Thursday 27 April, 2006

ముక్కు యొక్క అందం (లేక) ముక్కందం

నంది తిమ్మన పారిజాతాపహరణంలో సత్యభామ ముక్కును గొప్పగా (అంటే వాడుక భాషలో 'అతిగా' అని విజ్ఞులు అర్థం చేసుకోవాలి) వర్ణించి "ముక్కు తిమ్మన" అని పేరు తెచ్చుకున్నాడట. 'ముక్కు గురించి అంతగా వర్ణించడానికేముంటుందబ్బా?' అని నేను "తెగ బోలెడు చాలా " హాశ్చెర్యపోయానన్నమాట. ముళ్ళపూడి 'రాధాగోపాళం'లో రాధ ముక్కు గురించి రమణగారు రాసింది చదివే వరకూ అలా అంతూ పొంతూ లేకుండానే నా హాశ్చెర్యపోవడం కొనసాగింది. ఇందులో మరీ విచిత్రం (అంటే నా హాశ్చెర్యంలో కాదు, రాధాగోపాళంలో): మనం బ్రమ్హ అని పలుకుతూ బ్రహ్మ అని రాస్తామే, ఆ పేరు గల సృష్టి కర్త ఒక రోజు ఒక అందమైన ముక్కును సృష్టించాలనుకుని మరీ శ్రద్ధగా ఒక ముక్కును సృష్టించాడట. ఆ ముక్కు చుట్టూ దానికి అత్యంత అద్భుతంగా నప్పేటట్లు అంతంత అందమైన నోరూ, కళ్ళూ, చెక్కిళ్ళూ ఇతర అవయవాలూ సృష్టించాడట.

ముఖారవిందం యొక్క అందంలో ముక్కు అంత ముఖ్య పాత్ర పోషిస్తుందని నేను ఆ నాటి వరకూ కలలో కూడా ఊహించలేదు. అసలు ఎవరినైనా మొదటి సారి కలిసినప్పుడు ఆ(డవారి) ముఖంలో ముందుగా నాక్కనిపించేది వాళ్ల కళ్ళు. తర్వాత పెదవులు, నుదురు, చెక్కిళ్ళు, చుబుకం, చివరగా మొహం మొత్తం ఆకారం (అంటే కోలగా ఉందా? లేక గుండ్రంగా ఉందా?...ఇలాంటివన్నమాట). తొలి పరిచయం లోనే ఇవన్నీ కాదు: "అనగనగ రాగం" టైపులో ఒక మనిషిని చూడగా చూడగా నిదానంగా ఇవన్నీ తెలుస్తాయన్నమాట.

అంతే తప్ప దీనికంతకటికీ మధ్యలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా ముక్కనేదొకటుంటుందని నాకెప్పుడూ తట్టనే తట్టదు. భామ ముక్కు గురించి వ్రాసిన తిమ్మన, రాధ ముక్కు గురించి వ్రాసిన రమణ నా గురించి తెలిస్తే నాకేసి చూసే చూపు తలచుకుంటే నా మీద నాకే జాలి కలిగి ఏమిటోగా అనిపిస్తూంటుంది అప్పుడప్పుడూ.

కేవలం కథలూ కావ్యాల్లోనే కాదండోయ్! నిజ జీవితంలో అంటే సమకాలీన చరిత్రలో భారత దేశ సమాజంలో కూడా ముక్కందం పోషించిన పాత్ర సామాన్యమైనదేమీ కాదు. అందాల నటి శ్రీదేవి తన ముక్కుకు ఆపరేషన్ చేయించుకుందట! "మళ్ళీనా? మాకు తెలియకుండానే?!" అని తత్తర పడకండి. ఈ వార్త నాకు చరిత్ర పుటల్లో దొరికింది. అక్కడ (అంటే చరిత్ర పుటల్లో) ఇంకా చాలా విశేషాలున్నాయి లెండి. అవి మనకు అప్రస్తుతం.

"శ్రీదేవి అందం: ముక్కాపరేషన్ కు ముందూ - వెనకా" అనే పేర్లతో గొప్ప గొప్ప పాత్రికేయులూ, వాళ్ళను చూసి చరిత్రకారులూ పరిశోధన చేసేసి పుస్తకాలకు పుస్తకాలే వ్రాసేసి ఉంటారు. అసలు అంత ఘనమైన ముక్కు సదరు ఆపరేషన్ కు ముందు ఆమె ముఖారవిందం మీద ఉండేదో లేదో కూడా నాకు తెలియదు. నేనెప్పుడూ గమనించనే లేదు. ఇప్పుడు మాత్రం ముక్కు ఉందండీ. చాలా స్పష్టంగా, కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అయితే ఆ ముక్కు అలా కాక ఇంకోలా ఉన్నా ఆమె అందానికి వచ్చే లోటేమిటో నాకు అర్థం కాదు - అసలెప్పటికీ!

ఈ మధ్య పాత పాటలు వింటూంటే ఒక పాటలో ఒక ప్రౌఢ - "నా ముక్కు చూడు ముక్కందం చూడు - ముక్కున ఉన్న ముక్కెర చూడు - మ.గ.డా! నే మునుపటి వలెనే లేనా?" అని నిలదీస్తోంది తన మొగుణ్ణి. అది విని నాకు దడ పుట్టింది. ముక్కెర సంగతి దేవుడెరుగు గానీ తన ముక్కందం గురించి రేప్పొద్దున నా (కాబోయే) పెళ్ళాం అంత గట్టిగా నిలదీసి అడిగితే నా గతేం కాను? ఎందుకంటే ఎదుటి మనిషి ముక్కు కాదు కదా నా సొంత ముక్కెలా ఉంటుందో కూడా నాకింతవరకూ తెలీదు!

- త్రివిక్రమ్

Sunday 23 April, 2006

ఇన్ని రాశుల యునికి...

మనం భూమి మీదనుంచి చూసినప్పుడు సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలు భూమి చుట్టూ దాదాపు వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నట్లు కనిపిస్తాయి. ఈ ఊహాజనిత కక్ష్య వెంబడి పన్నెండు నక్షత్రాల గుంపులను గుర్తించారు. ఈ నక్షత్రాల గుంపులు ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకమైన ఆకారంలో కనిపిస్తాయి. ఆ ఆకారాలను బట్టి వాటికి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం అని పేర్లు పెట్టారు. సూర్యుడు ఈ రాశి చక్రాన్ని చుట్టి రావడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది. (నిజానికి ఇది భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం.) అంటే సూర్యుడు ఒక సంవత్సరకాలంలో పన్నెండు రాశుల్ని దాటి మొదటికి వస్తాడన్నమాట. అంటే ఒక్కో నక్షత్ర రాశిలోనూ దాదాపు ఒక్కో నెల ఉంటాడు. ఇది సౌర మానం.


ఇక చంద్రుడు నెల రోజుల్లోపే (ఇంకా చెప్పాలంటే 27-28 రోజుల్లోనే) రాశి చక్రాన్ని చుట్టి వస్తాడు. అంటే భూమి చుట్టూ తిరిగేసి వస్తాడు. ఈ 27 రోజుల స్వల్ప కాలంలో చంద్రుడు ఎప్పుడు ఏ రాశిలో ఉన్నదీ గుర్తించేదెలా? అనేదొక సమస్య. ఈ సమస్యను తీర్చడానికన్నట్లు రాశి చక్రం చుట్టూ తిరిగేటప్పుడు చంద్రుడు ఒక్కో రోజు ఒక్కో నక్షత్రానికి దగ్గరగా వస్తాడు. ఇలాంటి నక్షత్రాలను ఇరవై ఏడింటిని గుర్తించారు. అవి:

అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఘ పుబ్బ(పూర్వ ఫల్గుణి) ఉత్తర(ఉత్తర ఫల్గుణి) హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ఠ శతభిషం పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర రేవతి

చంద్రుడు రాశి చక్రం వెంబడి గల ఈ 27 నక్షత్రాలను ఒక్కసారి చుట్టి వచ్చాడంటే 12 రాశుల రాశి చక్రాన్ని చుట్టి వచ్చినట్లే. ఈ 27 నక్షత్రాల పరిధి 12 రాశులలో పరుచుకుని ఉంటుందన్నమాట. ఒక్కో నక్షత్ర పరిధిని నాలుగు భాగాలు (పాదాలు)గా విభజిస్తే మొత్తం 108 పాదాలవుతాయి. ఈ 108 నక్షత్ర పాదాలు 12 రాశులలో ఉన్నాయని గుర్తుంచుకుంటే ఒక్కో రాశిలో 108/12 = 9 నక్షత్ర పాదాలున్నట్లు సుళువుగా ఊహించవచ్చు. ఆ విభజన ఇలా ఉంటుంది (మొత్తం అంటే '4 పాదాలు' అని అర్థం చేసుకోవాలి):

మేషం: అశ్విని మొత్తం, భరణి మొత్తం, కృత్తిక 1వ పాదం

వృషభం: కృత్తిక 2వ, 3వ, 4వ పాదాలు, రోహిణి మొత్తం, మృగశిర 1వ, 2వ పాదాలు

మిథునం: మృగశిర 3వ , 4వ పాదాలు, ఆర్ద్ర మొత్తం, పునర్వసు 1వ, 2వ ,3వ పాదాలు

కర్కాటకం: పునర్వసు4వ పాదం, పుష్యమి మొత్తం, ఆశ్లేష మొత్తం

సింహం: మఘ మొత్తం, పుబ్బ(పూర్వ ఫల్గుణి)మొత్తం, ఉత్తర(ఉత్తర ఫల్గుణి)1వ పాదం

కన్య: ఉత్తర(ఉత్తర ఫల్గుణి) 2వ,3వ,4వ పాదాలు, హస్త మొత్తం, చిత్త 1వ,2వ పాదాలు

తుల: చిత్త 3వ,4వ పాదాలు, స్వాతి మొత్తం, విశాఖ 1వ, 2వ, 3వ పాదాలు

వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ మొత్తం, జ్యేష్ఠ మొత్తం

ధనుస్సు: మూల మొత్తం, పూర్వాషాఢ మొత్తం, ఉత్తరాషాఢ 1వ పాదం

మకరం: ఉత్తరాషాఢ 2వ,3వ,4వ పాదాలు, శ్రవణం మొత్తం, ధనిష్ఠ 1వ,2వ పాదాలు

కుంభం: ధనిష్ఠ 3వ,4వ పాదాలు, శతభిషం మొత్తం, పూర్వాభాద్ర 1వ, 2వ, 3వ పాదాలు

మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర మొత్తం, రేవతి మొత్తం.

ఇది చాంద్ర మానం.

Saturday 22 April, 2006

నాలుగు బై మూడు

చిన్నప్పట్నుంచి, రామాయణంలో నాకు సరిగా అర్థం కానిదొకటుంది. దశరథుడి పట్టమహిషి కౌసల్య, ముద్దుల భార్య కైకేయి కాగా ఇలాంటి ప్రత్యేక హోదాలేమీ లేని మామూలు రాణి సుమిత్ర. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసినపుడు అగ్నిదేవుడిచ్చిన పాయసాన్ని లెక్కప్రకారమైతే మూడు భాగాలే చేయాలి - ఉన్నది ముగ్గురు రాణులే కాబట్టి. కానీ దశరథుడు ఆ పాయసాన్ని రాణుల మధ్య పంచిన తీరు చూస్తే ఎవరికైనా నవ్వు వస్తుంది. అంతే కాదు, దశరథుడు పూర్తిగా ముసలివాడైపోయాడనీ, అందుకే ఆ పంచడం కూడా అంతా అవకతవకగా చేశాడనీ కూడా అనిపిస్తుంది. ఆ వ్యవహారం ఎంత గందరగోళంగా జరిగిందో చూడండి:

ఉన్నది ముగ్గురు రాణులైతే, పాయసాన్ని ముందుగా రెండు భాగాలు చేశాడు. సరే, బాగానే ఉంది, ఒక భాగాన్ని కౌసల్యకిస్తాడు పట్టపు రాణి కాబట్టి. ఇదీ బాగానే ఉంది.
మిగిలిన సగాన్ని ఏం చేశాడయ్యా అంటే మళ్ళీ రెండు భాగాలు చేశాడు. ఆ రెండు భాగాల్ని సుమిత్రకూ, కైకేయికీ ఇవ్వాలా? ఊహూ, ఒక సగాన్ని అలాగే ఉంచి ఇంకో సగాన్ని వారిలో ఒకరికి ఇచ్చాడు. ఆ ఒక్కరూ ఎవరూ? లెక్క ప్రకారమైతే కైకేయి కావాలి - ముద్దుల భార్య కాబట్టి. కానీ ఆమెకివ్వలేదు - సుమిత్రకిచ్చాడు. ఎందుకనేది నాకు ఈ నాటికీ అర్థం కాలేదు. పోనీ ఆ మిగిలిన సగాన్నైనా కైకేయికివ్వొచ్చు కదా? ఊహూ... దాన్ని మళ్ళీ సగం చేశాడు. చేసి, సుమిత్రకూ, కైకేయికీ ఇచ్చాడు. సుమిత్రకు ఇంతకు ముందే ఇచ్చిన మాట మరిచి పోయాడా లేక కౌసల్యకే మళ్ళీ ఇవ్వబోయి సుమిత్రకిచ్చాడా? ఇది నా ఊహకు అందడం లేదు. ఇది ఇంకోలా జరిగి ఉంటుందా అని సరదాగా ఆలోచిస్తే నాకిలా అనిపించింది:

దశరథుడు పాయసం మొత్తాన్ని రెండే భాగాలు చేసి కౌసల్యకు, కైకేయికి ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. అయితే సుమిత్రకు ఇవ్వకుండా తామే తినడానికి మనసొప్పక వాళ్ళిద్దరూ తమ భాగంలో నుంచి కొంత భాగాన్ని సుమిత్రకిచ్చారు. అలా ఆమె రెండు భాగాలు పొందడం వల్ల ఇద్దరు పిల్లలు పుట్టారు.

అయితే, ఈ రహస్యం వాల్మీకి మహర్షికి తెలియలేదు. ఏం జరిగిఉంటుందా అని అలోచించి, సవతులు అంత సఖ్యంగా ఉంటారని అనుకోక పోవడం వల్ల ఆయనకు తోచిన విధంగా కథ అల్లి మనకు చెప్పి ఉంటాడు.

Friday 21 April, 2006

'Texting' time

(From The Hindu archives)

"My summr hols wr CWOT. B4, we usd 2 go 2 NY 2C my bro, his GF & thr 3 :-O kds FTF. ILNY, it's a gr8 plc."

CAN'T MAKE sense out of it? Worry not. It is not pure English, nor is it French or German or Italian — it is something called SMS language, or more popularly, `texting' language.

The sentence was written recently by a 13-year old girl, when she was asked to submit an essay by her school teacher, in a secondary school in Scotland.

The teacher was puzzled and was quoted saying, "The page was riddled with hieroglyphics, many of which I simply could not understand."

The essay when `translated' into real English, read: "My summer holidays were a complete waste of time. Before, we used to go to New York to see my brother, his girlfriend and their three screaming kids face-to-face. I love New York, it's a great place."

This incident set off a spark among educationists who came down heavily on the trend over the past two decades, of declining standards of written language — something that is clearly reflected in text message shorthand.

According to a psychologist quoted by The Times, London, "Kids today don't write letters. Sitting down to type or write an essay is very difficult for them. They revert to what they feel comfortable with — `texting is attractive and uncomplicated'.

Or as the Parent -Teacher Council in the Scottish town, which triggered the current alarm, put it, "Pupils think orally and write phonetically."

Immediately after this news story broke, BBC's Online service came up with the cheeky idea of asking surfers to `SMSize' classic English quotations.

Responses included:

"2b or not 2b that's ?" or even more mathematically as: "2b/-2b=?"
(From Shakespeare's "Hamlet": To be or not to be, that is the question),

"0.5a leag 0.5a leag, 0.5a leag onwrd In2 T valy o Dth Rd T 600a.." (Tennyson's "Charge of the Light Brigade": Half a league, half a league, Half a league onward, Into the valley of death Rode the six hundred"),

"LEmntry, my dEr Wtson"
(Arthur Conan Doyle's Sherlock Holmes stories: "Elementary, My dear Watson").

The `texting' lingo began with picture symbols: `emoticons' and `smileys', before pervading the English language. The earliest `texting' words were: gr8 (for great), tc (for take care), b4 (for before) and the rest. Speed is the keyword in texting lingo — the faster you are, the better it is.

A.VISHNU



© Copyright 2000 - 2006 The Hindu

Sunday 16 April, 2006

కృష్ణ లీలలు

కృష్ణతత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం ఎవరి వల్లా అయే పని కాదు. ఒక్కొక్కరికి ఒక్కో సందర్భంలో ఒక్కో విధం గా గోచరిస్తూ ఉంటుంది. "యదా యదాహి ధర్మస్య..." అన్న నోటితోనే చివరాఖరి మాటగా "సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజః..." (18 వ అధ్యాయం 66 వ శ్లోకం) అనడం మామూలుగా చూస్తే ధర్మగ్లానికి దన్నుగా నిలిచినట్లే అనిపిస్తుంది. కానీ ఇక్కడ సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే విధి నిర్వహణలో పుత్ర ధర్మం, భ్రాతృ ధర్మం, స్నేహ ధర్మం, శిష్య ధర్మం, మొ. వాటిని వదిలేసి నడచుకోమని కదా అర్థం?

అలాగే గోపిక లను జీవాత్మలుగానూ, వారి కుటుంబాలతో వారికి గల అనుబంధాలను ఆత్మకు జీవుడితో గల బంధాలు గానూ, వారికి కృష్ణుడి పై గల ప్రేమను జీవాత్మ (భవబంధాలను వదిలించుకుని) పరమాత్మలో లీనం కావడానికి చేసే ప్రయత్నంగానూ అనుకుంటే అబ్బురమనిపిస్తుంది. కృష్ణుడు గీతాబోధ చేసినప్పుడు గురువులకే గురువై, జ్ఞాన బోధ చేసిన బ్రాహ్మణుడైనాడు. బాణాసురుడి లాంటి వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు క్షాత్ర తేజంతో వెలిగాడు. వైశ్యులు చేయదగిన రాయబారం తాను వహించి వైశ్యుడైనాడు. చివరికి బావ బండి (రథం) తోలి పెట్టి శూద్ర ధర్మమూ పాటించాడు. ఎందుకు? ఏ ధర్మమూ (విధి నిర్వహణ) తక్కువది కాదు. అని చెప్పడానికి... కాదు కాదు చేసి చూపడానికి.

లీలామానుష విగ్రహుడైన ఆయన "ఎంతవారలైనా అనువుగాని చోట అధికులమనరాదు" అని మనకు చెప్పడానికే కొన్ని కొన్ని సందర్భాలలో పైకి అమాయకంగానూ, పిరికిగానూ కనిపించినట్లనిపిస్తుంది. తాను పుట్టిన కొన్ని నిమిషాల్లోపే యమునా నదిని చీల్చి దారి చేసుకున్న వాడు అంతకు కాసేపటి క్రితమే చిద్విలాసంగా చూస్తూ తన సమక్షంలోనే వసుదేవుడి చేత గాడిద కాళ్ళెందుకుపట్టించాడు? వసుదేవుడి ఉదంతమూ, జరాసంధుడి ఉదంతమూ అనువుగాని చోట అధికులమనరాదు అని మనకు చెప్పడానికే తప్ప ఆయన వల్ల కాక కాదు - అని నా అభిప్రాయం. ఇక ఈ బ్లాగులో మొదటి పోస్టెందుకలా వ్రాశానంటారా?

తన భక్తుల చేత అప్పుడప్పుడూ నిందలు పడడం కూడా ఆయనకు వినోదమే అనిపిస్తుంది. "ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు?" అని తిట్టినప్పుడు రాముడి రూపంలో ముసి ముసి నవ్వులు ఒలకబోసిందీ ఆయనే. ఇక ఆయన చేసిన పనుల్లో మామూలుగా అర్థం కానివి, అయోమయంగా అనిపించేవి అక్కడ వ్రాశాను. పాండవుల చేత అధర్మ యుద్ధం చేయించడము, కర్ణుడి విషయంలో అన్యాయంగా ప్రవర్తించడము ఇప్పటికీ నాకు అర్థం కాని విషయాలే.

P.S.: And the best thing about our epics is that they are open to a thousand interpretations.

Wednesday 12 April, 2006

మొల్ల

1. 2-4-2006 న వార్త దినపత్రిక ఆదివారం అనుబంధంలో ద్వా.నా.శాస్త్రి వ్రాసిన ఆర్టికల్ ఇది:

"ఘనమగు సంస్కృతము జెప్పగా రుచియగునే" అని సంస్కృతాధిపత్యాన్ని నిరసించిన కవయిత్రి మొల్ల.
"కందువ మాటల సామెతలందముగా గూర్చి చెప్ప నది తెలుగునకుం
పొందై రుచియై వీనుల విందై" ఉంటుందని తెలుగు భాషాఅభిమానాన్ని ప్రకటించిన కవయిత్రి మొల్ల.
"గూఢ శబ్దములను గూర్చిన కావ్యమ్ము మూగచెవిటి వారి ముచ్చటగును" అంటూ తెలుగు కవిత్వానికి సారళ్య అవసరాన్ని నొక్కి చెప్పిన కవయిత్రి మొల్ల.
"శ్రీకంఠ మల్లీశు వరము చేత నెఱి కవిత్వంబు చెప్పగా నేర్చుకొంటి" అంటూ భక్తికి పట్టం కట్టిన కవయిత్రి ఆమె.
"తప్పులెంచకుడు కవుల్" అనగల వినయ సంపద గల కవయిత్రి ఆమె.
వాల్మీకి రామాయణాన్ని కథాప్రధానంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పినట్లు గానే వ్రాసిన కవయిత్రి మొల్ల.
మొల్ల కడప జిల్లా గోపవరం గ్రామం లో జన్మించినట్లుగా చాల మంది నిర్ణయించారు.
నెల్లూరు దగ్గర గోపవరం ఉన్నా గానీ అక్కడ శ్రీకంఠ మల్లేశ్వరస్వామి ఆలయం లేదు. మొల్ల తాను శ్రీ కంఠ మల్లేశ్వరుని వరం చేతనే కవిత్వం నేర్చుకున్నానని స్వయంగా చెప్పింది. శ్రీరామాలయమూ గోపవరంలోనే ఉంది. తరతరాలుగా జనం చెప్పుకునే మొల్ల బండ ఉంది. గ్రామస్థులు ఈ బండకు పూజ చేయడం ఉంది. శ్రీ కృష్ణదేవరాయలు గోపవరం లో బస చేసినట్లుగా స్థానికులు చెప్పుకొంటూ ఉంటారు. మొల్ల పూర్వీకులు ఆత్మకూరుకు చెంది ఉంటారనీ, అందుకే ఆతుకూరు ఇంటిపేరు అయిందనీ కొందరి అభిప్రాయం. కుమ్మరి కులానికి చెంధిన మొల్ల ఈ ప్రాంతానికి చెందినదనడానికి గోపవరం దగ్గర కుమ్మరి కులాలవారూ ఉనారు. మొల్ల నివసిచిన ఇల్లుగా గోపవరంలో పాడుబడిన ఇల్లు ఉంది. పెద్దన కూడా గోపవరం వచ్చినట్లుగా కొందరు వృద్ధుల కథనం.


ఇంత చారిత్రక ప్రాధాన్యం గల గోపవరం లో శ్రీకంఠమల్లేశ్వరుని దేవాలయం జీర్ణావస్థలో ఉంది. విగ్రహం ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ, దుమ్ములో ఉంది. ఈ దేవాలయాన్ని పునరుద్ధరించాలి. రామాలయంలోని విగ్రహాలను ఎవరో ఎత్తుకుపోయారు. రాముని పటం మాత్రమే ఉంది."మొల్ల బండ"కు పరిరక్షణ లేదు. ఇటీవల మొల్ల జయంతి సందర్భంగా గోపవరంలో మొల్ల విగ్రహావిష్కరణ జరిగింది.దానికి మూల కారకులు విద్వాన్ గానుగపెంట హనుమంత హనుమంత రావు గారు.ఈయన కృషి వల్లనే మొల్ల సాహితీ పీఠం స్థాపించ బడింది. శాలివాహన సంఘం మొల్ల కవితా వ్యాప్తికి నడుం బిగించింది. గానుగపెంట హనుమంత హనుమంత రావు గారు మొల్ల పై చిన్న పుస్తకం కూడా వ్రాశారు.

అయితే మొల్ల కు తగిన న్యాయం లభించిందా? అన్నది ప్రశ్న. ట్యాంక్ బండ్ పై మొల్ల విగ్రహం ప్రతిష్ఠించడమొక్కటే చెప్పుకోదగినది. మొల్ల రామాయణం 1917 లో వావిళ్ళ వెంకటేశ్వర్లు గారు అచ్చు వేశారు.కందుకూరి కవుల చరిత్ర వ్రాసే నాటికి మొల్ల రామాయణం అసలు ప్రతి దొరకలేదేమో ? కానీ ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం లో మొల్ల గురించి టూకీ గా మాత్రమే వ్రాశారు. అంటే సమగ్ర విశ్లేషణ చేయదగ్గ కవయిత్రిగా భావించలేదన్న మాట. మొల్లకు న్యాయం జరగాలంటే గోపవరమ్ లో శ్రీకంఠమల్లేశ్వరుని దేవాలయాన్ని పునరుద్ధరించాలి.రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన చేయడం, మొల్ల బండకు ప్రాధాన్యమిచ్చి కాపాడడం తక్షణం చేపట్టాలి.గోపవరం మండలాన్ని మొల్ల మండలంగా మార్చాలన్న వినతిని కడప జిల్లా పరిషత్ చేర్మన్ అంగీకరించారు.రాజకీయ నాయకుల, పురుషుల పేర్లతో జిల్లాలు, వీధులు ఉంటాయి.స్త్రీల పేర్లతో ఎందుకుండవో అర్థం కాదు.గోపవరాన్ని మొల్ల మండలంగా మారిస్తే అదొక చారిత్రక ఘటన అవుతుంది. తెలుగు విశ్వ విద్యాలయం మొల్ల రామాయణాన్ని వ్యాఖ్యానంతో ముద్రించడం అవసరం. రాయలసీమ అంటే బాంబుల సీమ కాదు ముఠాకకషలకు పుట్టినిల్లు కాదు.అని ఈ తరానికి, రాబోయే తరాలకు చెప్పవలసి ఉంది. మొల్ల, అన్నమయ్య, తిమ్మక్క, వేమన, పోతులూరి వంటి ఎందరో మహానుభావులు జన్మించిన నేలగా, బ్రౌన్ నడయాడిన నేలగా, విస్తృతంగా ప్రచారం చేయవలసి ఉంది. మన సాహితీ అవశేషాలను భద్రపరచవలసి ఉంది. గోపవరాన్ని చారిత్రక పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయవలసి ఉంది.

2. 13-3-2006 న ఈనాడు కడపలో వచ్చిన వార్త~:

మొల్ల ఊరు..మరచి పోయారు


అనాదరణకు గురవుతున్న పెద్ద గోపవరం
నేడు జయంతి

శ్రీకృష్ణాదేవరాయల కొలువులోని హాస్యకవి తెనాలి రామలింగనికి సమకాలీనురాలుగా భావిస్తున్న రచయిత్రి మొల్ల తెలుగు రామాయణంతో చరిత్రలో సుస్థిర స్థానం పొందింది. ఆమె పాద ముద్రికలు బద్వేలు మండలం పెద్దగోపవరంలో నిలచి ఆ ఘనతను చాటుతున్నాయి. ఆమె జ్ఞాపికలను పదికాలాల పాటు నిలిపే ప్రయత్నం మాత్రం జరగడం జరగడం లేదు.

వాల్మీకి రామాయణానికి తెలుగు వన్నెలద్దిన మహిళా కవితామూర్తి మొల్ల నేటికీ స్మరణీయురాలే.కానీ తెలుగు జాతికి ఖ్యాతి తెచ్చిన ఆమె నివాసగ్రామమైన బద్వేలు నియోజకవర్గంలోని పెద్దగోపవరం మాత్రం నిరాదరణకు గురవుతోంది. చారిత్రక ప్రాధాన్యమున్న ఈ ప్రాంతాన్ని అటు పురావస్తు శాఖ అధికారులు గానీ, ఇటు పర్యాట శాఖ అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. ఆదికవి వాల్మీకి 24 వేల శ్లోకాల్లో రచించిన రామాయణాన్ని ఆమె తేట తెలుగులో 871 పద్యాలతో కావ్యంగా రచించి చెరగని ముద్ర వేసుకొంది. ఆ మహాయజ్ఞాన్ని ఆమె అయిదు రోజుల్లో పూర్తి చేసినట్లు దక్షిణ హిందూ స్థానపు కవుల చరిత్రలో కావలి వెంకటరామస్వామి పేర్కొని ఆమె ఘనతను కొనియాడారు. గుర్తుగా ఆమె కూర్చొని కవిత్వం రాసిన బండ మాత్రం ఏటా పండుగల సందర్భంగా పూజలను అందుకొంటోంది. ఈమె ఆరధ్య దైవమైన శ్రీకంఠ మల్లేశ్వరస్వామి ఆలయం నేచదరమైంది. ఆమె పూజించిన శివలింగం కాలగర్భంలో కలసి పోగా పానుమట్టం మాత్రమే మిగిలింది. వినాయకుడు, తదితర దేవతామూర్తి విగ్రహాలకూ ఇదే దుస్థితి పట్టింది.

శివకేశవుల బేధం ఉన్న రోజుల్లో ఇద్డరూ ఒకటేనని సమాజానికి చాటిచెప్పిన మహనీయురాలు ఆమె. రాముడిని, వేణుగోపాలుడ్నీ, శ్రీకంఠమల్లేశ్వరుడినీ ఆరాధించి ఆధ్యాత్మికంలో ఉన్న గొప్పదనాన్ని చాటింది. ఈ ఆలయాలు ఇప్పటికీ ఆమె జ్ఞాపికలుగా గ్రామంలో నిలిచాయి.

మొల్ల మాండలికాలపై సాహిత్య శోధనలు చేయాలి
మొల్ల తాను రచించిన రామాయణంలో గోపవరం ప్రాంత ప్రజలు మాట్లాడుకొనే పదాలనే కవిత్వంలో వాడిందని, వీటిపై సాహిత్య పరిశోధనలు జరిపించాలనికవయిత్రి మొల్ల సాహిత్య పీఠం గౌరవాధ్యక్షులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఏటా మార్చి 13న ఆమె జయంతిని జరుపుతున్నామని తెలిపారు. మొల్ల నివసించిన ఇంటిని స్మారక మందిరంగా మార్చాలని కోరారు.18,19 శతాబ్దాలలో కందుకూరి వీరేశలింగం పంతులు, బద్వేలుకు చెందిన ఆధునిక కవులు జంగా నరసింహశాస్త్రి, జనమంచి శేషాద్రి శర్మ, యాదాటి నరసింహశర్మ తదితరులు మొల్ల రామాయణం గూర్చి చర్చించారని తెలిపారు.

Monday 10 April, 2006

తెలుగుకు పట్టిన తెగులు

ఏది తెలుగు? ఏది కాదు?
ఓ మహాత్మా! ఓ మహర్షీ!!


తెలుగు పద సంపద పెరగాలి. కొత్త పదాలు పరభాషల్నుంచి వచ్చినా అభ్యంతరం లేదు కానీ మనం విపరీతంగా వాడే పరభాషా పదాలు తెలుగును పరిపుష్టం చేసే మాట అటుంచి ఉన్న తెలుగు పదాల్నే మింగేస్తూంటే భాష అభివృద్ధి చెందేదెలా?
'చీటికి మాటికి ఏమిటీ గోల?' అని చిరాకు పడే వాళ్ళు దయచేసి ప్రసిద్ధ రచయిత, అనువాదకుడు అయిన డా.ఉప్పల లక్ష్మణరావు వ్రాసిన ఈ కథ చదవండి~:

స్పోకెన్ టెలుగులో చిల్డ్రెన్ కి ఎ షార్ట్ స్టోరీ


ఒకానొకప్పుడు - అనగా వన్స్ అపానె టైమ్ ఇన్ ది వోల్డెన్ డేస్ - ఒక పేద ముసలివాడు - తెలుగులో చెప్పాలంటే - యె పూర్ వోల్డుమాన్ - జీవించుతూ ఉండే వాడు. వాడు ముసలివాడవడం చేతనూ, అండ్ దట్ టూ పూర్ మాన్ అవడం చేతనూ వాడికి యీ లోకంలో నూకలు చెల్లి పోయాయి - అనగా సింపుల్ తెలుగులో ఎక్స్ ప్లెయిన్ చెయ్యాలంటే - వాడు డెత్ బెడ్ మీద లై అయివున్నాడు. ఆ వోల్డు అండ్ పూర్ మాన్ కి టూ సన్స్ అండ్ వన్ డాటరూ ఉన్నారు. పెద్ద సన్నుకి ఫార్టీ యియర్సూ, చిన్న సన్ను కి ట్వెంటీ యియర్స్.

వన్ డాటర్ యొక్క యేజి ముప్ఫై - అనగా సింపుల్ టెలుగూలో థర్టీ యియర్సు. డాటర్ కి యుక్త వయస్సు రాక ముందే, సంతానం కలగక పూర్వమే వైధవ్యం సంప్రాప్తించింది - టు పుట్ ఇట్ ఇన్ స్పోకెన్ టెలుగూ - షి బికేమ్ యె చైల్డు విడో విథౌట్ చిల్డ్రన్ ఆరె హస్బెండు. అందుచేత ఆ యంగు విడో తండ్రి పంచన చేరింది - అనగా చక్కని తెలుగులో చెప్పాలంటే ఆమె ఫాదర్ పైనే యెంటైర్ గా డిపెండై, ఫాదర్స్ హౌస్ లోనే లివ్ చేస్తూ లైఫ్ ఈక్ ఔట్ చేస్తూ ఉండేది.ఆ ఓల్డ్ అండ్ పూర్ మాన్ కి డెత్తు వెరీ నియరై, టుడే ఆర్ టుమారో అన్నట్టుండడమ్ చేత తన టూ సన్స్ అండ్ వన్ డాటర్ ని తన డెత్ బెడ్డు దగ్గరికి రమ్మని వర్తమానమంపించెను - అనగా ఇన్ టెలుగూ~: బెడ్ సైడ్ కి రావలసిందిగా వర్డు పంపించాడు - అదే ఇడియమాటిక్ టెలుగూలో చెప్పాలంటే ఆర్డరు చేశాడు. వాళ్ళు డెత్తు బెడ్డుని సమీపించిన అనంతరం - అనగా మన వాడుక భాషలో అప్రోచి అయిన తర్వాత, తన చిల్డ్రెను కి ఈ విధంగా ఇన్ ఫారం చేశాడు~:

"నేను పూర్ మాన్ని. నాకు ఏ కైండాఫ్ ఆస్థిపాస్థులూ లేవు. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే నేను ప్రాపర్టీలెస్ ఫకీర్ని. నాకున్న చరాస్థి అంతా - అనగా మన టెలుగూ లో మై మూవబుల్ ప్రాపర్టీ యావత్తూ - ఓన్లీ పద్ధెనిమిది గోవులు మాత్రమే - అనగా సులభశైలి టెలుగూ లో యెయ్ టీన్ కౌసు మాత్రమే. ఈ యెయ్ టీన్ కౌస్ లోనూవన్ కవ్ ని నా లాస్ట్ మోమెంట్సు లో సింగినాథపు సింగయ్య సిద్ధాంతి గారికి గోదానం నా చేత ఆఫర్ చేయించండి. నేను ఆ వన్ కౌ టెయిలు పట్టుకుని రివర్ వైతరిణిని క్రాస్ చేసి హెవెన్ రీచయి శాశ్వత ఇంద్ర భోగం అనుభవిస్తాను - ఇన్ సింపుల్ టెలుగూలో పెర్మనెంట్ గా పారడైజులో ఫర్ యెవ్వర్ గా లివ్ చేస్తాను. ఇక రిమెయినింగ్ సెవెన్ టీన్ ఆవులని మీ త్రీ మధ్యా పంచుకోంఢి - అనగా చేస్ట్ టెలుగూ లో చెప్పాలంటే - డివైడ్ చేసుకోంఢి. ఎల్డెర్ సన్నుకి జేష్ఠ భాగం న్యాయం కనుక - అనగా వ్యావహారిక టెలుగూలో చెప్పాలంటే జస్ట్ అండ్ ఫెయిర్ కాబట్టి - సెవెన్టీన్ గోవుల్లోనూ సంగోరు భాగం - అనగా టెలుగూలో చెప్పాలంటే సెవెన్ టీన్ కౌసులోనూ హాఫ్ ది నంబరు పెద్ద సన్నుకీ, చిన్న సన్ కి సెవెన్ టీను కౌసులోనూ మూడింట ఒక పాలూ - అదే ఈజీ టెలుగూలో చెప్పాలంటే వన్ థర్డూ - ఇహ తలచెడ్డ గొడ్డు ముండకి - అనగా క్లీన్ షేవెన్ మరియూ చైల్డ్ లెస్ మరియూ హస్బెండ్ లెస్ విడోకి - మీకూ, మీ వైఫ్ లకీ మీ చిల్డ్రెన్ లకీ సేవ చేసేంహుకు గానూ - అనగా శిష్ఠ వ్యవహారిక టెలుగూలో చెప్పాలంటే - డెయ్ లీ కుక్ చేసీ, యుటెన్సిల్స్ క్లీన్ చేసీ, హౌస్ వాష్ చేసే ఇత్యాది డాంకీ వర్కు చేసేందుకు గానూ - దానికి తొమ్మిదింట ఒక భాగమూ, అనగా సింపుల్ టెలుగూలో ఎక్స్ ప్రెస్ చేసి చెప్పాలంటే కౌస్ నంబర్ లో వన్ నైన్తూ - వచ్చేటట్టు కౌస్ ని డివైడ్ చేసుకుని హాపీగా లివ్ చేయండి. ఇహ వెళ్ళి - అనగా గో అండు ఫెచ్ సిద్ధాంతి గార్నీ!"

సిద్ధాంతి గారు వచ్చి గోదానం పట్టిన తర్వాత - అనగా కౌని డెత్ గిఫ్టుగా రిసీవ్ చేసుకున్న తర్వాత - ఆ వోల్డ్ అండు పూర్ మాను శాశ్వతంగా కన్ను మూశాడు - అనగా వాడుక భాషలో చెప్పాలంటే డైడ్ అయిపోయాఅడు. పిత్రు వాక్య పాలనకై - అనగా యీజీ టెలుగూ లాంగ్వేజీలో - ఫాదర్స్ లాస్ట్ విషెస్ కి రెస్పెక్ట్ ఇవ్వడానికని - వాళ్ళు టూ బ్రదర్సూ అన్డ్ వన్ విడోడ్ సిష్టరూ - మల్లగుల్లాలు పడ్డం మొదలుపెట్టారు. వాళ్ళలో వాళ్ళకి డివిజన్ ఆఫ్ ది కౌస్ తెగక తగాదాలు పడుతూండగా - అనగా ఫైట్ చేస్తూండగా, సిద్ధాంతి గారు తన వన్ కౌనీ సేల్ చెయ్యడానికని వెళ్తూ ఆ తోబుట్టువులకి - అనగా టూ బ్రదర్స్ అండ్ వన్ సిష్టరుకి ఎదురు పడ్డాడు. ఆ టూ బ్రదర్స్ అండ్ వన్ సిష్టరూ ఆ సిద్ధాంతి గార్ని ఇలా అర్థించారు - అనగా తెలుగులో చెప్పాలంటే రిక్వెస్టు చేశారు.

"మేము మా గోవుల్ని విభజిచుకోలేకుండా వున్నాం - అనగా కరెక్టుగా డివైడ్ చేసుకోలేకుండా వున్నాం. దయుంచి మాకు సహాయమొనరించ ప్రార్థన - అనగా స్పోకెన్ టెలుగూలో చెప్పాలంటే - ప్లీజ్ మాకు హెల్ప్ చేయవలసింద"ని అతనిని బెగ్ చేశారు.

సిద్ధాంతి గణిత శాస్త్రజ్ఞుడు- -అనగా స్వచ్ఛమైన టెలుగూలో చెప్పాలంటే అతడు మాథమెటీషియను - కాబట్టి నిమేష మాత్రం దీర్ఙ్హాలోచనాపరుడై - ఇన్ ఈజీ టెలుగులో చెప్పాలంటే - ఫైవ్ మినిట్స్ పాటు థింక్ చేసి ఇలా అన్నాడు~:

గతించిన మీ తండ్రి గారు మిమ్మల్ని ముగ్గురినీ మూడు చెరువుల నీళ్ళు త్రాగించి ముప్పు తిప్పలు పెట్టారన్న మాట నిజం.అనగా చక్కని టెలుగూ నానుడిలో ఆనొటేట్ చెయ్యాలంటే - మీ ఫాదర్ మీ త్రీ పీపుల్ నీ ...త్రీ టాంకు వాటర్సూ తాగించి మిమ్మల్ని ట్రబుల్స్ లో పెట్టాడనడం నిజమే అంటే ఇటీజ్ ట్రూ. నేను మీకు సహాయం చేస్తాను - అనగా నేను మీకు హెల్ప్ చేస్తానుకానీ నా వద్ద ఒక ఏకైక గోవు మాత్రమే కలదు - అనగా మీకు అర్థమయేటట్లుఆర్డినరీ వాడుక భాషలో చెప్పాలంటే నాకు వోన్లీ వన్ కౌ మాత్రమే ఉన్నది.ఐనప్పటికీ ఆ వన్ కౌనీ మీ పదిహేడు ఆవులతోనూ కలుపుకునీ - అనగా సింపుల్ టెలుగూలో మీకర్థమయేటట్టు చెప్పాలంటే మీ సెవెన్టీన్ కౌస్ కీ నా కౌ యాడ్ చేసిమీ జనకుడి ఆజ్ఞను పాలించి ఆస్తి విభజించుకోండి అనగా సింపిల్ అండ్ ఈజీ టెలుగూలో చెప్పాలంటే - మీ ఫాదర్ గారి విషెస్ ప్రకారం మీ కౌస్ ని డివైడ్ చేసుకుని యేదైనా గోవు శేషించిన యెడల దానిని నాకు తిగి ఇచ్చి వేయండి" అన్నాడు - అనగా వాడుక భాషలో లేక స్పోకెన్ టెలుగూలో చెప్పాలంటే - ఇఫ్ ఎ కౌ కనక రిమెయిన్ అయిపోతే ఆ కౌ ని నాకు రిటర్న్ చేసేయండి." అని సలహా చెప్పాడు - అనగా అడ్వైస్ చేశాడు.

ఆ ప్రకారం వాళ్ళు గోవులను పంచుకోగా - అనగా డివైడ్ చేసుకోగా, జ్యేష్ఠుడికి తొమ్మిది గోవులూ - అనగా యెల్డర్ సన్ కి నైన్ కౌసూ, రెండో వాడికి ఆరు గోవులూ - అనగా ఠెలుగులో చెప్పాలంటే సిక్స్ కౌసూ, బాల వితంతువు సోదరికి - అనగా ఇస్స్యూలెస్సూ మరియు హస్బెండ్లెస్సూ అయి వున్న వర్జిన్ విడోకి - రెండు గోవులూ - అనగా టూ కౌసూ పంచుకోగా ఒక గోవు - సిద్ధాంతిగారి గోవు మిగిలి పోవడమూ చూసి - వన్ కౌ రిమెయినింగ్ గా ఉండడం చూసి వాళ్ళు ముగ్గురూ వండర్ స్ట్రక్ ఐ పోయారు. ఆ మిగిలిపోయిన గోవు సిద్ధాంతిగారిదవడం చేత దానిని ఆయనకి వాపస్ అప్పనం ఇచ్చి వేశారు.అనగా వాడుక భాష టెలుగూలో చెప్పాలంటే ఆయనకు రిటర్న్ చేసి తమ కృతజ్ఞతాభివందనములను ఆయనకు అర్పించారు - అనగా వ్యవహారిక టెలుగూ లాంగ్వేజీలో చెప్పాలంటే తమ గ్రేట్ ఫుల్ థ్యాంక్స్ ని ఆఫర్ చేసి స్వగృహానికి వెళ్ళి పోయారు - అనగా శిష్టులు స్పీక్ చేసే టెలుగూలో చెప్పాలంటే వారి హౌస్ కి రిటర్న్ అయిపోయారు. ఇంతటితో కథ సమాప్తం- అనగా ది స్టోరీ హాజ్ గాన్ టు ది ఫెన్స్ అని వాడుకభాషలో అర్థమూ.

"వికాసం" సభ్యుడు,
టెలుగూ రచయిత,
డబ్ల్యూ ఎల్ రావు.

ట్వంటీ~:టెన్ ~:1971
బెర్ హెం పూర్
(గంజామ్)