్రకటనలు...బ్రాండు పేరుతో సంబంధం లేకుండా అన్ని చిన్న పిల్లల వస్తువుల ప్రకటనలు.

ఇక నాకు చూస్తేనే ఒళ్ళుకంపరం కలిగించే ప్రకటనలు:

చిన్నపిల్లాడితో తీసిన గోద్రెజ్ హేర్ డై ప్రకటన - దీంట్లో తండ్రికి తెల్లజుట్టుంటే కొడుకు దాన్ని అవమానంగా భావించడం, దాంతో ఆ తండ్రి తన జుట్టుకు రంగేసుకోక తప్పదని చూపించడం నాకు నచ్చలేదు. ఎమోషనల్ బ్లాక్ మెయిలింగంటే ఇదేనేమో? ఈ కోవకు చెందిందే ఇంకొకటి:

రంగుల సెల్ ఫోన్ల గురించి వచ్చిన ఒక ప్రకటన - దీంట్లో రంగుల్లేని సెల్ ఫోన్ వాడేవాళ్ళందరూ దాన్నొక అవమానంగా భావించి తమ సెల్ ఫోన్లను ఎవరికంటా పడకుండా దాచేందుకు నానా అవస్థలు పడుతున్నట్లు చూపించారు. ఇప్పటికీ నేను వాడుతున్నది రంగులుగానీ, (కెమెరా, FM రేడియో లాంటి) అదనపు హంగులు గానీ ఏ మాత్రమూ లేని అతి సాధారణమైన సెల్ ఫోన్ మాత్రమేనని బ్లాగుముఖంగా సగర్వంగా ప్రకటిస్తున్నాను.

మింటో-ఫ్రెష్ ప్రకటనలు - ఇవి మరీ దారుణంగా ఉంటాయి. (వీటిలో ఒకటి మాత్రం నాకు నచ్చుతుంది: అదేమిటంటే ఒక నిండు గర్భవతిని పార్కులో ఒక ఉయ్యాల మీద కూర్చోబెట్టి ఆమె భర్త మింటోఫ్రెష్ చప్పరించి నోటితో మెల్లగా గాలి వదలగానే ఆ గాలి తాకిడికే ఉయ్యాల ఊగుతుంది.)

కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం

ఈనాడులో వార్త

అంబవరం వద్ద ఉక్కు కర్మాగారం


* చొరవ చూపుతున్న ముఖ్యమంత్రి వై.ఎస్‌.
* 8000 ఎకరాల కేటాయింపునకు సన్నాహాలు

జిల్లా రూపురేఖలు మారిపోతున్నాయి. సిమెంటు ఉత్పాదనలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న జిల్లాలో స్టీల్‌ కంపెనీని నెలకొల్పేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. బ్రాండిగ్స్‌, ఐఐఐటీ తదితర సంస్థల ఏర్పాటుకు చొరవచూపుతూనే మరోవైపు స్టీలు కంపెనీని తీసుకువచ్చేందుకు వై.ఎస్‌. ప్రయత్నాలు చేస్తున్నారు. జమ్మలమడుగు మండలం అంబవరం పరిసర ప్రాంతాల్లో ఈ కర్మాగారం కోసం భూమిని కేటాయించేందుకు జిల్లా ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్‌ 19న జిల్లాను సందర్శించనున్న ముఖ్యమంత్రి ఈ అంశంపై చర్చించనున్నారు.

న్యూస్‌టుడే, కడప


ఉక్కు కర్మాగారాలకు ప్రధాన వనరు అయిన ఇనుప ఖనిజం కర్ణాటకలోని బళ్లారి నుంచి చెన్నై నౌకాశ్రయం ద్వారా విస్తారంగా విదేశాలకు ఎగుమతి అవుతోంది. ప్రస్తుతం బళ్లారి చుట్టుపక్కల, అనంతపురం సరిహద్దులో మినహా మిగతా రాయలసీమ జిల్లాల్లో స్టీల్‌ కంపెనీలు లేకపోవడంతో అధికభాగం ఇనుప ఖనిజం ఇతర ప్రాంతాలకు తరలిపోతోంది. జిల్లా మీదుగానే చెన్నైకు రవాణా చేస్తుండటంతో ఇక్కడ స్టీల్‌ కంపెనీ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా కొందరు పారిశ్రామికవేత్తలతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. కంపెనీ నిర్మాణానికి అనువైన భూమిని ముందుగా గుర్తిస్తే ఔత్సాహికులు పరిశీలించి సానుకూలంగా స్పందించేందుకు అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. అధికారులు ఇప్పటికే స్థల పరిశీలనలో నిమగ్నమై ఉన్నారు.
కొలిక్కివచ్చిన స్థల పరిశీలన
* ముద్దనూరు, జమ్మలమడుగుల మధ్య కంపెనీ నిర్మించేందుకు అనుకూలంగా ఉంటుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. అంబవరం పరిసర ప్రాంతాల్లో దాదాపు 8,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు వారు గుర్తించారు. పట్టాభూమిని సేకరించేందుకు పెద్ద కసరత్తు చేయాల్సిన అవసరం కూడా ఉండదని భావిస్తున్నారు.
* ముద్దనూరు రైల్వేలైను సమీపంలో ఉండటంతో ఇనుప ఖనిజం, బొగ్గు దిగుమతి చేసుకొనేందుకు, ఉత్పత్తిచేసిన స్టీలు రవాణా చేసుకునేందుకు ఎంతో అనువుగా ఉంటుంది. దగ్గరలో ఉన్న మైలవరం జలాశయం నుంచి కంపెనీకి అవసరమైన నీరు సరఫరా చేసేందుకూ వెసులుబాటు ఉంటుంది.
* అంబవరం వద్ద స్టీలు కంపెనీ ఏర్పాటుచేస్తే పరిసర గ్రామాలైన పాటి, బొమ్మేపల్లి, ఒంటిమిద్దె, పొన్నతోట, బి.ఆర్‌.కొట్టాల తదితర గ్రామాల ప్రజలకు మహర్దశ పట్టినట్టే!

-----------------------

ఈనెల 20న మైలవరం మండలంలోని నవాబుపేట సమీపంలో దాల్మియా (ఈశ్వర్‌) సిమెంటు ఫ్యాక్టరీ శంకుస్థాపన

Monday 9 April, 2007

హైదరాబాదులో సులభం-బెంగుళూరులో కష్టం?

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐ.ఐ.టి. ప్రవేశపరీక్ష (IIT JEE 2007) నిన్న జరిగింది. ఈ పరీక్ష గురించి ఈరోజు హిందూలో రెండువార్తాకథనాలు ప్రచురించినారు: ఒకటి హైదరాబాదు నుంచి, ఇంకొకటి బెంగుళూరు నుంచి. విచిత్రమేమిటంటే ఈ పరీక్ష సులభంగా ఉందని విద్యార్థులంటున్నట్లుగా హైదరాబాదు విలేకరి, చాలా కష్టంగా ఉందంటున్నట్లుగా బెంగుళూరు విలేకరి రాసినారు. :O

ఏమైనా హైదరాబాదులో సులభమంటున్నారు కాబట్టి ఈసారి కూడా ఐ.ఐ.టి.ల్లో ఆంధ్రా విద్యార్థుల హవా కొనసాగుతుందని ఆశించవచ్చా?

ఈ ప్రవేశపరీక్షలో గతానికి భిన్నంగా ఈసారి అన్నీ ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలే అడిగారట. పైగా ఈసారి పరీక్ష మూడు పేపర్లు కాదు, రెండు పేపర్లే. JEE సులభమైనా, కష్టమైనా ఆ ప్రభావం ఎమ్‌సెట్ మీద పడుతుంది.

ఇంకో విషయమేమిటంటే ఈసారి JEE కి నిరుటికంటే తక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. దాంతో కొన్ని పత్రికలు విద్యార్థుల్లో ఐ.ఐ.టి.ల పట్ల మోజు తగ్గిపోయిందని రాసినాయి. అసలు విషయమేమిటంటే ఈసారి ఈ పరీక్ష ఎవరూ రెండుసార్లకు మించి రాయకూడదని నిబంధనలను సవరించినారు. అందువల్ల పూర్తిస్థాయిలో పరీక్షకు తయారైనవాళ్ళే దరఖాస్తు చేసుకున్నారు. దాంతో దరఖాస్తులు సహజంగానే తగ్గిపోయినాయి.

మోసపోయిన వరూధిని

కొత్తపాళీ గారి బ్లాగులో సుగాత్రి "అమాయకంగా" అడిగిన ప్రశ్న: "వరూధిని చివరికి మోసపోయింది అన్నారేమిటండీ? పాపం...నిజంగానే మోసపోయిందా?" అని.

వరూధినీప్రవరాఖ్యుల కథ అందరికీ తెలిసిందేననుకుంటున్నాను. వరూధిని వక్షమ్మీద చెయ్యేసి గోళ్ళు గుచ్చుకునేంత బలంగా తోసేసిన తర్వాత ప్రవరాఖ్యుడు తన నిష్టాగరిష్టత చేత అక్కడ మాయమై ఇక్కడ ఇంట్లో వచ్చి పడ్డాడు కదా? ఆ తర్వాతి కథేమిటంటే...

గంధర్వలోకంలో ఎప్పటి నుంచో వరూధినిని ప్రేమిస్తున్న వాడొకడున్నాడు. ఐతే వాడు వరూధిని కంటికి ఆనలేదు. వాడికి ఇక్కడ హిమవన్నగం మీద జరిగిన సంఘటన ఎలా తెలిసిందో తెలిసింది. దాంతో వాడు "Everything is fair in war and love" అనుకుంటూ అచ్చం ప్రవరాఖ్యుడిలా వేషం మార్చుకుని వరూధిని చెంతకు చేరాడు. ఆ అమాయకురాలు వాడు నిజంగానే ప్రవరుడనుకున్నది. కానీ మోసం ఎంతో కాలం దాగదు కదా? పైగా నిద్రపోయేటప్పుడు, శృంగారంలో అసలు రూపాలు బయటపడతాయంటారు. వాడిది దొంగవేషమని తెలుసుకున్న వరూధిని వాణ్ణి వదిలించుకుంది. కానీ ఈలోపే జరిగిన ప్రణయఫలంగా వరూధినికొక కొడుకు పుట్టాడు. వాడిపేరు స్వరోచి.

ఇదిలా ఉండగా ఆ వరూధినికొక తమ్ముడున్నాడు. వాడి పేరు ఇందీవరాక్షుడు. వాడికొక కూతురు. పేరు మనోరమ. వాడు ఒక ముని దగ్గర దొంగతనంగా ఆయుర్వేదం నేర్చుకుని, పోతూ పోతూ ఆయన్నే ఎగతాళి చేసేసరికి ఆయనకు కోపమొచ్చి వాణ్ని రాక్షసుడైపొమ్మని శపిస్తాడు. వీడు బావురుమని వేడుకోగా నువ్వు ఎప్పుడైతే తెలియక నీ సొంత కూతుర్నే మింగబోతావో అప్పుడే ఒక వీరుడి వల్ల నీకు శాపవిమోచనం కలుగుతుంది అని అనుగ్రహిస్తాడు. ఆ వీరుడే వరూధిని కొడుకైన స్వరోచి. ఆ స్వరోచి కొడుకే మనువు. ఆ మనువు పుట్టుక వెనకున్న కథే స్వారోచిష మనుసంభవం (స్వరోచి కొడుకైన మనువు పుట్టుక) లేక మనుచరిత్ర.

కొసమెరుపేమిటంటే ఇంతా చేసి ఆ మనువు పుట్టింది మనోరమ కడుపున కాదు!

Tuesday 3 April, 2007

బొట్టు-జ్ఞానం

రాధిక గారి సందేహం చదివాక గూగుల్ చేసి చూస్తే బొట్టు గురించి బోలెడు విషయాలు తెలిశాయి. వాటికి నాకు తెలిసినవాటిని కలిపి రాస్తే ఇది తయారైంది.

యోగ, ఆగమ, తాంత్రిక శాస్త్రాల ప్రకారం మన శరీరంలో ఉద్దీపనం చెందిన కుండలినీ శక్తి వెన్నెముక వెంబడి గల శక్తి కేంద్రాలను దాటుకుని శిరస్సును, తద్వారా పరాశక్తిని చేరుకుంటుంది. ఆ శక్తికేంద్రాలు ఏడు. వీటినే చక్రాలు అంటారు. అవి:

మూలాధార చక్రం,
స్వాధిష్ఠాన చక్రం,
మణిపూర చక్రం,
అనాహత చక్రం,
విశుద్ధ చక్రం,
ఆజ్ఞా చక్రం,
సహస్రార చక్రం
ఇవీ ఆ ఏడు చక్రాలు.
నుదుటి మీద కనుబొమల నడుమ బొట్టు పెట్టుకునే ప్రాంతంలో ఆరవదైన అగ్నిచక్రం/ఆజ్ఞాచక్రం ఉంటుందట. అగ్ని తేజస్సుకు, జ్ఞానానికి చిహ్నం. ఆజ్ఞాచక్రం అంతర్గతమైన/నిబిడీకృతమైన జ్ఞానానికి చిహ్నం. మన అనుభవ, సంచిత జ్ఞానమంతా అక్కడే కేంద్రీకృతమై ఉంటుంది. ధ్యానం చేసినప్పుడు ఉద్దీపనం చెందే కుండలినీశక్తి వెన్నెముక అడుగునుండి పైకి పాకుతుంది. ఆ శక్తి శరీరం లో నుంచి ఈ చక్రం గుండా వెలుపలికి పోతుందని తంత్రవేత్తల నమ్మకం. అక్కడ పెట్టుకునే బొట్టు ఆ శక్తిని వెలుపలికి పోనివ్వకుండా అడ్డుకుని తద్వారా ఏకాగ్రతను, ధారణ శక్తిని పెంపొందిస్తుందని వారంటారు. బొట్టు దుష్టశక్తులను, మనకు రానున్న చెడును అడ్డుకుని మనలను కాపాడుతుందని ఒక నమ్మకం.


ప్రాచీన కాలంలో ఆర్యసమాజంలో పెళ్ళి కొడుకు పెళ్ళైందనడానికి గుర్తుగా పెళ్ళి కూతురి నుదుటన బొట్టు పెట్టేవాడు. బహుశా సుమంగళి యొక్క ముత్తైదువతనానికి ఒక చిహ్నంగా నిలచిన బొట్టు ఒక సంప్రదాయంగా మారింది అక్కడి నుంచే కావచ్చు. మొదట్లో పెళ్ళైన ముత్తైదువులే తప్ప పెళ్ళికాని ఆడవాళ్ళు అసలు బొట్టు పెట్టుకునేవాళ్ళు కాదట! (ఇప్పుడు పాపిట్లో పెట్టుకునే బొట్టులాగే).

ఆడవాళ్ళు రకరకాల వస్తువుల నుంచి తయారుచేసిన బొట్లు పెట్టుకున్నప్పటికీ మగవాళ్ళు మాత్రం సాధారణంగా చందనపు బొట్టును పెట్టుకుంటారు. మనదేశంలాంటి ఉష్ణమండలపుదేశాల్లో ఇది చల్లదనాన్ని కలిగిస్తుంది.

బొట్టునే కుంకుమ అని, మాంగల్యం అని (మంగళప్రదమైనదనే అర్థంలో), తిలకమని, సింధూరమని అంటారు. హనుమంతుడి ఒళ్ళంతా సింధూరవర్ణంలో ఉండడానికి ఒక చక్కటి కథ చెప్తారు: ఒకసారి సీతాదేవి సింధూరపు బొట్టు పెట్టుకోవడం చూసిన హనుమంతుడు ఆమెను అడిగాడట ఆ బొట్టెందుకు పెట్టుకుంటారని. అప్పుడు సీతమ్మ ఈ సింధూరపు బొట్టు పెట్టుకునేవాళ్ళమీద రామయ్య అనుగ్రహం ఉంటుందనో ఏదో చెప్పిందట. అప్పుడు హనుమంతుడు తన మీద రాముడి దయ సంపూర్తిగా ఉండాలని ఒళ్ళంతా సింధూరం పులుముకున్నాడట. అదీ కథ.

హిందీ లో బొట్టును బిందీ అంటారు. ఇది బిందు అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. ఈ మాటకు చుక్క అని అర్థం. సాధారణంగా ఇది ఎర్రని ఎరుపురంగులో ఉంటుంది. బొట్టు స్త్రీశక్తికి ప్రతీకగా కూడా చెప్తారు. దీనిని ధరించిన స్త్రీలను, వారి భర్తలను ఆ శక్తే కాపాడుతుందని ఒక నమ్మకం.
-------------------------------------------------------------------------------
(వేదకాలంలోనే గార్గి, మైత్రేయి, లోపాముద్ర, రోమశ లాంటి స్త్రీలు గొప్ప పాండిత్యం కలవారుగా గుర్తించిన దేశం మనది. ఇదే దేశంలో స్త్రీలు, శూద్రులకు జ్ఞానం పొందే అర్హత లేదని తర్వాతి కాలంలో ఛాందసులు తీర్మానించారు. ఇక భర్త పోయిన స్త్రీకి జ్ఞానం అక్ఖర్లేదా అంటే ఏం చెప్తాం? బృహదారణ్యకోపనిషత్తులో ఒక కథ ఉంది. దాంట్లో జనకమహారాజు స్వయంగా గొప్ప జ్ఞాని. అలాంటివాడు పండితులతో ఏర్పాటు చేసిన చర్చాగోష్టిలో యాజ్ఞవల్క్యుడనే వాడు అందరినీ ఓడిస్తాడు. చివరకు గార్గి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక "ఎక్కువగా ప్రశ్నించావంటే నీ తల పగిలిపోతుంది" అని బెదిరించి ఆమె నోరు మూయిస్తాడు. తర్వాతి కాలంలో మగవాడు ఆడవాళ్ళ మీద అదే దౌర్జన్యాన్ని ప్రయోగించి వాళ్లను ఆలోచించనివ్వకుండా, వాళ్లకు చదువు-సంధ్యల్లేకుండా చేశారేమో? మీకు కచ-దేవయాని కథ తెలిసే ఉంటుంది. దాంట్లో రాక్షసులు కచుణ్ణి చంపి శుక్రాచార్యుడి కడుపులోకి పంపేసినప్పుడు అతణ్ణి బ్రతికించిన శుక్రుడు మృతసంజీవనీవిద్యను కచుడికే నేర్పి తన ప్రాణాలు వాడి చేతుల్లో పెట్టడానికి సిద్ధపడుతాడు. ఏం? అక్కడే ఉన్న తన కూతురు దేవయానికే నేర్పొచ్చు గదా? ఆమెకెందుకు నేర్పలేదంటే స్త్రీలు మంత్రోపదేశానికి అనర్హులట!!!)

Sunday 1 April, 2007

జైనమతంలో అహింస

అన్ని మతాలూ అహింస గురించి చెప్పినా అహింసను మరీ ఆచరణసాధ్యం కానంత తీవ్ర స్థాయికి తీసుకెళ్ళింది మాత్రం జైనమతమే. జైనమతం ప్రజాదరణ పొందలేకపోవడానికి కూడా అదే కారణమేమో? ఎందుకంటే గాలి పీలిస్తే గాల్లోని సూక్ష్మజీవులు చచ్చిపోతాయని మూతికి గుడ్డ కట్టుకుంటారు. నీళ్ళు వడగట్టుకుని తాగడం సరే, అడుగు తీసి అడుగువేసేటప్పుడు కాలికింద పడి సూక్ష్మజీవులు చచ్చిపోతాయని నెమలీకలతో చేసిన పొరకతో నడిచినంతమేరా అడుగేసేముందు నేలను ఊడ్చుకుంటూపోతారు. ఇలాంటివాళ్ళు నేలను చీల్చి దున్నే వ్యవసాయం ఏం చేస్తారు చెప్పండి? అందుకే జైనులు బతకడానికి వ్యాపారాలు (వడ్డీ వ్యాపారంతో సహా) చేయవలసిందేగానీ వ్యవసాయం చేయడానికి లేదు. వ్యవసాయం చెయ్యకపోతే తిండెలా వస్తుంది? జనాలెలా బ్రతుకుతారు? ఈ విపరీతధోరణి వాళ్ళు జీవులను ఏకేంద్రియ నుంచి పంచేంద్రియ వరకు చేసిన వర్గీకరణలో కూడా కనబడుతుంది:
జైనమతం పంచ భూతాలకు సంబంధించిన జీవుల గురించి ఇలా చెప్తుంది: పృథ్వీకాయ, అప్కాయ, తేజోకాయ, వాయుకాయ, వనస్పతికాయ జీవులు. ఇవి ఏకేంద్రియ జీవులట (స్పర్శజ్ఞానం మాత్రమున్నవి). అవి వాటినెవరైనా తాకితే గుర్తుపడతాయట.
రాళ్ళు, మట్టి, గవ్వల్లాంటివి పృథ్వీకాయ జీవులు.
నీటికున్న వేర్వేరు రూపాలు మంచు, ఆవిరి, నీరు, వానలాంటివి అప్కాయ జీవులు.
మంట, మెరుపు, బూడిద లాంటివి తేజోకాయ జీవులు.
గాలి, పెనుగాలి, తుఫాన్ లాంటివి వాయుకాయ జీవులు.
ఇక వృక్ష సంబంధమైన వనస్పతిక జీవుల్లో మొక్కలు, పొదలు, చెట్లు, వాటి బెరడు, కాండం, ఆకులు, విత్తనాలు...వీటిలో ఒక్కోదానిలో ఒక్కో ఆత్మే ఉంటుందట. అందుకని ఇవి ఏకకాయజీవులు. ఉర్లగడ్డలు, కంద, చేమ, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, మొదలైనవి అసంఖ్యాక ఆత్మలు గల బహుకాయజీవులు. ఈ రెండు రకాలూ వనస్పతిక జీవులే.

ఈ ఐదు రకాల జీవుల్లో ఒక్కో జీవికీ 4 ప్రాణాలు (స్పర్శ, శ్వాస, శరీరం, ఆయుష్షు) ఉంటాయట. ఇక పంచేంద్రియజీవులకు 10 ప్రాణాలుంటాయని వాళ్ళ నమ్మకం. ఈ ఏకేంద్రియ జీవులు కూడా పదార్థాన్ని ఆహారం, శరీరం, ఇంద్రియాలు, శ్వాసోశ్వాసలు అనే నాలుగు మార్గాల ద్వారా స్వీకరించి దాన్ని శక్తిగా మార్చుకుని బతుకుతాయట.

Friday 23 March, 2007

సర్దార్జీ జోకులపై అభ్యంతరాలు

నిజమే! ప్రసాదం బ్లాగులో చెప్పినట్లు కొంతమంది సర్దార్జీలు తమ మీద తామే జోకులేసుకుని అందరినీ నవ్విస్తూ తామూ వాళ్లతో కలిసి మనసారా నవ్వగలుగుతారు. కానీ దేనికైనా ఒక పరిమితంటూ ఉంటుంది కదా? అందుకే ఇప్పుడు శృతి మించి రాగాన పడిన సర్దార్జీ జోకులను నిషేధించాలంటూ కొందరు సర్దార్జీలు మైనారిటీస్ కమీషన్ ను కోరారు. ఇదే విషయంపై ఒక ప్రజాప్రయోజనవ్యాజ్యం కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది.

Sikhs ask cops to ban 'Sardar' jokes on Net

రాజ్యాంగం లోని ప్రాథమికహక్కుల్లో Protection of life and personal liberty అనేది అతి ముఖ్యమైన హక్కు. Right to live with dignity (గౌరవప్రదంగా జీవించడం) కూడా అందులో భాగమే. ఇది ప్రతివారికీ ఉండే హక్కు. ఇప్పుడు రానురాను మరీ అవమానకరంగా తయారౌతున్న ఈ జోకుల వల్ల తమ గౌరవం, ప్రతిష్ట దెబ్బతింటున్నాయని కొందరు సిక్కుల ఫిర్యాదు.

“I think these jokes can be very demeaning. And the line between what is healthy and what is humiliating has been crossed.” –Jeev Karan, a college student

“Unlimited jokes have an impact on the psyche of the community. Also, if one encounters a police officer who is a Sikh, he won’t be taken seriously. They’ll in stead take him to be a comedian.” –Tejdeep Kaur Meenon

ఇదిలా ఉండగా వాక్‌స్వాతంత్ర్యపు హక్కుకున్న పరిమితులెరుగని పాత్రికేయుడొకడు సర్దార్జీల మీద జోకులెయ్యొద్దనడం తమ వాక్‌స్వాతంత్ర్యపు హక్కును అడ్డుకోవడమేనని హిందూస్థాన్ టైమ్స్ లో రాశాడు. అది రాసినవాణ్ణీ, వేసిన సంపాదకులను, ప్రచురణకర్తను నోటికొచ్చినట్లు తిట్టి, 'ఇది నా వాక్‌స్వాతంత్ర్యపు హక్కు' అంటే ఏమంటారో?

ఇవి కూడా చూడండి:

http://www.dnaindia.com/report.asp?NewsID=1084154

http://o3.indiatimes.com/sardarji

http://www.panthic.org/news/129/ARTICLE/1332/2005-05-15.html

Wednesday 21 March, 2007

శాసనవ్యవస్థ-న్యాయవ్యవస్థ

గత ఐదు రోజులుగా సభాకార్యక్రమాలు బొత్తిగా సాగకపోవడం వల్ల లోక్ సభ బడ్జెట్ సమావేశాలను ఒకరోజు ముందుగానే ముగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. శుభం! ఘనత వహించిన మన పార్లమెంటు సభ్యులు -బాహాబాహీ, కచాకచి, ముష్టాముష్టి- అవసరమైతే ఎంతకైనా తగుదుమని ఈ సమావేశాల్లో మరోసారి నిరూపించారు. సరిగ్గా ఈ సమావేశాలు జరుగుతున్నప్పుడే శాసనమండలి ఎన్నికలు (చదువుకున్నోళ్ళ ఓట్లు) జరిగాయి. రాష్ట్రస్థాయిలో ఎగువసభ అవసరమా అన్న విషయం పక్కనపెట్టి ఈ ఎన్నికల్లో పోటీకి నిలిచిన అభ్యర్థులను బట్టి చూస్తే ఒక్కో నియోజకవర్గంలో అర్హులైన అభ్యర్థులు ఒకరికంటే ఎక్కువమందే నిలిచినట్లనిపించింది. ప్రథమప్రాధాన్యత ఓటును ఎవరికి వెయ్యాలన్నది నిర్ణయించుకోవడం కాస్త కష్టమనిపించింది...(దిగువసభ ఎన్నికల్లో ఎవరో ఒకరికి ఓటెయ్యాల్సిరావడం ఎంత కష్టమో అంత కష్టం కాదులెండి). దిగువసభలైన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో "None of the above " ఆప్షన్ ఎప్పటికి వస్తుందో ఏమో?

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశపు పౌరుడినైన నాకు రాజ్యాంగ, ప్రభుత్వ పాలనాపరమైన విషయాల్లో మన (ప్రజలెన్నుకున్న) చట్టసభల మీదకంటే ఉన్నత న్యాయస్థానాల మీదే నమ్మకం, గౌరవం ఎక్కువ. ఐతే సాధారణ కేసులను సైతం పరిష్కరించడంలో జరిగే అసాధారణ జాప్యం న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని పోగొడుతోంది. మొత్తానికి ఎవరూ వాళ్ళు చెయ్యాల్సిన పనిని సక్రమంగా చెయ్యడం లేదన్నమాట. :( మచ్చుకు ఇటీవల కడపలో జరిగిన ఒక సంఘటన:

http://www.hindu.com/2007/03/04/stories/2007030411470400.htm

25 యేళ్ళ కిందట తమ సర్వస్వం కోల్పోయిన సోమశిల మునకప్రాంతాల వారికి నష్టపరిహారం ఇంకా అందలేదు. ఐనా నష్టపరిహారం కోసం వాళ్ళు ఏ మాత్రం ఆగ్రహించక, ఎంతో ఓపికతో ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. వారికిచ్చే నష్టపరిహారం పాతికేళ్ళ కిందటి లెక్కలప్రకారం. పరిష్కరించిన కేసులు 700, మిగిలి ఉన్నవి 1907. విషయం తెలుసుకున్న హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ అధ్యక్షుడు బిలాల్ నజ్కీ "25 యేళ్ళ కిందట తమ సర్వస్వం కోల్పోయినవారికి నష్టపరిహారం ఇంకా అందించలేని వ్యవస్థలో తానూ ఒకడినైనందుకు సిగ్గుపడుతున్నా"నని అన్నారు. పరిహారం కోసం ఇంకా ఎంతో సహనంతో ఎదురుచూస్తున్న బాధితుల ఔదార్యానికి సెల్యూట్ చెయ్యాలని అనడమేకాదు, ఈ నెలాఖర్లోగా మిగిలిన కేసులు పరిష్కరించకపోతే ఇక ఇక్కడి బాధితులకు తన మొహం చూపించలేనని, జీవితంలో మళ్ళీ ఇక్కడికి రాబోనని అన్నారు. ఇక్కడ శాశ్వత లోక్ అదాలత్ ప్రారంభించడానికి వచ్చిన హైకోర్టు న్యాయమూర్తులకు బార్ అసోసియేషన్ సన్మానం చేయబోగా సన్మానాలకు తాము అర్హులం కామంటూ వారిని వారించి తమకు అందవలసిన పరిహారం ఇన్నేళ్ళుగా అందకపోయినా ఎంతో ఆదరాభిమానాలతో తమను ఆహ్వానించిన లబ్ధిదారులే అందుకు నిజంగా అర్హులని పేర్కొంటూ లబ్దిదారులను శాలువాలతో సన్మానించారు.


పెండింగ్ అప్పీళ్ళను పరిష్కరించడానికి దేశంలోనే ప్రప్రథమంగా ఒక జిల్లా కోర్టులో హైకోర్టు బెంచ్ లోక్ అదాలత్ నిర్వహించింది ఇక్కడే.

Friday 16 March, 2007

క్లాసిక్ అనగా...

తెలుగులో నేను అదీ ఇదీ అని లేకుండా అన్ని రకాల పుస్తకాలూ చదువుతాను. ఇంగ్లీషులో ఒకప్పుడు షేక్స్‌పియర్ నాటకాల నుంచి లేటెస్ట్ బూతు నవలల దాకా అన్ని రకాలూ (రకానికి ఒకటి రెండు చొప్పున) చదివాను. ఇది పదేళ్ళ కిందటి సంగతి. తర్వాత నా స్నేహితుడు లక్కీ నాకు బహుమతిగా ఇచ్చిన Midnight's Children చదువుదామని మొదలుపెట్టి మధ్యలోనే మానేశాను. ఆ పుస్తకం గత ఐదేళ్ళుగా నా పుస్తకాల అరలో అలాగే పడి ఉంది. ఆ తర్వాత గత సంవత్సరం ప్రపంచంలో ఇంగ్లీషొచ్చిన ప్రతివారూ కలవరించిన పుస్తకం, ఇంగ్లీషు పుస్తకాల సమీక్షల్లో ప్రపంచప్రఖ్యాతి పొందిన TLS (Times Literary Suppliment) చేత "un-putdownable book" గా ప్రశంసించబడిన Da vinci code బలవంతాన వారం రోజులపాటు ప్రయత్నించి నలభై పేజీలు చదివి పక్కన పడేశాను. అది సంవత్సరం నుంచి పలకరించే నాథుడు లేక దుమ్ముకొట్టుకుపోయింది. ఇంగ్లీషు పుస్తకాలు చదివే అలవాటు తప్పిపోయిందా అంటే నాన్-ఫిక్షన్ ఇప్పటికీ అమితాసక్తితో చదువుతూనే ఉన్నాను. అంటే ఇంగ్లీషులో ఫిక్షన్ చదవడం నా వల్ల కావడం లేదా? ఇది నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇటీవల ఒక ప్రముఖ రచయితతో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు Da vinci code చదవలేక పక్కనపడేసిన విషయం ప్రస్తావించాను. దానికి ఆయన "చదవాలంటే ముందు మనకు దాని మీద ఆసక్తి పుట్టాలి. Da vinci code మనకు తెలిసిన జీవితాలకు గానీ, మన సంస్కృతికి గానీ సంబంధం లేని రచన కావడం కూడా ఆ ఆసక్తి కలగకపోవడానికి కారణం కావొచ్చు." అన్నారు. అదే నిజమేమో? నేను డావిన్సీ కోడ్ చదవనంత మాత్రాన కొంపలేం మునిగిపోవు. కానీ ఏ ఆర్కే నారాయణో, రస్కిన్ బాండో, మనోజ్ దాసో రాసిన పుస్తకాలు చదవడానికి ప్రయత్నించి విఫలమైతే అది నిజంగా ఆందోళన పడాల్సిన విషయమే! మరి Midnight's children సంగతేంటి? అది మన దేశాన్ని గురించి రాసిందే కదా? ఐనా నేను దాన్ని చదవలేకపోవడమేమిటి? దీనికి కారణం ఇటీవలే తెలిసింది: సాల్మన్ రష్దీ, బిల్ క్లింటన్ లాంటివాళ్ళ రచనలు చదవడం కష్టమేనట. ఇది నా ఒక్కడి సమస్య కాదట. చాలామంది చదవడం మొదలుపెట్టి పూర్తిచెయ్యకుండానే వదిలేస్తారట.

Midnight's children ఒక క్లాసిక్. ఈ వార్త చదవగానే "Classic is a book which everyone praises but noone reads." అన్న ఫన్నీ కోట్ గుర్తొచ్చింది.

Monday 12 March, 2007

చుట్టూపక్కల చూడరా...

మీ కంప్యూటరులోని ఏ ఫైలు నుంచైనా సరే మీకు తోచిన (text) భాగాన్ని Ctrl c లేదా మూషిక సాయంతో కాపీ చేసి (at your own risk) ఈ సైటు చూడండి....

Thursday 1 March, 2007

బావా!...చీ!!

నేను హైదరాబాదుకు వచ్చిన కొత్తల్లో జరిగిందిది. జవహర్‍నగర్‍లో ఉండడానికి రూమ్ దొరకగానే లగేజ్ మొత్తం అక్కడ పడేసి, అవసరమైనవన్నీ కొనుక్కుని "హమ్మయ్య!" అనుకునేసరికి సాయంత్రమైంది. స్నానం చేసి, పరిసరాల పరిజ్ఞానం పొందుదామని బయలుదేరాను. రోడ్డు దాటి అటూ ఇటూ దిక్కులు చూస్తూ మళ్ళీ ఇంకో రోడ్డు దాటి కొంత దూరం ముందుకెళ్ళి రోడ్డు పక్కన చోద్యం చూస్తూ నిలబడ్డాను. అటూ ఇటూ హడావిడిగా ఉరుకులు పరుగులతో వెళ్తున్నారు జనాలూ, వాహనాలూ. ఉండుండీ వాహనాలన్నీ ఒకదానివెనకొకటి ఆగిపోతున్నాయి. (ముందు ట్రాఫిక్ సిగ్నల్ ఉండడం వల్ల అని అప్పుడే ఊహించేశాను.) ఒక్కసారిగా జనాలు ఎక్కణ్ణించో గుంపులుగుంపులుగా వెళ్తున్నారు. (సినిమా థియేటర్ల నుంచి అని తర్వాత తెలిసింది.) అక్కడ కనుచూపు మేరలో నాలాగ దిక్కులు చూస్తూ నిలబడ్డ నరమానవుడెవడూ లేడు. ఇదీ వాతావరణం.

నేనా వాతావరణానికి అలవాటు పడుతున్న సమయంలోనే తూర్పు దిక్కు నుంచి ఉల్కాపాతంలాగ దూసుకొచ్చి సడన్ బ్రేకుతో సరిగ్గా నా ముందే ఆగిందొక ఆటో! ఆ ఆటోలో నుంచి జీన్స్ ప్యాంటూ టీషర్టులో సన్నగా, నాజూగ్గా కనిపిస్తున్న ఒక టీనేజీ అమ్మాయి కొంగలాగ మెడసాచి తల మాత్రం బయటపెట్టి "బావా...!" అని సన్నగొంతుతో పెద్దగా పిలిచింది. పిలిచి, అరక్షణం ఆగింది. ఆ గొంతు వినగానే చిన్నప్పుడు చదివిన ఫిజిక్స్ పాఠాలు తోసుకుంటూ వచ్చి "ఈ పిల్ల గొంతులో పిచ్చెక్కువ (pitch-a quality of sound-ఎక్కువ)." అని చెప్పాయి.
నేనా మాటలకు ఊకొడుతూనే "ఈ పిల్ల పిలుస్తున్నదెవరినబ్బా?" అని నా తలను శరవేగంతో వెనక్కి తిప్పి తేరిపారజూశాను. దరిదాపుల్లో ఎవరూ లేరు.........నేను తప్ప! 'ఆ పిల్ల రాకముందు నుంచే ఆ (పారజూసే)పనిలో ఉండడం వల్ల గదా నాకు కుడి ఎడమల ఎవరూ లేరని ఆ పిల్ల పిలిచిన వెంటనే నిర్ధారించుకోగలిగాను? పరిసరాల పరిజ్ఞానమంటే ఇదిగాక మరేది?' నేనా ఆలోచనతో బుడుంగున ఆనందసాగరం లోతు కొలవడానికి వెళ్ళిపోయాను. అందుకే ఆ తర్వాత ఆ పిల్ల పలికిన పలుకులు కాస్త ఆలస్యంగా, అస్పష్టంగా నా చెవిని సోకాయి: "చీ ఎక్కడా?" అని.

తత్తరపడ్డాను. ఆ మాటతో నేను ఓలలాడుతున్న ఆనందసాగరం అకస్మాత్తుగా మంత్రమేసినట్లు ఇంకిపోయింది. 'ముక్కూ మొహం ఎరుగని నన్ను పట్టుకుని ఒక ఆడపిల్ల 'బావా' అని పిలవడమేమిటి? పిలిచెనుపో మరుక్షణమే 'ఛీ ఎక్కడ?' అని అనడమేమిటి? కొంపదీసి 'ఛీ! ఇక్కడా?' అన్లేదుగద? ఆ మాట మాత్రం ఎందుకంటుంది? అందునా నన్ను (అనగా ఒక అపరిచితుణ్ణి అని భావము)?' ఆనందసాగరం నుంచి ఎగిరొచ్చి అయోమయాగాథంలో పడ్డ నేను ఒకవైపు పైకి రావడానికి గింజుకుంటూనే ఇంకోవైపు ఊపిరందక తల ఎలా ఆడిస్తున్నానో కూడా నాకే తెలియకుండా ఊపేశాను. ఆ ఊపుడు చూసిన ఆటోవాడు 'వీడెవడో వెర్రిబాగులవాడు. వీణ్ణడిగి లాభం లేదు.' అని తెలుసుకున్నాడేమో ఆటోను ముందుకు దూకించాడు. సర్రుమని దుమ్ములేపుకుంటూ ఆటో, ఆటోలోని పిల్లా వెళ్ళిపోయారు. నిదానంగా తేరుకున్న నేను 'అసలు నేక్కడున్నాను? ఆ పిల్ల నన్నేమడిగింది?' అని పరిశోధించే పనిలో పడ్డాను.

ఎదురుగా కొంచెం దూరంలో ఒక పెద్ద హీరో కటౌట్ ఉంది. అదొక సినిమా థియేటర్లా ఉంది. ఇక నా వెనకేముంది? అసలు నేను ఎక్కడ, దేని ముందు నిలబడ్డాను? అని వెనుదిరిగి చూస్తే 'Bawarchi' అని పెదపేద్ద అక్షరాలతో బోర్డు కనిపించింది. 'ఇదేం పేరు? విచిత్రంగా ఉందే? అసలిది ఏ భాష? దీన్నెలా పలకాలి? ఈ పేరుకర్థమేమిటి?' అని సందేహాలు కలిగాయి. ఆ పేరునెలా పలకాలో ప్రయత్నిస్తుండగా దాన్ని 'బావర్చి' లేక 'బావార్చి' అని పలకవచ్చనిపించింది. దాంతో మిష్టరీ విచ్చిపోయిందని నాలోని డిటెక్టివ్ కేయాస్ ఒక్క కేక పెట్టాడు. (ఘనత వహించిన నా ఈ అభిమాన డిటెక్టివ్ పేరుకు Chaos (అనగా గందరగోళం) అని భాష్యం చెప్పారు కీ.శే.వల్లంపాటి వారు.) ఇందాక ఆ పిల్ల నన్నడిగిన అడ్రసు ఇదే! ఆ పిల్ల నన్ను 'బావా' అని పిలవలేదు!! ఏ సంబోధనా లేకుండానే('ఇస్సీ! ఎంత అమర్యాద?' అనుకోరాదు. పాపం, ఆ పిల్ల తొందర ఆ పిల్లది) 'బావా...ర్చీ ఎక్కడ?' అని అడగబోయి నోరు తిరక్కనో ఏమో 'బావా...చ్చీ ఎక్కడ?' అని అడిగింది. దాన్ని మనం 'బావా...చీ ఎక్కడ?' అని అర్థం చేసుకున్నాం. సరే, 'బావా...చీ' ఆచూ...కీ తెలిసింది "మరదలా రమ్మని" కేకేద్దామని చూస్తే అప్పటికే ఆ మరదలు పిల్ల కనుచూపుమేరలో లేకుండాపోయింది. నేను ఆ ఆటో వదిలిన పొగమేఘం వైపే దీ...ర్ఘంగా ఆ పొగ గాలిలో కలిసిపోయేవరకు చూసి, ఒక నిట్టూర్పు విడిచి అక్కడి నుంచి బయలుదేరి మెల్లగా మా రూముకు వచ్చేశాను.

ఇంతేసంగతులు.

(ఇంతకూ బావార్చి లేక బావర్చి అనేది ఏభాషలోని పదమో, ఆ మాటకు అర్థమేమిటో నాకు ఇంతవరకు తెలియదు. మీకు తెలిస్తే చెప్పరూ?)

Friday 23 February, 2007

సిగ్గు! సిగ్గు!!

సమస్త దేశాన్నీ ఆశీర్వదించే నెపంతో జాతీయపతాకాన్ని సదరు మాతాజీ తన పాదాల కిందేసి తొక్కిందా లేక కేవలం తన పాదాల మీద పరిపించుకుందా అనేది కాదు ప్రశ్న. ఎట్టి పరిస్థితుల్లోనూ నేలను తాకకూడని జాతీయపతాకాన్ని నేల మీద పరిచారా లేదా...అదీ ఒకరి పాదాలను తాకేలా అన్నదే. అదీ పదహారేళ్ళపాటు ఐక్యరాజ్యసమితిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఒక మాజీ అయ్యేయెస్ అధికారి సమక్షంలో! ఈ ఫోటోలే దిగ్భ్రాంతికరం కాగా "అమ్మగారి" పాదపద్మాల మీద పతాకాన్ని ఉంచి దేశం సుభిక్షమైపోవాలని కోరుకునే మూర్ఖశిఖామణులను సమర్థిస్తూ వచ్చిన వ్యాఖ్యలను చూసి ఏమనుకోవాలో అర్థం కాలేదు. ఈ పేజీలో నాలుగో వ్యాఖ్య రాసిన అజ్ఞాత పాఠకుడు అంటున్న "పరమసత్యం (Ultimate Truth)" ఏంటో నాకైతే బోధపడలేదు.

Saturday 17 February, 2007

నేను-తను

-సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

ఒక అభిప్రాయం మా మధ్య పెఠిల్లున విరిగినప్పుడు-
మేమిద్దరం చెరో ధ్రువం వైపు విసిరేయబడతాము
ఆమె మొహం నాకేదో నిషిద్ధ వర్ణచిత్రంలా గోచరిస్తుంది
చేయి చాచితే అందే ఆమె దూరం
మనస్సులో యోజనాలై విస్తరించుకొంటుంది

ఉల్లిపొరై మామధ్య లేచిన భేదభావానికి
నా అహం ఉక్కుపూత పూసేందుకు నడుం బిగిస్తుంది
మౌనంగా మా మధ్య చెలియలికట్టలా పడుకుని ఉన్న పాపకు ఇటువైపు
నా గుండె కల్లోలసాగరమై ఎగిసిపడుతుంటుంది
నా మనస్సు విరిగిన అభిప్రాయశకలాల్ని కూర్చుకుంటూ
ఆమె కత్తివాదర వెనుక గయ్యాళితనాన్ని కొలుస్తుంటుంది

టైం కి డ్యూటీ కొచ్చి తట్టి సైగచేసే నిద్రను
మెలకువ కసరుకొంటుంది
ఎంతకూ నిద్రలేవని ఆమెలోని దాసిత్వాన్ని
నాలోని పురుషత్వం శంకిస్తుంటుంది
అప్పుడు-అభిప్రాయం కాదు సమస్య-
అది విరిగిన క్షణాలు మెదడులో వేరుపురుగులవ్వడం
అంతకంతకూ ఆమె నిశ్చల మౌనతటాకమౌతోంటే
నేననుకొంటున్న ఆమెలోని అహం కరిగి
నా పాదాలకేసి ప్రవహించనదుకు
నాలోని మరో నేను అసహనాన్ని పిచ్చిగా కౌగిలించుకుంటుంటాను
ఇప్పుడు-భేదభావం కాదు ప్రశ్న-
ఆమె అబలత్వం తీవై సాగి సాగి
చివురుల అరచేతుల్తో నా అహాన్ని స'మర్ది'స్తూ
నాపైకి ఎగబాకలేదనే!

క్షణక్షణానికి ఆమె మౌనం మీద వేయిచబడుతోన్న నా అహం
బేలగా మారి బీటలు వారేందుకు సిద్ధమౌతుంది
ఆమె చలిగాలి అలై నా ఒంటరితనాన్ని స్పర్శిస్తే
జలదరించి వర్షించాలని ఉంటుంది

మనోగవాక్షలలోంచి దూకివచ్చిన చంద్రబింబం
కన్నీటిబిందువై మా మధ్య కేర్ మన్నప్పుడు
ఆమెలోని మాతృత్వం పాపకేసి నదిలా కదిలి
అసంకల్పితంగా నన్ను ఆడతనమై తాకుతుందా-
నేను నీటిబుడగనై పేలిపోతాను
ఎర్రనీటి ఏటినై ఉరకలెత్తుతాను
ఆమెను నా గుండెల సుడిగుండాల్లో పసిపాపలా తిప్పుతాను
నేనే ఆమెనై అబలనై పసిపాపనై గారాలు పోతాను

Tuesday 13 February, 2007

దుస్సంధి-దుష్టసమాసం

రెండు వేర్వేరు భాషలకు చెందిన పదాలు కలిస్తే భాషాసంకరం అవుతుంది. అలాంటి పదాల కలయికతో ఏర్పడిన సమాసాల మాటెలా ఉన్నా సంధులకు మాత్రం సూత్రాలంటూ లేవు. ఉదాహరణకు:
అ+అ కలిస్తే తెలుగులో అ (అకారసంధి) ఐతే సంస్కృతపదాల్లో ఆ (సవర్ణదీర్ఘసంధి) అవుతుంది.
అలాగే అ+ఇ తెలుగులో ఇ (ఇకారసంధి) ఐతే సంస్కృతపదాల్లో ఏ (గుణసంధి) అవుతుంది. ఇలా ఒక్కో భాషలోని పదాల కలయికకు విడివిడిగా సూత్రాలున్నాయి. ఇలాంటి సంధి సూత్రాలు వర్తించని విధంగా రెండు వేర్వేరు భాషల్లోని పదాల మధ్య సంధి కలిపితే దాన్ని దుస్సంధి అని, ఆ సమాసాన్ని దుష్టసమాసం అని అంటారు.

ఒక ఉదాహరణ: నల్ల అనేది అచ్చతెలుగుపదం. ఇంద్రుడనేది ఇంద్ర: అనే సంస్కృతపదం నుంచొచ్చింది. ఇప్పుడు నల్ల+ఇంద్రుడు తెలుగుసంధిసూత్రాల ప్రకారమైతే నల్లింద్రుడు, సంస్కృతసంధి ప్రకారమైతే నల్లేంద్రుడు అవుతాడు. "ఏదైనా తప్పే. అసలలా వేర్వేరు భాషలకు చెందిన పదాలను కలపాలనుకోవడమే తప్పు" అంటారు వ్యాకరణవేత్తలు. వాళ్ళ ఉద్దేశ్యంలో రెండు వేర్వేరు భాషలకు చెందిన పదాలను కలపనే కూడదు. ఎందుకంటే రెండు పదాలు కలిసిపోయినప్పుడు ఏర్పడే కొత్తరూపం శబ్దాన్ని బట్టి కాక భాషను బట్టి మారుతుంది. ఉదాహరణకు రెండు హ్రస్వ అకారాలు కలిసినప్పుడు తెలుగులో "అ" ఏర్పడితే సంస్కృతంలో అవే శబ్దాలు కలిసినప్పుడు "ఆ" ఏర్పడుతుంది. అందుకే తెలుగులో రామ+అయ్య=రాయ్య (అకార సంధి) అయితే సంస్కృతంలో రామ+అవతారం=రామావతారం (సవర్ణదీర్ఘసంధి) అవుతుంది.

ఈ లెక్క ప్రకారం బ్లాగ్ అనేది ఆంగ్లపదం కాబట్టి బ్లాగోత్సాహం దుస్సంధి, దుష్టసమాసం అవుతుందా? (బ్లాగరులు తరచుగా తమది బ్లాగోత్సాహం అనే అంటున్నారు.) భాషలో ఎక్కువమంది వాడే పదమే వాడుకలో నిలుస్తుంది - వ్యాకరణసూత్రాలతో సంబంధం లేకుండా. ఇలాంటి వ్యాకరణవిరుద్ధమైన పదబంధాలు ఇప్పటికే కొన్ని బహుళవ్యాప్తిలో ఉన్నాయి.

సముదాయ పందిరి, వీక్షణజాబితాలు దుష్టసమాసాలా?

సముదాయ: సంస్కృతపదం
పందిరి: అచ్చతెలుగు

వీక్షణ: సంస్కృతపదం
జాబితా: విదేశీపదం (మనది కాదని తెలుసుగానీ ఏ దేశానిదో నాకు తెలియదు)

వికీపీడియాలో వాడుతున్న సముదాయ పందిరి దుష్టసమాసమని చెబితే తప్ప తట్టలేదు. ఐనా ప్రస్తుత పరిస్థితుల్లో దుష్టసమాసాలను ప్రయోగించకుండా మడి కట్టుకుని కూర్చోలేం.

Monday 12 February, 2007

ఆ ఐదుగురు

మహాభారతంలో ఐదుగురిని మహావీరులుగా పేర్కొన్నారు. వాళ్లైదుగురూ వాళ్ళలోవాళ్ళు కొట్టుకుచావల్సిందే తప్ప వేరెవ్వరూ వాళ్ళనేమీ చెయ్యలేరట. వాళ్లైదుగురు: భీముడు, దుర్యోధనుడు, జరాసంధుడు, కీచకుడు, బకాసురుడు. వీళ్లు నిజంగా అంత మొనగాళ్ళా?

ముందుగా బకాసురుడి సంగతి చూద్దాం. వీడు వీరోచితకృత్యాలు చేసినట్లు ఎక్కడాలేదు. వాడు చేసిందల్లా ఏకచక్రపురమనే అగ్రహారంలోని వాళ్ళను బెదిరించి పొట్టపోసుకోవడం. వాడి తిండి, ఆకారం చూసి ఆ అగ్రహారంలోని బ్రాహ్మలు వాడినెదిరించడానికి భయపడినట్లు అనిపిస్తుంది. వాణ్ణెదిరించేవాడెవరూ లేనంతవరకు మాత్రమే వాడి ఆటలు చెల్లాయి. బకాసురుడి జీవితకాలంలో వాడి వీరత్వానికి ఒకే ఒక సవాలు ఎదురైంది - భీముడి రూపంలో. ఆ ఒక్కసారీ వాడు దారుణంగా ఓడిపోయాడు. భీముడు బండెడు కూడు తిని భుక్తాయాసమైనా తీర్చుకోకుండానే వాడితో తలపడి చంపేశాడంటేనే వాడి వీరత్వమేమిటో స్పష్టమైపోతుంది.

భీముడికి చిన్నప్పట్నుంచి ఏ విషయంలోనైనా తన Id impulses ను అదుపులో పెట్టుకునే అలవాటులేదు. అందుకే తానున్నది అజ్ఞాతవాసంలోనైనా కీచకుడు తన భార్యను అవమానించాడనే కోపావేశంతో ఉన్న భీముడు వాడి శవాన్ని ఆనవాలైనా పట్టడానికి వీల్లేకుండా ఒక మాంసపుముద్దగా చేసిపారేశాడు. బేసిగ్గా బకాసురుడు, కీచకుడు ఒకలాంటివాళ్ళే. రెండే తేడాలు:
1. మొదటివాడికి కడుపే కైలాసం. రెండోవాడి ఆకలి వేరు.
2. మొదటివాడికి ఎటువంటి అధికారహోదా లేదు. రెండోవాడికి అధికారమదం, బలగర్వం ఉన్నాయి.
కీచకుడు వీరుడే. కొన్ని యుద్ధాలు గెలిచాడు. కానీ మహావీరుడంటే మాత్రం ఆలోచించాల్సిందే! నిజంగా కీచకుడు గొప్ప వీరుడే ఐతే విరాటరాజ్యం "దోమకుత్తుకంతే" ఎందుకుంటుంది? వీళ్ళిద్దరి గురించీ రాసినవాటిలో అతిశయోక్తులే ఎక్కువ.

దుర్యోధనుడు: వీడిది వజ్రకాయం. ధర్మబద్ధంగా ఐతే భీముడైనా, వాడి తాతైనా వీడిని గెలవలేకపోయేవాళ్ళు.(ఈ తాత గురించి ఇంకోసారి చెప్పుకుందాం.) పైగా వీడు గదాయుద్ధంలో మెళకువలు నేర్చుకున్నది(అడ్వాన్సుడు కోర్సు చేసింది) బలరాముడి దగ్గర. ఈ బలరాముడికి సరిజోడీ ఐనవాడు జరాసంధుడు.

జరాసంధుడు: చర్వితచర్వణం కాకుండా జరాసంధుడి గురించి ముందుగా నేను రాసింది ఇక్కడ చదవండి. అక్కడ "నమ్మశక్యంగా లేదు" అని ఎందుకు రాశానో మాత్రం ఇక్కడ వివరిస్తాను:
కృష్ణుడు భీమార్జునులను వెంటబెట్టుకుని గిరివ్రజానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో గమనిస్తే చాలు - జరాసంధుడెలాంటివాడో తెలిసిపోతుంది:
వాళ్లు రావడమే దొడ్డిదారిన వచ్చారు. రావడంతోటే భేరీలను పగలగొట్టి విధ్వంసానికి పాల్పడ్డారు. వేరే ఎవరైనా ఐతే ఆ పని చేసినందుకు వాళ్ళను తన్నితగలేసేవాళ్ళు. ఐనా జరాసంధుడు వాళ్ళను ఆదరంగానే చూశాడు. తప్పుచేసి తన చేతికి చిక్కిన శతృవులనే ఏమీ చెయ్యకుండా వదిలినవాడుగా కనిపిస్తాడు జరాసంధుడు ఇక్కడ. ఆ ఆదరాన్ని కూడా తృణీకరించి వాళ్ళు అతణ్ణి అవమానించారు. మీరెవరని అడిగినప్పుడు వాళ్ళు తాము బ్రాహ్మణులమని చెప్పుకున్నారు. అప్పుడు వాళ్ళను చూసి జరాసంధుడు ఇలా అంటాడు: "మీ చేతులు ఆయుధాలు ప్రయోగించడానికి అలవాటుపడినవాళ్ళలా కాయలుకాచి ఉన్నాయి గానీ బ్రాహ్మణుల చేతుల్లా లేవు. ఐనా మీరెవరన్నది నాకనవసరం..." అని వాళ్ళకు అతిథులకు చేయదగిన మర్యాదలన్నీ చేస్తాడు.

చివరకు తామెవరో చెప్పి యుద్ధం చేస్తామన్నప్పుడు కూడా "18 సార్లు నా దెబ్బకు తట్టుకోలేక పారిపోయినవాడివి నువ్వు నాతో ఏం పోరాడుతావ్?" అని కృష్ణుణ్ణీ, మరీ అర్భకుడుగా ఉన్నాడని అర్జునుణ్ణీ వదిలేసి బుద్ధిపూర్వకంగానే భీముణ్ణి ఎంచుకుంటాడు. ఛాయిస్ తనకే ఇచ్చారు కదాని ముందుగా కృష్ణార్జునులను ఒకరి తర్వాతొకరిని రమ్మని చావచితక్కొట్టినా, లేక చంపిపారేసినా అడిగే దిక్కులేదు. ఐనా వాళ్ళు అంతదూరం వచ్చారంటే అది అతడి ధర్మనిరతి మీద వాళ్ళకున్న నమ్మకమే. ఇంతటి ధర్మపరుడు నరబలులిస్తాడంటే నమ్మడమెలా? అందునా సాటి రాజులను? పైగా అతడు నిజంగా నరబలులే ఇస్తున్నట్లైతే వీళ్ళు తన చిరకాల శతృవులని, ఇప్పుడు ఒంటరిగా చిక్కినారని తెలిసీ ముగ్గురినీ బంధించి అదే వరసలో బలి ఇవ్వకుండా ఎందుకు వదిలేసినట్లు? ప్రతీకారం తీర్చుకుంటారేమోనని భయమా? భీమార్జునులే చచ్చినాక పాండవుల వైపు కసిదీర్చుకునే వీరుడెవడున్నాడని? మహా ఐతే కృష్ణుణ్ణి కోల్పోయిన బలరాముడు దండెత్తివచ్చేవాడు. జరాసంధుడికి బలరాముడి వీరత్వం మీద ఏ కాస్త గౌరవమున్నా మథుర మీద అన్నిసార్లు దండెత్తేవాడే కాదుగద? ఐనా ఆ బలరాముడే జరాసంధుణ్ణి జయించగలిగితే వీళ్ళకీ తిప్పలెందుకు? జరాసంధుణ్ణి చంపడానికి చీకట్లో వెళ్ళడమే ఒక సూచన - అధర్మమార్గంలో చంపారనడానికి.

Sunday 11 February, 2007

సర్దార్జీలు-బహద్దూర్లు

సర్దార్జీలు:
గతంలో తాగుబోతుల మీదా, డాక్టర్ల మీదా ఎక్కువ జోకులు వచ్చేవి. కానీ ఇప్పుడు ఇంటర్నెట్‌లో సర్దార్జీల మీదొచ్చిన/వస్తున్న జోకులముందు అవెంత? మానవమాత్రులెవరి మీదైనా వెయ్యగలిగే జోకులను, ఎవరిమీదా వెయ్యలేని జోకులను కూడా సర్దార్జీల మీదే వేసి వినోదిస్తారు కొందరు. సర్దార్జీలంటే ఎందుకింత చులకనో నాకు తెలియదుగానీ ఇటీవల నాకొచ్చిన ఒక మెయిల్ గనక నిజమే అయితే అలా జోకులేసుకుని నవ్వుకున్నందుకు మనమే సిగ్గుతో తలదించుకోవలసి వస్తుంది. ఆ మెయిల్ ప్రకారం మన దేశం బ్రిటిష్ వారి పాలనలో ఉన్నప్పుడు సిక్కు వీరులు 1930 ప్రాంతంలో బ్రిటిష్ వారి దురాక్రమణకు వ్యతిరేకంగా అసమాన ధైర్యసాహసాలతో పోరాడారు. వాళ్ళ ధాటికి తట్టుకోలేకపోయిన బ్రిటిష్ పాలకులు వాళ్ళమీద ఇలాంటి జోకులెయ్యడం ద్వారా తమ కడుపుమంట చల్లార్చుకునేవాళ్ళట. అది తెలియక సర్దార్జీల మీద జోకులేసి నవ్వుకోవడం మనకు అలవాటైపోయింది.

అసలు 16వ శతాబ్దంలో సిక్కు మతం పుట్టినప్పటి నుంచి ఆ మతం మనుగడ వాళ్ళు మొఘలు పాలకులతో జరిపిన పోరాటాల్లో ప్రదర్శించిన గుండెధైర్యం, సాహసాల మీదే ఆధారపడింది. వాళ్ళ పవిత్రగ్రంథమైన ఆదిగ్రంథ్ ను రాయడంతో బాటు అమృత్‌సర్‌లో స్వర్ణదేవాలయం కట్టించిన గురు అర్జున్ దేవ్ ను చిత్రహింసలు పెట్టి చంపించాడు జహంగీర్. దాంతో తర్వాతి సిక్కు గురువైన హర్‌గోవింద్ సుశిక్షితులైన సిక్కులతో ఒక సాయుధదళాన్నే ఏర్పాటు చేశాడు. తొమ్మిదో గురువైన తేఘ్ బహదూర్ ను ఔరంగజేబు చంపించడంతో తొమ్మిదేళ్ళ వయసులో సిక్కు గురువైన గోవింద్ సింగ్ తర్వాతి కాలంలో పూర్తిస్థాయి సిక్కు సైన్యాన్నే (ఖల్సా) నడపవలసి వచ్చింది. తర్వాతికాలంలో ఔరంగజేబు అతడి నలుగురు కొడుకులను కూడా చంపించాడు. ఈ పోరాటాలు ఔరంగజేబుతో అంతమవలేదు. గురు గోవింద్ తర్వాత సిక్కు నాయకుడైన బందా బహదూర్ ను జహందర్ షా అనే మొఘల్ చక్రవర్తే చంపించాడు.

తర్వాతి కాలంలో పంజాబ్ లో సామ్రాజ్యాన్ని నిర్మించిన మహరాజా రంజిత్ సింగ్ కూడా సిక్కే. ఆఫ్ఘాన్లను పశ్చిమ పంజాబు నుంచి తరిమేసి పెషావర్ తో బాటే పష్టూన్ ను స్వాధీనం చేసుకున్నాడు. పష్టూన్ ప్రాంతాన్ని పాలించిన మొట్టమొదటి ముస్లిమితర పాలకుడు రంజిత్ సింగ్ - ఒక సర్దార్జీ! అంతకు ముందు వెయ్యేళ్ళ పైబడిన కాలంలో ఎప్పుడూ బయటి నుంచి కైబరు కనుమల గుండా విదేశీయులు మనదేశం మీదికి దండెత్తి ఆక్రమించుకోవడమే తప్ప ఇక్కడి నుంచి సైన్యాన్ని అటువైపు దాటించిన పాలకులెవరూ లేరు రంజిత్ తప్ప. రంజిత్ పాటించిన లౌకికవిధానాల వల్ల ముస్లిములు కూడా అతణ్ణి అభిమానించేవారు. అత్యంత సారవంతమైన పంజాబు భూమి మీద కన్నేసిన బ్రిటీష్ పాలకులు దాన్ని చేజిక్కించుకోవడానికి ఎన్ని కుట్రలు పన్నినా సిక్కుల పోరాటపటిమ వల్ల, రంజిత్ నాయకత్వలక్షణాల వల్ల అతడి జీవితకాలంలో అది సాధ్యపడలేదు.

దయచేసి సర్దార్జీల మీద జోకులేయడం ఆపండి. మీకు ఎవరైనా సర్దార్జీ జోకులు పంపినా, లేక చెప్పినా అలా చెయ్యొద్దని చెప్పండి.

బహద్దూర్లు:
పాత సినిమాలు చూసేవారికి కొన్ని ముసలిపాత్రలను రావు బహద్దూర్ అని గొప్ప అట్టహాసంగా చూపించడం తెలిసేవుంటుంది. ఈ బహద్దూర్లెవరో తెలుసా? ఇది కూడా బ్రిటిష్ వాళ్ళు మొదలుపెట్టిందే! తమ ప్రభుత్వానికి విధేయులుగా ఉన్న ఉన్నత కుటుంబాలవారికి వాళ్ళిచ్చిన బిరుదులే ఈ
రావు(రాయ్) బహద్దూర్ - హిందువులకు,
ఖాన్ బహద్దూర్ - ముస్లిములకు.
ఇప్పుడు ఆ "బహద్దూర్"ల భేషజం చూస్తే నవ్వొస్తుంది.

Sunday 28 January, 2007

సినిమా పండుగ రెండోరోజు విశేషాలు


మార్కస్ బార్ట్లే వాడిన మిచెల్ కెమెరా


పాతపాత్రల్లో కొత్తనటులు

దుర్యోధనుడిగా బాలకృష్ణ
ఆహార్యం: అదిరింది.
ఆంగికం: ఫర్వాలేదు.
వాచికం: అధ్వాన్నం.

శకుని పాత్రకు ఏవీఎస్ అతికినట్లు సరిపోయాడు.

ఉత్తరకుమారుడిగా బ్రహ్మానందం: బ్రహ్మానందం పర్ఫార్మెన్స్ ఇంత పేలవంగా ఉండగలదని ఊహించనేలేదు. రేలంగిలో శతాంశమైనా లేదు.
***

స్టేజి క్రింద అలనాటి సదాజపుడు పద్మనాభం ఈ వయసులో కూడా ఎక్కడా తడుముకోకుండా, తడబడకుండా "ప్రేమకోసమై..." పాటను పూర్తిగా ఆలపించి ప్రేక్షకులను ముగ్ధులను చేశారు.

ప్రదర్శనలో ఎన్టీయార్ వాడిన గదలు, కిరీటాలు వగైరాలతోబాటు మార్కస్ బార్ట్లే వాడిన కెమెరాను కూడా ప్రదర్శించడం విశేషం.


ఇక వినోద కార్యక్రమాల్లో వార్తలకు సునీల్ చేసిన అభినయం హైలైట్. అది చూసి నవ్వలేక చచ్చాం.

Monday 22 January, 2007

సుభాషితాలు

పెళ్ళనే అగ్రిమెంటుతో మగాడు తన బాచిలర్ డిగ్రీని కోల్పోతే ఆడదానికి మాస్టర్ డిగ్రీ వస్తుంది.

భార్యాభర్తల్లో ఒకరు ఏది చేస్తే అదే కరెక్టు. రెండోవారే భర్త.

మా ఆవిడా నేనూ ఎప్పటికప్పుడు సర్దుకుపోతూ ఉంటాం: నేను తప్పు చేశానని ఒప్పుకుంటాను. తనేమో ప్రతిసారీ నాతో ఏకీభవిస్తుంది.

కాన్ఫరెన్సు: ఒకరి మనసులోని గందరగోళాన్ని అందరికీ పంచడం.

కాన్ఫరెన్సు: అందరూ మాట్లాడుతారు, ఎవరూ వినరు, ఏ ఇద్దరూ ఏకీభవించరు.

సాధన కంటే ముందు విజయం, పని కంటే ముందు గెలుపు, పెళ్ళి కంటే ముందు పెటాకులు వచ్చేది నిఘంటువులోనే!

స్నేహితుణ్ణి అప్పు అడిగే ముందు మరొక్కసారి ఆలోచించు: నీకు అంతకంటే ఎక్కువ కావాలేమో?

మరణం వారసత్వంగా వస్తుంది.

వాదనలో మూడు పక్షాలుంటాయి. నీపక్షం, నాపక్షం, సరైన పక్షం.

విషయనిపుణులెవరంటే నీకర్థమయ్యే ఒక విషయాన్ని తీసుకుని దాన్ని నీకర్థం కాకుండా వివరించేవాళ్ళు.

మూర్ఖుడితో ఎప్పుడూ వాదించకు. చూసేవాళ్ళకు తేడా తెలీదు.

తప్పులు అందరూ చేస్తారు. ఎవరూ చూడనప్పుడు చేసేవాళ్ళే తెలివైనవాళ్ళు.

డబ్బు అవసరమైతే నిరాశావాది నుంచి తీసుకో. తిరిగొస్తుందని అనుకోడు.

ఎక్కువ అలసిపోకుండా అప్పుడప్పుడూ కునుకుతీస్తూ ఉంటే వృద్ధాప్యం మీదాకా రాదు...ఆ కునుకేదో మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తీసినట్లైతే.

మొదటి బిడ్డ పుట్టినప్పుడు మీరు అమ్మో నాన్నో అవుతారు. రెండో బిడ్డ పుడితే మీరు రిఫరీ అవుతారు.

ప్రభుత్వమిచ్చిన వాణిజ్యప్రకటనలో "చిరునవ్వు"తో పన్నుకట్టమన్నారు. తీరా నేనదే పని చెయ్యబోతే అది చెల్లదు. డబ్బు తియ్యమన్నారు.

మీకు ప్రతిభ లేదని బాధపడకండి. చాలా మంది మనలాంటివాళ్ళే.

మీరెవరితో జీవించాలనుకుంటున్నారో వారిని కాకుండా ఎవరు లేకుండా మీరు జీవించలేరో వారిని పెళ్ళి చేసుకోండి. ఎటుతిరిగీ పశ్చాత్తాపం తప్పదనుకోండి. అది వేరే విషయం.

మీరు ప్రేమను కొనుక్కోలేరు. కానీ ప్రేమను పొందడానికి చాలా ఖర్చవుతుంది.

నిజమైన స్నేహితులు వెన్నుపోటు పొడవరు. ఎదుటికి వచ్చి పొడుస్తారు.

నన్ను బాధపెట్టిన నిన్ను అసహ్యించుకోవడానికి నాకు గల హక్కును వదులుకోవడమే క్షమ.

మంచి పౌరులు ఓటెయ్యకపోవడం వల్లే చెడ్డవాళ్ళు నాయకులౌతారు.

అలసిపోకముందే విశ్రాంతి తీసుకోవడం అలవాటుగా మారితే అదే సోమరితనం.

తమను చూసి తాము నవ్వుకోలేనివాళ్ళను చూసి అందరూ నవ్వుతారు.

మహిళలను గౌరవించడం మన సంప్రదాయం. అందమైనవాళ్ళను మరింతగా...

పెళ్ళైన మగాడు ఎన్ని ఉద్యోగాలు మారినా అతని పై అధికారి మారదుగా?

మన భాషను మాతృభాష అంటారు. తండ్రికి మాట్లాడే అవకాశముండదుగా? అందుకన్నమాట.

పిల్లల కోసం డబ్బు కూడబెట్టడం చాలా అవసరం. ముఖ్యంగా మన తల్లిదండ్రులకు.

తాము చెప్పవలసిందేదైనా ఉన్నప్పుడు నోరుతెరుస్తారు జ్ఞానులు. నోరు తెరిచాం కాబట్టి ఏదో ఒకటి చెప్పాలనుకుంటారు మూర్ఖులు

మూలం: తెలియదు
అనువాదం: త్రివిక్రమ్

సన్నపురెడ్డి నవలల సవ్వడి

ఒకే సంవత్సరం జరిగిన 3 నవలల పోటీల్లో ఒకే రచయిత రాసిన నవలలకు ప్రథమ బహుమతులు లభించడం అపూర్వం, అనితర సాధ్యం. అది 2006లో సన్నపురెడ్డి సాధించిన ఘనత. ఈయన రాసిన ఆ మూడు నవలలు:
తోలుబొమ్మలాట 2006 ఆటా పోటీలలో ప్రథమ బహుమతి (ఈ నవల సాహిత్యనేత్రం అక్టోబర్ 2006 సంచికలోను, ఆటా వారి 9వ ఆటా మహాసభల ప్రత్యేక సంచికలోను ప్రచురితమైంది).
పాలెగత్తె 2006లో స్వాతివారపత్రిక నిర్వహించిన నవలలపోటీలో ప్రథమ బహుమతి
చినుకుల సవ్వడి 2006లో నిర్వహించిన చతుర నవలపోటీలో ప్రథమ బహుమతి
సాధించాయి.
ఎవరీ సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి?
ఈయన ఒక మారుమూల పల్లెటూరిలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు.
1980లలో కవితలు రాయడం మొదలుపెట్టాడు. 1980లలో వచ్చిన అత్యుత్తమ కవితలను ఏర్చికూర్చిన కవితాసంకలనం "కవితా! ఓ కవితా!!" లో ఈయన రాసిన 2 కవితలు చోటు సంపాదించుకున్నాయి. తర్వాతి కాలంలో రచన మాసపత్రికలో ఈయన కవితలు చదివిన యండమూరి వీరేంద్రనాథ్ "(ఇంత) బాగా రాయగలవాళ్ళు ఎక్కువగా ఎందుకు రాయరో నాకు అర్థం కాదు." అని రాశాడు. (స్వతహాగా కవి కావడం వల్లేనేమో నిండుకుండ నెత్తినపెట్టుకుని అడుగులేస్తూ ఉంటే నీళ్ళు చిందినంత సహజంగా సన్నపురెడ్డి రచనల్లో కవిత్వం ఒలుకుతూ ఉంటుంది.) 1990ల ప్రారంభంలో కథలు రాయడం ప్రారంభించిన ఈయన అచిరకాలంలోనే విస్మరించరాని కథారచయిత గుర్తించబడ్డాడు. సన్నపురెడ్డి కథలను రెండురకాలుగా విభజించవచ్చు: మంచి కథలు, గొప్ప కథలు. ఈయన రాసిన కథలు రాతిపూలు, కథాసాగర్, విశాలాంధ్ర తెలుగుకథ మొదలైన కథాసంకలనాల్లో చోటు సంపాదించుకున్నాయి.

ఇక ఈయన రాసిన తొలి నవల కాడి 1998లో ఆటా వారు నిర్వహించిన నవలల పోటీలో ద్వితీయబహుమతి పొందదమేగాక చిరస్థాయిగా నిలిచిపోగల అతికొద్ది తెలుగు నవలల్లో ఒకటిగా గుర్తించబడింది. తర్వాత ఆయన స్వాతివారపత్రిక లో పాండవబీడు అనే నవల రాశాడు. అప్పటికే నా దృష్టిలో స్వ+అతి గా మారిన స్వాతి వారపత్రికను నేను కేవలం ఈ సీరియల్ కోసమే చదివేవాడిని. ఆ సీరియల్ ముగిసినవెంటనే అదీ మానేశాను. మళ్ళీ దానిజోలికి పోలేదు. ఇప్పుడు మళ్ళీ పాలెగత్తె కోసం మొదలుపెట్టాల్సి వచ్చేలా ఉంది.

బహుమతులు పొందిన సన్నపురెడ్డి కథలు:

1996లో అప్పజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్ వారి కథలపోటీలో అంతు కథ ప్రథమ బహుమతి పొందింది.
అదే సంవత్సరం సాహిత్యనేత్రం నిర్వహించిన కథలపోటీలో చనుబాలు కథ ప్రథమబహుమతి పొందింది.
ఇవే కాకుండా ఈయన తడి, కొత్తదుప్పటి, ఒక్కవానచాలు, గిరగీయొద్దు, ఒక్కవానచాలు, దిగంబరం, ఊరిమిండి లాంటి కథలు రాశాడు.
తెలుగు భాష, సాహిత్యాలకు ఆయన చేసిన సేవకు 2004, 2006 సంవత్సరాలలో అధికారభాషాసంఘం ఆయనను ఘనంగా సత్కరించింది.

1996లో రాతిపూలు సంకలకర్తలు ఈయన గురించి ఇలా అన్నారు:

చాలామంది రచయితలకు లేని వైవిధ్యభరిత జీవితానుభవం ఉన్న రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి - అటువంటి గ్రామీణ జీవితానుభవసారం ఉండబట్టే "కవిత్వాన్నీ, కథనీ కోపుయాస లేని ఎద్దులుగా సాహిత్య వ్యవసాయాన్ని" చేస్తున్నాడు.
కవితల్లో వ్యక్తీకరించలేని భావాల్ని కథల్లో, కథల్లో ఇమడ్చలేని సున్నితవ్యక్తీకరణల్ని కవితల్లో ఒదిగిస్తున్నారు వెంకటరామిరెడ్డి.
పుట్టింది, పెరిగింది, ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నది కడప జిల్లా కలసపాడు మండలం బాలరాజుపల్లె కుగ్రామం కావడంతో తన కథలకూ, కవితలకూ అవసరమైన మూలబీజాల్ని ఆ గ్రామీణం నుండే ఏరుకోగలుగుతున్నాడు. అక్కడి బడుగుజీవులైన రైతుల, రైతుకూలీల బతుకువెతల్ని తన కళ్ళలో నింపుకుంటూ, తన కళ్ళ దర్పణాల్లో వాళ్ళ జీవిత ప్రతిబింబాల్ని పాఠకలోకానికి స్పష్టంగా చూపించగలుగుతున్నారు.
అంతేకాకుండా పల్లె ప్రజల నెత్తుటిలో మలేరియా క్రిమిలా వ్యాపించిన హీనరాజకీయాల్ని - వాళ్ళ బతుకుల్నిండా చీడై కమ్ముకున్న కరువు గురించి - ప్రభుత్వ సవతి ప్రేమను గురించి ఆవేదన చెందుతూ వాటికి ఆస్కారమిచ్చిన మూలాల గురించి నిరంతరం అన్వేషిస్తూ ఉన్న అరుదైన రచయిత వెంకటరామిరెడ్డి.

Sunday 21 January, 2007

కడపోత్సవాలు - 00(7)

మీకు తెలుసా - జవహర్లాల్ నెహ్రూ తాను ప్రధానమంత్రిగా ఉన్నరోజుల్లో కడపజిల్లా బద్వేల్ తాలూకా పోరుమామిళ్ళ దగ్గరున్న సిద్ధవరం అగ్రహారం నుంచి తోలుబొమ్మలాట కళాకారులను ఢిల్లీకి ప్రత్యేకంగా పిలిపించుకుని ఆటాడించి అభినందించారని?
మామూలుగా అయితే ఈపాటికి కడప కడపోత్సవాలతో సందడిసందడిగా ఉండేది. కడప జిల్లాకు బాంబుల గడపగా, ఫ్యాక్షనిస్టుల గడ్డగా ఉన్న మచ్చను చెరిపేసి కడపకున్న భాషా, సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక, ఆర్థిక ప్రాధాన్యతను చాటిచెప్పి 'ఇదీ మా కడప!' అని సగర్వంగా చెప్పుకునేలా చేసే వార్షిక సంబరాలు కడపోత్సవాలు. గత ఐదు సంవత్సరాలుగా జనవరి మూడో వారంలో కడపలో మూడురోజులపాటు జరుగుతూ వస్తున్నాయి.
ఘనమైన కడప ప్రాంత విశిష్టతలను చాటిచెప్పే వివిధ రకాల ప్రదర్శనలతో, అలనాటి విజయనగర భువనవిజయాన్ని గుర్తుకు తెచ్చే చర్చాగోష్టులతో సందడిగా ఉండవలసిన కడప గడప ఈసారి స్తబ్ధుగా ఉంది. కడపోత్సవాలు ఈసారి ఎందుకు నిర్వహించలేదని ఇద్దరు పురప్రముఖులను అడిగితే ముఖ్యమంత్రి ఈసారికి వద్దన్నాడని ఒకరు, కలెక్టరు ఆసక్తి చూపడం లేదని ఇంకొకరూ సమాధానం చెప్పారు. లోగుట్టు పెరుమాళ్ళకెరుక!

మీకు తెలుసా -

ప్రపంచప్రఖ్యాత సురభినాటకసమాజం కడపజిల్లాలోని ఒక మారుమూల పల్లెటూళ్ళో పుట్టిందని?
తొలి తెలుగుశాసనం కడపజిల్లాలోనే బయల్పడిందని?
తెలుగులో తొలి స్వతంత్రకావ్యకర్త, ఆంధ్రకవితాపితామహుడు ఇక్కడివాడేనని?
తొలి తెలుగు కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క, సుప్రసిద్ధ కవయిత్రి మొల్ల ఇక్కడివారేనని?
అష్టదిగ్గజకవుల్లో నలుగురు కడపజిల్లావారేనని?
అన్నమయ్య, యోగివేమన, సామాజికతత్త్వవేత్త పోతులూరి వీరబ్రహ్మం మొదలైనవారంతా ఇక్కడివారేనని?
ఆంధ్రవాల్మీకి, వాసుదాసు వావిలికొలను సుబ్బారావు ఇక్కడివాడేనని?
అగణితప్రజ్ఞగల గణితబ్రహ్మ లక్కోజుసంజీవరాయశర్మ ఇక్కడివాడేనని?
సరస్వతీపుత్ర, శివతాండవకర్త పుట్టపర్తి నారాయణాచార్యులు, శివభారతకర్త గడియారం వెంకటశేషశాస్త్రి ఇక్కడివారేనని?
అవధానులకు ఇది ఆలవాలమని?
తెలుగుసూర్యుడు సి.పి.బ్రౌన్ స్థిరనివాసమేర్పరచుకుని, తెలుగుతేజాన్ని, వేమనశతకపు వెలుగులను ప్రపంచానికి చూపింది ఇక్కడినుంచేనని?
తొలి తెలుగుపత్రిక రాయవాచకం సంపాదకుడు, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీకి సంపాదకుడైన తొలి భారతీయుడు బి.వి.రామన్ ఇక్కడివాడేనని?
సుప్రసిద్ధ సాహితీ విమర్శకుడు, అనువాదకుడు, పత్రికా సంపాదకుడు రా.రా. ఇక్కడివాడేనని?
సుప్రసిద్ధ కవి, పాత్రికేయుడు గజ్జెల మల్లారెడ్డి ఇక్కడివాడేనని?
తెలుగుసినిమా స్వర్ణయుగపు ధృవతారలు బి.ఎన్.రెడ్డి, నాగిరెడ్డి ఇక్కడివారేనని?
సుప్రసిద్ధ కథారచయితలు కేతు విశ్వనాథరెడ్డి, సొదుం జయరాం, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, దాదాహయత్ మొదలైన వారు ఇక్కడివారేనని?
తిరుమలేశుని తొలిగడప ఇక్కడుందని?
భౌగోళికంగా దక్కన్ పీఠభూమి ఆవిర్భావానికి మూలం ఇక్కడేనని?
భారతదేశంలో హనుమంతుడు లేని ఏకైక రామాలయం ఇక్కడుందని?

Thursday 4 January, 2007

ఉలిపికట్టె

ఊరందరిదీ ఒకదారైతే ఉలిపికట్టెదింకొకదారి అని సామెత. ఇక్కడ ఉలిపికట్టెను నేనే! ఒకటిరెండు విషయాల్లో నేను నిజంగా ఉలిపికట్టెనేనేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. ఉదాహరణకు నా రూమ్మేట్లందరూ టీవీకి అతుక్కుపోయి క్రికెట్ మ్యాచ్ చూస్తున్న సమయంలో అసలా మ్యాచ్ ఎవరెవరికి మధ్య జరుగుతోందో కూడా పట్టించుకోకుండా నా పనిలో నేను నిమగ్నమవడం మా రూం లో సాధారణంగా కనబడే దృశ్యం. మరే ఇతర క్రీడా లేనంతగా రోజంతా మాత్రమే కాకుండా రోజుల తరబడి కూడా ఆడే ఆట కూడా ఇదొక్కటే! ఎవరైనా క్రికెట్ గురించి నాతో మాట్లాడబోతే 'ఊ', 'ఆ' అని ఊకొట్టడమే తప్ప నేనెప్పుడూ సంభాషణ పొడిగించను.

టీవీలో మ్యాచులు చూడను, సరే! పేపరులో కూడా స్పోర్ట్స్ పేజీలో క్రికెట్ గురించి చదవడం మానేశానీమధ్య. ఎందుకంటే క్రికెట్ గురించి నేను చదివి తెలుసుకోదగ్గ విశేషాలన్నీ మొదటి పేజీలోనే ప్రత్యక్షమౌతూ ఉంటే ఇంకా స్పోర్ట్స్ పేజీలో కూడా క్రికెట్ గురించే చదవడమెందుకు? అదీ నా ఆలోచనాధోరణి. మరి నేను ఉలిపికట్టెను కాదంటారా?

కొంతమంది...కొంతమందేమిటి లెండి చాలా మంది కూడూ నీళ్ళూ కూడా మానేసి క్రికెట్ చూడడమే గాక క్రికెట్ గురించి మాట్లాడుతూ కూడా కూడూ నీళ్ళూ మరిచిపోగలరు. క్రికెటర్ల క్రీడానైపుణ్యాల గురించి, క్రీడారాజకీయాల గురించి, బీసీసీఐ నిర్వహణ గురించి అంతులేని ఉత్సాహంతో తమ చుట్టూ ఉన్నవారికి తమ అభిప్రాయాలు, సూచనలు అందజేస్తూ ఉంటారు. అలాంటివాళ్ళందరికీ నా విన్నపం: మీ చర్చోపచర్చల ద్వారా భారత క్రికెట్ ను సంస్కరించగల సత్తాయే మీకుంటే మీ చర్చలను దయచేసి మనదేశంలో శాసనవ్యవస్థ మీదికి, చట్టాలు అమలౌతున్న తీరు మీదికి మళ్ళించండి. దేశానికి మీరు అంతకంటే చెయ్యగల గొప్ప సేవ మరి ఉండబోదు.

కోట్లాది మందికి రోజుల తరబడి నిరర్థకంగా గడపగల గొప్ప అవకాశాన్నిచ్చింది క్రికెట్. అసలు క్రికెట్ ఆటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా - టెస్ట్ మ్యాచైతే ఐదు రోజులపాటు, వన్ డే ఐతే ఒక రోజంతా - జరుగుతుంది. ఇంత సుదీర్ఘ సమయాన్ని హరించే ఆట మరేదీ లేదు. ఈ విషయంలో ఇప్పుడిప్పుడే కళ్ళు తెరిచి ఆటను 20 ఓవర్లకు కుదిస్తున్నారనుకోండి.

అసలు ఆటల ప్రధానోద్దేశ్యం వ్యాయామం. క్రికెట్ ఆట జరిగేటప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి: మైదానంలో ఇరుజట్లలో మొత్తం కలిపి ఉండే 13 మంది ఆటగాళ్ళలో ఎప్పుడు చూసినా కనీసం 9-10 మంది కదలామెదలక ఊరికే నిలబడి ఉంటారు:
బౌలర్ బంతి విసిరేటప్పుడు బౌలర్, స్ట్రైకింగ్ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ మాత్రమే "అలర్ట్" గా ఉంటారు. వాళ్ళలో "కదిలేది" బౌలర్ ఒక్కడే! మిగిలినవాళ్ళు 10-12 మంది.

బ్యాట్స్‌మెన్ పరుగులు తీసేటప్పుడు పరిగెత్తేవాళ్ళు మహా ఐతే నలుగురు (ఇద్దరు బ్యాట్స్‌మెన్ పరుగుల కోసం, ఇద్దరు ఫీల్డర్లు బంతి కోసం). మిగిలినవాళ్ళు 9 మంది.

ఈ పరిగెత్తే అవసరం ప్రతి బంతికీ రాదనే విషయం మనం లెక్కలోకి తీసుకుంటే మైదానపు ఆటల్లో (out-door games) ఇంత "రిలాక్సింగ్ గేమ్" ఇంకొకటి లేదు.

అలాగే సామాన్య ప్రేక్షకుల సమయాన్ని ఇంతగా వ్యర్థం చేసే ఆటా మరొకటి లేదు. క్రికెట్ మ్యాచ్ జరుగుతోందంటే చాలు. కార్యాలయాల్లో పనిచేసేటందుకు పెద్ద పెద్ద మొత్తాల్లో జీతాలు తీసుకునేవారు సైతం పనిమానేసి క్రికెట్ గురించే ఆలోచించడం, 'స్కోరెంత?' తో మొదలుపెట్టి రోజంతా క్రికెట్ గురించే కబుర్లు చెప్పుకోవడం. ఇదీ వరస.

ఇది చాలనట్లు గత సంవత్సరంలో ఒకసారి క్రికెట్ ఆటను ప్రత్యక్షంగా చూడలేకపోవడం తమ ప్రాథమిక హక్కులకు భంగం అని భావించి సుప్రీమ్‌కోర్టులో ప్రజాప్రయోజనవ్యాజ్యం వేయడమే పిచ్చికి పరాకాష్ట అనుకున్న నన్ను సుప్రీమ్‌కోర్టు ఆ పిటీషన్ను తోసిపారెయ్యకుండా విచారణకు స్వీకరించడం అయోమయంలో పడవేసింది. టీవీలో వార్తాఛానెళ్ళు నిమిషానికొకసారి, ఇంటర్నెట్లో కొన్ని వెబ్‌సైట్లు ప్రతి బంతికి ఒకసారి (ball-to-ball updates) విశేషాలను అందిస్తుండగా ఈ పిచ్చేమిటా అని. నా ఆలోచనాధోరణిలో లోపమేమైనా ఉందా?

పోనీ మన దేశంలో ఇంత ఆదరణ పొందుతున్న ఈ ఆటలో మన జట్టు సాధిస్తున్న విజయాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయా? అంటే అదీ లేదు. ఉలిపికట్టెను ఐతే అయ్యానుగానీ ఈ క్రికెట్ పిచ్చి నాకు లేనందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. ఈ క్రికెట్ మూలంగా జనాలు మరో ఆట గురించి, మరో వ్యాపకం గురించి ఆలోచించడమే మానేశారు. ఇది అత్యంత దురదృష్టకర పరిణామం.
ఐతే క్రికెట్ వల్ల లాభాలే లేవా అంటే లేకేం? ఉన్నాయి.
1. జట్లు జట్లుగా ఆడే ఆటల వల్ల ఉండే ప్రయోజనమొకటుంది. అదే: ఆడేవాళ్ళలో "నేను, నా" అనే భావనలకు బదులుగా "మనం, మన" అనే భావనలు బలపడడం. ఆటలో రాజకీయాలు, స్వార్థప్రయోజనాలు చోటుచేసుకోనంతవరకు ఇది ఖచ్చితంగా ప్రయోజనమే. ఇది ఆటగాళ్ళకు కలిగే ప్రయోజనం.
2. ఇక ప్రేక్షకుల్లో కుల, మత, జాతి, వర్ణ, వర్గ భేదాలు సమసిపోతాయి క్రికెట్ విషయంలో. అలాగే
3. 'స్కోరెంత?' అనే మాటకు ఏ మంత్రానికీ లేని శక్తి ఉంది - ఇద్దరు అపరిచితుల మధ్య మాటలు కలపడంలో.


ఇవి కాక ఇంకేమైనా ఉన్నాయా? మీకు తెలిస్తే చెప్పండి.

Tuesday 2 January, 2007

తెలుగు సాహితీ సదస్సు

అనుకున్నట్లుగానే చదువరి, సుధాకర్, రమణ, నేను తెలుగుసాహితీసదస్సులో "మీ కంప్యూటరుకు తెలుగు నేర్పడం ఎందుకు? ఎలా?" పుస్తకం ప్రతులు దాదాపు 600 మందికి పంచిపెట్టాం. అంతే కాదు, అక్కడ కొందరు ప్రముఖులను కలిసి మన కార్యక్రమాలను వివరించే అవకాశం కూడా కలిగింది. తెలుగు వికీపీడియన్ కూడా అయిన ప్రసిద్ధ రచయిత వివినమూర్తిగారు బెంగళూరు నుంచి కేవలం తెలుగు వికీపీడియనులను కలవడానికే హైదరాబాదుకు వచ్చాననడం సంభ్రమాశ్చర్యాలను కలిగించే విశేషం. అంతే కాదు, ఆయన కారా మాస్టారికి, ప్రముఖ చిత్రకారుడు చంద్ర, తదితరులకు వికీపీడియా, విక్షనరీ, ఇతర సోదర ప్రాజెక్టులను గురించి ఉత్సాహంగా వివరించారు. హైదరాబాదు తెలుగు బ్లాగరులు-వికీపీడియనుల సమావేశాల్లో చాలా మంచి విషయాలను చర్చిస్తున్నారని, బెంగుళూరులో సమావేశాలు జరుగుతున్నట్లైతే తాను తప్పక హాజరౌతానని కూడా అన్నారు. బెంగుళూరు తెలుగు బ్లాగరులారా! ఇక మీదే ఆలస్యం. (మాకినేని ప్రదీపు, కూనపరెడ్డి మురళీకృష్ణ, అనిల్ చీమలమఱ్ఱి బెంగుళూరులోనే ఉన్నారనుకుంటా!)

ప్రవాసాంధ్ర రచయితల్లో అగ్రగణ్యుడు, గతంలో vemurione పేరుతో సైన్సు విషయాల గురించి అరటిపండు ఒలిచిపెట్టినట్లు వికీపీడియాలో వ్యాసాలు రాసిన వేమూరి వేంకటేశ్వరరావుగారికి ఆ విషయాలను గుర్తుచేసి, పుస్తక ప్రతులను ఇవ్వడమేగాక మళ్ళీ ఒకసారి వికీపీడియాలో రాయవలసిందని కోరాం.

వీళ్ళిద్దరి ఈమెయిల్ ఐడీలను కూడా తీసుకున్నాం. ఈ సదస్సులో మరో ప్రముఖ రచయిత సత్యం మందపాటి గారితో కూడా పరిచయం ఏర్పడింది. ఆయన వెబ్‌సైటు (http://satyam-mandapati.com) యూనికోడులో లేకపోవడాన్ని గమనించి నేను ఆయనకు గతరాత్రే ఈమెయిల్ కూడా చేశాను.

ఇక ఈటీవీ2 లో తెలుగు-వెలుగు కార్యక్రమ ప్రయోక్త మృణాళిని గారు తెలుగుబ్లాగులు, తెలుగువికీల గురించి వరల్డ్ స్పేస్ రేడియో ప్రేక్షకులకు కూడా తప్పక చెబుతానన్నారు. హైదరాబాదు విశ్వవిద్యాలయం లోని CALTS కు చెందిన డా.ఉమామహేశ్వరరావు గారు వేదికమీద మాట్లాడిన ధోరణి యూనికోడుకు వ్యతిరేకంగా ధ్వనించినా తర్వాత రమణ, నేను విడిగా కలిసి మాట్లాడినప్పుడు మన కార్యకలాపాలపై ఆసక్తి కనబరచారు. సదస్సులో తెలుగుబ్రెయిన్స్ ప్రతినిధి భాస్కర్ తెలుగుబ్రెయిన్స్ లో వీవెన్ ద్వారా మన కార్యక్రమాలు తమకు బాగా తెలుసని చెప్పారు. ఒక్క తెలుగుపీపుల్.కాం ప్రతినిధిని మాత్రం కలుసుకోలేకపోయాం.