Thursday 16 June, 2011

పదిరోజుల్లో కన్నడం - ఒకటో రోజు

రెండేండ్ల కిందట నేను "పదిరోజుల్లో కన్నడం" పుస్తకం రాస్తానని చెప్పి ముందస్తు ఆర్డర్ల కోసం ప్రకటన ఇస్తే ఔత్సాహికులు పొలోమని ఆర్డర్లిచ్చేశారు. వాళ్ళ ఉత్సాహాన్ని జోకొట్టి పడుకోబెట్టింది ఇన్నాళ్ళూ నాలో సహజసిద్ధంగా ఉన్న బద్ధకం. ఐతే ఈమధ్యకాలంలో నా కన్నడ పరిజ్ఞానం విపరీతంగా పెరిగిపోయి నాకు నిజంగానే కన్నడం కొద్దికొద్దిగా అర్థమైపోతోందేమోనని చాలా రొంబ తుంబ డౌటనుమానం కూడా వచ్చేస్తోంది. దాన్ని నిర్ధారించుకోవడానికే ఇదిగో ఇలా బ్రహ్మాండమైన విడుదల - స్వీయవిరచిత "పదిరోజుల్లో కన్నడం" పుస్తకం (in the making) లోని మొదటి చాప్టరు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మొదటి చాప్టరు

(philological outlook వుండవలె)

ఏం లేదండీ, మన భారతీయ భాషలన్నీ కొద్దో గొప్పో సంస్కృత భాష యొక్క ప్రభావానికి లోనైనవే. ఆమాటకొస్తే ఒక్క భారతీయ భాషలే కాదు, మన దేశం బయట కూడా లాటిన్, గ్రీకు లాంటి భాషల్లోని కొన్ని పదాలను గమనిస్తే సంస్కృత భాషలోని అదే అర్థం గల పదాలతో సారూప్యం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. "జనని సంస్కృతము ఎల్ల భాషలకు" అని ఊరికే అనలేదు. పుట్టపర్తి వారు ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు:

"నాకు తెలిసినంతలో అన్ని భాషల తత్త్వం ఒక్కటే. సంస్కృతం ఒకటి బాగా వచ్చినట్లయితే, ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్‌లో ఏ భాషైనప్పటికిన్నీ కూడా సులభంగా మనిషికి అర్థమవుతుంది. మనిషి నేర్చుకోవచ్చును. French, Latin, Greek, German మొదలైన ఈ భాషలన్నీకూడా,  సంస్కృతంతో సంబంధం ఉండేటటువంటి భాషలే. ఉత్తర హిందుస్థానంలో అనేకమైన భాషలు సంస్కృతంతో సంబంధం ఉండేవే. సంస్కృతాన్ని బాగా చదువుకోవాలి. అయితే వాడికి philological outlook వుండవలె. అది లేకపోతే కష్టం. భాషా శాస్త్రానికి సంబంధించిన అవుట్‌లుక్ ఉండినట్లైతే సంస్కృతమును పరినిష్ణాతంగా నేర్చుకున్నవాడు ఏ భాషనైనప్పటికినీ సులభంగా నేర్చుకోవచ్చును."

ఇండో యూరోపియన్ కుటుంబానికి చెందిన ఉత్తర భారతదేశ భాషలతో బాటే ద్రవిడభాషల మీద కూడా సంస్కృత ప్రభావం గణనీయంగానే ఉంది. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో 30-35 శాతం పదాలు సంస్కృతం నుంచి వచ్చినవే. సంస్కృత పదాలను తెలుగులో చేర్చుకునేటప్పుడు వాటి మీద తెలుగు ముద్దరేసి మరీ కలుపుకోవడం ఆచారం (ఇంగ్లీషు మ్లేచ్ఛభాష గదా? అందుకే దానికి మన ఆచారాలు, పద్దేశాలు పట్టవు. ఇంగ్లీషు పదాలు కాళ్ళైనా కడుక్కోకుండా నేరుగా వచ్చి పంక్తిలో కూర్చుంటాయి). ఆ తెలుగు ముద్రకు నాలుగు రూపాలున్నాయి. అవి - డు, ము, వు, లు. నాకు తెలిసి మిగతా ఏ భాషలూ ఇంత స్పష్టమైన ముద్రికలను తయారుచేసుకోలేదు. ఈ ముద్రాక్షరాలు సంస్కృతపదాల చివర ఎత్తిన తెలుగు జెండాలు. మనం తెలుగు పదాలుగా భావించి వాడేసుకుంటున్న వాటిలో సంస్కృత పదాలేవో తెలుసుకోవడానికి రెండు మూడు కొండగుర్తులున్నాయి:

1. పదం చివరున్న తెలుగు జెండాలను తొలగించినా అర్థం మారకుండా సమాసాల్లో చక్కగా ఇమిడిపోయేవి సంస్కృత పదాలు.

ఉదా: 'వీరుడు' లో 'డు' తీసేసినాక మిగిలే పదం వీర (డు మోపిన బరువుకు పదం చివర వంగింది. కొమ్ము కొట్టేయండి). దీన్ని విడిగా కూడా వాడుకోవచ్చు. అంతకంటే ముఖ్యంగా గమనించవలసిందేమిటంటే అలా విడదీశాక కూడా అర్థం మారలేదు. కాబట్టి వీర అనే సంస్కృత పదాన్ని చివర 'డు' చేర్చి తెలుగులో వాడేసుకుంటున్నామన్నమాట. పాడు, కోడు, చెడు వీడు, రేడు - వీటి చివర డు ఉన్నా ఇవి అచ్చ తెలుగు పదాలు. అన్నట్లు రేడు లో ఉన్నది బండిరా (అంటే శకటరేఫం ఱ). దీన్నెలా పలకాలో నిజ్జంగా నాకు తెలియదు కానీ ఇది ఉన్న పదాలన్నీ అచ్చ తెలుగు పదాలే అని మాత్రం తెలుసు. అలాగే 'ము'తో అంతమయ్యే పదాలలో పాము, చీము లాంటివి అచ్చతెలుగు పదాలు కాగా సంస్కృతం నించొచ్చిన ధర్మము లాంటి పదాల చివరన ఉండే ము కాస్తా ఆధునిక వ్యవహారంలో అనుస్వారంగా (అనగా గుండుసున్నా అని అర్థం) మారిపోయింది.

2. మనం చిన్నప్పుడు సంస్కృత సంధులు అని సవర్ణదీర్ఘసంధి, గుణసంధి మొదలైనవి నేర్చుకున్నాం. గుర్తుందా? ఆ సంధి సూత్రాలను పాటించేవి సంస్కృత పదాలు (మొదట్లో ఇది కొండగుర్తూ, బండ గుర్తూ కాదు. లిట్మస్ టెస్టుగానే ఉండేది. ఐతే ఈమధ్య పాలాభిషేకం, తెలుగేతర, తెప్పోత్సవం లాంటి దుష్టసమాసాల విషయంలో తప్పు ఫలితాన్నిస్తోంది). వాటితోబాటే అకార, ఇకార, ఉకార మొదలైన కారపు సంధులు తెలుగు సంధులని నేర్చుకున్నాం. ఈ తెలుగు సంధి సూత్రాలను పాటించేవి అచ్చ తెలుగు పదాలు. ఎంతైనా కారం తెలుగువాళ్ళ(కు నచ్చే) రుచి. ఈ అచ్చు కారాలన్నీ తెలుగుభాషకు ప్రాణాలు.

3. i. మహాప్రాణాలు, సంయుక్తాక్షరాలు ఉన్నవి ఏ భాషైనా కావచ్చు కానీ అచ్చ తెలుగు పదాలు మాత్రం కావు అని ఎవరో చెప్పగా విన్నాను కానీ బ్రౌను ఒప్పుకోవడం లేదు.

అచ్చ తెలుగు పదాల్లో మహాప్రాణాలకు ఉదాహరణలు: ఖద్ది (p. 0343) [ khaddi ] khaddi [Tel.] n. Strength, might. బలము.

ఖాణము (p. 0344) [ khāṇamu ] khāṇamu. [Tel.] n. Food for horses. దాణా. Provender, fodder. Grass. గ్రాసము, కసువు.

సంయుక్తాక్షరాలకు ఉదాహరణలు: ౛ాపత్రి (p. 0480) [ zāpatri ] or ౛ాపత్తిరి ḍzāpatri. [Tel.] n. The spice called Mace. See under ౛ాజి.

పత్రి (p. 0707) [ patri ] or పత్రిరి patri. [Tel.] n. Leaves used in worship. "భక్తిలేని పూజ పత్రిచేటు." Vēma.

ii. అరసున్నా లేక అర్ధానుస్వారం ఉన్నవన్నీ కూడా అచ్చతెలుగు పదాలేనట.ఇది నిజం కాకపోవచ్చు. బ్రౌను నిఘంటువులో చూద్దామంటే ఆయన అసలు అరసున్నాలు వాడినట్లే లేదు.

4. చివరగా - తెలుగు అజంత భాష. అంటే అచ్చుతో అంతమయ్యే పదాలు గలది. దీనికి విరుద్ధంగా ప్రాణం లేని హల్లుతో గానీ, దీర్ఘాలు తీస్తూ గానీ తుదిశ్వాస వదిలేవి పరదేశీలు.

కన్నడం నేర్పుతానని పిలిచి తెలుగు పాఠాల్లోకి దిగాడేమిటని ఆగ్రహించకండి. కన్నడ బాగిట్లోకి వచ్చేశాం. కుడికాలు సిద్ధం చేసుకోండి.

తెలుగులో చెల్లుబాటయ్యే సంస్కృత/పరభాషా పదాలు దేశంలో ఏ భాషలో ఐనా చెల్లుబాటవుతాయని నా నమ్మకం. ఈ నమ్మకానికి, పైన చెప్పిన కొండగుర్తులకు ప్రత్యుదాహరణలు ఉండొచ్చు, కానీ వాటిని ప్రస్తుతానికి పక్కన పెడదాం. (ఇక్కడ మనం చేస్తున్న పని వేగంగా కన్నడం నేర్పడం. తప్పుల్లేకుండా కన్నడం నేర్పడం కాదు ;-) ) సంస్కృత పదాలు, విదేశీ పదాలేవేవో సరిగ్గా తెలిస్తే మనకు ఏ భారతీయ భాషలో ఐనా సరే ఎడాపెడా వాడెయ్యడానికి వీలయ్యే పదాలు వచ్చేసినట్లే. ఇవి ఏ భాషలోనైనా సుమారు 30-35% కి తగ్గకుండా ఉంటాయి. సంస్కృత పదాలను వాడడమెలాగంటే వాటి చివరన ఉండే డుమువులనే తెలుగు తోకలు కత్తిరించేస్తే సరి. అవి సుబ్బరంగా సర్వభాషామోదిత పదాలైపోతాయి.

ఇక పై తరగతులకు చెందిన పదాలు కాక ద్రవిడ భాషల్లో మాత్రమే కామన్ గా ఉండే పదాలు అర్థంలోను, రూపంలోను స్వల్ప తేడాలతో మూల ద్రావిడ భాష నుంచి వచ్చినవి. ఇవి కూడా అన్ని ద్రవిడభాషల్లోనూ 30-35% వరకు ఉంటాయి. ఐతే వీటికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ నియమాలు తెలిస్తే ద్రవిడ భాషలన్నీ కరతలామలకమే. వాటిలో మొదట తెలుసుకోవలసిన నియమమేమిటంటే -

మూల ద్రావిడంలో పదం మొదట్లో ఉండే 'ప'కారం కన్నడంలోకి వచ్చేసరికి 'హ'కారంగా మారుతుంది. ఈ నియమమే గుడ్డిగా ఫాలో ఐనందుకు బెంగళూరుకొచ్చిన కొత్తల్లో నాచేత హాహాకారాలు పెట్టించింది. అలా అని ఇదేదో నా సొంత పైత్యం అనుకునేరు. కానేకాదు, భాషాశాస్త్రవేత్తలు చెప్పిన శాస్త్రీయ నియమమే!

ఉదా: పాలు, పంది, పులి, పల్లి(పల్లె), పువ్వు, పండు, పో - ఈ పదాలు కన్నడంలో వరుసగా హాలు, హంది, హులి, హళ్ళి, హువ్వె, హణ్ణు, హో అవుతాయి.

కాబట్టి మీకు కన్నడంలో హ తో మొదలయ్యే పదం అర్థం కాకపోతే మొదట చేయవలసిన పని హ స్థానంలో ప పెట్టి చూడడం. మీకు హాసిని అనే కన్నడ అమ్మాయి పరిచయమైందనుకోండి, ఆమె పేరుకు అర్థం తెలుసుకోవడానికి ఈ సూత్రాన్ని వాడితే దెబ్బతింటారు. ఇందులోని నీతి ఏమనగా, ఆడవాళ్ళు అన్ని నియమాలకూ అతీతులు. [ఇక్కడ సంస్కృతపదానికి ద్రవిడభాషానియమం అన్వయించి నేను అనవసరంగా ఆడవాళ్ళ మీద అభాండాలు వేస్తున్నానని, అంతకంటే అనవసరంగా వాళ్ళను బద్‌నామ్ చేస్తున్నానని మీరు అనుకోవచ్చు (అన్నట్లు, బద్‌ నామ్ అనేది హిందీ పదం. దాన్నే ఇంగ్లీషులో బాడ్ నేమ్ అంటారు. చూశారా దేశ విదేశాల్లోని వేర్వేరు భాషల మధ్య ఎంత దగ్గరి పోలికలున్నాయో? :D) కానీ ఈ ద్రవిడభాషానియమాన్ని పాటించే సంస్కృత పదాలూ లేకపోలేదు. ఉదాహరణకు పండుగ - పబ్బం అనే జంట పదాల్లోని పబ్బం పర్వ(దిన)మనే సంస్కృత పదానికి వికృతి. (అలా కాక అది ద్రవిడ పదమే ఐతే పదం చివర ఇతర భాషల్లో లేని 'ము (లేక) అనుస్వారము' తెలుగులో ఉండకూడదు.) ఐతే ఈ పబ్బాన్నే కన్నడంలో హబ్బ అంటారు. పుట్టినరోజు పండుగను సింపుల్‌గా హుట్టుహబ్బ అంటారు.]

సరే, పందిని కాస్తా హందిని చేసిన ఈ సూత్రం ప్రకారమే పది కాస్తా కన్నడంలో హది కావాలి. కానీ కానంటోంది. ఎందుకంటే మూల ద్రావిడంలో దాని అసలు రూపం 'పత్తు' కాబట్టి. ఉన్న ద్రవిడ భాషలన్నిట్లోనూ తమిళమొక్కటే మూ.ద్రా. భాషకు దగ్గరగా ఉండి, ఆ లక్షణాలను చాలా వరకూ నిలబెట్టుకొన్నదని భాషాశాస్త్రవేత్తల ఉవాచ. తమిళంలో పదిని పత్తు అంటారు. ఇప్పుడు పదాది హకారం సూత్రం ప్రకారం ము.ద్ర.లోని పత్తు కన్నడంలోకొచ్చేసరికి హత్తు అవుతుంది.

నేను చదివిన రెండో సూత్రం "కచకారాల"కు సంబంధించినది. అంటే పైన చెప్పుకున్న పకార-హకారాల్లాగే ఇది కకారం-చకారాలకు వర్తిస్తుందన్నమాట. అంటే ము.ద్ర.లో క గుణింతంలోని అక్షరాలతో మొదలయ్యే పదాలు తెలుగు లాంటి కొన్ని భాషల్లోకి వచ్చాక మొదటక్షరాన్ని చకారంగా మార్చేసుకుంటాయి. ఉదా: కై-చెయ్యి, కివి-చెవి

ఇక మూడో సూత్రం. ఇది నేను చదివింది కాదు, అనుభవం మీద బోధపడింది: పదాది వకారం బకారమౌతుంది. వెన్న-బెణ్ణ, వాకిలి-బాగిలు, వా-బా, వల - బల (ఈ వల net కాదు. వలపలి చేత ఘంటం, వలపట-దాపట, బంతిలో వలపక్షం లలో ఉండే వల - అంటే కుడి అని అర్థం.)

కన్నడంలో బలి తిరువుసి అంటే కుడి వైపుకు తిరగండి అని.

అలాగే తమిళంలో వా అంటే రా అని అర్థం. అదే కన్నడంలో బా అవుతుంది. ఇక్కడో చిన్న కోతికొమ్మచ్చి: ఆవారాబావా అని ఒక తమాషా పదముంది. ఆ పదం ఐదు వేర్వేరు భాషల్లోని ఏకాక్షర పదాల సమ్మేళనం. పైగా ఆ పదాలన్నిటి అర్థమూ ఒకటే. అదీ అసలు తమాషా (ఆ-హిందీ, వా-తమిళం, రా-తెలుగు, బా-కన్నడం, వా-మలయాళం). అన్నట్లు తమాషా (దీర్ఘాంతం.. దీర్ఘాంతం..) అనేది పార్శీ పదం. మరాఠీలు రంగస్థలం మీద చేసే వినోదప్రదర్శన 'తమాషా' అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. అక్కణ్ణించీ ఆ పదం ఇతర భారతీయ భాషల్లోకి పాకింది.

పైన హులి అంటే పులి అని చెప్పుకున్నాం. బెంగళూరులో హుళిమావు అని ఒక ప్రాంతముంది. ఐతే ఈ హుళి పుల్లదనానికి సంబంధించింది. హుళిమావు అంటే పుల్ల మామిడి. (అసలీ టపాను పోయిన్నెల్లోనే ప్రచురించవలసింది. కానీ అప్పటికే అలుపెరుగక ఆవకాయ - మాగాయ పోరాటాలు చేస్తోన్న జనాల మధ్యకు పుల్లమామిడిని వదలడానికి జంకి ఇన్నిరోజులూ ఆగానన్నమాట. :D) అలాగే ఆనేకల్ అని ఇంకొక ప్రాంతముంది. కన్నడంలో ఆనె అంటే ఏనుగు. (కాబట్టి ఆనేకల్లంటే ఏనుగు రాయి అనుకోవాలి. అదేం పేరు అనుకోకండి. మా కడప నగరంలో ఒక ప్రాంతం పేరు మట్టి పెద్దపులి. అక్కడ మట్టితో చేసిన పెద్దపులి విగ్రహముంది లెండి. అందుకే ఆ పేరు. మనం పులులను కడపలో, పులివెందుల్లో వదిలేసి మళ్ళీ ఏనుగు దగ్గరికొద్దాం.) వివిధ ద్రవిడ భాషల్లో ఇది ఆనె, ఆనై, యానై, ఏనిగ్, ఏనిగ అని పిలవబడుతోంది.

పత్తు/హత్తు/పది, వా/బా/రా, ఆనై/ఆనె/ఏనిగ(ఏనుగు) లాంటి పదాలను చూస్తే ఇవి ము.ద్ర. లేక తమిళంలో, కన్నడంలో ఒక విధంగాను, తెలుగులో మాత్రం కొంచెం తేడాగానూ ఉన్నట్లు తెలుస్తోంది కదా? ముద్ర నుంచి ఎక్కువ దూరం వచ్చేసింది తెలుగు భాషేనేమో అని కూడా దీన్ని బట్టి అనిపిస్తోంది.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఇంతటితో కన్నడ స్వబోధినిలోని మొదటి చాప్టరు సమాప్తం. ఈ ఒక్క చాప్టర్లోనే మీరు కన్నడభాషలోని 40-50% పదాలు నేర్చేసుకున్నారు. రెండో చాప్టరు మూడువందల ముప్ఫైమూడూ పాయింట్ మూడు మీటర్లు అనగా తొమ్మిది వందల కిలోహెర్ట్జ్స్ పై తర్వాతెప్పుడో ప్రసారమౌతుంది. ఈలోగా మీరు వీటిని బాగా అధ్యయనం చేసి, అభ్యాసం చేసి మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు ధైర్యంగా, విశృంఖలంగా వాడడం మొదలుపెట్టండి. విజయోస్తు!

Appendix:

మీ సౌకర్యం కోసం RTS తో వెతుక్కోవడానికి వీలు కల్పించే కన్నడ కస్తూరి ఆన్లైన్ నిఘంటువుల లింకులు

ఆంగ్ల-కన్నడ నిఘంటువు

కన్నడాంగ్ల నిఘంటువు

హెచ్చరిక: కింది రెండు వాక్యాలూ స్వగతం. ఎవ్వరూ చదవకండి.
'హమ్మయ్య, నాకొచ్చిన నాలుగు కన్నడ పదాలూ చెప్పేశాను. ఇంకో నాలుగు పదాలు నేర్చుకున్నాక రెండో చాప్టరు రాస్తా!'

Monday 3 January, 2011

యువత మార్పుతోనే వ్యవస్థకు చికిత్స

 - ఎం. కేశవరెడ్డి, కడప

డిసెంబరు31 లోపు తెలంగాణా ఇవ్వాలి! ఇవ్వకుంటే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది అని తెలంగాణావాదులు, ఇస్తే మా తడాఖా చూపిస్తాం అని సమైక్యవాదుల పరస్పర ప్రేలాపనలు, ఏమౌతుందో ఏమో అన్న అపోహలు ప్రభుత్వానికి గుక్కతిప్పుకోనివ్వని వైనం. సాయుధ పోరాటానికి సిద్ధం కమ్మని నాయకుల రణఘోషలు, ఆపేందుకు ప్రభుత్వ దళాల మోహరింపు. (తేదీ జనవరి 6కు మారింది. కానీ పరిస్థితుల్లో మార్పు లేదు.) ఏమిటిది? ఒక సమస్యకు పరిష్కారం హింసా? ఇది గాంధీ పుట్టిన దేశమేనా? శాంతిని ప్రపంచానికి అందించిన నేల ఇదేనా? ఆధ్యాత్మిక సంపన్నులుగా ప్రపంచ గుర్తింపు పొందిన భారతీయులు, విభిన్న జాతి, కుల, మతాలకతీతులుగా సామరస్యంగా జీవించే భారతీయులు తన్నుకు చావడం ఏమిటి? మనమంతా పాఠశాలలో చదువుకొనేటప్పుడు ప్రతిజ్ఞ చేస్తుంటాం. భారతీయులందరూ నా సహోదరులు అని చెయ్యిచాపి ప్రతిజ్ఞచేసి ఎదిగినవాళ్ళం. నేడు కులం, మతం, ప్రాంతం విభేదాలతో విరోధులుగా తన్నుకుచావడం ఏమిటి? ఇది ఏ కులం, ఏ మతం చెబుతుంది?

సమస్య సమస్యకో ఉద్యమం. మా కులానికే ముఖ్యమంత్రి కావాలి. కాదు మా ప్రాంతానికే ఇవ్వాలి. అంటూ అజ్ఞానంతో చేసే ఉద్యమాలు అభివృద్ధికి అడ్డుగా మారడం భారతీయతకే మచ్చ. కాటన్, మన్రో, బ్రౌన్ లాంటి వారిదే మతం? ఏ కులం? ఏ జాతి? మేలు చేయాలనే తలంపు ఉండాలేగానీ మా కులం వాడో, మా మతం వాడో వీరుడు, శూరుడు కాడనే సత్యం గమనించాలి. సేవచేయగల్గిన సమర్థులు మనకు పాలకులుగా రావాలి. అలాంటివారిని మనం ఆహ్వానించాలి. సాయుధులను కమ్మంటున్నారు. పోరాటాలకు ఉరకండి అంటున్నారు. తన్నులు తిని చచ్చేదెవరు? మిమ్మల్ని ప్రేరేపించి ఎయిర్ కండిషన్డ్ గదుల్లో నాయకులు విశ్రాంతి తీసుకొంటుంటే మీ ప్రాణాలు పణంగా పెట్టి మనలో మనం తన్నుకుచావడం బాధ్యత గల పౌరుని లక్షణమేనా? ఆలోచించండి.

తెలంగాణా ఇస్తే ఏమౌతుంది? ఎవరో ఒకరు ముఖ్యమంత్రి. ఆ పదవి నాక్కావాలంటే నాక్కావాలంటూ పెనుగులాటలు, పోరాటాలు, పదవులు దక్కినవారికి సంతోషం, దక్కని వారికి ఆక్రోషం, మా కులంవారికి అన్యాయం, మా జిల్లాకు మొండిచేయి, సీనియర్ కు అన్యాయం, జూనియర్ కు అందలం, ఇదీ వరుస. పదవుల కోసం పైరవీలు, లాబీయింగ్ వీరులకే అధికారం. యధా మామూలే. రొటీన్ అసంతృప్తే. ఉద్యోగాలొస్తాయి, ఆ లాభమొస్తుంది, ఈ లాభమొస్తుంది, అని ఊదరగొట్టి ప్రజలను భ్రమల్లో తేల్చిన ఆ నాయకుల కుర్చీ కుస్తీలో మళ్ళీ మీరు సమిధలే. అప్పుడు మళ్ళీ సామాన్యులకు నిరాశే. బాగా ఆలోచించండి. నాయకుల పదవుల కోసం కుల, మత, ప్రాంతాల సంకుచితత్వంతో జరిగే పోరాటాల్లో మీకేంటి పని? ఉపాధి ఆశా? బాగా చదవండి ఉద్యోగాలొస్తాయి. సత్తా లేకుండా అవకాశాల కోసం ఎదురుచూడడం మూర్ఖుల పని. ఆలోచించండి. అలాంటివి మనకొద్దు. సమర్థులుగా ఎదగాలి. ఉద్యమంలో పాల్గొంటే మీకు చరిత్రలో కొన్ని పేజీలొస్తాయా? మీరు లేని పేజీలు దేనికి? ఈ స్వార్థపు పోరాటాలు వద్దు. పరిపాలనా సౌలభ్యం కోసం విభాగాలుగా చేయాల్సి వస్తే అది కేంద్రం చేస్తుంది. అవి విభజన రేఖలు కావు. పాలనా సౌలభ్యం కోసం మాత్రమే. మీ పోరాటాలు మానవ జాతి సమస్తానికి మేలు చేకూర్చేవై ఉండాలి. అవినీతి వల్ల, కాలుష్యం వల్ల మన సమాజం, భవిష్యత్తు నేడు తీవ్ర విపత్తునెదుర్కొంటున్నాయి. వాటి గురించి ఆలోచించండి. ఉద్యమించండి. కుల, మత, ప్రాంతాలకతీతంగా మానవ జాతి కళ్యాణానికి ప్రయత్నం చేయండి.ప్రగతితో బాటు చరిత్రలో నిలిచిపోతారు. ఎవరి కోసమో ఆత్మహత్యలు, లాఠీదెబ్బలు మీకెందుకు? మీ చదువు, విజ్ఞానం నవ సమాజానికి ఉపయోగపడాలి. ఎవరి కిందో, ఏ పదవి ఆశకో చేసేది ఉద్యమం కాదు. దాని వల్ల మార్పు రాదు. నిస్వార్థంగా ఆలోచించాలి. అలాంటి నాయకులు మన మధ్య ఉన్నారా? గమనించాలి. ప్రజలందరినీ సహజీవనులుగా గౌరవించడం నేర్చుకోవాలి. అలాంటప్పుడు సమస్త ప్రపంచం మీకు సలాం కొడుతుంది. మీ నిజాయితీ ప్రశ్నించలేనిదై దేదీప్యమానమౌతుంది. చదువుల కోసం వచ్చిన మీరు ఉద్యమాలకు బలయిపోతే కాయకష్టంతో చదువులకై పంపిన మీ తల్లిదండ్రులకు గుండెకోతను మిగిల్చినవారవుతారా?

ఓటుకు నోటో, సారా పాకెట్టో, క్రికెట్ కిట్టో మీరడిగితే అది సమకూర్చేందుకు మీ నాయకులకు డబ్బు కావాలి. అది కావాలంటే అవినీతి చేయాలి. ఆ అవినీతిలో బలయిపోయేదెవరో ఆలోచించారా? వచ్చే రూపాయి గురించి ఆలోచిస్తున్నారే తప్ప పోయే కోట్ల గురించి, భవిష్యత్ వినాశనం గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? అవినీతిలో భారతదేశం కూరుకుపోయిందనే సంగతి ప్రపంచ సంస్థలు కోడై కూస్తున్నాయి. ప్రజాసేవకుల ముసుగులో వేలకోట్లు సంపాదిస్తున్న వారిని మీరు సమర్థించడం ఏమిటి? తాత్కాలిక ప్రయోజనాలకు మనం తృప్తిపడితే భవిష్యత్తులో మరింత నష్టపోవాల్సి వస్తుంది. డబ్బు కక్కుర్తికో, శృంగార సంతృప్తికో, మద్యవిలాసాలకో దేశ పరువును తాకట్టు పెట్టిన ప్రబుద్ధులను మన చట్టం, న్యాయం శిక్షించలేని పరిస్థితులలో ఉన్నాయి. వారి అవినీతిని ప్రశ్నించలేని దౌర్బల్యంలో మనముంటే మనకు బాధలు కాక మరేముంటాయి?

ఒక పసిపాప బోరుబావిలో పడ్డప్పుడు, ఒక పాప బాయిలర్ లో కాల్చబడినప్పుడు యావత్ మానవ హృదయం ద్రవించింది. అదే మానవీయత. కుల, మత, ప్రాంతాలకతీతంగా మన కళ్ళలో కన్నీరు రాలాయే అదే మనలోని దైవత్వం. దానిని వెలికితీయాలి. అందుకు మనం సమర్థులను వెదకాలి. అందుకు ముందు మనం మారాలి. మన ఆలోచనలు మారాలి. మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలంటే బాహ్యంలో గాలి స్వచ్ఛంగా ఉండాలి. మన సమాజం బాగున్నప్పుడే మనం బాగుంటాం. సమాజాన్ని సంస్కరించాలంటే ముందు విద్యా వ్యవస్థను సంస్కరించాలి. సాంకేతిక ప్రగతిపై ఉన్న శ్రద్ధ విలువల పెంపుకు లేదు. మద్యంపై ఉన్న ఆసక్తి విద్యపైన లేదు. ఆధ్యాత్మిక జ్ఞానంతో సేదదీరాల్సిన జనం మత్తులో జోగడం వ్యవస్థ పతనానికి పరాకాష్ట కాదా? ఇంకా మార్పు కోసం చేయాల్సిన ప్రయత్నానికి వేళ కాలేదా? సమయం రాలేదా? ఆలోచించండి.

మన బిడ్డకు దెబ్బ తగిలితే ఎంత బాధపడతామో ఇతరులకు తగిలినా అలాగే స్పందించాలి. శరీరాలు, ఆస్థులు, మేడలు పెరిగినా బుద్ధులు పెరగడం లేదు. తప్పు చేసినవాడు మనవాడైతే ఒకలాగ, వేరొకరైతే ఒకలాగ స్పందించడం మానవునిలోని ద్వంద్వ ప్రవృత్తికి నిదర్శనం. ఇది వ్యవస్థ పతనానికో కారణం. ఒక తండ్రి కోట్లు కూడబెట్టి సంతానానికిచ్చి తృప్తి పడుతున్నాడు. మరి ఆ కోట్లు అతనికి బ్రతుకు భరోసా ఇస్తున్నాయా? అతని పతనానికో, కుట్రలతో అతని మరణానికో కారణం అవుతున్నాయి. అందుకే మంచి సమాజం కావాలి. ఒక డ్యాం నిర్మాణానికి ఎంతో మంది శ్రమ కావాలి. కూల్చాలంటే ఒకే ఒక బాంబు చాలు. వినాశనం మనకొద్దు. నిర్మాణాత్మకంగానే మనమూ మన ఆలోచనలూ ఉండాలి. మన సమాజంలోని రుగ్మతలకు టీకా వేయాలి. అదీ యువత చేతుల్లోనే ఉంది.

టీవీ ఛానల్స్, పత్రికలు సమాజంలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. స్వప్రయోజనాల లబ్దికై కృషి చేస్తున్నాయి. సమస్య సృష్టించడం, వ్యాపింపజేయడం, తద్వారా వ్యాపారలబ్ది పొందడం వాటి నైజమైంది. వ్యాపార లబ్ది వాటికి వంటబట్టి సమాజహితాన్ని గాలికొదిలాయి.

అపార మేధావులు సమాజ మార్పుకై సాయుధులై నక్సలైట్లుగా చాటుగా, మాటుగా చలికీ, వేడికీ పగలనక, రేయనక కొండల్లో, లోయల్లో సంచారం, ప్రభుత్వంపై పోరాటం. సమాజ వ్యతిరేకులంటూ ప్రభుత్వ పోలీసులు కూంబింగ్ లు, ఆపరేషన్లు. ఎందుకు? నక్సలైట్లు మనవాళ్ళే, పోలీసులు మనవాళ్ళే. ఒకరిని ఒకరు చంపుకుంటూ ఎంతో కాలంగా హింసను సృష్టిస్తూనే ఉన్నారు. మార్పు వచ్చిందా? రాదు. ఎందుకంటే వారి విజ్ఞానం హింసపై పెరుగుతున్నదే తప్ప సమాజ మరమ్మత్తు ప్రజా చైతన్యంలో ఉన్నదన్న సత్యాన్ని వారు గ్రహించలేకున్నారు. సహజ ఎరువులు వాడితే ప్రయోజనం. శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకుంటే ఆరోగ్యం అని మనకు తెలుసు. మరి వ్యవస్థలో అవినీతి వ్యతిరేక నిరోధక శక్తి పెంచేదానికి ప్రజాచైతన్యమే మందు అనే సత్యం వారిరువురూ ఎరగాలి. అహింసాయుతంగా ఆ మార్పు జరగాలి.

రిజర్వేషన్లు, కులమతాలు సమాజంలో వర్గ వైరుద్ధ్యానికి కారణాలవుతూ అభివృద్ధికి ఆటంకాలవుతున్నాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందినా వాటిని ఉపయోగించుకుంటూ సంపన్నులో, అధికార బలం కలిగినవారో లబ్ది పొందుతున్నారు తప్ప సామాన్యుడికి ఉపయోగపడడం లేదు. అందరి రక్తం ఒక్కటే, అందరం మనుషులమే. మనమధ్య ఎందుకీ అంతరాలు? వాటిని రద్దుచేసి పేదలను గుర్తించి వారి స్థితిగతులను మెరుగుపరచి, జీవన ప్రమాణాలను అభివృద్ధిచేసే వ్యవస్థలను మనం పెంచుకోవాలి. అందుకు టెక్నాలజీని సక్రమంగా ఉపయోగించుకోవాలి.

భారీ ప్రాజెక్టులతో తలనొప్పులు, పర్యావరణ ఇబ్బందులు తెచ్చుకోక మైనర్ ఇర్రిగేషన్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. వృధాను అరికట్టాలి. వేసిన రోడ్డు వేసుకొంటూ కట్టిన ఇల్లే కట్టుకుంటూ పోతే అభివృద్ధి జరగదు. నాయకులూ మీరూ ఆలోచించండి. పదవుల కోసం, పైరవీల కోసం డబ్బు కావాలి. అందుకు మీరు అవినీతి చేయాలి. అందుకు ప్రభుత్వ నిధులు వృథా అవుతున్నాయి. వాటిని సక్రమంగా నిర్వహిస్తే పదవులు అవే వస్తాయి. వాటి కోసం కాళ్ళు మొక్కడం, లంచమివ్వడం, లాబీయింగ్ చేయడం చేసి మీ వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చుకోవద్దు. మీ ప్రజలకు తలవొంపులు తేవద్దు.

ఈనాటి సమాజాన్ని చూడండి. ఆత్మహత్యలు, మారణకాండలు, మానభంగాలు, అవినీతి, లంచగొండితనం ఇలాంటివెన్నో పీడించే సమస్యలు. వీటిని ఎదుర్కోలేక ప్రభుత్వాలు, చట్టాలు నిర్వేదంలో ఉన్నాయి. టెర్రరిజం, ఉగ్రవాదం, కాలుష్యం విపత్తులు మన వినాశనానికై ఎదురుచూస్తున్నాయి. మనం జాగ్రత్తగా లేకపోతే మానవ జాతికి ముప్పు తప్పదు.

కోటాను కోట్లు జనాభా పెరిగినా వారి మధ్య ప్రేమ లేదు, విశ్వాసం లేదు. నమ్మకం లేదు. నిత్యం ఒత్తిడిలో కోరికల సుడిలో రోగాలు ఆవహించి బ్రతుకును ఛిద్రం చేసుకుంటున్నారు. తల్లికి బిడ్డ, బిడ్డకు తల్లి లేని సంబంధాలు మన మధ్య పెరిగాయి. ప్రపంచంలో కోట్ల మంది జనాలున్నా నాకెవ్వరూ లేరనే ఒంటరితనం జనాల్లో ఉంది.

బిడ్డల భవిష్యత్తు ఆలోచించే తల్లిదండ్రులు మేము పోతే మా బిడ్డలు ఏమౌతారో. వారినెవరు చూస్తారో అన్న విశ్వాసం లేక తమకు ఆపద వచ్చినప్పుడు తమతో పాటు తమ బిడ్డలను పరలోకానికి తీసుకుపోవడం మనం వింటున్నాం. ఎంత దైన్యం? పొరుగువాడిని ప్రేమించలేకున్నాం. అనుమానాలు, భ్రమలు, అభద్రత మనలో ఉన్నాయి. అవి తొలగాలంటే మనం మారి, సమాజాన్ని మార్చాలి. అందుకు ప్రజలందరూ చైతన్యులవ్వాలి. మాకు ఉద్యోగాలు ఇప్పించండీ అని ఏ యువకుడూ ఏ నాయకుణ్ణీ అడుక్కొనే పరిస్థితి రాకూడదు. ఉద్యోగాలు సృష్టించుకొనే స్థితికి యువత ఎదగాలి. వారి ఆలోచనలు మారాలి. అప్పుడు ప్రభుత్వాలు, వ్యవస్థలు వాటంతట అవే మారుతాయి. అందుకు ప్రజాచైతన్యం అహింసాయుత విప్లవం రావాలి. అదే విశ్వాసంతో వదలని పట్టుదలతో యువత ఉద్యమిస్తే ప్రతి మనిషి సంతోషాన్ని ఆస్వాదిస్తారు. జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తారు.

లేదంటే రాబోయే రోజుల్లో మానవ వికృత చేష్టల వల్ల పర్యావరణం, అవినీతి వ్యవస్థలు మన బిడ్డలను, వారి బిడ్డలను కబళించక మానవు. మనం పేర్చిన ఈ కోట్లూ, నోట్లూ ఆ ఉపద్రవాల నుంచి భవిష్యత్తు తరాలను కాపాడలేవు. ఆలోచించండి సంకుచిత పోరాటాల్లో సమిధలు కాకండి. శాంతికి కృషి చేయండి. వ్యవస్థ మార్పుకు ఉద్యమించండి. అణువులు విడిపోతే వెలువడే ఆటంబాంబు శక్తి కన్నా అణువుల సంలీనం వల్ల వెలువడే హైడ్రోజన్ బాంబు శక్తి అమోఘమనే సత్యం మీకు తెలుసు. ఉమ్మడి చైతన్యంతో ముందుకు ఉరకండి. వ్యవస్థ మార్పు మీ చేతుల్లోనే ఉంది. అహింసాయుత వైజ్ఞానిక విప్లవజ్యోతులై ప్రకాశించి ఈ జనవరి 6ను రక్త చరిత్ర కాకుండా కాపాడండి. యువకులారా ఆలోచించండి. మార్పుకు శ్రీకారం చుట్టండి.

Tuesday 25 August, 2009

వెన్నెలకు వన్నెలద్దుతున్నామని మురిసిపోయే మూర్ఖశిఖామణులకు

(టపా మారలేదు. మారింది టైటిలే. :) )

మూడు తరాలుగా ఆబాలగోపాలాన్ని అలరించిన చందమామలో గత కొన్ని నెలలుగా "వినాశకాలే..." అన్న తీరులో చోటు చేసుకున్న పెనుమార్పులపై నేను చందమామ సంపాదకులకు ఒక ఈమెయిలు ఘాటుగా పంపాను. (పాత చందమామలను పునర్ముద్రించమని విడిగా ఇంకొక మెయిలు కూడా పంపాను.) పత్రిక ముఖచిత్రాలుగా వపా బొమ్మలనే చూడబోతున్నామనే వార్త ఆనందాన్ని కలిగించేదే అయినా మిగతా మార్పుల విషయంలో చందమామ ప్రస్తుత యాజమాన్యం వైఖరి తెలియకపోవడం వల్ల తోటి చం.పి.లు కూడా ఈమెయిళ్ళ ద్వారా వారిపై ఒత్తిడి తీసుకురావడానికి వీలుగా నేను పంపిన ఈమెయిలు పాఠ్యాన్ని క్రింద ఇస్తున్నాను. (Update: కప్పగంతు శివరామప్రసాద్ గారు చందమామకు రాసిన లేఖ కూడా చూడండి) దీంట్లో మీకు అవసరమనిపించిన మార్పులు - చేర్పులు చేసి editor@chandamama.com, online@chandamama.com లకు పంపవలసిందిగా కోరుతున్నాను.

----------------------------------------

Changes in Chandamama

Dear Sir/Madam,

I am an ardent reader of Chandamama (Telugu). The recent changes in the layout of language editions of Chandamama can only be conceived by a foolish mind which thinks it can make the moonlight more attractive by adding colours to it. There is no need to make Chandamama more 'popular'. What is needed is dedication to make it stick to its core values. It is not just a magazine for us. It much more: to me it is the cultural ambassador of India.

Here is what I want and don't want in Chandamama:

1. Recently you have been asking whether we want more Contemporary stories: My answer is a big NOOOOOOOOOOO if by Contemporary stories you mean stories set in the contemporary/modern world. I definitely want more stories which are set in the ancient/medieval times.

2. You have also discarded the 25-ఏళ్ళనాటి చందమామ కథ in Telugu. I want one every month without fail.

3. Jataka tales: I want them back in the old form. In stead of wasting the time, space and effort on experiments like this, why don't you just reproduce them in their original form and give bigger illustrations in the regular serials and concentrate on improving the quality of content and translations?

4. No more comic strips, please! These are very irksome in Chandamama. if you can't do anything better, you please continue the tradition. Don't meddle and mess up with it. (You can try giving this kind of stuff in Junior Chandamama).

5. I also want two full-page illustrations in the regular serials.

6. One more suggestion: don't leave blank space on either side of the title of each story. It should be covered with illustration only. That way, we can have slightly bigger illustrations as we had previously. They have shrunk to a large extent in recent times and sometimes appear more like miniature paintings. The 'Send SMS' requests have also eaten into the space meant for the illustrations. Please stop them.

7. The editorial page: I haven't ever seen any journal/magazine without its name/logo in the editorial page. The frame designed by Chitra with swans swimming in the lake was pleasing. It's again a foolish idea to discard it.

8. Illustrations: The illustrations with their edges mutilated look as if they are eaten up by white ants. I want them with clear, straight edges.

9. Footer: The writers' names should be given in the footers only.

10. Ordering of the pages: Please retain the old order with the photo caption contest in the last page, etc.

11. Don't publish commercial advertisements between stories.

12. And last but not the least, The cover page: The cover page should reflect the nature and content of the magazine. Once in a while if you have chosen to publish the full-size illustrations of King Vikram carrying the corpse or the illustrations by Chitra that would have been nice. But a group of small small illustrations don't look beautiful and it is blasphemous, disgusting and an unpardonable crime if you think Chandamama can attract more readers or make its readers happy by showing the pictures of cricketers and film stars.

The only thing I liked in the changes you have introduced is the icons indicating the nature of each article/story.

Monday 27 July, 2009

చేజారిన చందమామ?

ఔను, నిజంగానే! దశాబ్దాలుగా ఆబాలగోపాలాన్నీ అలరిస్తూ వచ్చిన చందమామే, అచ్చ తెలుగుదనానికి ప్రతీకలుగా మనం చెప్పుకునేవాటిలో ముందుండే చందమామే తెలుగువాడి చేతిలోనుంచి జారిపోయి పరాధీన అయిపోయింది. ఈ మార్పు చాపకింది నీరులా జరిగిపోయింది. ఆరేడు నెలలకిందటనుకుంటా పాత చందమామ కథను వెండితెర మీద చూడబోతున్నామన్న వార్త తెలిసి ఆనందంతో గంతులు వేసినప్పుడే చందమామ ప్రధాన సంపాదకుడు, ప్రచురణకర్త ఐన విశ్వం చిన్నప్పటినుంచి పెనవేసుకున్న అనుబంధాన్ని తెంచుకుని బాధాతప్త హృదయంతో చందమామ నుంచి తొలగిపోతున్నట్లు చందమామలో సంపాదకీయానికి అదనంగా ఇంకో పేజీలో రాశారు. అది చదివి నాకు గుండె ఆగిపోయినంత పనైంది. అసలు ఆయన చందమామనుంచి తొలగిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది?

1990లలో చందమామ ప్రచురణ తాత్కాలికంగా ఆగిపోయి, పునఃప్రారంభమైన తర్వాత మోర్గాన్ స్టాన్లీకి చెందిన వినోద్ సేథీ తదితరులు ప్రదర్శించిన "సృజనాత్మక ఔదార్యం" గురించి విశ్వం తరచూ ప్రస్తావించి ప్రశంసించేవారు. ఔదార్యం మాట అటుంచి దాంట్లో సృజనాత్మకత ఏముందో నాకు అప్పట్లో అర్థం కాలేదు. ఇప్పుడర్థమౌతోంది ఆ "సృజనాత్మకత" ఫలితమే చందమామలో వ్యవస్థాపకుల వారసులకు, చందమామను ఇన్నేళ్లూ చందమామగా నిలిపినవారికి చందమామలో స్థానం లేకపోవడం. చందమామ మీద "అంతులేని అభిమానం"తో 60% శాతం పెట్టుబడులతో ముందుకొచ్చిన పెద్దమనుషులు వాటాలు పెంచుకుని, విశ్వం మాటకు విలువ లేకుండా చేసి ఇప్పుడు తరతరాల వారసత్వసంపదను ఇంకెవరో అనామకుల చేతుల్లో పెట్టి చేతులు దులుపుకున్నారు (కాదు సొమ్ముచేసుకున్నారు అనడం సరైనది). చందమామ ప్రస్థానంలో ఇప్పుడు నడుస్తున్నది అతి కీలక ఘట్టం. అసలు చక్రపాణి మరణానంతరం (అప్పటికి ఇరవయేళ్లకు పైగా చందమామలో పేరులేని ఎడిటర్ గా కొ.కు. పనిచేస్తున్నప్పటికీ) అంతకు చాలా కాలం క్రితమే చక్కన్న చందమామ ప్రధాన సంపాదకుడిగా తన వారసుడిగా ఎంపికచేసి ఉంచిన విశ్వం గారు, చందమామ సంపాదకుడిగా, ప్రచురణకర్తగా, ముద్రాపకుడిగా సుదీర్ఘకాలం కొనసాగిన విశ్వం గారు ఇప్పుడు చందమామలో లేరు!

విశ్వం చందమామ నుంచి నిష్క్రమించడంతో చందమామలో మరో శకం ముగిసింది. నా చిన్నప్పుడు చందమామలో అప్పుడప్పుడూ కనిపించే Statement about ownership of CHANDAMAMA(Telugu Rule 8 (Form VI), Newspapers (Central) Rules, 1956 లో చందమామ వాటాదారులుగా ప్రచురణకర్త Shri B. VENKATRAMA REDDY (ఆయనే నాగిరెడ్డి కుమారుడు 'విశ్వం') పేరుకు అదనంగా అన్నీ తెలుగు పేర్లే (నాగిరెడ్డి కుటుంబసభ్యులవే) కనిపించేవి:
Shri B. VENKATRAMA REDDY
Shri B. NARESH REDDY
Shri B. SANJAY REDDY
Shri B. V. SHARATH REDDY
Smt. B. PADMAVATHI
Shri B. N. RAJESH REDDY
Smt. B. VASUNDHARA
Kum. B.L. ARCHANA
Kum. B.L. ARADHANA

అర్చన, ఆరాధన మైనర్లుగా ఉన్నప్పటి నుంచే ఇందులో ఉన్నారు (Minors admitted to the benefits of Partnership).

ఇప్పుడో? సంపాదకీయం పేజీలోనే చక్రపాణి-నాగిరెడ్డి, విశ్వం లాంటి అచ్చ తెలుగు పేర్లకు బదులుగా ఒక అరవపేరును చూడాల్సి రావడం దుస్సహంగా ఉంది. మార్పు అదొక్కటే కాదు. చందమామ చాలా మారింది. విశ్వం చందమామ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత ఒకటి రెండు నెలలు సూర్యోదయాల్లో, చంద్రోదయాల్లో ఎటువంటి మార్పూలేదు. అది అబద్ధమేమో, విశ్వం గారు చందమామను వదిలేసి ఎక్కడికి పోతారు? అనుకుని స్థిమితపడుతున్నంతలో మార్పులు ఒకదాని వెనుకొకటి శరాఘాతాలుగా వచ్చి తగిలాయి.

అసలు చందమామలో జరగరానిదేదో జరుగుతోందని చాన్నాళ్ల కిందటే చందమామ వెబ్సైటు chandamama.org నుంచి chandamama.com కి మారినప్పుడే గ్రహించాల్సింది. వెబ్సైటు చిరునామాలో మారింది టాప్ లెవెల్ డొమెయిను ఒక్కటే కాదు - చందమామను చేజిక్కించుకున్నవారి దృక్కోణమే వాణిజ్యమయమైపోయింది. chandamama.org ఉన్నప్పుడు కథలు, తాజా చందమామ సంచికలు Treasure chest అనే విభాగంలో ఉండేవి. (తర్వాత కొంతకాలానికి ఈనాడు చిన్నపిల్లల పేజీ (హాయ్ బుజ్జీ!)లో కథలను ఒక శీర్షికగా "కథల ఖజానా" అనే పేరు కింద వెయ్యడం మొదలుపెట్టడం కాకతాళీయమని నేను అనుకోను :)!!) chandamama.org లో తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు విడివిడిగా చర్చావేదికలు (Fora for parents and teachers) ఉండేవి. పిల్లల పెంపకం, వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దడం లాంటి విషయాల గురించి చర్చించుకునే అవకాశముండేది. వాటి స్థానంలో ఇప్పుడు షాపింగులు, అడ్వర్టైజుమెంట్లు.

నాకు ఆందోళన కలిగిస్తున్న విషయం ఇంకొకటుంది: పోయిన నెల చందమామలో వికీపీడియా లోని ఒక ఫోటో వేశారు. అది వింత కాకపోవచ్చు. ఐతే వికీపీడియాలోని ఆ ఫోటోను GFDL కింద వాడుకున్నట్లు వివరంగా రాసిన నోట్ దాదాపు ఆ ఫోటో అంత స్థలాన్ని ఆక్రమించింది. ఇక్కడ ఆలోచించవలసిన విషయమేమిటంటే ఇతరుల కాపీహక్కులకు ఇంత ప్రాధాన్యత ఇచ్చినవాళ్ళు తమ కాపీహక్కుల విషయంలో ఇంకెంత కఠినంగా ఉండబోతారో అని! 'వాళ్ల హక్కులు, వాళ్ళిష్టం - పైగా బోలెడు డబ్బు పొసి కొనుక్కున్నారు కదా' అనెయ్యకండి. ఇప్పటివరకూ మీరెప్పుడూ చందమామలో కాపీహక్కుల నోటీసు చూసి ఉండకపోతే ఒకసారి చూడండి - విషయసూచిక పేజీలో అట్టడుగున "The stories, articles, designs contained herein are the exclusive property of the publishers. Copying or adapting them in any manner/medium will be dealt with according to law." అని ఉంటుంది.

ఇప్పుడు ఆలోచించండి: chandamama.org వెబ్సైటు ప్రారంభించిన కొత్తల్లో కోరినవారికి ఈమెయిల్ ద్వారా చక్కటి చందమామ కథలను ఇంగ్లీషులో పంపేవాళ్ళు. అవే కాకుండా మనం ఎక్కడైనా వినగా మనకు బాగా నచ్చిన కథలు కూడా చందమామ కథలే అయి ఉండే అవకాశం చాలా ఎక్కువ. ఆ కథలను ముచ్చటపడి మీరు (నేరకపోయి) మీ బ్లాగుల్లో/సొంత వెబ్సైట్లలో పెట్టుకున్నారనుకోండి. చందమామ యాజమాన్యం మీ నుంచి పరిహారం కోరవచ్చు. ఇప్పటివరకూ మాచిరాజు కామేశ్వరరావు, దాసరి వెంకటరమణ, డా, గంగిశెట్టి శివకుమార్ లాంటి రచయితలు తమ కథాసంపుటాల్లో చందమామ కథలు చేర్చుకున్నారు. ఇకమీదట చందమామ కథల రచయితలు కూడా వాటిని తమ కథాసంపుటాల్లో చేర్చడానికి చందమామ యజమానుల అనుమతి కోరవలసిరావచ్చు. చందమామ యాజమాన్యం అనుమతి నిరాకరించనూవచ్చు. లేదా అనుమతికి ఖరీదు కట్టనూవచ్చు. అందుకే చందమామ నిర్వహణ ఎలాంటివారి చేతుల్లో ఉంది అనేది అతి ముఖ్యమైన అంశం.

కొత్త యాజమాన్యం చందమామలో తీసుకువచ్చిన మార్పులు దాదాపు అన్ని అంశాల్లోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి:

ముఖచిత్రాలు: ఏ పత్రికకైనా ముఖచిత్రం ఆ పత్రిక స్వభావాన్ని, లోపలి కంటెంటును ప్రతిబింబించేటట్లుగా ఉంటుంది. చందమామలో ఎన్ని రకాల శీర్షికలున్నా ప్రధానంగా అది భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే కథల పత్రిక. కథల పత్రికగా ప్రసిద్ధి పొంది మూడుతరాలపాటు అవిచ్ఛిన్నంగా ఆబాలగోపాలాన్ని అలరించిన చందమామ ఇప్పుడు కాలానుగుణామైన మార్పులంటూ ముఖచిత్రాలుగా వపా బొమ్మలకు బదులు క్రికెటర్లు, సినీతారల బొమ్మలు చూపి అమ్మకాలు పెంచుకోవాలనుకునే హీనస్థితికి దిగజారినందుకు బాధగా ఉంది. చందమామ రాగానే ముఖపత్రం మీద వపా సంతకం కోసం అప్రయత్నంగానే వెదకడం, ఈసారి ఆయన సంతకం అడ్డంగా ఉందా, నిలువుగానా? తెలుగులో ఉందా, ఆంగ్లంలోనా లేక చిత్రలిపిలోనా? అని చూసేవాణ్ణి. ఇప్పుడది గతకాలపు జ్ఞాపకం. "55 సంవత్సరాలుగా చందమామ చదువుతున్నా. ఇప్పుడందులో వస్తున్న మార్పులు హర్షణీయమేనా? అమెరికాలో ఉన్న నా మనవరాలు తెలుగు రాకపోయినా తల్లిచేత చందమామ చదివించుకుంటుంది. ఏప్రిల్ సంచిక ముఖచిత్రం చూసి 'ఇది చందమామ కాదు' అందిట." అంటున్నారు ఒక చందమామ అభిమాని. చంపి లందరి గోడు కూడా అదే.

లోపలి బొమ్మలు: చందమామ కథల్లో బొమ్మలకున్న విశిష్టత గురించి ఎంత చెప్పినా తక్కువే. అవే బొమ్మలు ఇప్పుడు చుట్టూ చెదలు తినిపోగా మిగిలిన పాత పుస్తకాల్లోని బొమ్మల్లా ఉన్నాయి. దశాబ్దాల కిందట తాను ప్రారంభించిన ఒరవడినే అన్ని పత్రికలూ పాటిస్తూండగా వీళ్ళకు కొత్తగా ఏం పుట్టిందో నాకు అర్థం కావడం లేదు. కథల పేర్లు ఇంతకుముందు చిత్రకారుల చేత రాయించేవారు. ఆ పద్ధతికి (చందమామ ఇండియా లిమిటెడ్ ఏర్పడిన తర్వాత) చాన్నాళ్ల కిందటే మంగళం పాడేశారు. ఇప్పుడు రచనల వరుస కూడా ఎట్లా పడితే అట్లా మార్చి పారేస్తున్నారు. ఏ పేజీలో ఏ శీర్షిక/సీరియల్ ఉందో వెతుక్కోవలసిన అవసరం ఇంతకుముందుండేది కాదు. ఉదాహరణకు బంగారులోయ సీరియల్ పేజీలు బైండు చేసుకోవడనికి పుస్తకం నుంచి విడదీస్తే దాంతోబాటే కృష్ణావతారం సీరియల్ చక్కగా చేతిలోకి వచ్చేసేది. ఇప్పుడైతే పీజీల అమరిక మొత్తం అయోమయం, గందరగోళం అయిపోయింది. ఉదాహరణకు, ఇప్పుడు నాలుగేసి పేజీల బొమ్మల సీరియల్స్ రెండు వస్తున్నాయి. అవైనా ఒకటిగా ఇవ్వొచ్చు కదా? ఆమాత్రం శ్రద్ధ కూడా తీసుకోవడం లేదు. కళ్ళు మూసుకుని గుడ్డిగా ఎక్కడేది పడితే అక్కడ అది వేసేస్తున్నారు. ఆఖరుకు ఫోటో వ్యాఖ్యల పోటీ కోసం కూడా పత్రికంతా వెదుక్కోవలసిన పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. పైగా ఎప్పుడూ లేని విధంగా కథల మధ్యలో కూడా వాణిజ్య ప్రకటనలు! చక్రపాణైతే ఒక్ఖ పేజీ కూడా తేడా రాకుండా చూసుకునేవారు.

మరో మార్పు: ఇప్పుడు కొత్తగా ప్రతి పేజీలో హెడర్, ఫుటర్ ఇస్తున్నారు. మొదట్లో కథ పేరు బొమ్మలో అంతర్భాగంగా చిత్రకారులే రాసేవారు. ఆ రాయడంలో ఆయా చిత్రకారుల శైలి ప్రతిబింబించేది - ఉదాహరణకు చిత్రా గారు రాసే అక్షరాలు ప్రధానంగా రెండు రకాలుగా ఉండేవి. వాటిని చూడగానే ఇవి చిత్రా గారి అక్షరాలు అని తెలిసే విధంగా. తర్వాత కథ పేరును ప్రింట్ చెయ్యడం మొదలుపెట్టారు. ఇప్పుడు కథ పేరు హెడర్లో ఇస్తుంటే - కొత్తగా ఉంది. కథ మొదటి పేజీలో (అది సింగిల్ పేజీ కథైతే తప్ప) బొమ్మ తప్పనిసరిగా పేజీ పైభాగాన్నే ఉండేది. ఇప్పుడా పద్ధతికీ మంగళం పాడేశారు. ఇక ఫుటర్లోనైతే రచయిత పేరు ఉండవలసినచోట ఎస్సెమ్మెస్ విజ్ఞాపనలు! ఎంత చిరాగ్గా ఉంటుందో చూడండి. ఐతే కొత్త అమరికలో అనుకూలమైన మార్పు - నాకు బాగా నచ్చింది - ఏమిటంటే హెడర్ మొదట్లో ఆ పేజీలోని రచనకు సంబంధించిన ఒక చూడముచ్చటైన ఐకన్ ఉంటోంది.

కంప్యూటర్ గ్రాఫిక్స్: బొమ్మలను అందంగా, ఆకర్షణీయంగా చూపడానికి కంప్యూటర్ గ్రాఫిక్స్ ను అద్భుతంగా వాడుకోవచ్చు. ఏడెనిమిదేళ్ళ కిందట ఇంగ్లిష్ చందమామలో ఒకానొక బొమ్మలో అద్దిన hues and shades చూసి పరవశించిపోయాను. ఇప్పుడు చందమామలో వస్తున్న బొమ్మలు (శంకర్ వేసినవి తప్ప) నాకు అసలేం నచ్చడం లేదు. ఇంతకు ముందు మాదిరే బొమ్మలు మంచి చిత్రకారుల చేత వేయించి వాటికి రంగులద్దడానికి కంప్యూటర్ ను వాడుకుంటే బాగుంటుంది.

కథలు: చందమామలో సీరియల్ కథలను మినహాయిస్తే మిగిలిన కథలన్నీ ఒక ఎత్తు, తానొక్కటీ ఒక ఎత్తుగా ఉండేది 25-ఏళ్ళనాటి చందమామ కథ. ఇప్పుడదీ ఎత్తేశారు.

ఇలాంటి అవకతవక మార్పుల వల్ల ఇంతకాలం ఆబాలగోపాలాన్ని అలరించిన చందమామ చరిత్రలో కలిసిపోనుందా? అని భయమేస్తోంది. కాలానుగుణంగా మార్పులు అనివార్యమే. కానీ కొన్ని మార్పులను అసలు సహించలేం. మరికొన్ని అనివార్యమైన మార్పులను తట్టుకోవడానికి సమయం పడుతుంది. (హిందూ పత్రిక డిజైన్ మార్చినప్పుడు మొదట చాలా చిరాకనిపించింది. కానీ నిదానంగా దానికి అలవాటు పడ్డాను.) చందమామ రూపంలో చోటుచేసుకున్న మార్పులు నాకు ఇంకా జీర్ణం కాలేదు. టైం పడుతుంది. ఇవి చందమామ కొత్త యాజమాన్యం అంటున్నట్లు రూపంలో మాత్రమే అని కూడా సరిపెట్టుకోలేకపోతున్నాను. ఎందుకంటే చందమామ విశిష్టత రూపంలో, బొమ్మల్లో కూడా ఉంది. ఆ రూపమే మారిపోయాక అది చందమామ ఎలా ఔతుంది? సుజాత గారు అన్నారు - అబ్దుల్ కలామ్ గారికి తెలుగు అర్థం కాదుగా అని. కానీ గతంలో చందమామ చదివినవారెవరినైనా మళ్ళీ ఆ లోకంలోకి తీసుకుపోవడానికి బొమ్మలు చాలు.

ఐతే చందమామ ప్రస్తుత యాజమాన్యం తన చర్యలను సమర్థించుకోజూస్తోంది: SMS పోల్ లో కొత్త తరహా ముఖచిత్రాలు గొప్పగా ఉన్నాయి అని 56%, బాగున్నాయి అని 28%, పాతవే నయం అని 16% అన్నారట! ఐనా ఆశ (hope) చావలేదు. "ఏ పత్రికైనా పాఠకుల కోసమే కాబట్టి వారు హర్షించని మార్పులు పత్రికలో మనగలవనుకోం" అంటున్నారు వసుంధర. చందమామకు గ్రహణం పట్టి చీకట్లు కమ్మిన ప్రస్తుత దశను త్వరలోనే దాటి చల్లని వెన్నెల కురుస్తుందని ఆశిద్దాం.

పూర్తిగా చందమామకు సంబంధించింది కాకపోయినా ఇక్కడ అప్రస్తుతం కాని ఒక చిన్న ప్రశ్న: చక్రపాణి చక్కన్న ఎలా అయ్యాడు?

కొసరు: మీ చిన్నప్పుడు చివరి పేజీలో వస్తూ ఉండిన పార్లే పాపిన్స్ ప్రకటనలు కూడా మీ చందమామ జ్ఞాపకాల్లో ఒక భాగమేనా? ఐతే ఇక్కడ చూడండి.

Monday 2 February, 2009

దేవుని కడపనొక కంట చూడు దేవా!

దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరాలయ ప్రధాన గోపురం

తిరుమలేశుని తొలిగడపగా ప్రఖ్యాతి పొందిన దేవాలయం దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరాలయం. అంతేకాదు, దక్షిణ ప్రాంత యాత్రికులు కాశీ వెళ్లడానికీ ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం వెళ్లడానికీ తిరుమల వేంకటేశ్వరుని వద్దకు కాలిబాటన వెళ్లడానికీ కడపే ప్రధాన మార్గం. ఈ కారణంగా మూడుచోట్లకూ వెళ్లే భక్తులు కచ్చితంగా ఇక్కడ మొదటిగా శ్రీ లక్ష్మీప్రసన్న వేంకటేశ్వరుణ్ణి, సోమేశ్వరస్వామిని దర్శించుకుని అనంతరం మూడు క్షేత్రాలకు వెళ్లేవారు. ఈ కారణంతోనే మూడు పుణ్యక్షేత్రాల తొలి గడపగా దేవునికడపను పేర్కొంటారు. ఇక్కడి దైవం ఏడుకొండల వేంకటేశ్వరునికి ముమ్మూర్తులా ప్రతిబింబంలా కనిపించే శ్రీ లక్ష్మీప్రసన్న వేంకటేశ్వరుడు. తిరుమల శ్రీవారి మాదిరిగానే ఇక్కడ కూడా స్వామివారి వక్షస్థలంపై కుడివైపు మహాలక్ష్మి కొలువై ఉంది.

తిరుమలలోని శ్రీవారి దర్శనార్థం వెళ్ళే భక్తులు ముందు దేవుని కడపలో స్వామివారి దర్శనం చేసుకుని ఆ తర్వాతే తిరుమలకు వెళ్ళడం ఆచారం. రవాణా సౌకర్యాలు ఇప్పుడున్నంతగా అభివృద్ధి చెందని రోజుల్లో భక్తులు తిరుమల మొక్కులు కూడా ఇక్కడే చెల్లించుకునేవారు. ఇక్కడ చెల్లించే మొక్కులు, కానుకలు సాక్షాత్తూ తిరుమలలోని స్వామివారి సన్నిధిలో చెల్లించినట్లుగా స్వామివారు ప్రీతి చెందుతారు. అంతటి ముఖ్యమైన దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి తీసుకువచ్చినప్పుడు భక్తులంతా ఎంతగానో సంతోషించారు. ఈ దేవస్థానం కూడా బాగా అభివృద్ధి చెందుతుందని ఆశించారు. ఐతే గత ఆగస్టులో అక్కడికి వెళ్ళిన మేము అక్కడి వాస్తవ పరిస్థితులను, దేవస్థానం వారి నిర్లక్ష్యాన్ని, సాక్షాత్తూ దేవాలయంలో నెలకొన్న దుర్భరమైన అపరిశుభ్ర వాతావరణాన్ని చూసి దిగ్భ్రాంతి చెందవలసి వచ్చింది. ఇంతటి ప్రాశస్త్యం గల దేవాలయం, అందునా ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తున్న సొంత జిల్లా కేంద్రంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం అంతటి దయనీయమైన స్థితిలో ఉన్నందుకు ఆవేదన కలిగింది.

"Cleanliness is next to Godliness" అంటారు. మన సంప్రదాయాలు, మడీ-దడీ-ఆచారాలు కూడా శుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఏర్పాటు చేసుకున్నవే. శుచి-శుభ్రత లేనిచోట దరిద్రం తాండవిస్తుందని మన నమ్మకం. కానీ మేం వెళ్ళినప్పుడు ఇక్కడ అడుగడుగునా అపరిశుభ్రతే కనిపించింది. గర్భగుడి చుట్టూ భక్తులు ప్రదక్షిణం చేసే అంతరాళంలో గర్భగుడి గోడల వెలువలివైపున, నేల మీద ఎంగిళ్ళు, వక్కాకు చారికలు, బీడీ ముక్కలు, ...అది చూసి తట్టుకోలేక ప్రదక్షిణాలు గబగబా ముగించుకుని ఇవతలికి వచ్చేశాం.

పేరుకు ఇక్కడ ఒక అద్దాల మండపం కూడా ఏర్పాటు చేశారు కానీ దాని అతీ గతీ పట్టించుకునే నాథుడే లేడు. ప్రవేశద్వారం దగ్గర "ప్రవేశరుసుము 2 రూపాయలు" అని ఉంది. కానీ లోపలికి వెళ్ళాలనుకునేవారికి టిక్కెట్లు అమ్మేవాళ్ళుగానీ, టిక్కెట్లను తనిఖీ చెయ్యడానికి గానీ దరిదాపుల్లో ఎవరూ లేరు. చివరికి లోపలికివెళ్ళినవాళ్ళు అద్దాలన్నిటినీ పగలగొట్టి వచ్చినా పట్టించుకునే దిక్కులేదనడానికి ప్రత్యక్ష తార్కాణం అక్కడే మా కళ్ళబడింది. ఆ అద్దాల మండపం ద్వారం దగ్గర పాలరాతితో ఏర్పాటుచేసిన మెట్లను (సోపానాలను) ఎవరో రాళ్లతో తుక్కుతుక్కుగా నలగ్గొట్టిపెట్టారు. మరీ ఒక మెట్టు మీదైతే పాలరాయి ఒకవైపు అడుగు వ్యాసంలో పూర్తిగా పొడిపొడిగా మారిపోయి ఉంది. అక్కడి నుంచి అన్ని వైపులకూ చివరి దాకా నెర్రెలు చీలి ఉన్నాయి. నలగ్గొట్టడానికి వాడిన రాయి కూడా ఫుట్ బాల్ సైజులో ఆ మెట్టుమీదే ఉంది! ఆలయ నిర్వాహకులు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉండగలుగుతారసలు?

ఇవన్నీ చూశాక "సీతారామస్వామీ! నువు చేసిన నేరంబేమి" అనిపించకమానదు. ఆ దేవుడే మొరబెట్టుకున్నా మన ఏలినవారి చెవులకెక్కవుగదా? ఇక మన (ఆ)వేదనలు వినిపిస్తాయా? సొంతజిల్లాలో కోట్లు ఖర్చుబెట్టి వారు చేస్తున్న అభివృద్ధి ఫలాలు అస్మదీయులకేనా? అనిపించి అక్కడ లభించే తిరుపతి లడ్డు తిన్న తర్వాత కూడా నోరంతా చేదుగా అనిపించింది.

ఈ ఆలయానికి సంబంధించి కొన్ని విశేషాలు:

    తిరుమల వరాహక్షేత్రం కాగా ఇది హనుమక్షేత్రం. ఆంజనేయస్వామి ఇక్కడి క్షేత్రపాలకుడు.

    ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని మహాభారతంలో కౌరవుల కులగురువైన కృపాచార్యులు ప్రతిష్ఠించారని అంటారు.కాబట్టే ఈ ప్రాంతానికి కృపాపురం అనే పేరు వచ్చిందంటారు. కాలక్రమంలో అది కురుప, కరిపె, కరిగె గా రూపాంతరం చెందిందనీ అదే కడపగా మారి ఉండొచ్చనీ చరిత్రకారుల అంచనా. (క్రీ.శ. రెండవ శతాబ్దంలో టాలెమీ కడపను కరిపె, కరిగె అని పేర్కొన్నాడు. పేరులో కరి అని ఉంది కాబట్టి ఇక్కడ ఆ కాలంలో ఏనుగులు ఎక్కువగా ఉండేవంటారు.)

    ఐతే ఇక్కడ అంతకుముందునుంచే ఆంజనేయస్వామి క్షేత్రం, హనుమత్ పుష్కరిణి ఉండేవని, స్వామివారి స్వప్నసందేశాన్ననుసరించి స్వామివారిని ప్రతిష్ఠింపజేయడానికి ఈ స్థలం అనువైనదిగా నిర్ణయించినది జనమేజయ మహారాజు అని, శ్రీవారి విగ్రహానికి వెనుక వైపున గోడలో ఆంజనేయుడి ప్రతిమ రాతిలో కనిపిస్తుందని "మనకు తెలియని కడప" గ్రంథంలో శశిశ్రీ రాశారు.

    ఆలయ ప్రాంగణంలో ఆండాళమ్మ, విష్వక్సేన, పద్మావతి అమ్మవారు, శంకచక్ర ధ్వజగరుడ అళ్వారు, హన్మత్‌పెరుమాళ్లు, నృత్యగణపతి... తదితర దేవీదేవతలు కొలువై ఉన్నారు.

    దేవుని కడప ఆలయ కోనేటిని హరిహర సరోవరమని, హనుమత్‌ పుష్కరిణి అని పిలుస్తారు. కొలనులో నిరయ మంటపం, తీర్థవాశి మంటపం ఉన్నాయి. పాతకడప చెరువు నుంచి ఇక్కడికి నీటి మార్గం ఉంది. పుష్కరిణిలో స్వామి తెప్పోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.

    ఏటా ధనుర్మాసంలో ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. ఇక ప్రతి ఏడాదీ మాఘశుద్ధ పాడ్యమి(ఈ ఏడాది జనవరి 27) నుంచి ఏడురోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అన్ని మతాలకు చెందిన భక్తులు పాల్గొంటారు.

    మరో విశేషమేమిటంటే ఈ ఆలయ ఆవరణలో ఉన్న వినాయకుడికి నిలువునామాలుంటాయి.

ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే గాక కేంద్ర ప్రభుత్వం కూడా కడపజిల్లాలోని పర్యాటక కేంద్రాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించగల ఇంత గొప్ప పుణ్యక్షేత్రంలో ఆలయప్రాంగణం ఎల్లవేళలా శుభ్రంగా ఉంచడం నిర్వాహకుల కనీస ధర్మం.
-శ్రీదేవి & త్రివిక్రమ్


ఈరోజు దేవుని కడప బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం జరుగుతుంది. ఏటా రథసప్తమి నాడు జరిగే రథోత్సవం, కల్యాణోత్సవం, గరుడవాహన సేవలో పాల్గొనడానికి భక్తులు వేలాదిగా తరలివస్తారు. దేవుని కడప రథోత్సవం గురించి
"కన్నుల పండుగ లాయే కడప రాయని తేరు
మిన్ను నేల శృంగారము మితిమీరినట్లు"
అన్నాడు అన్నమయ్య.

Wednesday 12 November, 2008

తెలుగు పతాక ఆవిష్కరణ, తెలుగు శాసనాల మ్యూజియం

సి.పి.బ్రౌన్ 210వ జయంతి సందర్భంగా నేడు సి.పి. బ్రౌన్ భాషాపరిశోధక కేంద్రంలో తెలుగు పతాకం ఆవిష్కరణ జరుగుతోంది. భారత జాతీయ పతాకాన్ని రూపొందించిందే ఒక తెలుగువాడైనప్పుడు ఆ తెలుగువారి పతాకం ఇంకెంత గొప్పగా ఉంటుందో చూడాలనే ఆసక్తితో తెలుగు నేలకు వచ్చి నిరాశ చెందిన సి.పి. బ్రౌన్ చుట్టం గురించి జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారి కథ "తెలుగు పతాకం" నిరుడు సాహిత్యనేత్రం నిర్వహించిన కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందింది. తెలుగు భాష ప్రస్తుత స్థితిని, ప్రసార మాధ్యమాల్లో తెలుగు స్థాయిని చక్కగా విశదీకరించిన ఆ కథను, ఆయన ఆ కథ రాయడం వెనకున్న నేపథ్యం గురించి మీరు చదివే ఉంటారు. ఇప్పుడు అలాంటివారు నిరాశ చెందకుండా మనం వారికి తెలుగు పతాకాన్ని చూపించొచ్చు. ఈ ఆవిష్కరణోత్సవానికి ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి, సాహిత్యనేత్రం సంపాదకులు శశిశ్రీ, శ్రీకృష్ణదేవరాయ, యోగి వేమన విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సెలర్లు హాజరౌతున్నారు. ఈనాడులో వచ్చిన వార్త:

నేడు తెలుగు పతాక ఆవిష్కరణ
కడప నగరం, న్యూస్‌టుడే : తెలుగుభాషకు ప్రాచీన హోదా లభించిన నేపథ్యంలో బ్రౌన్‌ 210వ జయంతిని పురస్కరించుకొని బ్రౌన్‌ గ్రంథాలయంలో బుధవారం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వీసీ రామచంద్రారెడ్డి చెప్పారు. ఈసందర్భంగా తెలుగు పతాకాన్ని ఆవిష్కరించనున్నామన్నారు. సాయంత్రం 6 గంటలకు సభ మొదలువుతుందని ముఖ్యఅతిథిగా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వీసీ పి.కుసుమకుమారి రానున్నారన్నారు. విశిష్ఠ అతిథిగా కలెక్టర్‌ ఎం.టి.కృష్ణబాబు, గౌరవ అతిథులుగా డా. జానుమద్ది హనుమచ్ఛాస్త్రి, ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి, శశిశ్రీ హాజరవుతున్నారు. గ్రంథాలయానికి పుస్తకాలు ఇచ్చిన వారిని సత్కరించనున్నామని చెప్పారు. ఇంకా విలేకరుల సమావేశంలో తెలుగుభాష పరిశోధకుడు కట్టా నరసింహులు, పీఆర్వో డా. మూలె మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.

బ్రౌన్ జయంతిని పురస్కరించుకొని కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో సి.పి. బ్రౌన్ మెమోరియల్ సెంటర్, తెలుగు శాసనాల మ్యూజియం కూడా నెలకొల్పుతున్నారు. తెలుగుకు ప్రాచీన భాషగా గుర్తింపు వచ్చిన నేపథ్యంలో సి.పి. బ్రౌన్ మెమోరియల్ సెంటర్ ప్రాచీన భాషా పరిశోధనాకేంద్రంగా పనిచేస్తుందని, విశ్వవిద్యాలయం బ్రౌన్ రచనలన్నింటినీ ఆధునీకరించి, డిజిటైజ్ చేస్తుందని, ఇందుకోసం బ్రౌన్ లేఖలు, డైరీలను చెన్నై మ్యూజియం నుంచి ఇక్కడికి తెప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని యోగి వేమన విశ్వవిద్యాలయం వీసీ ఆర్జుల రామచంద్రారెడ్డి చెప్పారు. వివరాలు హిందూలో.

Thursday 16 October, 2008

జ్ఞాన పీఠం

"జ్ఞాన పీఠ అవార్డు ఇవ్వడానికి తెలుగు భాషను పరిశీలించే సమయం వచ్చింది" అన్నారు 'చంద్రిమ' బ్లాగులో రాసిన జ్ఞాన పీఠము తెచ్చినారము జ్ఞానులెవ్వరొ తెలుపుడీ! టపాలో చంద్రమోహన్ గారు.

నాకు తెలిసి అలాంటిదేమీ లేదు, ఒకసారి ఒక భాషవారికి ఇచ్చాక మూడు సంవత్సరాల పాటు ఆ భాషను పరిశీలించరు. అంటే గత మూడేళ్లలో అవకాశం రాని భాషలన్నిటికీ "సమయం" వచ్చినట్లే. నిన్న మొన్నటి దాకా భారతదేశంలో ఇతర భాషల్లో అసలు మంచి సాహిత్యమే రానట్లు దాదాపు ప్రతి మూడేళ్లకొకసారీ జ్ఞానపీఠాన్ని ఆనవాయితీగా ఎగరేసుకుపోతూ వచ్చిన కన్నడిగుల మీద నా ఉక్రోషాన్ని నమ్మ బెంగళూరు టపాలో చూపించాను. అది హాస్యానికనుకున్నారేమో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. (ఇప్పటి వరకూ కన్నడానికి ఏడు పీఠాలు వస్తే హిందీకి మాత్రం ఆరుసార్లు పీట వేశారు.) నాకు తెలిసిన కన్నడిగులను ఈ సప్తపీఠాల గురించి అడిగితే వాటిలో సాహిత్యేతర కారణాల వల్ల వచ్చినవి కూడా కొన్ని ఉన్నాయని అంగీకరించారు. కానీ కన్నడంలో ఆ పీఠమెక్కవలసినవారు ఇంకా చాలామంది ఉన్నారని కూడా వాక్రుచ్చారు!

విశ్వనాథ సత్యనారాయణ కోసం ఆ పీటనెత్తుకొచ్చింది అప్పటి జ్ఞానపీఠ అవార్డుల కమిటీ అధ్యక్షుడుగా ఉన్న బెజవాడ గోపాలరెడ్డి. ఒక ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు - ఆ పీటను తీసుకు రావడానికి తాను గట్టి కృషే చేశానని (ఆయన విశ్వనాథకు వీరాభిమాని లెండి).సినారెకు వచ్చినప్పుడు ఆ కమిటీ అధ్యక్షుడుగా ఉన్నది పి.వి. నరసింహారావు అనుకుంటా. అంటే కేవలం సాహిత్యానికే పరిమితం కాకుండా రాజకీయాల్లో ఆరితేరిన వారు ఆ కమిటీ అధ్యక్షులుగా ఉండి సామ, దాన, భేదోపాయాలను ప్రదర్శిస్తే తప్ప ఆ పీఠం తెలుగు నేలకు రాలేదన్నమాట. జ్ఞానపీఠాన్ని మళ్ళీ తెలుగునేలకు రప్పించే రహస్యం ఇదేనా? ఏమో!

విషయానికి వస్తే చంద్రిమ బ్లాగులో అడిగిన ప్రశ్నకు నేను సమాధానం అక్కడే రాసినా అది ఎందుకనో కనబడలేదు. అందుకే అక్కడ అడిగిన ప్రశ్నకు నా సమాధానం ఇక్కడ రాస్తున్నాను: కాళీపట్నం రామారావు.

Monday 13 October, 2008

చందమామ పిచ్చోళ్ళ కథ

నాగమురళి గారి బ్లాగులో పాత చందమామలు చదివారా? నా కలల్లో కనిపించే స్వర్గం కూడా అలాగే ఉంటుంది. కాకపోతే నా అభిమానం పూర్తిగా చందమామ మీదే కేంద్రీకృతమైంది. బాలజ్యోతి రుచి దాదాపుగా నేనెరుగను. చిన్నప్పుడు చదివిన బాలమిత్ర కాస్త పెద్దయ్యాక నాకు నచ్చడం మానేసింది. చందమామ అలా కాదు. కొన్నేళ్ల కిందట తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ చందమామకు విరివిగా ఉత్తరాలు రాశాను. అప్పట్లోనే నేను రాసిన సింగిల్ పేజీ కథ కూడా ఒకటి చందమామలో వచ్చింది. అంతర్జాలంలోకొచ్చాక తెవికీలో చురుగ్గా ఉన్నరోజుల్లో చందమామ గురించి రాశాను, ఆర్కుట్లో చందమామ కమ్యూనిటీని ఏర్పాటు చేశాను. ఇంకా... బ్లాగుల్లో కూడా బహుశా చందమామ గురించి ఎక్కువసార్లు బ్లాగింది నేనే అనుకుంటా. ఇప్పటికీ ప్రతినెలా విడవకుండా చందమామ చదువుతాను. ఎప్పటికీ చదువుతూనే ఉంటాను. అందుకే చందమామ పిచ్చోళ్ళ క్లబ్బులో నాకు శాశ్వత సభ్యత్వముంది. :) ఇస్తే చిన్నదో, పెద్దదో ఒక పదవి కూడా తీసుకుంటా!

మొదట్లో chandamama.com లో పెట్టిన PDF ఫైళ్ళు అన్నీ ఆత్రంగా డౌన్లోడు చేసి పెట్టుకున్నాను. అదెంత మంచిపనో ఇప్పుడు chandamama.comలో ఆర్కైవ్స్ చూసినవాళ్లకు అర్థమౌతుంది. ఐతే ఒక లోటేమిటంటే ఆ PDF ఫైళ్లలో జూలై 1947, డిసెంబర్ 1948, ఫిబ్రవరి 1949, మార్చ్ 1955, సెప్టెంబర్ 1959 సంచికలు లేవు. "ఎలాగరా దేవుడా! మనకు ఇంతేనా ప్రాప్తం?" అనుకుంటూ ఉంటే దేవుడల్లే నాగమురళి గారు తన బ్లాగులో నేను చూడని ఆ టపా గురించి బ్లాగాగ్ని గారి బ్లాగులో వ్యాఖ్య రాసి ulib.orgకి దారి చూపించారు. ఐతే ఆ ulibలో డిసెంబరు 1948 పేరుతో ఉన్నది డిసెంబరు 1949 సంచిక. (ఈ విషయం నేను ULIB వాళ్ళకు తెలిపాను. డిసెంబరు 1948 సంచిక ULIBలో లేకపోయినా ఇప్పుడు నా దగ్గర ఉంది లెండి. లేకపోతే నేను చంపినెలా అవుతాను? :)) పైగా ulib.org సర్వరు మీద మనలాంటి పిచ్చోళ్ళు ఎక్కువగా దాడి చేస్తూండడం వల్లనో ఏమో ఆ సైటు ఎప్పుడూ ముక్కుతూ మూల్గుతూ ఉంటుంది. పోయిన్నెల్లో పరిస్థితి ఇది. ఇప్పుడు బాగైందేమో తెలియదు.

ఇదంతా ఇప్పుడెందుకంటే ఈమధ్య నేను హైదరాబాదుకు వెళ్ళినప్పుడు పని ఉండి ఒక పెద్దాయన్ను కలిశాను. మాటల మధ్యలో చందమామ ప్రస్తావన వచ్చింది. ఆయన తన దగ్గర పాత చందమామలు చాలా ఉన్నాయి కానీ ప్రారంభ సంచిక (1947 జూలై) లేదని వాపోయాడు. అప్పుడు నేను ఆయనకు చాలా ఉత్సాహంగా "ఆన్లైన్లో చందమామ" కథ చెప్పాను. ulib.org నుంచి శ్రమపడి అంతకుముందురోజే డౌన్లోడు చేసుకున్న సదరు సంచికలోని 68 పేజీలూ 68 పీడీఎఫ్ ఫైళ్ళుగా నా దగ్గరున్న పెన్ డ్రైవ్ లో భద్రపరచుకుని తిరుగుతున్న నేను ఆయన కోరిన సంచికతో బాటు బ్లాగాగ్ని కానుకలైన సీరియళ్లను కూడా ఆయన కంప్యూటర్లోకి కాపీ చేసి ఇచ్చాను. అవి చూసి ఆయన పరమానందభరితుడయ్యాడు.

అన్నిటికంటే ముఖ్యంగా (అసలు దొరుకుతుందనే ఆశలు దాదాపుగా వదిలేసుకున్న) ప్రారంభసంచిక కంటబడడంతో ఆయన ఉత్సాహంగా మాట్లాడుతూ, ఆ విడి విడి పేజీలను పేజ్ మేకర్లో అమర్చుకుని, వెలిసిన రంగులు సరిచేసి, పడిన మరకలు తుడిచేసి, ప్రింటౌట్లు తీసుకుని మళ్ళీ కొత్తగా చందమామను తయారుచేసుకుంటాననేసరికి నేను నోరెళ్ళబెట్టాను. ఆయన అదేమీ గమనించకుండా తన ధోరణిలో తాను ఇంకా సెలవిచ్చిందేమంటే అలా చెయ్యడానికి రోజుకు పద్దెమినిది గంటల చొప్పున పనిచేస్తే మూడురోజులు పడుతుందని, ఇంతకుముందొకసారి తాను అలాగే చేశాడని! అప్పుడే అనిపించింది నాకు - ఆయన్ను ఆలిండియా చందమామ పిచ్చోళ్ళ సంఘానికి అధ్యక్షుణ్ణి చేసెయ్యొచ్చని. ఐతే మరి కాసేపట్లోనే ఆ అభిప్రాయం మార్చుకున్నాను. ఎందుకో కింద చదవండి. ;)

నా నోరు మూతపడిన తర్వాత మాటలు చందమామ సీరియళ్ల మీదికి మళ్ళాయి. నేను 1980 ల ప్రారంభంలో చందమామ చదవడం మొదలుపెట్టినప్పుడే ముగ్గురు మాంత్రికులు సీరియల్ మొదలైందని నేనంటే ఆయన "ఆ సీరియళ్లన్నీ అంతకుముందే ఒకసారి వచ్చాయి. 80లలో వెయ్యడం అంటే అది రెండోసారి" అన్నాడు. దానికి నేను "అవునండీ, మా తరం వాళ్లం ఫాలో అవగలిగింది రెండో ఇన్నింగ్స్ నే" అని చెప్పాను. ఆయన తాను చదివిన సీరియళ్ల గురించి చెప్తూ పుస్తకరూపంలో తన దగ్గరున్న విచిత్ర కవలలు, మరికొన్ని చందమామ సంచికలను కలిపి బైండ్ చేసిన పుస్తకాన్ని నాకు చూపించాడు. (ఇంతకు ముందు చందమామలో ప్రజాదరణ పొందిన సీరియళ్ళను, కథలను తెలుగులో (కూడా) పుస్తకాలుగా విడుదల చేసేవాళ్ళు. ఆ పుస్తకం చూడగా నాకు తెలిసింది ఏమిటంటే అలా విడుదల చేసిన పుస్తకాల్లో ఆ కథలు బొమ్మలతో సహా అచ్చం చందమామలో వచ్చినప్పుడు ఎలా ఉండేవో అలానే ఉండేవని. ఎంత గొప్ప విషయమో కదా? సాధారణంగా పుస్తకాలుగా వచ్చే కథలు, నవలల్లో అలా బొమ్మలు ఉండవు.) మడతలు పెట్టి, ట్వైన్ దారంతో చుట్టిన ఒక పాలిథీన్ కవర్లో భద్రంగా ఉంది ఆ పుస్తకం. ఉద్వేగంగా దాన్ని అందుకుని తెరవబోతే తిప్పిన పేజీలు తిప్పినట్లు ఊడి చేతిలోకొచ్చేస్తున్నాయి. బహుశా చందమామ ప్రారంభసంచికను ఏదో ఒకరూపంలో అందజేశానన్న అభిమానంతోనే వాటిని నాకు చూపెట్టినట్లు అర్థం చేసుకున్నాను.అదే పుస్తకం ఆ స్థితిలో నా దగ్గరున్నట్లైతే సాక్షాత్తూ మన్మోహన్ సింగ్ వచ్చి అడిగినా ఇచ్చేవాడిని కాను. ఏమో, బహుశా అబ్దుల్ కలాం అడిగితే ఇస్తానేమో లెండి. ;) పైగా ఆయన ULIB founding sponsor కూడా.

తా.క.:

అన్నట్లు మీకు దాసరి వెంకట రమణ అనే పేరు తెలుసా? చందమామలో అప్పుడప్పుడూ కథలు రాసే ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో "చందమామ కథలు - బాలల్లో వ్యక్తిత్వ వికాసం" గురించి పరిశోధన (Ph.D.) చేస్తున్నారు. ఆయన చాలా కాలంగా పాత చందమామల కోసం వెదుకుతున్నారు. గతంలో ఆయన ఫోన్నంబరు, ఈమెయిల్ ఐడీ కూడా నా దగ్గర ఉండేవి. ఇప్పుడు వెదికితే కనిపించలేదు. మీకు తెలిస్తే పాత చందమామలు chandamama.comలోను, ulib.orgలోను దొరుకుతాయని ఆయనకు చెప్పండి.

వచ్చే నెలనుంచి చందమామ విడిప్రతి 20 రూపాయలు ఔతుందట. ఈ నెలాఖరులోగా చందా కట్టేవారికి ప్రత్యేక తగ్గింపు ధరలు ఉంటాయి. కాబట్టి త్వరపడండి.

Monday 8 September, 2008

బేడర కన్నప్ప - భక్త కన్నప్ప

శివుడు కలలోకొచ్చి తన కళ్లను సమర్పించమని కోరాడని చెప్తూ తన రెండు కళ్లనూ (ఒక్కో కన్నునొక్కోసారి) పెరికేసుకుని శివుడికి సమర్పించి ఇటీవల వార్తల్లోకెక్కాడొక కన్నడిగుడు. అతడి పేరు ముదుకప్ప ఎల్లప్ప కరాడి. అతడికి తిరిగి చూపొచ్చే అవకాశం లేదని వైద్యులు తెలిపారు. బాగల్కోట్ ప్రాంతానికి చెందిన ఈయన ప్రస్తుతం బెంగుళూరులోని NIMHANS (National Institute of Mental Health And Neuro Sciences)లో మానసిక చికిత్స పొందుతున్నాడు. ఈ విపరీత ప్రవర్తనకు మూలం భక్త కన్నప్ప కథే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐతే శ్రీకాళహస్తీశ్వర దేవాలయంలో శివుడికి తన కళ్ళు పెకలించి సమర్పించిన భక్త కన్నప్ప ఎక్కడి వాడు? ఈయన కడప జిల్లాలోని రాజంపేట మండలం ఊటుకూరులో జన్మించాడని ఎస్‌.కె. పళణిస్వామి అనే పరిశోధకుడు అంటున్నారు. వివరాలు నిన్నటి ఈనాడు కడప జిల్లా వార్తల్లో ఇలా ఉన్నాయి:
భక్తకన్నప్ప చరిత్ర రికార్డుల అప్పగింత
రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే : శ్రీకాళహస్తీశ్వరస్వామి పరమభక్తుడు భక్తకన్నప్ప(తిన్నడు) కడప జిల్లా రాజంపేట మండలం ఊటుకూరులో జన్మించినట్లు తెలిపే చరిత్ర రికార్డులను, ఆధారాలను శనివారం ఊటుకూరు గ్రామ సర్పంచి ఎం.ఎల్‌.నారాయణ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు కాళహస్తీశ్వర దేవస్థానం డిప్యూటీ ఈవోకి అందజేశారు. భక్తకన్నప్ప చరిత్రపై సర్వే నిర్వహించిన ఎస్‌.కె. పళణిస్వామి ఈ సందర్భంగా భక్తకన్నప్ప ఊటుకూరులో జన్మించినట్లు ఆధారాలను కాళహస్తీ అధికారులకు చూపించి విఫులంగా వివరించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్‌.వి. వెంకట్రాజు మాట్లాడుతూ ఆధారాలను పరిశీలించి జన్మస్థలిగా గుర్తింపు కోసం ఈ ఆధారాలను ఉన్నతాధికారులకు పంపుతామని పేర్కొన్నారు.