Monday 23 April, 2007

జయహో ఇస్రో!




నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నీవెగిరిపోతె నిబిడానందంతో మేము!
చల్లని చందమామపై నువ్వడుగిడితే మురిసిపోవాలనీ మేమె!!
Photo: ISRO

Friday 13 April, 2007

నదిరే, పుదిరే

గమనిక 1: ఇది సినిమా పాట గురించి కాదు.
గమనిక 2: అనిల్ బ్లాగులో నటురె, ఫుటురె, చదవగానే ఇది గుర్తొచ్చి బ్లాగాలనిపించింది. ఇది చదివే ముందొకసారి విహారి గారి బ్లాగులో మొట్టిక్కాయలు చదవవలసిందిగా మనవి. వాళ్ళిద్దరికీ ముందుగా ధన్యవాదాలు.

ముచ్చటగా మూడోమాట: చిన్నప్పుడు మా బళ్ళో సెక్షన్లు, మొట్టికాయలు మినహా హిందీ విషయంలో విహారి గారి అనుభవాలు, నా అనుభవాలు ఒకటేనని తేలడం వల్ల కత్తిరించి అతకడం కంటే ఒక లంగరెయ్యడం సుఖమని భావించి పైన ఆ పనే చేశాను.

ఇక చదవండి:



నేను ఢిల్లీలో ఉన్నప్పుడు సిటీబస్సుల మీద బోర్డులు నాకు అర్థం కాని భాషలో ఉండడం వల్ల నాకు అసలు అర్థం అయ్యేవి కావు. (నాకు అర్థం కాని భాష అనగా హిందీ అని నా భావము. మరియొక విధమ్మున జెప్పవలెనన్న ఆంధ్రము, ఆంగ్లము దక్క ఇతరభాషలన్నియు నాకర్థము గానివే)

పాడగా పాడగా రాగమైనప్పుడు చూడగా చూడగా ఏమౌతుంది? నా తలకాయవుతుంది. (నా తలకాయలో ఏమీ ఉండదని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు.) అందువల్ల నేనెంత చూసినా ఆ బోర్డులు నాకు అర్థమయ్యేవి కావు. అలా నాకు అర్థంకాని బోర్డులు బోలెడు! అవన్నీ తమకు అందిన బస్సులెక్కి నగరవీధుల్లో ఊరేగుతూ ఉండేవి. అలాంటి బోర్డుల్లో ముఖ్యమైనవి రెండు: నదిరే స్టేశన్, పుదిరే స్టేశన్.

స్టేశన్ ఏమిట్రా? రాన్రానూ రాజుగారి గుర్రం గాడిదౌతోందే అని ఆగ్రహించకండి. [ఇంకో మనవి: రాజుగారి గుర్రమా అదెక్కడుంది? అని వెదక్కండి. చెప్పాలంటే నాకు వినయం అడ్డొస్తుంది. ;-)] పవిత్ర ఉత్తరభారతదేశంలో అంథే! మనం ప్రసాద్ అంటామా? వాళ్ళు ప్రషాద్ అంటారు. మనం నమస్కారం అంటాం. వాళ్ళేమో నమష్కార్ అంటారు. దాంతో చిరాకేసి ఇరిటేషన్ అంటామా? వాళ్ళేమో నింపాదిగా ఇరిటేసన్ అంటారు. శ, ష, స లలో ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు వాడతారో తెలియక వినే దాక్షిణాత్యులకు పిచ్చెక్కిపోవాల్సిందే! ఇలాంటి పిచ్చి మా ఆఫీసులోనాకు రోజూ ఎక్కుతుంది. ఎందుకంటే ఆఫీసులో నా పక్కసీటమ్మాయిది బీహారు. ఐతే ఏంటట? మాది రాయలసీమ. ఎవరి గొప్ప వారిది. ;-) ప్రతిరోజూ ఏదో ఒక విషయమ్మీద ఆ అమ్మాయికి, నాకు గొడవవుతుంది - ఉత్తరభారతదేశానికి, దక్షిణభారతదేశానికి గల తేడాల మూలంగానో లేక ఆ తేడాల మీదనో. మా ఇద్దరికీ పనీపాటా లేనప్పుడు 'బీహారు ఉండేది ఉత్తరభారతదేశంలోనేనా కాదా?' అని కూడా వాదించుకుంటాం. ఏడుగురు అక్కచెల్లెళ్ళను మినహాయించి వింధ్యపర్వతాలకు అవతలుండేదంతా 'ఉత్త'రభారతదేశమేనంటాను నేను. ఎంతమాత్రమూ కాదు - మాది తూర్పు భారతదేశమంటుంది ఆ అమ్మాయి. తెలుగు రాదు కదా? అందుకే 'East India' అని ఒకసారి, 'పూరబ్ భారత్ దేష్' అని ఒకసారి... ఆ గొడవ మాకొదిలేయండి. మళ్ళీ ఢిల్లీ నగర వీధుల్లో నా వెతలు చూతము రారండి.

"ఆ బోర్డు మీద ఏమని రాసుంది?" అని ఎవరినైనా అడిగేటంత హిందీ మనకు రాదు కదా? ఆక్కడికీ సాహసం చేసి ఒకసారి హృదయమున్న ఒక 'దిల్లీ'వాసిని "ఓ క్యా హై?" అనడిగేశాను. "ఓ బోర్డ్ హై" అని చెప్పేసి చక్కా వెళ్ళిపోయాడు ఆ ఢిల్లీవాసి.

ఇక "ఆ బోర్డు మీద ఏముంది?" అనడిగేటంత హిందీ మనకు వచ్చిందెప్పుడు? "ఉస్,బోర్డ్, మే, మై, తుస్, బుస్..." అని నాలో నేను గొణుక్కోవలసిందే! ఇలా కుదరని చాలా రోజులు కష్టపడి నాకు తెలిసిన హిందీ అంతా గుర్తుతెచ్చుకుని, తెచ్చుకుని 'మీద'ను హిందీలో 'ఊపర్' అంటారని ఊహించాను. 'ఉస్ బోర్డ్ ఊపర్ క్యాహై?' అని ఇంకొకరోజు ఇంకొక 'దిల్'వాలాను అడిగాను. ఆయన నా వైపు విచిత్రంగా చూసి పలక్కుండానే వెళ్ళిపోయాడు. "అంత కష్టమెందుకు? చక్కగా ఇంగిలీసులో అడగొచ్చు కదా?" అని మీరంటారని నాకు తెలుసు. కానీ దిల్లీలో ఇన్లాండు లెటరును కూడా అంతర్దేశీయ్ పత్ర్ అంటారు. అలాంటి పవిత్ర నగరంలో (హైదరాబాదులో తెలుగురాని దుకాణదార్లను అడిగినట్లు) ఇంగ్లీషులో అడగాలంటే నాకు తెలియకుండా నాకే సిగ్గేసేది. :(

నాకసలే మతిమరపు ఎక్కువ. అందువల్ల రోడ్లమీద చూసినప్పుడే తప్ప ఇల్లు చేరాక ఈ నదిరే, పుదిరే ల గురించి గుర్తుండేది కాదు. అందువల్ల ఆ సందేహం చాలారోజులు అలాగే ఉండిపోయింది.


చివరకు న.ది.రే., పుదిరే ల మిష్టరీ విచ్చిపోకముందే ఒక శుభదినాన హైదరాబాదుకు తిరుగుప్రయాణమయ్యాను. రైలెక్కడానికి న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ కు వెళ్ళడానికి ఏ బస్సు ఎక్కాలని అడిగి కనుక్కుంటే రూట్ నంబరెంతో చెప్పారు. తీరా చూస్తే ఆ బస్సు మీద న.ది.రే. స్టేశన్ అని ఉంది. దారి పొడవునా దాని గురించే తీవ్రాతి తీవ్రంగా ఆలోచిస్తూ న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర ఆ బస్సు దిగి ఎదురుగా కనిపిస్తున్న "యీ దిల్లీ రేలవే స్టేశన్" అనే బోర్డు చూడగానే డిటెక్టివు కేయాస్ పెట్టిన రెండో కేక వినబడింది. (మొదటి కేక ఎప్పుడు వినబడింది? అనే సందేహం మీకొస్తే మీకు "బావా...చీ" అన్న మరదలు పిల్ల గురించి తెలియదన్నమాట. :)) అంటే డిటెక్టివు కేయాస్ రెండో కేసు విజయవంతంగా విచ్చగొట్టేశాడని అర్థం.

ఇంతకూ ఆ కేక వెనకనున్న రహస్యం: న.ది.రే. స్టేశన్ అంటే నయీ దిల్లీ రేల్వే స్టేశన్ అని, అలాగే పు.ది.రే. స్టేశన్ అంటే పురానీ దిల్లీ రేల్వే స్టేశన్ అని తెలియడమే! ఆ విధంగా అభినవ డిటెక్టివు కేయాసు రెండో కేసు విజయవంతంగా మూతపడింది అనగా క్లోజైంది.

నాకు నచ్చిన మరియు చచ్చినా నచ్చని ప్రకటనలు

నేను టీవీ పెద్దగా చూడను. ఐనా టీవీలో ఇటీవలి కాలంలో నేను చూసిన వాణిజ్య ప్రకటనల్లో నాకు నచ్చినవి, నచ్చనివి కొన్ని:
(వాణిజ్య ప్రకటనల గురించి సంభవామి బ్లాగులో రాసింది చదివాక)


చిన్నపిల్లలతో తీసిన ప్రకటనలన్నీ నాకు బాగా నచ్చుతాయి. మచ్చుకు కొన్ని -

సర్ఫ్ ఎక్సెల్ ప్రకటనలు:
మరక మంచిదేగా! - (శక్తి కొద్దీ బురదతో పోట్లాడి, విజయోత్సాహంతో "సారీ చెప్తున్నాడు" అని చెప్పేదొకటి, షూ లేసులతో కుస్తీపట్టి దుమ్ములో మునిగితేలేదొకటి),

కోల్గేట్ వారి చిన్నపిల్లల ప్రకటన :
"మ్...దంతక్షయం!"
":( అక్కా?"
"నేను డెంటిస్ట్ ని"
..."దంతక్షయం కావడం కష్టం డాక్టర్!",

అలాగే హగ్గీస్ "వాటర్ ఫాల్" ప్రకటన...ఎంత అందంగా ఉంటుందో కదా?

కొంతకాలం కిందట వచ్చిన రిలయన్సు వారి ఇన్సూరెన్సుకు సంబంధించిన ప్రశ్నల ప్రకటన:

"నువ్వు చాక్లెట్లు ఎందుకు తింటావు?"
"నీకు కూడా గడ్డం వచ్చేస్తేనో??".

(ఇది చూసినంతసేపూ ముద్దొస్తుంది గానీ చివర్లో చిన్నపిల్లలడిగేవి అర్థం లేని ప్రశ్నలనడమే బాలేదు.)

ఇలాంటివే మరికొన్ని ప్రకటనలు...బ్రాండు పేరుతో సంబంధం లేకుండా అన్ని చిన్న పిల్లల వస్తువుల ప్రకటనలు.

ఇక నాకు చూస్తేనే ఒళ్ళుకంపరం కలిగించే ప్రకటనలు:

చిన్నపిల్లాడితో తీసిన గోద్రెజ్ హేర్ డై ప్రకటన - దీంట్లో తండ్రికి తెల్లజుట్టుంటే కొడుకు దాన్ని అవమానంగా భావించడం, దాంతో ఆ తండ్రి తన జుట్టుకు రంగేసుకోక తప్పదని చూపించడం నాకు నచ్చలేదు. ఎమోషనల్ బ్లాక్ మెయిలింగంటే ఇదేనేమో? ఈ కోవకు చెందిందే ఇంకొకటి:

రంగుల సెల్ ఫోన్ల గురించి వచ్చిన ఒక ప్రకటన - దీంట్లో రంగుల్లేని సెల్ ఫోన్ వాడేవాళ్ళందరూ దాన్నొక అవమానంగా భావించి తమ సెల్ ఫోన్లను ఎవరికంటా పడకుండా దాచేందుకు నానా అవస్థలు పడుతున్నట్లు చూపించారు. ఇప్పటికీ నేను వాడుతున్నది రంగులుగానీ, (కెమెరా, FM రేడియో లాంటి) అదనపు హంగులు గానీ ఏ మాత్రమూ లేని అతి సాధారణమైన సెల్ ఫోన్ మాత్రమేనని బ్లాగుముఖంగా సగర్వంగా ప్రకటిస్తున్నాను.

మింటో-ఫ్రెష్ ప్రకటనలు - ఇవి మరీ దారుణంగా ఉంటాయి. (వీటిలో ఒకటి మాత్రం నాకు నచ్చుతుంది: అదేమిటంటే ఒక నిండు గర్భవతిని పార్కులో ఒక ఉయ్యాల మీద కూర్చోబెట్టి ఆమె భర్త మింటోఫ్రెష్ చప్పరించి నోటితో మెల్లగా గాలి వదలగానే ఆ గాలి తాకిడికే ఉయ్యాల ఊగుతుంది.)

కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం

ఈనాడులో వార్త

అంబవరం వద్ద ఉక్కు కర్మాగారం


* చొరవ చూపుతున్న ముఖ్యమంత్రి వై.ఎస్‌.
* 8000 ఎకరాల కేటాయింపునకు సన్నాహాలు

జిల్లా రూపురేఖలు మారిపోతున్నాయి. సిమెంటు ఉత్పాదనలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న జిల్లాలో స్టీల్‌ కంపెనీని నెలకొల్పేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. బ్రాండిగ్స్‌, ఐఐఐటీ తదితర సంస్థల ఏర్పాటుకు చొరవచూపుతూనే మరోవైపు స్టీలు కంపెనీని తీసుకువచ్చేందుకు వై.ఎస్‌. ప్రయత్నాలు చేస్తున్నారు. జమ్మలమడుగు మండలం అంబవరం పరిసర ప్రాంతాల్లో ఈ కర్మాగారం కోసం భూమిని కేటాయించేందుకు జిల్లా ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్‌ 19న జిల్లాను సందర్శించనున్న ముఖ్యమంత్రి ఈ అంశంపై చర్చించనున్నారు.

న్యూస్‌టుడే, కడప


ఉక్కు కర్మాగారాలకు ప్రధాన వనరు అయిన ఇనుప ఖనిజం కర్ణాటకలోని బళ్లారి నుంచి చెన్నై నౌకాశ్రయం ద్వారా విస్తారంగా విదేశాలకు ఎగుమతి అవుతోంది. ప్రస్తుతం బళ్లారి చుట్టుపక్కల, అనంతపురం సరిహద్దులో మినహా మిగతా రాయలసీమ జిల్లాల్లో స్టీల్‌ కంపెనీలు లేకపోవడంతో అధికభాగం ఇనుప ఖనిజం ఇతర ప్రాంతాలకు తరలిపోతోంది. జిల్లా మీదుగానే చెన్నైకు రవాణా చేస్తుండటంతో ఇక్కడ స్టీల్‌ కంపెనీ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా కొందరు పారిశ్రామికవేత్తలతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. కంపెనీ నిర్మాణానికి అనువైన భూమిని ముందుగా గుర్తిస్తే ఔత్సాహికులు పరిశీలించి సానుకూలంగా స్పందించేందుకు అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. అధికారులు ఇప్పటికే స్థల పరిశీలనలో నిమగ్నమై ఉన్నారు.
కొలిక్కివచ్చిన స్థల పరిశీలన
* ముద్దనూరు, జమ్మలమడుగుల మధ్య కంపెనీ నిర్మించేందుకు అనుకూలంగా ఉంటుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. అంబవరం పరిసర ప్రాంతాల్లో దాదాపు 8,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు వారు గుర్తించారు. పట్టాభూమిని సేకరించేందుకు పెద్ద కసరత్తు చేయాల్సిన అవసరం కూడా ఉండదని భావిస్తున్నారు.
* ముద్దనూరు రైల్వేలైను సమీపంలో ఉండటంతో ఇనుప ఖనిజం, బొగ్గు దిగుమతి చేసుకొనేందుకు, ఉత్పత్తిచేసిన స్టీలు రవాణా చేసుకునేందుకు ఎంతో అనువుగా ఉంటుంది. దగ్గరలో ఉన్న మైలవరం జలాశయం నుంచి కంపెనీకి అవసరమైన నీరు సరఫరా చేసేందుకూ వెసులుబాటు ఉంటుంది.
* అంబవరం వద్ద స్టీలు కంపెనీ ఏర్పాటుచేస్తే పరిసర గ్రామాలైన పాటి, బొమ్మేపల్లి, ఒంటిమిద్దె, పొన్నతోట, బి.ఆర్‌.కొట్టాల తదితర గ్రామాల ప్రజలకు మహర్దశ పట్టినట్టే!

-----------------------

ఈనెల 20న మైలవరం మండలంలోని నవాబుపేట సమీపంలో దాల్మియా (ఈశ్వర్‌) సిమెంటు ఫ్యాక్టరీ శంకుస్థాపన

Monday 9 April, 2007

హైదరాబాదులో సులభం-బెంగుళూరులో కష్టం?

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐ.ఐ.టి. ప్రవేశపరీక్ష (IIT JEE 2007) నిన్న జరిగింది. ఈ పరీక్ష గురించి ఈరోజు హిందూలో రెండువార్తాకథనాలు ప్రచురించినారు: ఒకటి హైదరాబాదు నుంచి, ఇంకొకటి బెంగుళూరు నుంచి. విచిత్రమేమిటంటే ఈ పరీక్ష సులభంగా ఉందని విద్యార్థులంటున్నట్లుగా హైదరాబాదు విలేకరి, చాలా కష్టంగా ఉందంటున్నట్లుగా బెంగుళూరు విలేకరి రాసినారు. :O

ఏమైనా హైదరాబాదులో సులభమంటున్నారు కాబట్టి ఈసారి కూడా ఐ.ఐ.టి.ల్లో ఆంధ్రా విద్యార్థుల హవా కొనసాగుతుందని ఆశించవచ్చా?

ఈ ప్రవేశపరీక్షలో గతానికి భిన్నంగా ఈసారి అన్నీ ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలే అడిగారట. పైగా ఈసారి పరీక్ష మూడు పేపర్లు కాదు, రెండు పేపర్లే. JEE సులభమైనా, కష్టమైనా ఆ ప్రభావం ఎమ్‌సెట్ మీద పడుతుంది.

ఇంకో విషయమేమిటంటే ఈసారి JEE కి నిరుటికంటే తక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. దాంతో కొన్ని పత్రికలు విద్యార్థుల్లో ఐ.ఐ.టి.ల పట్ల మోజు తగ్గిపోయిందని రాసినాయి. అసలు విషయమేమిటంటే ఈసారి ఈ పరీక్ష ఎవరూ రెండుసార్లకు మించి రాయకూడదని నిబంధనలను సవరించినారు. అందువల్ల పూర్తిస్థాయిలో పరీక్షకు తయారైనవాళ్ళే దరఖాస్తు చేసుకున్నారు. దాంతో దరఖాస్తులు సహజంగానే తగ్గిపోయినాయి.

మోసపోయిన వరూధిని

కొత్తపాళీ గారి బ్లాగులో సుగాత్రి "అమాయకంగా" అడిగిన ప్రశ్న: "వరూధిని చివరికి మోసపోయింది అన్నారేమిటండీ? పాపం...నిజంగానే మోసపోయిందా?" అని.

వరూధినీప్రవరాఖ్యుల కథ అందరికీ తెలిసిందేననుకుంటున్నాను. వరూధిని వక్షమ్మీద చెయ్యేసి గోళ్ళు గుచ్చుకునేంత బలంగా తోసేసిన తర్వాత ప్రవరాఖ్యుడు తన నిష్టాగరిష్టత చేత అక్కడ మాయమై ఇక్కడ ఇంట్లో వచ్చి పడ్డాడు కదా? ఆ తర్వాతి కథేమిటంటే...

గంధర్వలోకంలో ఎప్పటి నుంచో వరూధినిని ప్రేమిస్తున్న వాడొకడున్నాడు. ఐతే వాడు వరూధిని కంటికి ఆనలేదు. వాడికి ఇక్కడ హిమవన్నగం మీద జరిగిన సంఘటన ఎలా తెలిసిందో తెలిసింది. దాంతో వాడు "Everything is fair in war and love" అనుకుంటూ అచ్చం ప్రవరాఖ్యుడిలా వేషం మార్చుకుని వరూధిని చెంతకు చేరాడు. ఆ అమాయకురాలు వాడు నిజంగానే ప్రవరుడనుకున్నది. కానీ మోసం ఎంతో కాలం దాగదు కదా? పైగా నిద్రపోయేటప్పుడు, శృంగారంలో అసలు రూపాలు బయటపడతాయంటారు. వాడిది దొంగవేషమని తెలుసుకున్న వరూధిని వాణ్ణి వదిలించుకుంది. కానీ ఈలోపే జరిగిన ప్రణయఫలంగా వరూధినికొక కొడుకు పుట్టాడు. వాడిపేరు స్వరోచి.

ఇదిలా ఉండగా ఆ వరూధినికొక తమ్ముడున్నాడు. వాడి పేరు ఇందీవరాక్షుడు. వాడికొక కూతురు. పేరు మనోరమ. వాడు ఒక ముని దగ్గర దొంగతనంగా ఆయుర్వేదం నేర్చుకుని, పోతూ పోతూ ఆయన్నే ఎగతాళి చేసేసరికి ఆయనకు కోపమొచ్చి వాణ్ని రాక్షసుడైపొమ్మని శపిస్తాడు. వీడు బావురుమని వేడుకోగా నువ్వు ఎప్పుడైతే తెలియక నీ సొంత కూతుర్నే మింగబోతావో అప్పుడే ఒక వీరుడి వల్ల నీకు శాపవిమోచనం కలుగుతుంది అని అనుగ్రహిస్తాడు. ఆ వీరుడే వరూధిని కొడుకైన స్వరోచి. ఆ స్వరోచి కొడుకే మనువు. ఆ మనువు పుట్టుక వెనకున్న కథే స్వారోచిష మనుసంభవం (స్వరోచి కొడుకైన మనువు పుట్టుక) లేక మనుచరిత్ర.

కొసమెరుపేమిటంటే ఇంతా చేసి ఆ మనువు పుట్టింది మనోరమ కడుపున కాదు!

Tuesday 3 April, 2007

బొట్టు-జ్ఞానం

రాధిక గారి సందేహం చదివాక గూగుల్ చేసి చూస్తే బొట్టు గురించి బోలెడు విషయాలు తెలిశాయి. వాటికి నాకు తెలిసినవాటిని కలిపి రాస్తే ఇది తయారైంది.

యోగ, ఆగమ, తాంత్రిక శాస్త్రాల ప్రకారం మన శరీరంలో ఉద్దీపనం చెందిన కుండలినీ శక్తి వెన్నెముక వెంబడి గల శక్తి కేంద్రాలను దాటుకుని శిరస్సును, తద్వారా పరాశక్తిని చేరుకుంటుంది. ఆ శక్తికేంద్రాలు ఏడు. వీటినే చక్రాలు అంటారు. అవి:

మూలాధార చక్రం,
స్వాధిష్ఠాన చక్రం,
మణిపూర చక్రం,
అనాహత చక్రం,
విశుద్ధ చక్రం,
ఆజ్ఞా చక్రం,
సహస్రార చక్రం
ఇవీ ఆ ఏడు చక్రాలు.
నుదుటి మీద కనుబొమల నడుమ బొట్టు పెట్టుకునే ప్రాంతంలో ఆరవదైన అగ్నిచక్రం/ఆజ్ఞాచక్రం ఉంటుందట. అగ్ని తేజస్సుకు, జ్ఞానానికి చిహ్నం. ఆజ్ఞాచక్రం అంతర్గతమైన/నిబిడీకృతమైన జ్ఞానానికి చిహ్నం. మన అనుభవ, సంచిత జ్ఞానమంతా అక్కడే కేంద్రీకృతమై ఉంటుంది. ధ్యానం చేసినప్పుడు ఉద్దీపనం చెందే కుండలినీశక్తి వెన్నెముక అడుగునుండి పైకి పాకుతుంది. ఆ శక్తి శరీరం లో నుంచి ఈ చక్రం గుండా వెలుపలికి పోతుందని తంత్రవేత్తల నమ్మకం. అక్కడ పెట్టుకునే బొట్టు ఆ శక్తిని వెలుపలికి పోనివ్వకుండా అడ్డుకుని తద్వారా ఏకాగ్రతను, ధారణ శక్తిని పెంపొందిస్తుందని వారంటారు. బొట్టు దుష్టశక్తులను, మనకు రానున్న చెడును అడ్డుకుని మనలను కాపాడుతుందని ఒక నమ్మకం.


ప్రాచీన కాలంలో ఆర్యసమాజంలో పెళ్ళి కొడుకు పెళ్ళైందనడానికి గుర్తుగా పెళ్ళి కూతురి నుదుటన బొట్టు పెట్టేవాడు. బహుశా సుమంగళి యొక్క ముత్తైదువతనానికి ఒక చిహ్నంగా నిలచిన బొట్టు ఒక సంప్రదాయంగా మారింది అక్కడి నుంచే కావచ్చు. మొదట్లో పెళ్ళైన ముత్తైదువులే తప్ప పెళ్ళికాని ఆడవాళ్ళు అసలు బొట్టు పెట్టుకునేవాళ్ళు కాదట! (ఇప్పుడు పాపిట్లో పెట్టుకునే బొట్టులాగే).

ఆడవాళ్ళు రకరకాల వస్తువుల నుంచి తయారుచేసిన బొట్లు పెట్టుకున్నప్పటికీ మగవాళ్ళు మాత్రం సాధారణంగా చందనపు బొట్టును పెట్టుకుంటారు. మనదేశంలాంటి ఉష్ణమండలపుదేశాల్లో ఇది చల్లదనాన్ని కలిగిస్తుంది.

బొట్టునే కుంకుమ అని, మాంగల్యం అని (మంగళప్రదమైనదనే అర్థంలో), తిలకమని, సింధూరమని అంటారు. హనుమంతుడి ఒళ్ళంతా సింధూరవర్ణంలో ఉండడానికి ఒక చక్కటి కథ చెప్తారు: ఒకసారి సీతాదేవి సింధూరపు బొట్టు పెట్టుకోవడం చూసిన హనుమంతుడు ఆమెను అడిగాడట ఆ బొట్టెందుకు పెట్టుకుంటారని. అప్పుడు సీతమ్మ ఈ సింధూరపు బొట్టు పెట్టుకునేవాళ్ళమీద రామయ్య అనుగ్రహం ఉంటుందనో ఏదో చెప్పిందట. అప్పుడు హనుమంతుడు తన మీద రాముడి దయ సంపూర్తిగా ఉండాలని ఒళ్ళంతా సింధూరం పులుముకున్నాడట. అదీ కథ.

హిందీ లో బొట్టును బిందీ అంటారు. ఇది బిందు అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. ఈ మాటకు చుక్క అని అర్థం. సాధారణంగా ఇది ఎర్రని ఎరుపురంగులో ఉంటుంది. బొట్టు స్త్రీశక్తికి ప్రతీకగా కూడా చెప్తారు. దీనిని ధరించిన స్త్రీలను, వారి భర్తలను ఆ శక్తే కాపాడుతుందని ఒక నమ్మకం.
-------------------------------------------------------------------------------
(వేదకాలంలోనే గార్గి, మైత్రేయి, లోపాముద్ర, రోమశ లాంటి స్త్రీలు గొప్ప పాండిత్యం కలవారుగా గుర్తించిన దేశం మనది. ఇదే దేశంలో స్త్రీలు, శూద్రులకు జ్ఞానం పొందే అర్హత లేదని తర్వాతి కాలంలో ఛాందసులు తీర్మానించారు. ఇక భర్త పోయిన స్త్రీకి జ్ఞానం అక్ఖర్లేదా అంటే ఏం చెప్తాం? బృహదారణ్యకోపనిషత్తులో ఒక కథ ఉంది. దాంట్లో జనకమహారాజు స్వయంగా గొప్ప జ్ఞాని. అలాంటివాడు పండితులతో ఏర్పాటు చేసిన చర్చాగోష్టిలో యాజ్ఞవల్క్యుడనే వాడు అందరినీ ఓడిస్తాడు. చివరకు గార్గి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక "ఎక్కువగా ప్రశ్నించావంటే నీ తల పగిలిపోతుంది" అని బెదిరించి ఆమె నోరు మూయిస్తాడు. తర్వాతి కాలంలో మగవాడు ఆడవాళ్ళ మీద అదే దౌర్జన్యాన్ని ప్రయోగించి వాళ్లను ఆలోచించనివ్వకుండా, వాళ్లకు చదువు-సంధ్యల్లేకుండా చేశారేమో? మీకు కచ-దేవయాని కథ తెలిసే ఉంటుంది. దాంట్లో రాక్షసులు కచుణ్ణి చంపి శుక్రాచార్యుడి కడుపులోకి పంపేసినప్పుడు అతణ్ణి బ్రతికించిన శుక్రుడు మృతసంజీవనీవిద్యను కచుడికే నేర్పి తన ప్రాణాలు వాడి చేతుల్లో పెట్టడానికి సిద్ధపడుతాడు. ఏం? అక్కడే ఉన్న తన కూతురు దేవయానికే నేర్పొచ్చు గదా? ఆమెకెందుకు నేర్పలేదంటే స్త్రీలు మంత్రోపదేశానికి అనర్హులట!!!)

Sunday 1 April, 2007

జైనమతంలో అహింస

అన్ని మతాలూ అహింస గురించి చెప్పినా అహింసను మరీ ఆచరణసాధ్యం కానంత తీవ్ర స్థాయికి తీసుకెళ్ళింది మాత్రం జైనమతమే. జైనమతం ప్రజాదరణ పొందలేకపోవడానికి కూడా అదే కారణమేమో? ఎందుకంటే గాలి పీలిస్తే గాల్లోని సూక్ష్మజీవులు చచ్చిపోతాయని మూతికి గుడ్డ కట్టుకుంటారు. నీళ్ళు వడగట్టుకుని తాగడం సరే, అడుగు తీసి అడుగువేసేటప్పుడు కాలికింద పడి సూక్ష్మజీవులు చచ్చిపోతాయని నెమలీకలతో చేసిన పొరకతో నడిచినంతమేరా అడుగేసేముందు నేలను ఊడ్చుకుంటూపోతారు. ఇలాంటివాళ్ళు నేలను చీల్చి దున్నే వ్యవసాయం ఏం చేస్తారు చెప్పండి? అందుకే జైనులు బతకడానికి వ్యాపారాలు (వడ్డీ వ్యాపారంతో సహా) చేయవలసిందేగానీ వ్యవసాయం చేయడానికి లేదు. వ్యవసాయం చెయ్యకపోతే తిండెలా వస్తుంది? జనాలెలా బ్రతుకుతారు? ఈ విపరీతధోరణి వాళ్ళు జీవులను ఏకేంద్రియ నుంచి పంచేంద్రియ వరకు చేసిన వర్గీకరణలో కూడా కనబడుతుంది:
జైనమతం పంచ భూతాలకు సంబంధించిన జీవుల గురించి ఇలా చెప్తుంది: పృథ్వీకాయ, అప్కాయ, తేజోకాయ, వాయుకాయ, వనస్పతికాయ జీవులు. ఇవి ఏకేంద్రియ జీవులట (స్పర్శజ్ఞానం మాత్రమున్నవి). అవి వాటినెవరైనా తాకితే గుర్తుపడతాయట.
రాళ్ళు, మట్టి, గవ్వల్లాంటివి పృథ్వీకాయ జీవులు.
నీటికున్న వేర్వేరు రూపాలు మంచు, ఆవిరి, నీరు, వానలాంటివి అప్కాయ జీవులు.
మంట, మెరుపు, బూడిద లాంటివి తేజోకాయ జీవులు.
గాలి, పెనుగాలి, తుఫాన్ లాంటివి వాయుకాయ జీవులు.
ఇక వృక్ష సంబంధమైన వనస్పతిక జీవుల్లో మొక్కలు, పొదలు, చెట్లు, వాటి బెరడు, కాండం, ఆకులు, విత్తనాలు...వీటిలో ఒక్కోదానిలో ఒక్కో ఆత్మే ఉంటుందట. అందుకని ఇవి ఏకకాయజీవులు. ఉర్లగడ్డలు, కంద, చేమ, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, మొదలైనవి అసంఖ్యాక ఆత్మలు గల బహుకాయజీవులు. ఈ రెండు రకాలూ వనస్పతిక జీవులే.

ఈ ఐదు రకాల జీవుల్లో ఒక్కో జీవికీ 4 ప్రాణాలు (స్పర్శ, శ్వాస, శరీరం, ఆయుష్షు) ఉంటాయట. ఇక పంచేంద్రియజీవులకు 10 ప్రాణాలుంటాయని వాళ్ళ నమ్మకం. ఈ ఏకేంద్రియ జీవులు కూడా పదార్థాన్ని ఆహారం, శరీరం, ఇంద్రియాలు, శ్వాసోశ్వాసలు అనే నాలుగు మార్గాల ద్వారా స్వీకరించి దాన్ని శక్తిగా మార్చుకుని బతుకుతాయట.