Wednesday 12 November, 2008

తెలుగు పతాక ఆవిష్కరణ, తెలుగు శాసనాల మ్యూజియం

సి.పి.బ్రౌన్ 210వ జయంతి సందర్భంగా నేడు సి.పి. బ్రౌన్ భాషాపరిశోధక కేంద్రంలో తెలుగు పతాకం ఆవిష్కరణ జరుగుతోంది. భారత జాతీయ పతాకాన్ని రూపొందించిందే ఒక తెలుగువాడైనప్పుడు ఆ తెలుగువారి పతాకం ఇంకెంత గొప్పగా ఉంటుందో చూడాలనే ఆసక్తితో తెలుగు నేలకు వచ్చి నిరాశ చెందిన సి.పి. బ్రౌన్ చుట్టం గురించి జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారి కథ "తెలుగు పతాకం" నిరుడు సాహిత్యనేత్రం నిర్వహించిన కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందింది. తెలుగు భాష ప్రస్తుత స్థితిని, ప్రసార మాధ్యమాల్లో తెలుగు స్థాయిని చక్కగా విశదీకరించిన ఆ కథను, ఆయన ఆ కథ రాయడం వెనకున్న నేపథ్యం గురించి మీరు చదివే ఉంటారు. ఇప్పుడు అలాంటివారు నిరాశ చెందకుండా మనం వారికి తెలుగు పతాకాన్ని చూపించొచ్చు. ఈ ఆవిష్కరణోత్సవానికి ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి, సాహిత్యనేత్రం సంపాదకులు శశిశ్రీ, శ్రీకృష్ణదేవరాయ, యోగి వేమన విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సెలర్లు హాజరౌతున్నారు. ఈనాడులో వచ్చిన వార్త:

నేడు తెలుగు పతాక ఆవిష్కరణ
కడప నగరం, న్యూస్‌టుడే : తెలుగుభాషకు ప్రాచీన హోదా లభించిన నేపథ్యంలో బ్రౌన్‌ 210వ జయంతిని పురస్కరించుకొని బ్రౌన్‌ గ్రంథాలయంలో బుధవారం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వీసీ రామచంద్రారెడ్డి చెప్పారు. ఈసందర్భంగా తెలుగు పతాకాన్ని ఆవిష్కరించనున్నామన్నారు. సాయంత్రం 6 గంటలకు సభ మొదలువుతుందని ముఖ్యఅతిథిగా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వీసీ పి.కుసుమకుమారి రానున్నారన్నారు. విశిష్ఠ అతిథిగా కలెక్టర్‌ ఎం.టి.కృష్ణబాబు, గౌరవ అతిథులుగా డా. జానుమద్ది హనుమచ్ఛాస్త్రి, ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి, శశిశ్రీ హాజరవుతున్నారు. గ్రంథాలయానికి పుస్తకాలు ఇచ్చిన వారిని సత్కరించనున్నామని చెప్పారు. ఇంకా విలేకరుల సమావేశంలో తెలుగుభాష పరిశోధకుడు కట్టా నరసింహులు, పీఆర్వో డా. మూలె మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.

బ్రౌన్ జయంతిని పురస్కరించుకొని కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో సి.పి. బ్రౌన్ మెమోరియల్ సెంటర్, తెలుగు శాసనాల మ్యూజియం కూడా నెలకొల్పుతున్నారు. తెలుగుకు ప్రాచీన భాషగా గుర్తింపు వచ్చిన నేపథ్యంలో సి.పి. బ్రౌన్ మెమోరియల్ సెంటర్ ప్రాచీన భాషా పరిశోధనాకేంద్రంగా పనిచేస్తుందని, విశ్వవిద్యాలయం బ్రౌన్ రచనలన్నింటినీ ఆధునీకరించి, డిజిటైజ్ చేస్తుందని, ఇందుకోసం బ్రౌన్ లేఖలు, డైరీలను చెన్నై మ్యూజియం నుంచి ఇక్కడికి తెప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని యోగి వేమన విశ్వవిద్యాలయం వీసీ ఆర్జుల రామచంద్రారెడ్డి చెప్పారు. వివరాలు హిందూలో.

Thursday 16 October, 2008

జ్ఞాన పీఠం

"జ్ఞాన పీఠ అవార్డు ఇవ్వడానికి తెలుగు భాషను పరిశీలించే సమయం వచ్చింది" అన్నారు 'చంద్రిమ' బ్లాగులో రాసిన జ్ఞాన పీఠము తెచ్చినారము జ్ఞానులెవ్వరొ తెలుపుడీ! టపాలో చంద్రమోహన్ గారు.

నాకు తెలిసి అలాంటిదేమీ లేదు, ఒకసారి ఒక భాషవారికి ఇచ్చాక మూడు సంవత్సరాల పాటు ఆ భాషను పరిశీలించరు. అంటే గత మూడేళ్లలో అవకాశం రాని భాషలన్నిటికీ "సమయం" వచ్చినట్లే. నిన్న మొన్నటి దాకా భారతదేశంలో ఇతర భాషల్లో అసలు మంచి సాహిత్యమే రానట్లు దాదాపు ప్రతి మూడేళ్లకొకసారీ జ్ఞానపీఠాన్ని ఆనవాయితీగా ఎగరేసుకుపోతూ వచ్చిన కన్నడిగుల మీద నా ఉక్రోషాన్ని నమ్మ బెంగళూరు టపాలో చూపించాను. అది హాస్యానికనుకున్నారేమో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. (ఇప్పటి వరకూ కన్నడానికి ఏడు పీఠాలు వస్తే హిందీకి మాత్రం ఆరుసార్లు పీట వేశారు.) నాకు తెలిసిన కన్నడిగులను ఈ సప్తపీఠాల గురించి అడిగితే వాటిలో సాహిత్యేతర కారణాల వల్ల వచ్చినవి కూడా కొన్ని ఉన్నాయని అంగీకరించారు. కానీ కన్నడంలో ఆ పీఠమెక్కవలసినవారు ఇంకా చాలామంది ఉన్నారని కూడా వాక్రుచ్చారు!

విశ్వనాథ సత్యనారాయణ కోసం ఆ పీటనెత్తుకొచ్చింది అప్పటి జ్ఞానపీఠ అవార్డుల కమిటీ అధ్యక్షుడుగా ఉన్న బెజవాడ గోపాలరెడ్డి. ఒక ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు - ఆ పీటను తీసుకు రావడానికి తాను గట్టి కృషే చేశానని (ఆయన విశ్వనాథకు వీరాభిమాని లెండి).సినారెకు వచ్చినప్పుడు ఆ కమిటీ అధ్యక్షుడుగా ఉన్నది పి.వి. నరసింహారావు అనుకుంటా. అంటే కేవలం సాహిత్యానికే పరిమితం కాకుండా రాజకీయాల్లో ఆరితేరిన వారు ఆ కమిటీ అధ్యక్షులుగా ఉండి సామ, దాన, భేదోపాయాలను ప్రదర్శిస్తే తప్ప ఆ పీఠం తెలుగు నేలకు రాలేదన్నమాట. జ్ఞానపీఠాన్ని మళ్ళీ తెలుగునేలకు రప్పించే రహస్యం ఇదేనా? ఏమో!

విషయానికి వస్తే చంద్రిమ బ్లాగులో అడిగిన ప్రశ్నకు నేను సమాధానం అక్కడే రాసినా అది ఎందుకనో కనబడలేదు. అందుకే అక్కడ అడిగిన ప్రశ్నకు నా సమాధానం ఇక్కడ రాస్తున్నాను: కాళీపట్నం రామారావు.

Monday 13 October, 2008

చందమామ పిచ్చోళ్ళ కథ

నాగమురళి గారి బ్లాగులో పాత చందమామలు చదివారా? నా కలల్లో కనిపించే స్వర్గం కూడా అలాగే ఉంటుంది. కాకపోతే నా అభిమానం పూర్తిగా చందమామ మీదే కేంద్రీకృతమైంది. బాలజ్యోతి రుచి దాదాపుగా నేనెరుగను. చిన్నప్పుడు చదివిన బాలమిత్ర కాస్త పెద్దయ్యాక నాకు నచ్చడం మానేసింది. చందమామ అలా కాదు. కొన్నేళ్ల కిందట తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ చందమామకు విరివిగా ఉత్తరాలు రాశాను. అప్పట్లోనే నేను రాసిన సింగిల్ పేజీ కథ కూడా ఒకటి చందమామలో వచ్చింది. అంతర్జాలంలోకొచ్చాక తెవికీలో చురుగ్గా ఉన్నరోజుల్లో చందమామ గురించి రాశాను, ఆర్కుట్లో చందమామ కమ్యూనిటీని ఏర్పాటు చేశాను. ఇంకా... బ్లాగుల్లో కూడా బహుశా చందమామ గురించి ఎక్కువసార్లు బ్లాగింది నేనే అనుకుంటా. ఇప్పటికీ ప్రతినెలా విడవకుండా చందమామ చదువుతాను. ఎప్పటికీ చదువుతూనే ఉంటాను. అందుకే చందమామ పిచ్చోళ్ళ క్లబ్బులో నాకు శాశ్వత సభ్యత్వముంది. :) ఇస్తే చిన్నదో, పెద్దదో ఒక పదవి కూడా తీసుకుంటా!

మొదట్లో chandamama.com లో పెట్టిన PDF ఫైళ్ళు అన్నీ ఆత్రంగా డౌన్లోడు చేసి పెట్టుకున్నాను. అదెంత మంచిపనో ఇప్పుడు chandamama.comలో ఆర్కైవ్స్ చూసినవాళ్లకు అర్థమౌతుంది. ఐతే ఒక లోటేమిటంటే ఆ PDF ఫైళ్లలో జూలై 1947, డిసెంబర్ 1948, ఫిబ్రవరి 1949, మార్చ్ 1955, సెప్టెంబర్ 1959 సంచికలు లేవు. "ఎలాగరా దేవుడా! మనకు ఇంతేనా ప్రాప్తం?" అనుకుంటూ ఉంటే దేవుడల్లే నాగమురళి గారు తన బ్లాగులో నేను చూడని ఆ టపా గురించి బ్లాగాగ్ని గారి బ్లాగులో వ్యాఖ్య రాసి ulib.orgకి దారి చూపించారు. ఐతే ఆ ulibలో డిసెంబరు 1948 పేరుతో ఉన్నది డిసెంబరు 1949 సంచిక. (ఈ విషయం నేను ULIB వాళ్ళకు తెలిపాను. డిసెంబరు 1948 సంచిక ULIBలో లేకపోయినా ఇప్పుడు నా దగ్గర ఉంది లెండి. లేకపోతే నేను చంపినెలా అవుతాను? :)) పైగా ulib.org సర్వరు మీద మనలాంటి పిచ్చోళ్ళు ఎక్కువగా దాడి చేస్తూండడం వల్లనో ఏమో ఆ సైటు ఎప్పుడూ ముక్కుతూ మూల్గుతూ ఉంటుంది. పోయిన్నెల్లో పరిస్థితి ఇది. ఇప్పుడు బాగైందేమో తెలియదు.

ఇదంతా ఇప్పుడెందుకంటే ఈమధ్య నేను హైదరాబాదుకు వెళ్ళినప్పుడు పని ఉండి ఒక పెద్దాయన్ను కలిశాను. మాటల మధ్యలో చందమామ ప్రస్తావన వచ్చింది. ఆయన తన దగ్గర పాత చందమామలు చాలా ఉన్నాయి కానీ ప్రారంభ సంచిక (1947 జూలై) లేదని వాపోయాడు. అప్పుడు నేను ఆయనకు చాలా ఉత్సాహంగా "ఆన్లైన్లో చందమామ" కథ చెప్పాను. ulib.org నుంచి శ్రమపడి అంతకుముందురోజే డౌన్లోడు చేసుకున్న సదరు సంచికలోని 68 పేజీలూ 68 పీడీఎఫ్ ఫైళ్ళుగా నా దగ్గరున్న పెన్ డ్రైవ్ లో భద్రపరచుకుని తిరుగుతున్న నేను ఆయన కోరిన సంచికతో బాటు బ్లాగాగ్ని కానుకలైన సీరియళ్లను కూడా ఆయన కంప్యూటర్లోకి కాపీ చేసి ఇచ్చాను. అవి చూసి ఆయన పరమానందభరితుడయ్యాడు.

అన్నిటికంటే ముఖ్యంగా (అసలు దొరుకుతుందనే ఆశలు దాదాపుగా వదిలేసుకున్న) ప్రారంభసంచిక కంటబడడంతో ఆయన ఉత్సాహంగా మాట్లాడుతూ, ఆ విడి విడి పేజీలను పేజ్ మేకర్లో అమర్చుకుని, వెలిసిన రంగులు సరిచేసి, పడిన మరకలు తుడిచేసి, ప్రింటౌట్లు తీసుకుని మళ్ళీ కొత్తగా చందమామను తయారుచేసుకుంటాననేసరికి నేను నోరెళ్ళబెట్టాను. ఆయన అదేమీ గమనించకుండా తన ధోరణిలో తాను ఇంకా సెలవిచ్చిందేమంటే అలా చెయ్యడానికి రోజుకు పద్దెమినిది గంటల చొప్పున పనిచేస్తే మూడురోజులు పడుతుందని, ఇంతకుముందొకసారి తాను అలాగే చేశాడని! అప్పుడే అనిపించింది నాకు - ఆయన్ను ఆలిండియా చందమామ పిచ్చోళ్ళ సంఘానికి అధ్యక్షుణ్ణి చేసెయ్యొచ్చని. ఐతే మరి కాసేపట్లోనే ఆ అభిప్రాయం మార్చుకున్నాను. ఎందుకో కింద చదవండి. ;)

నా నోరు మూతపడిన తర్వాత మాటలు చందమామ సీరియళ్ల మీదికి మళ్ళాయి. నేను 1980 ల ప్రారంభంలో చందమామ చదవడం మొదలుపెట్టినప్పుడే ముగ్గురు మాంత్రికులు సీరియల్ మొదలైందని నేనంటే ఆయన "ఆ సీరియళ్లన్నీ అంతకుముందే ఒకసారి వచ్చాయి. 80లలో వెయ్యడం అంటే అది రెండోసారి" అన్నాడు. దానికి నేను "అవునండీ, మా తరం వాళ్లం ఫాలో అవగలిగింది రెండో ఇన్నింగ్స్ నే" అని చెప్పాను. ఆయన తాను చదివిన సీరియళ్ల గురించి చెప్తూ పుస్తకరూపంలో తన దగ్గరున్న విచిత్ర కవలలు, మరికొన్ని చందమామ సంచికలను కలిపి బైండ్ చేసిన పుస్తకాన్ని నాకు చూపించాడు. (ఇంతకు ముందు చందమామలో ప్రజాదరణ పొందిన సీరియళ్ళను, కథలను తెలుగులో (కూడా) పుస్తకాలుగా విడుదల చేసేవాళ్ళు. ఆ పుస్తకం చూడగా నాకు తెలిసింది ఏమిటంటే అలా విడుదల చేసిన పుస్తకాల్లో ఆ కథలు బొమ్మలతో సహా అచ్చం చందమామలో వచ్చినప్పుడు ఎలా ఉండేవో అలానే ఉండేవని. ఎంత గొప్ప విషయమో కదా? సాధారణంగా పుస్తకాలుగా వచ్చే కథలు, నవలల్లో అలా బొమ్మలు ఉండవు.) మడతలు పెట్టి, ట్వైన్ దారంతో చుట్టిన ఒక పాలిథీన్ కవర్లో భద్రంగా ఉంది ఆ పుస్తకం. ఉద్వేగంగా దాన్ని అందుకుని తెరవబోతే తిప్పిన పేజీలు తిప్పినట్లు ఊడి చేతిలోకొచ్చేస్తున్నాయి. బహుశా చందమామ ప్రారంభసంచికను ఏదో ఒకరూపంలో అందజేశానన్న అభిమానంతోనే వాటిని నాకు చూపెట్టినట్లు అర్థం చేసుకున్నాను.అదే పుస్తకం ఆ స్థితిలో నా దగ్గరున్నట్లైతే సాక్షాత్తూ మన్మోహన్ సింగ్ వచ్చి అడిగినా ఇచ్చేవాడిని కాను. ఏమో, బహుశా అబ్దుల్ కలాం అడిగితే ఇస్తానేమో లెండి. ;) పైగా ఆయన ULIB founding sponsor కూడా.

తా.క.:

అన్నట్లు మీకు దాసరి వెంకట రమణ అనే పేరు తెలుసా? చందమామలో అప్పుడప్పుడూ కథలు రాసే ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో "చందమామ కథలు - బాలల్లో వ్యక్తిత్వ వికాసం" గురించి పరిశోధన (Ph.D.) చేస్తున్నారు. ఆయన చాలా కాలంగా పాత చందమామల కోసం వెదుకుతున్నారు. గతంలో ఆయన ఫోన్నంబరు, ఈమెయిల్ ఐడీ కూడా నా దగ్గర ఉండేవి. ఇప్పుడు వెదికితే కనిపించలేదు. మీకు తెలిస్తే పాత చందమామలు chandamama.comలోను, ulib.orgలోను దొరుకుతాయని ఆయనకు చెప్పండి.

వచ్చే నెలనుంచి చందమామ విడిప్రతి 20 రూపాయలు ఔతుందట. ఈ నెలాఖరులోగా చందా కట్టేవారికి ప్రత్యేక తగ్గింపు ధరలు ఉంటాయి. కాబట్టి త్వరపడండి.

Monday 8 September, 2008

బేడర కన్నప్ప - భక్త కన్నప్ప

శివుడు కలలోకొచ్చి తన కళ్లను సమర్పించమని కోరాడని చెప్తూ తన రెండు కళ్లనూ (ఒక్కో కన్నునొక్కోసారి) పెరికేసుకుని శివుడికి సమర్పించి ఇటీవల వార్తల్లోకెక్కాడొక కన్నడిగుడు. అతడి పేరు ముదుకప్ప ఎల్లప్ప కరాడి. అతడికి తిరిగి చూపొచ్చే అవకాశం లేదని వైద్యులు తెలిపారు. బాగల్కోట్ ప్రాంతానికి చెందిన ఈయన ప్రస్తుతం బెంగుళూరులోని NIMHANS (National Institute of Mental Health And Neuro Sciences)లో మానసిక చికిత్స పొందుతున్నాడు. ఈ విపరీత ప్రవర్తనకు మూలం భక్త కన్నప్ప కథే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐతే శ్రీకాళహస్తీశ్వర దేవాలయంలో శివుడికి తన కళ్ళు పెకలించి సమర్పించిన భక్త కన్నప్ప ఎక్కడి వాడు? ఈయన కడప జిల్లాలోని రాజంపేట మండలం ఊటుకూరులో జన్మించాడని ఎస్‌.కె. పళణిస్వామి అనే పరిశోధకుడు అంటున్నారు. వివరాలు నిన్నటి ఈనాడు కడప జిల్లా వార్తల్లో ఇలా ఉన్నాయి:
భక్తకన్నప్ప చరిత్ర రికార్డుల అప్పగింత
రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే : శ్రీకాళహస్తీశ్వరస్వామి పరమభక్తుడు భక్తకన్నప్ప(తిన్నడు) కడప జిల్లా రాజంపేట మండలం ఊటుకూరులో జన్మించినట్లు తెలిపే చరిత్ర రికార్డులను, ఆధారాలను శనివారం ఊటుకూరు గ్రామ సర్పంచి ఎం.ఎల్‌.నారాయణ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు కాళహస్తీశ్వర దేవస్థానం డిప్యూటీ ఈవోకి అందజేశారు. భక్తకన్నప్ప చరిత్రపై సర్వే నిర్వహించిన ఎస్‌.కె. పళణిస్వామి ఈ సందర్భంగా భక్తకన్నప్ప ఊటుకూరులో జన్మించినట్లు ఆధారాలను కాళహస్తీ అధికారులకు చూపించి విఫులంగా వివరించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్‌.వి. వెంకట్రాజు మాట్లాడుతూ ఆధారాలను పరిశీలించి జన్మస్థలిగా గుర్తింపు కోసం ఈ ఆధారాలను ఉన్నతాధికారులకు పంపుతామని పేర్కొన్నారు.

Monday 11 August, 2008

ఒలింపిక్స్ లో స్వర్ణంతో భారత్ బోణీ

"ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురై వస్తే..." హృదయం నిజంగానే ఆనందంతో ఎగసి ఎగసి పడుతోంది. 1980 మాస్కో ఒలింపిక్స్ లో హాకీలో వచ్చింది, 28 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో ఒక స్వర్ణ పతకం. అభినవ్ బింద్రా పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో 700.5 పాయింట్లతో బంగారు పతకం గెలుచుకున్నాడు. 8 స్వర్ణ, ఒక రజత, రెండు కాంస్యాలను గెలుచుకున్న గతమెంతో ఘనకీర్తి గల మన జాతీయ క్రీడ హాకీని మినహాయిస్తే ఇప్పటి వరకు మనం గెలుచుకున్న ఒలింపిక్ పతకాలను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు: 1900 పారిస్ ఒలింపిక్స్ లో అథ్లెటిక్స్ లో నార్మన్ ప్రిచార్డ్* (200 మీటర్ల పరుగు, 200 మీటర్ల హర్డిల్స్ లో) రెండు రజతాలు, 2004 సిడ్నీ ఒలింపిక్స్ లో షూటింగ్ (డబుల్ ట్రాప్)లో లెఫ్టినెంట్ కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఒక రజతం గెలుచుకోగా
1952 హెల్సింకీ ఒలింపిక్స్ లో కుస్తీలో ఖషబ దాదాసాహెబ్ జాధవ్,
1996 అట్లాంటా ఒలింపిక్స్ లో టెన్నిస్ లో లియాండర్ పేస్,
2000 సిడ్నీ ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో కరణం మల్లీశ్వరి ఒక్కో కాంస్యం గెలుచుకున్నారు.
-------------------
*భారత్ లో పుట్టి పెరిగిన నార్మన్ ప్రిచార్డ్ ఒక ఆంగ్లేయుడు. 1905 లో ఇంగ్లాండుకు వెళ్ళి అక్కడే స్థిరపడ్డాడు.

Friday 25 July, 2008

బెంగుళూరులో బాంబు పేలుళ్ళు - ఒకరి మృతి, 15 మందికి గాయాలు

ఈరోజు శుక్రవారం మధ్యాహ్న నమాజు సమయంలో బెంగుళూరు నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో కొన్ని నిమిషాల తేడాలో 7 బాంబులు పేలాయి. ఈ పేలుళ్లలో ఒక మహిళ చనిపోగా పదహైదు మంది గాయపడ్డారని ప్రాథమిక సమాచారం. ఈ పేలుళ్ల గురించిన వార్తలు సర్వత్రా వ్యాపించడం వల్ల ఒత్తిడి పెరిగి టెలిఫోన్ నెట్వర్కులు జామ్ అయ్యాయి. మడివాళ, అడుగోడి, కోరమంగళ, హోసూరు రోడ్డు, మైసూరు రోడ్డు, నాయదహళ్ళి లలో పేలిన ఈ బాంబులు తక్కువ తీవ్రత గల నాటు బాంబులని, టైమర్ సహాయంతో వీటిని పేల్చారని పోలీసులు తెలిపారు. పేలుళ్ళు జరిగిన ప్రాంతాలకు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లను పంపారు. పాఠశాలలు, కళాశాలలు, వాణిజ్య సముదాయాలు, సినిమా హాళ్ళను మూసేశారు. జమ్మూ కాశ్మీరులో అమరనాథ్ యాత్రీకుల సౌకర్యార్థం ఆలయ బోర్డుకు రాష్ట్రప్రభుత్వం 40 హెక్టార్ల అటవీభూమిని కేటాయించబోయి విరమించుకున్న నేపథ్యంలో ఈ పేలుళ్ళు హిందూ అతివాదుల చర్య అని అనుమానిస్తున్నారు.

Update:

పేలుళ్ళ వివరాలు:


1. 1.20 pm, మడివాళ బస్ డిపో

2. 1.25 pm, మైసూరు రోడ్డు

3. 1.40 pm, అడుగోడి

4. 2.10 pm, కోరమంగళ

5. 2.25 pm, విఠ్ఠల్ మల్లయ్య రోడ్డు

6. 2.35 pm, లాంగ్ ఫోర్డ్ టౌన్

7. రిచ్ మాండ్ టౌన్

Wednesday 2 July, 2008

చెప్పుకోండి చూద్దాం



ఈ బ్లాగులో అప్పుడప్పుడూ వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ఫోటోలు చూపించి ఆ ఫోటోల్లోని వ్యక్తులెవరో చెప్పుకోండి చూద్దాం అని ఒక క్విజ్ లాగ నడుపుదామని నాకొక ఆలోచన వచ్చింది. శాస్త్రవేత్తగా మారిన ఒక హాలీవుడ్ నటి హెడీ లమర్ గురించి దాదాపు రెండేళ్ళ కిందట "ఆమె ఒక శాస్త్రవేత్త. ఆమె వెండితెర వేలుపు. ఆమె ఒక సాహసి. ఆమె ఒక సౌందర్యరాశి." అని అడిగి సమాధానం కూడా నేనే చెప్పేశాను. ఆ తర్వాత ఈ క్విజ్ ఆలోచన వచ్చింది గానీ ఇప్పటిదాకా ఆచరణలో పెట్టలేదు. ఇప్పుడు కాచుకోండి: ఈ ఫోటోలోని వ్యక్తి ఒక ప్రముఖ తెలుగురచయిత. ఈయనెవరో చెప్పుకోండి చూద్దాం.



క్లూలు కావాలా? ఐతే ఒకటి అందుకోండి: ఈయన వాసికెక్కిన రచయిత. మల్లాది వెంకటకృష్ణమూర్తి కాదు కాబట్టి ఈయన ఫోటోలు ఈయన పుస్తకాలపైనేగాక అంతర్జాలంలో కూడా కనబడుతాయి.







Tuesday 24 June, 2008

నమ్మ బెంగలూరు

ఐదేళ్లకు పైగా హైదరాబాదులో పాతుకుపోయిన నేను అకస్మాత్తుగా బెంగళూరు వచ్చెయ్యాలనేసరికి కాస్త బెంగపడ్డమాట నిజం. ఐతే నేను హైదరాబాదు వదిలేసి బెంగళూరు వచ్చేస్తున్నానని తెలియగానే కొందరు ఆత్మీయులు నా బెంగ అర్థరహితం, అనవసరం అని కొట్టిపారేస్తూ, "ఇక్కడికొచ్చాక మీరే నమ్మ బెంగుళూరు అంటారు, వచ్చెయ్యండి" అని నమ్మబలికారు. ఇంకా వెనుకాడుతున్న నన్ను చూసి బెంగుళూరులో ఉండివెళ్ళిన కొందరు మిత్రులు "బెంగుళూరు నచ్చాలంటే మనలో ఆ క్లాస్ ఉండాలమ్మా" అని విదేశాలనుంచి సన్నాయినొక్కులు నొక్కారు. ఏమైతేనేం, చివరకు అందరూ కలిసి నన్ను బెంగుళూరుకు లాగేశారు.

నిజం చెప్పాలంటే మా ఊరినుంచి హై. కంటే బెంగలే దగ్గర. కానీ రాష్ట్రం దాటి రావాలంటే ముందుగా భాష గురించే నాకు బెంగ. ఎందుకంటే మనకు ఆంధ్రాంగ్లములు దక్క ఇతరేతర భాషలు రావు. MCA చదువుతున్నప్పుడు స్నేహితుల బలవంతమ్మీద జీవితంలో మొదటిసారి హిందీ సినిమా చూడడానికి వెళ్తూ వెళ్తూ దారిలో విశాలాంధ్రలో హిందీ డిక్షనరీ కొనుక్కుని మరీ వెళ్ళాను. ఇప్పుడూ అలాగే బెంగుళూరుకు రాకముందే ముందుజాగ్రత్తగా విశాలాంధ్రలో National Integration Series వారి 30 రోజుల్లో కన్నడం కొనిపెట్టుకున్నాను. (దాన్నింత వరకు తెరిచి చూడలేదనుకోండి, అది వేరే విషయం.) గుడ్డిలో మెల్ల ఏమిటంటే చిన్నప్పుడే నాకు 'ఉ', 'హ', 'క' తో సహా కన్నడం చదవడం వచ్చు. అందుకే ఇక్కడి (బెంగళూరు)కొచ్చాక కనిపించిన ప్రతి కన్నడ బోర్డునూ ఉత్సాహంగా చదివిపారేస్తున్నాను - అర్థమైనా, కాకపోయినా.

మొదటి అనుభవం: షేవింగు సెట్టుకు 'కత్తెర'

అసలు బెంగళూరుతో నా అనుబంధం పదినెల్ల కిందటే మొదలైంది. వారాంతాల్లో బెంగళూరుకు రావడానికి నా అలవాటుకొద్దీ ఒక చిన్న బ్యాగులో నా బ్రష్షూ పేస్టూ, షేవింగ్ సెట్టూ, సెల్ ఫోన్ ఛార్జరూ, దార్లో చదూకోడానికి రెండు మూడు పుస్తకాలు వేసుకుని బయలుదేరితే హైదరాబాదు విమానాశ్రయంలోని భద్రతాసిబ్బంది నన్ను, నా మీసకట్టును చూడగానే తెగముచ్చటపడిపోయి, "మీ మీసకట్టు చూడముచ్చటగా ఉంది, మీరు ఏ కత్తెరతో షేప్ చేసుకుంటారో చూపించండి" అని, నేనెంత మొహమాటపడుతున్నా పట్టించుకోక నా బ్యాగునంతా వెదికి మరీ నా కత్తెరను సావనీరుగా తీసేసుకునేవాళ్ళు. అలా వాళ్ల దగ్గర నావి ఐదారు కత్తెరలు (ఉండి)పోయాయి. ఐనా నేనొచ్చినప్పుడల్లా కొత్త కత్తెరను తీసుకోవడం అస్సలు మర్చిపోరు. ఒకసారి ఎందుకనో గుర్తులేదుగానీ నా బ్యాగునిండా చీమ దూరడానికి కూడా సందు లేకుండా ఏవేవో వస్తువులు కుక్కుకుని బయలుదేరాను. (ఎందుకేమిటిలెండి, మా ఆవిడకు జన్మదిన కానుక(లు) తీసుకెళ్తున్నాను) అప్పుడైతే వాళ్లకు కత్తెర వెంటనే దొరకలేదని చిన్నబుచ్చుకున్నారు కూడా. 'లేదయ్యా, నా దగ్గర అసలు కత్తెర లేనేలేదు, పోయినసారి మీరు తీసేసుకున్న తర్వాత నేను మళ్ళీ కొనలేదు, ఒకవేళ కొన్నా వెంట తెచ్చుకోలేదు, కావాలంటే నా షేవింగ్ సెట్టు చూడండీ' అని షేవింగ్ కిట్టు తెరిచి చూపించినా వాళ్ళు నిరాశపడలేదు. నా బ్యాగునంతా రెండుసార్లు వెదికాక నేను బ్లేడుతోనే షేప్ అనుకుంటానేమో అని అనుమానించి బ్లేడ్లు తీసేసుకున్నారు. మళ్ళీ నా బ్యాగును వెనక్కి X-రే స్కానింగుకు పంపి "కహా హై, కహా హై" అని అక్కడి గార్డును కంగారుపెడితే అతను "Centre మే హై" అని చెప్పేవరకూ వాళ్ళు శాంతించలేదు. వాళ్ల వాలకం చూస్తే కత్తెర కోసం గిఫ్టు పాకెట్లు కూడా విప్పి చూపమంటారేమోననిపించింది. అసలా బ్యాగులో కత్తెర ఉన్నట్లు అప్పటివరకూ నేను చూసుకోనేలేదు. చూసుకున్నట్లైతే వాళ్లనంతగా ఇబ్బందిపెట్టి ఉండను. ;) అలా ఆ ట్రిప్పులో కత్తెరతోబాటు బ్లేడ్లు కూడా పోగొట్టుకున్నాను. (భద్రతాకారణాల వల్ల ఇలా ప్రయాణీకుల నుంచి స్వాధీనం చేసుకున్న "ఆయుధాల"ను బేగంపేటలో ప్రదర్శనకు పెట్టమని ఏలినవారిని కోరాలి). బెంగుళూరు వెళ్ళబోతే ప్రయాణంలోనే ఇలాంటి అనుభవాలౌతున్నాయే, బెంగుళూరు వెళ్ళాక పూర్తిగా క్షవరమైపోతానేమో అని కూడా అనిపించినా 'అబ్బే, మా ఆవిడ చాలా మంచిది. అలాంటి పనులేవీ చెయ్యదు' అని నాకు నేనే ధైర్యం చెప్పుకునేవాడిని. మొత్తానికి అలా నేను బెంగళూరు వచ్చిపడ్డానన్నమాట. ఇక బెంగళూరులో నా అనుభవాలు కాస్కోండి:

బాగిలు

మొదటిరోజు ఇంటినుంచి ఆఫీసుకు వెళ్లడానికి సిటీబస్టాపుకెళ్ళాను. 'హై.లోలాగ ఇక్కడ షేరింగ్ ఆటోలు ఎందుకు లేవా' అని చింతిస్తూ, బస్సు రాగానే ఎక్కడానికి వీలుగా కుడివైపు నిలబడ్డాను. ఇంతలో బస్సు రానేవచ్చింది. కానీ ఆ బస్సుకు వెనకవైపు అసలు డోరే లేదు. ముందుపక్క ఒకే ఒక డోరు మాత్రమే తెరచి ఉంది. ఇదెక్కడి వింత? అనుకుంటూ బస్సెక్కి చూస్తే ఒకచేత్తో స్టీరింగు తిప్పుతూ ఇంకో చేత్తో టికెట్లిస్తున్న డ్రైవరు కనబడ్డాడు. అది చూసి అదిరిపడ్డాను. సిటీ బస్సుల్లో వన్ మాన్ సర్వీసులా? బెంగళూరుకు రాకముందు ఇలాంటిదొకటి ఉందని, అది మనదేశంలోనే విజయవంతంగా అమలౌతోందని ఎవరైనా చెప్పినా నమ్మేవాణ్ణి కాదు. ఎవరూ చెప్పలేదు కాబట్టి బతికిపోయారు. బస్సెక్కిన కాసేపటికి రోడ్ల మీద వెస్టిబ్యూల్ బస్సులు కూడా తిరుగుతూ కనబడ్డాయి. ఇక్కడ విజయవంతంగా నడుస్తున్న ఈ జంటవాహనగళు హైదరాబాదులో మూణ్ణాళ్ళ ముచ్చటగా ఎందుకు మూలనబడ్డాయో నాకు అర్థం కాలేదు.

బస్సు ఎక్కబోతూ డోరు దగ్గర కన్నడంలో స్వయంచాలిత బాగిలు అని చూసి 'బాగిలు అంటే ఏమిటబ్బా?' అని ఆలోచించాను. అప్పుడేమీ తట్టలేదుగానీ 30 రోజుల్లో కన్నడం కూడా చదవనసరం లేకుండానే త్వరలోనే అదేమిటో అనుభవపూర్వకంగా బోధపడింది. కాసేపు ఓపిగ్గా ఈ టపా చదివితే మీకు కూడా తెలిసిపోతుంది. (అసలు నా బ్లాగు చదవడమే ఓ ఎడ్యుకేషన్. అందుకే రోజూ వచ్చి నా బ్లాగు చదివేస్తూ ఉండండి. మీ విజ్ఞానాన్ని పెంచుకోండి.)

హైదరాబాదులో ఐతే సిటీ బస్సులు బస్టాపులో ఆగడం, ఆగకపోవడం దైవాధీనం. అది డ్రైవరు మూడును బట్టి ఉంటుంది. బస్టాపులోని దీనజనాల మీద దయ కలిగిందా ఆగుతుంది, లేదంటే ఎక్కడో వెళ్ళి ఆగుతుంది. మనం అక్కడిదాకా పరిగెత్తిపోయేలోపే "Catch me if you can" అంటూ కదిలి బుర్రున వెళ్ళిపోతుంది. ఐతే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మాత్రం నమ్మకంగా ఆగుతుంది. అందుకే బస్సెక్కాలన్నా, దిగాలన్నా జనాలు బస్టాపుల కంటే ఎక్కువగా ట్రాఫిక్ సిగ్నళ్ళనే నమ్ముకుంటారు. ఈ ట్రెండు చూసి ఆర్టీసీ వాళ్లు ముచ్చటపడి అమీర్ పేట మైత్రీవనం గేటు ముందైతే ఏకంగా సిగ్నల్ దగ్గరే బస్టాపు ఏర్పాటుచేశారు.

ఒక అచ్చమైన హైదరాబాదీలాగ అదే అలవాటుతో నేనూ బెంగళూరులో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరే బస్సు దిగడం మొదలుపెట్టాను. నాలుగురోజులు బాగానే గడిచింది. ఐదో రోజు, అనగా ఒక శుక్రవారం నాడు, శుక్రుడు వక్రదృష్టితో చూశాడేమో నన్ను, బస్సు డ్రైవరు బస్సు దిగడానికి వస్తున్న నన్ను చూసి ముఖం మాడ్చుకుని ముందుకు వంగాడు. అతడలా వంగాడో లేదో అప్పుడే అలీబాబా అన్నకు గుహద్వారం ముసుకుపోయినట్లు నా కళ్లముందే బస్సుడోరు ముసుకుపోయింది. అసలే మన హై.లో సిటీ బస్సులకు డోర్లుండడం, ఉన్నా అవి మూసుకుపోవడం ఏ జన్మానా ఊహించలేం కదా? అందుకే 'ఈ డోరేమిట్రా ఇలా చేసిందీ' అని నిర్ఘాంతపోయాను. "డోరా డోరా తెరుచుకోవే" అని నాకొచ్చిన మంత్రాలన్నీ పఠించాను, లాభం లేకపోయింది. బస్సు డ్రైవరేమో నా మొర ఆలకించకుండా ఎటో చూస్తున్నాడు. ఈలోగా సిగ్నలు మారి బస్సు కదిలిపోయింది. ఆ కదలడం కదలడం ఒక కిలోమీటరు దాకా ఎక్కడా ఆగలేదు! దార్లో ఎక్కడా అంగుళం కూడా అడ్డం రాని బెంగళూరు ట్రాఫిక్ మీద మండమంటే మరి నాకు మండదా?

అలా ఎక్కడో దిగవలసిన నన్ను ఇంకెక్కడో వదిలి వెళ్ళిపోతున్న బస్సు వైపు "బలివాడ కాంతారావు నవలలా" చూసేసరికి ఆ బస్సు వెనుక రాసి ఉన్న రెండులైన్ల ముషాయిరా కనబడింది:

నడువె అంతరవిరళి
అఫవాతక్కి అవసరవే కారణ


మొదట అదేమిటో అర్థం కాలేదు. కాసేపటికి తేరుకుని నాకు అర్థమైనంతవరకు ఆ రెండు లైన్లకు స్వీయానువాదం
"నడువరా అంతదూరమూ, అవసరమే అందుకు కారణము" (నడువరా కి నడువే అని లింగమార్పిడి చేశారన్నమాట!) అని పాడేసుకుంటూ వెనుదిరిగి సాగిపోతున్నాను. ఒక్కో బస్సూ నన్ను దాటుకుని వెళ్తున్నప్పుడల్లా స్వయంచాలిత బాగిలు అని కళ్లముందు కనబడుతూనే ఉంది. ముషాయిరా అనువాదం కనిపెట్టిన ఉత్సాహంలో ఉన్నా కదా? అదే ఊపులోనైతే వీజీగా తడుతుందని స్వయంచాలిత బాగిలును కూడా స్వీయానువాదం చేయడానికి ప్రయత్నించాను. స్వయంచాలిత అంటే ఆటోమాటిక్. మరి బాగిలంటే ఏమయ్యుంటుంది? అని ఊహించబోతే ఎంతకీ తట్టలేదు. కుంచంతో నిలువుగా కొలవడానికి వీల్లేనప్పుడు తిరగేసి కొలవమన్నారు కదా? అందుకని ఇలా కాదని అసలు ఆ బస్సుల్లో కదిలేవీ, హైదరాబాదు బస్సుల్లో కదలనివీ ఏమున్నాయాని ఆలోచించేసరికి మిష్టరీ ఇట్టే విచ్చిపోయింది. (చూశారా? అసలైన Education అంటే ఇదేగానీ జావాలు, డాట్ నెట్లూ కాదని మీకెవరు చెప్తారు?) ఇంతకూ బాగిలు అంటే ఏమిటనుకున్నారు? అవే... ముదనష్టపు డోర్లు!! వాకిలిని కన్నడంలో బాగిలు అంటారన్నమాట. ఆహా! గొప్ప డిస్కవరీ. (నిండా కష్టాల్లో ఉన్నప్పుడే మనకలా బ్రెయిన్ వేవులొస్తుంటాయిలెండి) ఈ లెక్కన కన్నడం నేర్చుకోవడం చాల వీజీనే. అర్థం కానిచోటల్లా తెలుగు పదాలతో రైమింగు కుదిరేటట్లు చూసుకుంటే సరి.

మనం దారిలో కనిపించిన బోర్డులన్నీ చదివేసుకుంటూ, అనువాదాలు చేసేసుకుంటూ ఇదే వేగంతో పురోగమిస్తే పది నిమిషాల్లో ఆఫీసు చేరుకోవచ్చు, ఆపైన పదిరోజుల్లో కన్నడంలో పండితులమైపోవచ్చు. 10 రోజుల్లో కన్నడం పుస్తకం సొంతంగా ముద్రించుకోవడం మంచిదా లేక ఆ అవకాశం విశాలాంధ్ర వాళ్ళకిద్దామా అని తీవ్రంగా ఆలోచిస్తూ ఆఫీసు చేరుకున్నాను.

హా!
హాఫీసు నుంచి తిరిగొచ్చేటప్పుడు పాలు, పూలు తీసుకురమ్మని చెప్పి పంపింది మా ఆవిడ. పాలను హాలు, పూలను హువ్వ అంటారని కూడా చెప్పింది. దాంతో మన చురుకైన బుర్రకు అంతా అర్థమైపోయింది. బెంగాలీలు 'వ' ను 'బ' అని పలికినట్లే కన్నడిగులు 'ప' ను 'హ' అంటారన్నమాట. ఆహా! మన కన్నడం క్షణక్షణాభివృద్ధి చెందడానికి ఇంటా బయటా ఇంత గొప్ప ప్రోత్సాహం లభిస్తూంటే పుస్తకం సొంతంగానే ప్రచురించుకోవచ్చు. కన్నడంలో కథలు కూడా రాసేసి అర్జెంటుగా ఒకటో రెండో జ్ఞానపీఠాలు కూడా గెలిచేసుకోవచ్చు. భారతదేశం వోల్మొత్తంలో జ్ఞానపీఠమెక్కడానికి దగ్గర దారి కన్నడ సాహిత్యమేకదా? అసలే గిరీష్ కర్నాడ్ కు ఆ పురస్కారం వచ్చాక మూడేళ్ల కాలపరిమితి దాటిపోయి కూడా చాలా కాలమైంది.

ఇంతకూ మా ఆవిడ హాలు, హూలు తెమ్మందేగానీ హళ్ళు తెమ్మని చెప్పలేదు (అదేనండీ పళ్ళు, ఇలాంటి పదాలు వీజీగా క్యాచ్ చెయ్యాలంటే చిట్కాల కోసం నేను రాయబోయే 10 రోజుల్లో కన్నడం పుస్తకం ముందుగానే పది కాపీలు రిజర్వు చేసుకోండి). కానీ కొన్ని పనులు చెప్పకుండా చేస్తే మనకే లాభం. (Education లో మూడో పాఠం) ఏ హళ్లు తీసుకెళ్ళాలి? సీజన్ కాబట్టి మామిడి హళ్ళు బెటర్.

మడివాళ లో దిగడానికి సిద్ధంగా డోరు దగ్గర చేరి బయటకు చూస్తున్న నాకు సెయింట్ జాన్స్ ఆస్పత్రి పక్కన ఆనందాశ్చర్యాలు కలిగించే బోర్డు ఒకటి కనబడింది. ఆ రోడ్డు పేరు "మహాయోగి వేమన రస్తె" అట! అదే హై.లోనైతే పెద్ద సెంటర్లకు కోఠీ, అబిడ్స్, లక్డీకాపూల్, కూకట్ పల్లి, మెహదీపట్నం, దిల్ సుఖ్ నగర్,.. అనీ; చిన్నసెంటర్లకు టప్పా చబుత్ర లాంటి విడ్డూరమైన పేర్లేవో ఉంటాయి. రోడ్లకు అన్నీ ఇంగ్లీషు పేర్లో, లేకపోతే నవాబుల పేర్లో ఉంటాయిగానీ తెలుగువాళ్ల పేర్లు కనబడవు. నిజం చెప్తున్నా, వీటిల్లో ఒక్కదానికి కూడా నాకు అర్థం తెలీదు. అలాంటిది ఇక్కడ ఒక రోడ్డుకు యోగి వేమన పేరు పెట్టారని చాలా సంతోషించాను. ఎంతైనా కన్నడిగులు చానా మంచోళ్ళు.

ఆ ఆనందంలోనే మామిడిపళ్ల బండి దగ్గరకెళ్ళి కొన్ని పళ్ళు ఏరుకున్నాను. తక్కెడ తీసి ఎన్ని కావాలని కాబోలు అడిగాడు పళ్లమ్మేవాడు. "హది" అన్నాను. అప్పుడు వాడు వేసిన వెర్రిమొహం మసకచీకటిలో కూడా స్పష్టంగా కనబడింది. దాంతో 'ఓ! మనమెక్కడో తప్పులో కాలేశాం' అనుకుని 'టెన్' అన్నాను, వాడింకా అలాగే చూస్తున్నాడు. 'దస్' అన్నాను. అది కూడా వాడికి అర్థమైనట్లు లేదు. ఇలా కాదని అచ్చతెలుగులో 'పది' అన్నాను. ఆ మాటతో వాడిలో చలనం వచ్చింది. 'హమ్మయ్య! వీడికి తెలుగొచ్చన్నమాట!!' అనే ఆనందంలో జరిగిందంతా మర్చిపోయి హళ్ళు తీసుకుని ఇంటికొచ్చేశాను.

మామిడి హళ్ళ ... క్షమించాలి, పళ్ళ అనుభవంతో నా కన్నడ పరిజ్ఞానం మీద నాకే రవంత అనుమానం కలిగింది. దాంతో 10 రోజుల్లో కన్నడం పుస్తకం రాసే ఆలోచన ప్రస్తుతానికి పక్కన పెట్టాను. ఐతే ఇటీవల నన్ను కన్నడంలో ఎవరేది అడిగినా సమాధానం కన్నడంలోనే చాలా జోరుగా, ఇంకా చాలా కాన్ఫిడెంటుగా చెప్పేస్తున్నాను. అదేమిటో గానీ అందరికీ ఆ సమాధానం అర్థమౌతోంది కూడా. అడిగినవాళ్ళెవరూ నాకేసి వెర్రిగా గానీ, విచిత్రంగా గానీ చూడకపోవడమే దానికి నిదర్శనం. "National Integration Series" వారి 30 రోజుల్లో కన్నడం పుస్తకం చదవకుండానే నాకు కన్నడం వచ్చేసిందా? బెంగుళూరులో నేను భాష గురించి బెంగ లేకుండా బతికెయ్యగలనా? మీరే చెప్పాలి.
... ... ...

ఇంతకూ అసలు విషయం నేను మీకు చెప్పనేలేదు కదూ? కన్నడంలో నేను చాలా జోరుగా, ఇంకా చాలా కాన్ఫిడెంటుగా వాడుతున్న ఏకైక పదం "గొత్తిల్ల"!
(ಗೊತ್ತಿಲ್ಲ = తెలీదు)



Monday 9 June, 2008

కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని కడపలోనే స్థాపించాలి

ఎక్కడైనా ఒక ప్రాంతం సజావుగా/వేగంగా అభివృద్ధి చెందడమో, అభివృద్ధి కుంటుపడడమో, లేక అసలు లేకపోవడమో చూస్తాం. కానీ అభివృద్ధిపథంలో నానాటికీ వెనక్కెనక్కి పోవడం కడప జిల్లా ప్రత్యేకతేమో అనిపిస్తుంది కొన్ని విషయాలు చదివితే.

వివిధరంగాల్లో కడపజిల్లా అభివృద్ధి చరిత్రను ఒకసారి పరిశీలిస్తే,

రైల్వే: దేశాభివృద్ధికి జీవనాడుల్లాంటివి రైలుమార్గాలు. దేశంలోనే అతిప్రధానమైన రైల్వే మార్గాల్లో ఒకటి, స్వర్ణచతుర్భుజి లో భాగమైన ముంబై-చెన్నై రైలు మార్గం కడప గుండా పోతుంది. కానీ ఒక్క కడప జిల్లాలో మాత్రం ఆ మార్గం విద్యుదీకరణ గానీ, డబ్లింగు గానీ ఇంతవరకు పూర్తికాలేదు. (ఈ మార్గంలో ఉండడం వల్లే నూటపాతికేళ్ల కిందట రాష్ట్రంలో మొట్టమొదట రైల్వే సౌకర్యం పొందిన జిల్లాకేంద్రం కడప అయింది. విచారకరమైన విషయమేమిటంటే నేటికీ అదొక్కటే ఈ జిల్లాలో రైలుమార్గం. దశాబ్దాలు గడుస్తున్నా ఎర్రగుంట్ల-నంద్యాల రైలుమార్గం పూర్తికానే లేదు. కడప-నెల్లూరు, కడప-బెంగుళూరు రైలుమార్గాల పనులు ఇప్పట్లో ప్రారంభమౌతాయనే ఆశలు కూడా లేవు.)

పైగా ఆ మార్గంలో కడపజిల్లాలోనే నందలూరులో రైల్వే లోకో షెడ్ ఉండేది. గత ఐదేళ్ళుగా ఈ ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు విజ్ఞాపనలు, ఆందోళనలు చేసినా పట్టించుకోకుండా దాన్ని కాస్తా ఈమధ్యే తిరుపతికి తరలించేశారు. అక్కడి ప్యాసింజర్‌ డ్రైవర్ల క్రూ కేంద్రాన్ని కూడా మూసేశారు. ఇక్కడి ప్రజలు నందలూరు రైల్వే ఐక్యపోరాట సమితి (ఐకేపీఎస్‌) ఆధ్వర్యంలో పలుదఫాలు ఆందోళనలు చేసిన మీదట స్థానిక రైల్వేకేంద్రంలో గూడ్సు వ్యాగన్ల మరమ్మతు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని రైల్వేమంత్రి హామీ ఇచ్చారు గానీ అది నెరవేరే సూచనలు ఇంతవరకూ కానరాలేదు.

విమానయానం: బ్రిటిష్ వారి హయాం లోనే రాష్ట్రంలో రెండో విమానాశ్రయం కడపలో ఏర్పాటుచేశారు. దాన్ని కాస్తా 1993లో అనుకుంటా మూసేశారు. పోనీ ఇదేమైనా మారుమూల ప్రాంతమా అనుకుంటే 6 జిల్లాలకు నడిబొడ్డులాంటి నగరం. మౌలిక సౌకర్యాలు ఎంతగానో అభివృద్ధి చెందవలసిన ప్రాంతం.

పారిశ్రామికాభివృద్ధిని చూద్దామంటే అపారమైన ఖనిజసంపద ఉన్నా పరిశ్రమలు మాత్రం సున్నా. (ఎర్రగుంట్ల దగ్గర మాత్రం 3 సిమెంటు ఫ్యాక్టరీలున్నాయి.) నందలూరు దగ్గరే ఆల్విన్ ఫ్యాక్టరీ ఉండేది. అది అనతికాలంలోనే మూతపడింది.

ప్రొద్దటూరు మిల్క్ ఫాక్టరీ (PMF): ప్రారంభంలో సుమారు లక్ష లీటర్ల పాల సేకరణలో పి.ఎం.ఎఫ్‌. అందరి మన్ననలు పొందింది. ఇక్కడి ఉత్పత్తులు దేశ రక్షణకు పనిచేసే సైనికులకు సరఫరా చేసేవారు. భక్తులందరూ అమితంగా ఇష్టపడే ప్రీతికరమైన తిరుపతి లడ్డూల తయారీకి ఇక్కడి పాలనే వినియోగించేవారు. సరైన నిర్వణ లేకపోవడంతో 13 ఏళ్ళ కిందట నష్టాల బాటలో మూతపడింది.

తాజాగా చెన్నూరు దగ్గరున్న కడప చక్కెర కర్మాగారం మూతపడింది.

విద్య, వైద్య సౌకర్యాలు: 1972 వరకు జిల్లాలో ఒకే ఒక డిగ్రీ కళాశాల ఉండేది. నిన్నమొన్నటి వరకు ఒక్క ఇంజనీరింగ్ కళాశాల మాత్రమే ఉండేది. పెద్దజబ్బులేవైనా చేసినా, అత్యవసర పరిస్థితుల్లో ఐనా పొరుగుజిల్లాలైన నెల్లూరికో, కర్నూలుకో పోవలసివచ్చే దుస్థితి.

ఇతరాలు: మొదట అన్నివిధాలుగా అనువైనచోటుగా భావించి ఇక్కడ కార్యాలయాలు ఏర్పాటుచెయ్యడం, తర్వాత గప్ చుప్ గా వాటిని వేరే ఎక్కడికో తరలించడం సాధారణంగా జరిగేదే. కడప రేడియో స్టేషన్ను కూడా తిరుపతికి తరలించడానికి గతంలో గట్టి ప్రయత్నాలే జరిగాయి. ఐతే అప్పట్లో కడపకు చెందిన రచయితలు, కళాకారులు పెద్దయెత్తున ఆందోళనలు జరిపి ఆ ప్రయత్నం సాగకుండా అడ్డుకోగలిగారు.

ఇలా అన్నిరంగాల్లో ఒక అడుగు ముందుకేస్తే రెండడుగులు వెనక్కి వేస్తున్న ఇలాంటి ప్రాంతాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి మౌలిక సదుపాయాలు కల్పించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. అందులో భాగంగానే కేంద్రప్రభుత్వం స్థాపింపతలపెట్టిన కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలోని కడపలోనే ఏర్పాటు చెయ్యాలని నేను కూడా కోరుతున్నాను. దీనికి సంబంధించి ఈరోజు హిందూలో వచ్చిన వార్త:

Plea to locate Central University in Kadapa
Special Correspondent
District has been neglected for centuries, leaders of citizen associations tell Union Minister

Constitution of committee to study economic backwardness of the district sought

While Visakhapatnam has developed, Kadapa had only one degree college between 1952 and 1972


KADAPA: Citizens’ association leaders of the city on Sunday urged Union Minister for Human Resource Development N. Purandareswari to locate the Central University at Kadapa, which has been neglected for centuries, and not establish it at Visakhapatnam.

Association’s honorary chairman P. Subba Reddy, chairman S. Sitaramaiah and general secretary S. Elias Reddy said in a memorandum faxed to the Minister to constitute a committee to study the economic backwardness of Kadapa as well as Visakhapatnam before locating the Central University. Otherwise, the south Andhra Pradesh campus of the university may be located at Kadapa and the north campus at Visakhapatnam, they demanded.

Lost opportunity

Rayalaseema lost an opportunity to get a university at Anantapur during the British rule, when Prof. Kattamanchi Ramalinga Reddy recommended location of Andhra University at Visakhapatnam as Madras university was far away from it.

While Visakhapatnam has developed over the years, Kadapa had only one degree college between 1952 and 1972, they said.

When Chief Minister Y.S. Rajasekhara Reddy proposed to set up the Central University at Kadapa, people of Visakhapatnam launched an agitation, unmindful of Rayalaseema people’s agitation for a steel plant and upgradation of All India Radio at Visakhapatnam, they asserted. Visakhapatnam got a port, naval base, steel plant, Bharat Heavy Plates and Vessels, but Central funds to Kadapa were meagre.

Central location

Kadapa is centrally located in Rayalaseema region and is about 250 km from the south coastal backward districts.

The district would also serve backward areas like Bellary, Chintamani, South Arcot in neighbouring Tamil Nadu, they said.

Kadapa was on the Chennai-Mumbai railway line and Kadapa aerodrome was being developed, the citizen association leaders said.

Tuesday 3 June, 2008

పాండవులెవరు?

ఓరి దేవుడో! ఈ బ్లాగులో నేను టపా రాసి సంవత్సరమైందా? ఎంతన్యాయం? అరిఝెంటుగా ఏదోకటి రాసెయ్యాలి. అరిఝెంటుగా రాసెయ్యాలనుకున్నాను కాబట్టి అవుడియాలేం లేవు. అందుకే ఈసారికిలా సర్దుకుపోండి. విషయమేమిటంటే నిన్నటి ఈనాడు పేపర్లో ఆంతర్యామి శీర్షికలో ఒక ఆసక్తికరమైన వ్యాసం చదివాను. ఇది నిజంగా పాండవుల పుట్టుకపై కొత్తచూపే. లంకె ఇంకో మూణ్ణెళ్ళు మాత్రమే పనిచేస్తుంది. వ్యాసంలోని ముఖ్యాంశాలను ఇక్కడ ఇస్తున్నాను:

భూమాత స్వరూపమే కుంతి
- తటవర్తి రామచంద్రరావు

వ్యాసమహర్షి మహాభారతంలో భూమికి ప్రతిస్వరూపమైన కుంతిని సృష్టించాడు. కు అంటే భూమి. కుంతి అంటే భూ స్వరూపమే. కుంతికి పృధ అని మరో పేరుంది. అంటే పృధ్వి అని అర్థం.

ఆమె ముందు ప్రత్యక్షమైన సూర్యదేవుడు ఆమె నాభిని స్పృశించి ఆమె గర్భంలో ప్రవేశించి స్వర్ణకవచకుండలాలతో ఉన్న కర్ణుడికి జన్మకారకుడైనాడు. అంటే, సూర్యకిరణాల సహాయంతో భూమి మీద జీవరాశి ఉద్భవించిందనటానికి సంకేతం. వృక్షరాజ్యానికిది నాంది పలికింది. కర్ణ అంటే ధాన్యమని మరో అర్థం. అంటే కర్ణుడు వృక్షాలకు మూలమైన విత్తనాలకు సంకేతం. నీళ్ళు లేనిదే విత్తనం మొలకెత్తదు. అందుకే కుంతి కర్ణుడిని బుట్టలో పెట్టి నదిలో వదిలింది. ఆ బుట్టను అధిరథుడు చూసి కర్ణుణ్ని ఒడ్డుకు తెచ్చాడు. అధిరథుడంటే సారథి అని అర్థం. కర్ణుడి జీవితానికి అతను నిజంగానే సారథి. ఆ తరవాత కర్ణుడు అంగరాజు అయ్యాడు. అంటే శరీరాంగాలకు రాజు అయ్యాడు. శరీరాన్ని పోషించేది ఆహారం కనుక దానికి మూలాధారమైనాడు. మనకు ఆహారంగా లభ్యమయ్యే కూరలకు, పళ్ళకు, ధాన్యానికి పైన రక్షణగా తొక్క, బెరడు, పొట్టు లాంటివేవో ఒకటి ఉంటాయి. కర్ణుడి కవచం దానికి సంకేతం. ప్రతి చెట్టునుంచీ పళ్ళు వేలాడతాయి. కర్ణుడి కుండలాలు వాటికి చిహ్నాలు.

సూర్యశక్తితో ప్రథమపుత్రుడి ద్వారా వృక్షజాతికి జన్మనిచ్చిన కుంతి, జంతుజాతిలో అత్యుత్తముడిగా పుట్టిన మనిషికి కావాల్సిన అయిదు శక్తులకు పంచపాండవుల ద్వారా జన్మకారకురాలైంది.

బుద్ధికి యుధిష్ఠిరుడు, మనస్సుకు భీముడు, ప్రాణానికి అర్జునుడు, కాళ్ళుచేతులకు నకుల సహదేవులు సంకేతాలు. ఒకరి తరవాత ఇంకొకరు పుట్టటంలో కూడ ఒక అర్థం ఉంది. తల్లి గర్భం నుంచి ముందు బయటకు వచ్చేది బిడ్డతల. అక్కడే బుద్ధి ఉండేది. తరవాత వచ్చేవి కనుబొమలు. వాటిమధ్యనే కేంద్రీకృతమయ్యేది మనస్సు. తరవాత చెవులు, ముక్కు, నోరు బయటకు వస్తాయి. ప్రాణాధారమైన ఊపిరికి అవే ఆలవాలాలు. అక్కడితో మనిషి పుట్టుకకు నాంది జరిగింది. అయితే, ఆ శరీరం పనిచేయటానికి కాళ్ళు చేతులు కావాలి. అవి రెండు రెండుగా ఉండటమే కాకుండా ఒకేలా ఉంటాయి. నకుల సహదేవులు కవలలుగా పుట్టటం కూడా దానికే సంకేతం!

పైన చెప్పినట్లు మనిషి జీవితానికి అవసరమైన సృష్టి కుంతీపుత్రుల రూపంలో జరిగిందని వ్యాసమహర్షి తన మహాభారతకథ ద్వారా మనకు సూచించాడు. భూమిని రక్షించుకోకపోతే భవిష్యత్తులో మనిషి మనుగడకు ప్రమాదం సంభవిస్తుందని అంతా గుర్తించాల్సిన సమయమిది!

Saturday 19 April, 2008

చందమామ కాఫీటేబుల్ బుక్ లేక 60th Year Anniversary Book లేక...

...చందమామ కలెక్టర్స్ ఎడిషన్. చందమామ పత్రిక ప్రచురణ ప్రారంభమై అరవయ్యేళ్ళు పూర్తైన సందర్భంగా చందమామ పాత సంచికల్లోని కథలను పుస్తకాలుగా ప్రచురిస్తామని ప్రచురణకర్తలు ప్రకటించి ఉన్నారు. ఆ పుస్తకాల్లో మొదటిది సిద్ధమైంది. అదే చందమామ కాఫీటేబుల్ బుక్ లేక 60th Year Anniversary Book లేక... ...చందమామ కలెక్టర్స్ ఎడిషన్. ఆ పుస్తకాన్ని అమితాబ్ బచ్చన్ మొన్న ముంబాయిలో ఆవిష్కరించారు. అది నిన్నటి నుంచే మార్కెట్లో లభ్యమౌతోందని ప్రకటించారు. వెల 449 రూపాయలు. చందమామ వెబ్సైటు నుంచి ఇప్పుడే ఆర్డరు చేస్తే 20% డిస్కౌంటు కూడా ఉంది. ఆవిష్కరణోత్సవ విశేషాలు కూడా అక్కడే చదవొచ్చు.

PS: రానారే! ఇప్పుడు నా తల 'సేఫే'నా? ;)

Thursday 27 March, 2008

దుంగల దొంగలకు చందన చర్చ?

కడప జిల్లాలో సిద్ధవటం రేంజిలోని లంకమల అడవులు, పరిసరప్రాంతాల్లో ప్రపంచంలో మరెక్కడా దొరకని అరుదైన ఎర్రచందనం దొరుకుతుంది. (ఇది ప్రధానంగా కడప జిల్లాలోను, జిల్లా సరిహద్దుకవతల నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోను దొరుకుతుంది.) గతవారం నాకు పరిచయమైన ఒక సి.బి.సి.ఐ.డి. అధికారి దగ్గర మాటల సందర్భంలో దీనిగురించి ప్రస్తావిస్తే ఆయన "లంకమల అడవుల్లో గతంలో ఎర్రచందనం చెట్లు ఉండేవి. ఇప్పుడు అవి దాదాపుగా అంతరించిపోయాయి." అని విచారంగా అన్నారు. ఏమయ్యాయి? అని అడగనవసరం లేదు. దుంగల రూపంలో అక్రమంగా సరిహద్దులు దాటాయి. విదేశాల్లో ఎర్రచందనానికి విపరీతమైన గిరాకీ ఉండడం వల్ల గడచిన దశాబ్దకాలంలో ఎర్రచందనం అక్రమ రవాణా విపరీతంగా పెరిగిపోయింది.

కరువు ప్రాంతమైన కడప జిల్లాలో వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు సాపేక్షంగా తక్కువే అని చెప్పాలి. కుటుంబాలను పోషించడానికి పొట్ట చేతబట్టుకుని కువైట్ తదితర గల్ఫ్ దేశాలకు వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఎక్కువ. అంతదూరం వెళ్లలేని వాళ్లలో కొందరికైనా విపరీతమైన గిరాకీ ఉండే ఎర్రచందనం అక్రమరవాణాకు సహకరించడం మన ప్రజారాజ్యంలో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశంగా కనిపించడంలో వింతేమీ లేదు. ఐతే గత్యంతరం లేనివాళ్ళే అక్రమరవాణాకు పాల్పడుతున్నారనుకోవడం అమాయకత్వం. స్థానికంగానూ, పొరుగు జిల్లాల్లోనూ రకరకాల వృత్తులు, వ్యాపారాలు చేసుకునేవాళ్ళు ఇందులో ఉన్నారు. పోలీసుల దాడిలో చిక్కినవారిలో జిల్లాలోని ఒక నగర కౌన్సిలర్, ఒక న్యాయవాది ఉన్నారు. ఒక్కోసారి దాడుల్లో దుంగలతో నిండిన వాహనాలు మాత్రమే పట్టుబడి, స్మగ్లర్లు, వాహనసిబ్బంది తప్పించుకు పారిపోవడంలోని లోగుట్టు అందరికీ ఎరుకే. గత సంవత్సరం సాక్షాత్తూ కడప నగర మేయర్, ముఖ్యమంత్రి బావమరిది ఐన రవీంద్రనాథ రెడ్డి సొంత వాహనాల్లోనే ఈ ఎర్రచందనం దుంగలు అక్రమంగా రవాణా అవుతూ పట్టుబడడం ఎవరూ మరచిపోలేదు.

సిద్ధవటం రేంజిలోని లంకమల్ల అభయారణ్యం (కలివికోడి కోసం ఏర్పడిన శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యం) లో ఎర్రచందనం వృక్షాలు విస్తారంగా ఉన్నాయి. కొన్నేళ్లుగా రోలబోడు, కొండూరు, మద్దూరు, పొన్నాపల్లి బీటులో ఎర్రచందనం దుంగలు అక్రమంగా రవాణా అవుతున్నాయి. ఖాజీపేట, మైదుకూరు, బ్రహ్మంగారిమఠం మండలాల్లోని బోగాదిపల్లె, వెంకటాపురం, భాగ్యనగరం, నాగసానిపల్లె, తూపల్లి, జాండ్లవరం గ్రామాలకు చెందిన కూలీలు లంకమల్లలోని రోలబోడు, బాలయ్యపల్లె బీటులో చందనం వృక్షాలను నరికి దుంగలను విక్రయిస్తారు. కూలీల నుంచి దుంగలను కొనుగోలు చేసిన జాండ్లవరం, జి.వి.సత్రం, ప్రొద్దుటూరులకు చెందిన బడా స్మగ్లర్లు వాటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. ఇది ఒకరకం స్మగ్లింగ్ కాగా కూలీల చేత చెట్లు నరికించి దుంగలను అడవిలోనుంచే నేరుగా వాహనాల్లో తరలించడం మామూలుగా జరుగుతుంటుంది. ఈ వాహనాల రాకపోకల కోసమైతేనేమి, కూలీలకు రాత్రిపూట అడవిజంతువుల నుంచి రక్షణ కోసమైతేనేమి అడవికి అగ్గిపెట్టడం, పనయ్యాక ఆ మంటలను ఆర్పకపోవడం వల్ల అడవంటుకోవడం ఇంకో విషాదం.

ఈ స్మగ్లర్ల వెనుక పెద్ద పెద్ద ముఠాలే ఉన్నాయి. జిల్లాలో ఎర్రచందనాన్ని అక్రమరవాణా చేసే ముఠాలు కనీసం 8 ఉన్నాయని పోలీసులే ప్రకటించారు. అలాంటి ముఠాలలో రెడ్డి నారాయణ ముఠాకు సహకరిస్తున్నందుకు గత అక్టోబరులో ఏకంగా 17 మంది అటవీ అధికారులను, 21 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. ఈ చర్య అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒకేసారి ఇంతమంది అధికారుల సస్పెన్షన్ కు సిఫార్సు చేస్తూ అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న జిల్లా ఎస్పీ వై. నాగిరెడ్డి జిల్లాలో ఉమేష్ చంద్ర తర్వాత గొప్ప ఎస్పీగా నీరాజనాలు అందుకున్నారు. (పదేళ్ల కిందట దేశంలోనే అత్యంత సమస్యాత్మక జిల్లాల్లో రెండోస్థానంలో ఉన్న కడప జిల్లాలో ఫ్యాక్షనిజాన్ని అరికట్టి జిల్లాలో శాంతిభద్రతలు నెలకొల్పిన రియల్ హీరో ఉమేష్ చంద్ర.) మిగతా ముఠాలను, వారికి సహకరిస్తున్న పోలీసు, అటవీ అధికారులను పట్టుకోవడానికి పెద్ద పెద్ద ప్రణాళికలే వేశారు, పెద్ద పెద్ద శపథాలే పలికారు. ఐతే అందుకనుగుణంగా ఆ తర్వాతేమీ జరగలేదు.* ఈ సస్పెన్షన్ కు ముందూ, ఆ తర్వాతా కూడా ప్రతిరోజూ జిల్లా పత్రికల్లో అక్కడ (అక్రమంగా రవాణా అవుతున్న) అన్ని టన్నుల ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు, ఇక్కడ ఇన్ని టన్నుల దుంగలను పట్టుకున్నారు, అని వార్తలు రొటీన్ గా వస్తూనే ఉన్నాయి. ఈ సస్పెన్షన్ విషయంలో నాణానికి రెండోవైపు కూడా ఉంది:

సస్పెండైన అటవీ, పోలీసు ఉద్యోగులు ఇప్పుడు తెగబడి మరింత ఉధృతంగా, బాహాటంగా దుంగల అక్రమ రవాణాకు పాల్పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వారికి లంకమల ఆనుపానులు తెలుసు. అడవుల్లో దారులు తెలుసు. ప్రభుత్వ యంత్రాంగం పరిమితులు తెలుసు. దాని చేతగానితనమూ తెలుసు. అక్రమరవాణా చేయడంలో రకరకాల పద్ధతులు తెలుసు. ఏరకంగా అధికారుల కళ్ళుగప్పవచ్చో తెలుసు. ఈ అక్రమ వ్యాపారంలోకి దిగదలచుకున్న వారికి, వారితో చేతులు కలపదలచుకున్నవారికి, బేరసారాలు ఆడదలచుకున్నవారికి ఇప్పుడు పని మరింత సులభమైంది. 'పని' సులభంగా జరగాలంటే నేరుగా ఎవరిని కలవాలో ఇప్పుడు చిన్నపిల్లలక్కూడా తెలుసు. పైగా ఇప్పుడు ఈ 'అధికారులు' హమేషా హాజరీలో ఉంటారు. ఇంతకుముందు మొక్కుబడిగానో, తప్పనిసరయ్యో ఆఫీసులకు వెళ్ళడం, రిపోర్టు చెయ్యడం, 'పనిలోకి దిగేటప్పుడు' ముందూ వెనుకా చూసుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరమయ్యేవి. ఇప్పుడు అవేవీ అవసరం లేదు కదా? సస్పెండ్ చేసిన రెండువారాలకే సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ అక్రమరవాణా ఇంకా జరుగుతూనే ఉందని, సస్పెండైనవారిలో కొందరు ఫుల్ టైం స్మగ్లర్లుగా మారి సొంత గ్యాంగులు నడిపేలా ఉన్నారని హెచ్చరించారంటే వీళ్ళు అక్రమ రవాణాకు ఎంతగా అలవాటు పడిపోయారో అర్థమౌతుంది. ఐనా కలెక్టర్ వెర్రిగానీ అరకొర చర్యలు తీసుకుంటే ఫలితం అలా కాక ఇంకెలా ఉంటుంది? వాళ్లకు ఆ సస్పెన్షన్ చర్యే ఎండాకాలంలో గంధం పూసినంత హాయిగొలిపి ఉంటుంది. అప్పుడు సస్పెన్షన్ కు సిఫార్సు చేసిన ఎస్పీ నాగిరెడ్డి ఆర్నెల్లు తిరక్కుండానే బదిలీ ఐతే ఇంకెంత హాయిగా ఉంటుంది?
"చందన చర్చిత ..."
-----------------------------------------------------------------------

* ఈ సస్పెన్షన్లైన కొన్నాళ్ళకే హైదరాబాద్‌ నుంచి వచ్చిన ముగ్గురు సీబీసీఐడీ అధికారుల బృందం మైదుకూరు ప్రాంతానికి చెందిన ఓ ప్రముఖ స్మగ్లరు ఇచ్చిన సమాచారం ఆధారంగా జిల్లాలో రహస్యంగా విచారణ జరిపి వెళ్ళింది. కోడూరు ప్రాంతంలో బడా నాయకులతో, అటవీ శాఖలో కొందరు అవినీతి అధికారులతో సంబంధాలున్న బడా స్మగ్లర్ల వివరాలు సేకరించడంతో పాటు అటవీ చెక్‌పోస్టుల సిబ్బంది వ్యవహారశైలిపై ఆరా తీశారు. ఆయా పోలీసుస్టేషన్లకు చెందిన అధికారుల కేసు డ్యూటీ రిజిస్టర్లను పరిశీలించారు. (విధి నిర్వహణలో భాగంగా పోలీసు అధికారులు ఏ కారణంపై, ఏ ప్రాంతాలకు, ఏ మార్గాల ద్వారా జీపులో వెళ్లారో రిజిస్టరులో నమోదు చేస్తారు.) ఎర్రచందనాన్ని తరలించేముందు స్మగ్లర్లు అనుసరించే వ్యూహాలు, వెళ్లే మార్గాలు, ఏఏ వర్గాల ద్వారా ఎలాంటి సహకారం అందుతోంది తదితర అంశాలను ఆ స్మగ్లరు సీబీసీఐడీ అధికారులకు వెల్లడించాడట. ఎర్రచందనం స్మగ్లర్లకు కొందరు పోలీసులు సహకరించారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కేసు డ్యూటీ రిజిస్టరును పరిశీలించడం పోలీసులకు గుబులు పుట్టించింది. కొన్ని చోట్ల ఎర్రచందనం దుంగులను తరలించే వాహనానికి పోలీసులు ముందు వెళుతూ అడ్డంకులు ఎదురుకాకుండా సురక్షితంగా జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వివిధ ప్రాంతాలను సందర్శించే ముసుగులో పోలీసులు స్మగ్లర్లకు సహకరించారా, ఈ వ్యవహారంలో తలదూర్చకుండా తమ విధులు తాము నిర్వహించి వెనుదిరిగారా అనే కోణంలో విచారణ జరిగింది. జిల్లా సరిహద్దుల్లో అటవీ చెక్‌పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇందులో పనిచేసే సిబ్బంది వ్యవహారశైలి, పనితీరు ఎలా ఉన్నాయి? అనే అంశాలపై కూడా ఆరా తీశారు. తర్వాతేమైంది? Business as usual!

Saturday 15 March, 2008

333.3 మీటర్లు అనగా ఆకాశవాణి జానపద కేంద్రం

రాష్ట్రంలోని నాలుగు ప్రధాన రేడియో కేంద్రాల్లో ఒకటైన కడప కేంద్రం మొదటి నుంచీ జానపద కార్యక్రమాల్లో తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూనే ఉంది. జానపద కార్యక్రమాల నిర్వహణలో పలుమార్లు జాతీయ బహుమతులు పొందిన జానపదకార్యక్రమాల ప్రయోక్త ఆరవేటి శ్రీనివాసులు, జానపదగేయాల ఆడియో కేసెట్లలో ట్రెండ్ సెట్టర్, జానపదబ్రహ్మ గా పేరుపొందిన పల్లెపదాల సేకర్త, గాయకుడు కె. మునెయ్య (తెలుగు అకాడెమీ ప్రచురించిన "రాయలసీమ రాగాలు" రచయిత) లాంటి అతిరథ మహారథులతో కడప కేంద్రం నుంచి ప్రసారమయ్యే జానపద కార్యక్రమాలు జాతీయస్థాయిలో గుర్తింపు పొందాయి. ఇప్పుడు వారిద్దరూ లేకపోయినా వారి వారసత్వం ఇంకా కొనసాగుతోందని తెలిసి మా కేంద్రం గురించి నేను గర్వపడుతున్నాను. జానపద లలిత సంగీత వసంతోత్సవం నిర్వహణకు జాతీయస్థాయిలో ఎంపికచేసిన 10 కేంద్రాల్లో* కడప కేంద్రం ఒకటి. ఈనాడులో వచ్చిన వార్త ప్రకారం
ప్రాంతీయ జానపద లలిత సంగీత వసంతోత్సవం లో భాగంగా కడప కళాక్షేత్రంలో వసంతోత్సవాలను శనివారం సాయంత్రం 6.30 గంటలకు జిల్లా కలెక్టరు ఎం.టి.కృష్ణబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తారు. మొదట అర్జున జోగియాత్ర జానపద మహాభారత ఘట్టం నుంచి కన్నడంలో మైసూరు గురురాజు బృందం 30 నిమిషాల ప్రదర్శన ఇస్తారు. ఆకాశవాణి, తిరునల్వేలి మాయాకృష్ణన్‌ బృందం తమిళంలో నయ్యాండి మేళం ప్రదర్శిస్తారు, కడప జిల్లా జానపద గేయాలను పాణ్యం నరసింహులు ఆలపిస్తారు. ఇలా నిర్వహించిన 10 కేంద్రాల కార్యక్రమాలు నెలలోని మొదటి గురువారం రాత్రి 9.30 గంటలకు ఢిల్లీ నుంచి వ్యాఖ్యాన సహితంగా ప్రసారం అవుతాయి.
-------------------------------------------------

* అహమ్మదాబాదు, త్రిచీ, ఢిల్లీ, గౌహతి, జమ్మూ, జలంధర్, జైపూర్, రోహ్తక్, సతారా, కడప.

Wednesday 5 March, 2008

చందమామ - పాఠకాదరణలో సమస్యలు

తెలుగుబ్లాగు గుంపులో "తెలుగువారి అభిమానాన్ని చూరగొన్న చందమామను నెట్‍లో చూస్తూవుంటే ఎంతో ఆనందం కలిగింది. ఆనాడు నాగిరెడ్డి, చక్రపాణి ద్యయం ప్రారంభించిన చందమామ ఈనాటికీ పెద్దలను, పిల్లలను కూడా అలరిస్తోంది." అన్న దూర్వాసుల పద్మనాభం గారి మాటలకు నెటిజెన్ సమాధానం: "మీరన్నట్టు అలరిస్తు ఉన్నట్టయితే అది మూతపడేది కాదు."

అలరించడంలో మొదట్లో లేని సమస్యలు ఇప్పుడు కొన్ని ఉన్నాయి:

1. కంటెంటులో నవ్యత తగ్గిపోవడం: రచనల క్వాలిటీ పరంగా 1950-60 లలో చందమామ ఉచ్ఛస్థితిలో ఉండేది. తర్వాత క్రమంగా పడిపోతూ వచ్చింది. ప్రస్తుతం చందమామలో ఒక జానపద సీరియల్, ఒక పౌరాణిక సీరియల్, జాతక కథ పాత చందమామల్లో వచ్చినవే మళ్ళీ వేస్తున్నారు. నిజానికి ఇదో drawback కాదు. ఎందుకంటే అవి ఈ తరం పిల్లలకు పరిచయం లేనివి కావడం వల్ల మళ్ళీ వెయ్యడంలో తప్పు లేదు. ఐతే అవి కాస్తా పుస్తకాల రూపంలో అందరికీ అందుబాటులోకి వచ్చాక పేజీలు ఎలా నింపుతారనేది వేచి చూడాలి. (గతంలో 64 పేజీలున్న చందమామ ఇప్పుడు 76 పేజీలు ఉంటోంది.) ఇంకో వైపు తెలిసిన కథలనే చందమామలో చదవాలనుకునే నాలాంటి వాళ్ళం కూడా ఉన్నాం. :-) చక్కటి నుడికారంతో అచ్చుతప్పులు అసలుండని చందమామలో తెలిసిన కథలైనా మళ్ళీ మళ్ళీ చదవడం నాకిష్టం. ఇది పాత చందమామ కథల్లోనే సాధ్యం. ప్రస్తుతం చందమామ భాషలో కూడా మార్పు వచ్చింది. ఇతర భాషల నుంచి తెలుగులోకి అనువదించుకోవడం ఎక్కువై, భాషలోని మాధుర్యం చాలా వరకూ తగ్గిపోయింది. అంతేగాక అప్పుడప్పుడూ ఆ అనువాదం కృతకంగా కూడా ఉంటోంది. మరిన్ని వివరాలకు తెవికీలోని చందమామ వ్యాసం చూడండి.

(కంటెంటులో నవ్యత తగ్గిపోవడమనేది నిజానికి ఒక్క చందమామ సమస్యే కాదు. మొత్తమ్మీద భారతదేశంలో బాలసాహిత్యం ప్రపంచ వ్యాప్తంగా బాలసాహిత్యంలో వస్తున్న పోకడలను, అవి తెస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడం లేదు. అందుకే ఈ సమస్య. ఐతే కొత్తదనం కోసం చందమామ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. పిల్లల కోసం పిల్లల చేతే కథలు రాయించి, వాటికి పిల్లల చేతే బొమ్మలు వేయించడం అలాంటి ప్రయత్నాల్లో ఒకటి.)

2. ప్రత్యామ్నాయ విజ్ఞాన, వినోద సాధనాలు ఇప్పుడు లెక్కకు మిక్కిలిగా ఉండడం. చందమామ 1947 జూలైలో మొదలైంది. ప్రైవేటు టీవీ ఛానెళ్ళు 1990లలో మొదలయ్యాయి. తర్వాత పదేళ్లకు కంప్యూటరు (గేమ్సు), ఇంటర్నెట్టు ప్రాచుర్యంలోకి వచ్చాయి. వీటి పోటీని తట్టుకోవడం ఒక పిల్లల పత్రికకు చాలా కష్టం. (చందమామ ఆగిపోయింది ఆ దశలోనే. తర్వాత కొంతకాలానికే మరో పిల్లల పత్రిక బొమ్మరిల్లు కూడా మూతపడింది.) ఐనా ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడంలో చందమామ ఎప్పుడూ వెనుకబడలేదు.

3. పిల్లలను పాఠ్యపుస్తకాలు తప్ప కథల పుస్తకాలు చదివేటట్లు తల్లిదండ్రులు ప్రోత్సహించకపోవడం. (ఒక చిన్న ఉదాహరణ: తమ పిల్లలకు ప్రతివారమూ టీవీలో భాగవతం సీరియల్ చూపించడం కంటే భాగవతం పుస్తకం కొనివ్వడం అన్ని విధాలా మంచిదనే ఆలోచన ఈ కాలపు తల్లిదండ్రుల్లో చాలా మందికి రావడం లేదు. పిల్లల పత్రికలు/పుస్తకాల మీద పెట్టే ప్రతి పైసా వాళ్లకు దండగమారి ఖర్చుగానే అనిపిస్తుంది. వాళ్లలో చాలా మంది ప్రతివారం 10 రూపాయలు పెట్టి వారపత్రిక కొనగలిగే 'స్థితిమంతులే' కానీ నెలకు 10 రూపాయలు పెట్టి పిల్లల పత్రిక కొనడానికి వాళ్లకు చేతులు రావు.)

బ్లాగులకు రిజిస్టర్డ్ ఫ్యాన్!

ఆర్నెల్లుగా బజ్జున్న నా బ్లాగులను ఇక లెమ్మని అదిలించారు పొద్దులో బ్లాగు శీర్షికను దాదాపు ఒంటిచేత్తో నిర్వహిస్తున్న చదువరి. అసలు ఆ అదిలింపు వెనుక పనిచేసిన అదృశ్యహస్తం ఇంకొకరిదిలెండి. ఏమైతేనేం నేను లేవక తప్పలేదు. లేచి చూద్దును కదా రానారె బ్లాగుకు కొందరు రిజిస్టర్డ్ ఫ్యాన్లు, మరికొందరు అఫిషియల్లీ రిజిస్టర్డ్ ఫ్యాన్లు అని తెలిసింది. :-) ఇది ఏమాత్రం కొత్త లేక వింతైన విషయం కాకపోయినప్పటికీ కొత్తగా బ్లాగులు చదువుతున్న/రాస్తున్న వారి సౌకర్యార్థం ఒక తెలుగు బ్లాగుకు రిజిస్టర్డ్ ఫ్యానయ్యే క్రమంలోని సోపానాలను ఇక్కడ వివరిస్తున్నాను. ఇది వివరించే అవకాశం నాకు వదిలిపెట్టిన చావా కిరణ్ కు నెనర్లు. ;-)

1. మీరు తెలుగుబ్లాగు సభ్యులై ఉండాలి.
2. మీకొక సొంత బ్లాగుండాలి.
3. మీ బ్లాగు సైడ్ బార్లో సదరు బ్లాగుకు ఒక లంకె విధిగా ఉండాలి. అప్పుడే మీరు ఆ బ్లాగుకు రిజిస్టర్డ్ ఫ్యానౌతారు. :-)