Thursday 30 November, 2006

"చందమామ" జ్ఞాపకాలు-1

అప్పుడు నాకు ఏడెనిమిదేళ్ళుంటాయేమో! అది చలికాలం కావడంతో చిరుచలిగా ఉంది. ఆ రోజు సెలవు కావడం వల్ల మా నాన్న ఇంటి దగ్గరే ఉన్నాడు. పొద్దున్నే లేచి వంటింట్లో పొయ్యి దగ్గర వెచ్చగా చలి కాగుతున్నాం మా నాన్నా నేనూ. మా అమ్మ కొంచెం దూరంలో మజ్జిగ చిలుకుతోంది. చందమామ మా నాన్న చేతిలో ఉంది. (తొందరపడి మా నాన్నను అపార్థం చేసుకోకండి. అంతకు ముందురోజే అరడజనుసార్లు చందమామ పారాయణం పూర్తిచేశాను నేను.) మా నాన్నేమో చందమామ చాలా దీక్షగా చదివేస్తున్నాడు. మజ్జిగ చిలకడమయ్యాక వెన్నతీస్తూ మా అమ్మ మా నాన్నతో ఏదో చెప్పింది. మా నాన్న అప్పటికి పద్మపాదుడు, పింగళుల వెంట పిశాచగార్ధభాలెక్కి ఆకాశమార్గాన శరవేగంగా ప్రయాణం చేస్తున్నాడు. ఆ హోరులో ఈ మాటలు ఎవరికి మాత్రం వినిపిస్తాయి చెప్పండి? ఐతే మా అమ్మ ఆ మాత్రమైనా అర్థం చేసుకోకుండా మళ్ళీ ఏదో చెప్పింది. అప్పటికీ మా నాన్న కిందికి చూడలేదు.

వెన్న తీసిన తర్వాత కవ్వం వంటింట్లో పెట్టడానికొచ్చిన మా అమ్మ మా నాన్న "ఆకాశయానాన్ని" గమనించింది. గమనించి, అంతసేపూ మా నాన్న తన మాటలు విననందుకు ఉక్రోషం వచ్చి మూడోసారి అదేమాట ఇంకాస్త గట్టిగా చెప్పింది. అంత చలిలో కూడా వాతావరణం వేడెక్కుతోందని నాకర్థమైంది కానీ పరిస్థితి తీవ్రత తెలియలేదు. మా నాన్నకు అసలు ఆ మాత్రం కూడా తెలియదు! అప్పుడు ఏం జరుగుతోందో మా ఇద్దరికీ అర్థమయ్యే లోపలే మా అమ్మ మా నాన్న చేతుల్లో నుంచి చందమామ లాక్కుని, నలిపి పొయ్యిలో పెట్టేసింది! అలా చెయ్యడం మా అమ్మకు చందమామ అంటే ఇష్టం లేక కాదు. అప్పట్లో మా అమ్మ కూడా ప్రతి నెలా చదివేది. (మా నాన్న, నేను ఇప్పుడు కూడా చదువుతూనే ఉన్నాం.) ఇక ఆ పొయ్యిలో మహామాయుడి సమాధిలోని అనంత ధనరాశులతో బాటు మహామాయుడి మంత్రదండం, బంగారుపిడి గల ఖడ్గం, అతడి కుడిచేతి చూపుడువేలికి ఉన్న మహిమ గల ఉంగరం లాంటి అమూల్యవస్తువులు కూడా అంటుకోవడం వల్ల వంటిల్లంతా వింతవెలుగుతో నిండిపోయింది.

ఇంకేముంది? హాహాకారాలతో వంటిల్లు అదిరిపోయింది! పెట్టింది మనమే:) దాంతో ఈ లోకంలోకొచ్చిన మా నాన్న వెంటనే చందమామను బయటికి లాగి నిప్పునార్పేశాడు. ఇక దాన్ని తీసుకుని నేనక్కడి నుంచి పరుగో పరుగు...ఇంకా అక్కడే ఉంటే ఏం మూడుతుందో అని! (ఇక వాతావరణమా? అది ఆ నిప్పుతోబాటే చల్లారిపోయిందిగా? మంటల్లో పడిన చందమామను చూసి మా నాన్న కంగారు పడితే అది చూసి మా అమ్మకు నవ్వొచ్చింది. నవ్వుతూనే అంది "లేకపోతే ఏమిటది? ఒక పక్క నుంచి చెప్తూంటే చెవినేసుకోకుండా అదే లోకమా?" అని.)

Wednesday 29 November, 2006

Life with a Software Engineer

Husband - Hi dear, I am logged in.

Wife - Would you like to have some snacks?
Husband - Hard disk full.

Wife - Have you brought the saree?
Husband - Bad command or file name.

Wife - But I told you about it in the morning
Husband - Erroneous syntax: abort, retry, cancel.

Wife - Hae bhagwan! Forget it. Where's your salary.
Husband - File in use, read only. Try after some time.

Wife - At least give me your credit card. I can do some shopping.
Husband - Sharing violation, access denied.

Wife - I made a mistake in marrying you.
Husband - Data type mismatch.

Wife - You are useless.
Husband - By default.

Wife - Who was there with you in the car this morning?
Husband - System unstable. Press ctrl, alt, del to Reboot.

Wife - What is the relation between you & your Receptionist?
Husband - The only user with write permission.

Wife - What is my value in your life?
Husband - Unknown virus detected.

Wife - Do you love me or your computer?
Husband - Too many parameters.

Wife - I will go to my dad's house.
Husband - Program has performed an illegal operation. It will close.

Wife - I will leave you forever.
Husband - Close all programs and log out for another User.

Wife - It is worthless talking to you.
Husband - Shut down the computer.

Wife - I am going
Husband - It is now safe to turn off your computer.

(A forwarded mail)

Tuesday 28 November, 2006

మన దేశంలో ప్రజాస్వామ్యం-2 (సెక్షన్ 49 ‘O’)

"నిర్ణీతశాతం కంటే ఎక్కువమంది ఓటర్లు తమ ఓట్లు రద్దు చేసుకున్నప్పుడు ఆ ఎన్నిక రద్దవుతుందని, ఆ అభ్యర్థులు మళ్లీ పోటీకి అనర్హులనీ ఈ అంశంగురించి ఎక్కడో చదివాను." - అభిరామ్ బ్లాగులో రానారె వ్యాఖ్య.

నెట్లో వెదికితే కొన్ని బ్లాగుల్లో ఆసక్తికరమైన విషయాలు కనబడ్డాయి. పోలైన ఓట్లలో 50% కంటే ఎక్కువ మంది తమ ఓటును రద్దు చేసుకుంటే అక్కడి ఎన్నిక రద్దవుతుందని, అక్కడ పోటీ చేసిన అభ్యర్థులందరూ మళ్ళీ పోటీ చెయ్యడానికి అనర్హులవుతారని; ఓట్ల లెక్కింపు తర్వాత గెలిచిన అభ్యర్థి ఎన్ని ఓట్ల తేడాతో గెలిచాడో అంతకంటే ఎక్కువ మంది తమ ఓట్లను రద్దు చేసుకుని ఉన్నట్లైతే ఆ ఎన్నిక చెల్లదని, ఇలా...

వీటి మాటెలా ఉన్నా ఎన్నికల సంఘం మాత్రం బాలట్ పత్రాల్లో (ఓటింగు యంత్రాల్లో) "None" అని చేర్చడానికి సుముఖమేనని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రజాప్రయోజనవ్యాజ్యమొకటి సుప్రీంకోర్టులో నడుస్తోందట. వాస్తవమేమిటంటే Election rules 1961 లోని Section 49 ‘O’ ప్రకారం ఓటరు పోలింగు బూత్ లో ఓటేసిన వాళ్ళ సంతకాలు/వేలిముద్రలు తీసుకునే ఓటర్ల రిజిస్టర్ లో తన పేరు నమోదయ్యాక సంతకం/వేలిముద్ర వేశాక ఆ ఓటరు పేరుకెదురుగా "ఓటు వెయ్యలేదు" అని రాసి ఆ ఓటరు సంతకం/వేలి ముద్ర తీసుకుని వదిలేస్తారు. ఐతే ఇలా తమ ఓటును రద్దు చేసుకున్న వారెవరన్నది అందరికీ తెలిసిపోతుంది. ఇది రహస్య ఓటింగ్ నియమాలకు విరుద్ధం. కాబట్టి బాలట్ పత్రం/ఓటింగ్ యంత్రంలో "None" చేర్చడమే సముచితం.

ఎన్నికల కమీషను ఈవీఎం లలో None of the above ను చేర్చాలని సిఫార్సు చేసింది. ఆ ప్రతిపాదన ప్రకారం 50% కంటే ఎక్కువ మంది తమ ఓటును రద్దు చేసుకుంటే అక్కడి ఎన్నిక రద్దవడమేగాక, అక్కడ పోటీ చేసిన అభ్యర్థులందరూ మళ్ళీ పోటీ చెయ్యడానికి అనర్హులవుతారు. ఫలితంగా జరిగే ఉప ఎన్నికలో మాత్రం None of the above అని ఉండదు. (ఓటర్ల గ్రహచారం బాగలేక మళ్ళీ None ముందు అభ్యర్థులందరూ ఓడిపోతే? అందుకన్నమాట!) ఐతే ఈ సెక్షన్ 49 ‘O’ గురించి ఓటర్లలోనూ, అంతకంటే ముందు పోలింగ్ ఆఫీసర్లలోనూ అవగాహన కలిగించడం అవసరం. చాలా మంది పోలింగ్ అధికారులకే ఈ సెక్షన్ గురించి తెలియదు. ఒకవేళ ఎవరైనా తమ ఓటును రద్దు చేసుకోవాలనుకున్నా దాని గురించి తెలియని ఆఫీసర్లు తిరస్కరించే ప్రమాదముంది. తమిళనాడులో గత ఎన్నికల్లో అలాగే జరింది కూడా! జనాలు దీన్ని వాడుతున్నట్లైతే ప్రసారమాధ్యమాలు దీని మీద దృష్టిపెడతాయి. ఎవరూ వాడకపోయినా దీనిలోని లోపాన్ని కోర్టు దృష్టికి ఎవరైనా తీసుకెళ్తే తప్పక ప్రయోజనముంటుంది. చూద్దాం - కోర్టు ఏమని తీర్పు ఇస్తుందో?

ఇక ప్రజాస్వామ్యంలో "నిరక్షరాస్యులనో, రాజకీయాలంటే అవగాహన లేదనో వున్న ఓటుహక్కును నిరాకరిస్తే" అది ప్రజాస్వామ్యమే కాదు. నియంత్రించాల్సింది ఓటర్లను కాదు. రాజకీయులనే. నాకు ఈ జ్ఞానోదయం కింది టపాపై చరసాల గారి వ్యాఖ్య చదివాక కలిగింది. :) నిజానికి ఓటుహక్కు మన రాజ్యాంగం భారత పౌరులందరికీ ఆర్టికల్ 19(1)(a) క్రింద ప్రసాదించిన భావప్రకటనా స్వాతంత్ర్యపుహక్కులో భాగం. ఎన్నికల విషయంలో మరీ తీవ్రమైన తప్పిదం చేస్తే తప్ప దీన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు.

Thursday 23 November, 2006

మనదేశంలో ప్రజాస్వామ్యం

మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఇంతమంది ఓటర్లు మరే ప్రజాస్వామ్య దేశంలోనూ లేరు కాబట్టి మనదేశానికి ఆ గుర్తింపు వచ్చింది. మన పొరుగునే ఉన్న పాకిస్తాను, బంగ్లాదేశ్, మ్యాన్మార్ (బర్మా) లాంటి దేశాల్లో సైన్యాధిపతులు, జుంటాలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నేతలను చీటికి మాటికి పదవీచ్యుతులనో, బందీలుగానో చేసి అధికారం హస్తగతం చేసుకుంటూండగా మనదేశంలో అలాంటి పరిస్థితి కలలో కూడా ఎప్పటికీ ఎదురుకాదనీ, ఇక్కడ ప్రజాస్వామ్య పునాదులు చాలా గట్టివనీ గర్విస్తాం. ఐతే మనది నిజంగా గర్వించదగిన ప్రజాస్వామ్యమేనా? అసలు ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి ఎలాంటి పరిస్థితులు అనుకూలిస్తాయి?

ప్రజాస్వామ్యంలో వయోజనులందరికీ సమాన ప్రాతిపదికన ఓటుహక్కుంటుంది. అంటే తెలివున్నవాళ్ళు - తెలివిలేనివాళ్ళు; ఆలోచనాపరులు - ఆలోచించడానికి ఇష్టపడని/బద్ధకించేవాళ్ళు, తమకు ఏది మంచో ఏది చెడో బాగా తెలిసినవాళ్ళు, తెలిసినా పట్టించుకోనివాళ్ళు, అసలు తెలుసుకోలేనివాళ్ళు వీళ్ళందరి అభిప్రాయాలకూ సమాన విలువుంటుంది. మరి అలాంటప్పుడు ప్రజాస్వామ్యం అర్థవంతం కావాలంటే ఓటర్లందరికీ సరైన సామాజిక పరిజ్ఞానం; ఓటర్లుగా, పౌరులుగా తమ హక్కులు మరియు బాధ్యతల పట్ల అవగాహన కలిగించడం అవసరం. ముందుగా ఆ పని చెయ్యకుండా ప్రజాస్వామ్యాన్ని అమలు చేసేసి మనది ప్రపంచంలోనే అతిగొప్ప ప్రజాస్వామ్యమని గర్వించడం సమంజసమా? కనీసం ఇప్పుడైనా ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా?

బ్రిటిష్ వారి కాలంలో "male, propertied citizens" కే, అంటే ఆస్థిపరులైన పురుషులకే (అంటే భూస్వాములకు మాత్రమే - అది కూడా కుటుంబానికి ఒకరికి చొప్పున) ఓటుహక్కుండేది. మనకు స్వాతంత్ర్యం వచ్చి, మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన వెంటనే వయోజనులందరికీ ఓటుహక్కు ఇచ్చేశారు. అప్పుడు దేశంలో నిరక్షరాస్యత 86%గా ఉండేది (అక్షరాస్యులు 14% మందే). ఇప్పుడది 35%(అక్షరాస్యులు 65% మంది). ఇప్పటికీ చదువుకున్నవారిలో సైతం చాలా మందికి ఓటు విలువ తెలియదు. వాళ్ళు వోటు వెయ్యరు. వేసినా ఆ పని అభ్యర్థుల గురించి, పార్టీల గురించి, ప్రభుత్వపాలన సాగే విధానం గురించి పూర్తి అవగాహనతో చెయ్యరు. ఇక తమ ఓటును గుప్పెడు మెతుకులకో, గుక్కెడు సారాకో అమ్ముకునేవారి సంగతి సరేసరి. ఇది చాలనట్లు ఓటు వేసేటప్పుడు మన ఓటర్లు తాత్కాలిక ఉద్వేగాలకు లోనుకావడం, ఏదో ఒక పార్టీని గుడ్డిగా నమ్మి ఓటెయ్యడం చేస్తూ ఉంటారు. ఒక పార్టీ నేత మరణించినప్పుడో, వంచనకు గురైనప్పుడో ఆ పార్టీని/నేతను/సదరు నేత కుటుంబీకులను ఓదార్చడానికి (!?) ఓటును వెచ్చించేవాళ్ళూ తక్కువేం లేరు. ఇంకోవైపు కుల, వర్గ రాజకీయాలు ఆందోళన కలిగించే విధంగా బలపడుతున్నాయి.

సాధారణ పరిస్థితుల్లో కూడా వోటేసేటప్పుడు ఎంతమంది బరిలో ఉన్న పార్టీల గురించి, అభ్యర్థుల గురించి సవ్యంగా ఆలోచించి వోటు వేస్తున్నారు? మనవాళ్ళు ఎక్కువగా పట్టించుకునేది ప్రస్తుత ప్రభుత్వం మీద తమకు కలిగిన అభిప్రాయాన్ని. ఐదేళ్ళ చివర ఆ ప్రభుత్వం మీద తమక్కలిగిన అభిమానాన్నో, కసినో ఓట్ల రూపంలో చూపించడమే తప్ప ఆ నిర్ణయం తమందరి తలరాతల్ని ఐదేళ్ళపాటు ప్రభావితం చేస్తుందని గుర్తించేవాళ్ళు తక్కువ మంది (ఈ అభిమానం లేదా కోపం తాత్కాలికావేశం కాకుండా ఐదేళ్ళ పొడవునా పేరుకున్నదైతే మంచిదే).

వోటు వేసే ముందు ఈ క్రింది విషయాలు ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది:
1. పార్టీ గురించి: ప్రతి పార్టీకి కొన్ని సిద్ధాంతాలుంటాయి. ప్రతి పార్టీ కొన్ని వాగ్దానాలతో ప్రజల ముందుకు వస్తుంది. ఆశయాలకు, ఆచరణకు మధ్యనుండే అంతరం అందరికీ తెలిసిందే ఐనా ఒక పార్టీ వల్లించే ఈ ఆశయాలు, చేసే వాగ్దానాలు ఆ పార్టీ ప్రాథమ్యాలను, ప్రజాసంక్షేమం పట్ల ఆ పార్టీ దృక్పథాన్ని తెలుపుతాయి. ఇవి తమకు మేలు చేస్తాయని నమ్మిన ఓటర్లు ఆ పార్టీకి ఓటు వేయాలనుకుంటారు.
2. అభ్యర్థి గురించి: అసలు మనం మన ప్రతినిధిగా ఎలాంటి అభ్యర్థిని ఎన్నుకోవాలి? ఎవరైతే తమ నియోజకవర్గ అభివృద్ధికి నిబద్ధతతో కృషి చెయ్యగలడో, ఎవరికైతే ప్రజాసంక్షేమం పట్ల సరైన అవగాహన ఉందో అలాంటి అభ్యర్థికి ఓటు వెయ్యాలి. కానీ ఆచరణలో జరిగేదేమిటి? కుల, మత, వర్గ ప్రాతిపదికనో, వ్యక్తిగత రాగద్వేషాల ఆధారంగానో, ఇతరత్రా స్వార్థప్రయోజనాలు ఆశించో (తమ "పనులు" జరిపించగలరనే నమ్మకమున్నవారినో) ఓటు వేసేవారే ఎక్కువ మంది. ఇలా ఎన్నికైన ప్రజాప్రతినిధులు చట్టసభల సమావేశాల్లో తమ ప్రాంత ప్రజల అవసరాల గురించి కానీ, విధానపరమైన అంశాల గురించి గానీ ఎప్పుడూ నోరెత్తిన పాపాన పోరు. ఐతే మనకు నచ్చిన పార్టీని, నచ్చిన అభ్యర్థిని వేరువేరుగా ఎన్నుకునే అవకాశం లేదు. ఇక్కడ మనం వేసే ఒకే ఓటు అటు పార్టీకి, ఇటు అభ్యర్థికి చెందుతుంది. అంటే ఒక పార్టీ ప్రకటిత ప్రాథమ్యాలు ఎంత బాగా నచ్చినా, తమ నియోజకవర్గంలో ఆ పార్టీ నిలిపిన అభ్యర్థి సరైనవాడు కానప్పుడు ఓటరు తనకు నచ్చని అభ్యర్థికో, పార్టీకో వోటు వెయ్యక తప్పదన్నమాట.
కాపురం చేసే కళ కాలుతొక్కేటప్పుడే తెలిసినట్లు ఒక్కో రాజకీయపార్టీ పాలన ఎలా ఉండబోతోందో ఆ పార్టీ అభ్యర్థుల ఎంపికలోనే తెలిసిపోతుంది. ఎంత గొప్ప ఆదర్శాలు వల్లించినా ఆ ఆదర్శాలను అమలు చేసే బాధ్యత ఎలాంటి అభ్యర్థుల చేతుల్లో పెడుతున్నారో చూస్తే ఆయా పార్టీల చిత్తశుద్ధి ఏపాటిదో తేటతెల్లమవుతుంది. అక్రమార్కులు, అవినీతిపరులు, నేరచరితులను అభ్యర్థులుగా నిలిపే పార్టీలు అధికారంలోకి రావడం దేశ పురోభివృద్ధికి ఆటంకమే కలిగిస్తుంది. అందుకే ఓటర్లు తమకు నచ్చని అభ్యర్థిని పోటీలో నిలిపిన పార్టీకి వ్యతిరేకంగా ఓటువేయడమే దేశానికి మంచిది - అది ఎంత గొప్ప పార్టీ అయినాసరే. గతంలో మనదేశంలో ఒకే నియోజకవర్గం నుంచి ఒకరికంటే ఎక్కువమంది సభ్యులు ఎన్నికయ్యే అవకాశముండేది. ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులను చూస్తే అందరు అభ్యర్థులనూ తిరస్కరించే (None of the above)అవకాశం లేకపోవడం అతిపెద్ద లోపంగా అనిపిస్తోంది.
ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేవాళ్ళు, పార్లమెంటులోగానీ, శాసనసభలోగానీ సభ్యులుగా ఉంటూ మళ్ళీ పోటీ చేసే వాళ్ళు (పార్లమెంటు సభ్యుడొకరు ముఖ్యమంత్రి పదవినో, మరో ప్రయోజనాన్నో ఆశించి శాసనసభ్యుడొకరిచేత రాజీనామా చేయించి ఆ స్థానంలో శాసనసభ్యుడయ్యాడనుకోండి, అక్కడ పార్లమెంటుకు మళ్ళీ ఉప ఎన్నిక జరపాల్సొస్తుంది. ఒక్కరి స్వార్థప్రయోజనాల కోసం శాసనసభకొకటి, పార్లమెంటుకొకటి - రెండు ఉప ఎన్నికలు!), సరైన కారణం లేకుండానో, లేక కేవలం వ్యక్తిగత కారణాలవల్లో చట్టసభల సభ్యత్వాలకు రాజీనామా చేసేవాళ్ళు ప్రజాస్వామ్యస్ఫూర్తిని అవహేళన చేసినట్లుగా పరిగణించి వాళ్ళు మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకుండా చెయ్యాలి (మొదటిసారైతే ఆరేళ్ళు, రెండవసారి అదేపనిచేస్తే శాశ్వతంగా). ఈ కారణాలవల్ల జరపవలసి వచ్చే ఉప ఎన్నికలకయ్యే ఖర్చును సదరు అభ్యర్థులనుంచే రాబట్టాలి. వాళ్ళ నామినేషను/రాజీనామా పత్రాలతోబాటే సదరు సొమ్మును సమర్పించేలా నిబంధనలను సవరించాలి. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేవాళ్ళ డిపాజిట్టును కూడా తిరిగివ్వకూడదు.



3. స్థానిక ప్రాథమ్యాల గురించి: అభివృద్ధి ఫలాలు దేశంలోని అన్ని ప్రాంతాలకూ సమానంగా అందలేదు. దీనికి కారణాలు అనేకం. ప్రకృతిసహజమైన కారణాలు కొన్ని (భూసారం, వర్షపాతం, జలవనరులు, ఖనిజసంపద, మొదలైనవి) కాగా ఉన్న పరిమిత వనరులను ఎక్కడ వినియోగిస్తే ఎక్కువమంది లబ్ది పొందుతారో, ఉత్పాదకత గణనీయంగా మెరుగుపడుతుందో అక్కడే వినియోగించడం,అదే కారణం వల్ల ప్రభుత్వం మొదట సారవంతమైన భూములు, ఆధారపడదగ్గ జలవనరులు ఉన్నచోట నీటిపారుదల సౌకర్యాలు ఏర్పాటుచేయడం సబబైనదే. ఐతే అదే పరిస్థితి దీర్ఘకాలం కొనసాగినప్పుడు, ఒకే ప్రాంతం అన్నిరంగాల్లోనూ అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఇతర ప్రాంతాలవారికి అసంతృప్తి కలుగుతుంది. ఈ వివక్ష దీర్ఘకాలం కొనసాగినప్పుడు ప్రాంతీయ అసమానతలు ప్రాంతీయ విభేదాలకు, విద్వేషాలకు దారి తీస్తాయి. పరిస్థితి అంతవరకు రాకుండా తమ ప్రాంతంలో అభివృద్ధికి గల అవకాశాలేమిటో, ప్రతిబంధకాలేమిటో పరిశీలించి తెలుసుకుని, తదనుగుణంగా ఆ ప్రాంత అభివృద్ధికి కృషిచేయవలసిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులది. ఆ బాధ్యతను మన రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులెంతమంది పట్టించుకుంటున్నారు?

తమను ఎన్నుకున్న ప్రజల వాణిని చట్టసభల్లో వినిపించడం , ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం ప్రజాప్రతినిధుల బాధ్యత. ఈ బాధ్యతను సరిగా నిర్వర్తించని ప్రజాప్రతినిధుల ఎన్నికను ఎప్పుడైనా సరే రద్దుచేసే అవకాశం ప్రజలకుండాలి.

ఐతే ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ తన నియోజకవర్గస్థాయి అవసరాలను, సమస్యలను మాత్రమే గుర్తించగలరు. అంతకంటే కింది స్థాయి అవసరాలు - అంటే మండల/గ్రామస్థాయిలోని అవసరాలు - ఇంకొకవిధంగా ఉంటాయి. వాటికి పరిష్కారం కూడా స్థానికంగానే కనుగొనవలసి ఉంటుంది. ఇందుకోసమే మన రాజ్యాంగంలో స్థానికసంస్థలకు విశేష అధికారాలను ఇచ్చారు. ఇప్పుడు గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ ఈ పనులన్నీ చేయడం స్థానిక సంస్థలైన పంచాయతీలు, మునిసిపాలిటీల బాధ్యత. ఇది ఆచరణసాధ్యం కావాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల ప్రమేయం ఉండరాదు. ఇది సమర్థవంతంగా అమలు జరగడానికి వీలుకలిగిస్తూ స్థానికసంస్థలకు అధికారాల బదలాయింపు పూర్తిస్థాయిలో జరిగితేనే ప్రజాస్వామ్యం అర్థవంతమూ, సమర్థవంతమూ అవుతుంది. దీన్నే Democracy at the grassroots level అని పేర్కొంటారు.

గ్రామపంచాయతీలకు అప్పగించవలసిన అధికారాలు/బాధ్యతలుగా మన రాజ్యాంగం లో వీటిని పేర్కొన్నారు:
1. వ్యవసాయం, వ్యవసాయ విస్తరణ.
2. భూసంస్కరణల అమలు, భూసారసంరక్షణ, తదితరాలు.
3. చిన్ననీటిపారుదల, నీటియాజమాన్యం, వాటర్షెడ్ ల అభివృద్ధి.
4. పశుపోషణ, పాడిపరిశ్రమ, కోళ్ళపెంపకం.
5. చేపలు/జలచరాల పెంపకం.
6. సామాజిక అడవులు, క్షేత్ర అడవులు.
7. అటవీ ఉత్పత్తులు.
8. ఫుడ్ ప్రాసెసింగ్ తో సహా అన్ని చిన్నతరహా పరిశ్రమలు
9. ఖాదీ, గ్రామీణ, కుటీర పరిశ్రమలు.
10. గ్రామంలో ఇళ్ళనిర్మాణం.
11. మంచినీటి సౌకర్యం.
12. ఇంధనం, పశుగ్రాసం.
13. రహదారులు, కల్వర్టులు, వంతెనలు, పడవలు, జలమార్గాలు, మొ.
14. గ్రామంలో విద్యుదీకరణ, విద్యుత్తు సరఫరా.
15. సంప్రదాయేతర ఇంధనవనరులు.
16. పేదరిక నిర్మూలనాకార్యక్రమాలు.
17. పాఠశాల స్థాయి విద్య.
18. సాంకేతిక, వృత్తివిద్య.
19. వయోజన, నాన్-ఫార్మల్ విద్య.
20. గ్రంథాలయాలు.
21. సాంస్కృతిక కార్యక్రమాలు.
22. సంతలు, తిరునాళ్ళు.
23. ఆరోగ్యం-పారిశుద్ధ్యం, ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, డిస్పెన్సరీలు.
24. కుటుంబసంక్షేమం.
25. స్త్రీ-శిశుసంక్షేమం.
26. వికలాంగులు, మానసికంగా ఎదగనివారితో సహా సాంఘికసంక్షేమం.
27. బలహీన వర్గాలవారి సంక్షేమం.
28. ప్రజాపంపిణీవ్యవస్థ.
29. ఊరుమ్మడి ఆస్థులను పరిరక్షించడం.
ఇలాగే పట్టణస్వపరిపాలనసంస్థలకు అప్పగించవలసిన అధికారాలు 18 ఉన్నాయి. ఈ పనుల్లో వేటిని చేయవలసి వచ్చినా నిర్ణయాలు గ్రామ/పట్టణ స్థాయిలోనే తీసుకోవడం సబబు. అనుమతి/నిధుల మంజూరు కోసం రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వాలకేసి చూడవలసిరావడం అర్థరహితం. ఐతే స్థానికస్వపరిపాలనసంస్థలకు అధికారాలిస్తే సరిపోదు. వాటిని అమలుచేయడానికవసరమైన నిధులు కూడా ఇవ్వాలి. స్థానికసంస్థలకు అధికారాలు/నిధులను బదలాయించే విషయంలో ఏలినవారి దయ ఎంతవరకు ఉందో చూస్తూనేవున్నాం. ఇకమీదటైనా పరిస్థితి మారుతుందేమో చూడాలి.

ఒక్క ఓటు అభ్యర్థిని, ప్రభుత్వాన్ని రెండిట్నీ నిర్ణయించడం అన్యాయమైతే గెలిచిన పార్టీలు ఆ ఒక్క ఓటును తమ మేనిఫెస్టోలోని అసంఖ్యాక అంశాలమీదా ప్రజలు వేసిన ఆమోదముద్రగానూ, తాము అధికారంలోకొచ్చాక ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలన్నిటికీ ప్రజల అంగీకారంగానూ భాష్యాలు చెప్పడం మరీ అన్యాయం. ఒక్కో పార్టీ చేసిన ఎన్నికల వాగ్దానాల్లోని ఒక్కో అంశం మీదా ఓటర్లు విడివిడిగా తమ అభిప్రాయాలను తెలియజేసే అవకాశం లేకపోవడం దీనికి ఆస్కారమిస్తోంది.

స్వాతంత్ర్యం వచ్చి అరవయ్యేళ్ళైనా మన దేశంలో పేదరికం, అవిద్య, అనారోగ్యం, నిరుద్యోగాలు తాండవిస్తూనే ఉన్నాయి. దీనికి కారకులెవరు? అని ప్రశ్నించుకుంటే ఇన్నేళ్ళూ దేశాన్ని పాలించిన ప్రభుత్వాలే అని సమాధనమొస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాథమికావసరాలే తీరకపోతే మరి మన ప్రజాస్వామ్యం విజయమైనట్లా?

జుడిషియల్ ఆక్టివిజం: ప్రస్తుతం మనమెన్నుకుంటున్న ప్రజాప్రభుత్వాల మీద మనకున్న నమ్మకమెలాంటిదంటే ప్రజారోగ్యం నుంచి ట్రాఫిక్ నిబంధనల వరకు ఏ విషయంలోనైనా కోర్టు కలగజేసుకుని ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించేంతవరకూ ప్రభుత్వం ఆ సమస్యల్ని పట్టించుకుంటుందనే (పట్టించుకున్నా సరైన రీతిలో స్పందిస్తుందనే) ఆశలు కూడా వదిలేసుకుంటున్నాం. అప్పుడప్పుడూ కోర్టులు అత్యుత్సాహంతో హద్దుమీరి మనమెన్నుకున్న చట్టసభల కార్యకలాపాలను నిర్దేశించే ప్రయత్నం చేస్తున్నా దాన్ని అనుచితజోక్యంగా భావించడం లేదు. వీటినిబట్టిచూస్తే అసలు మనది ప్రజాస్వామ్యమేనా అనే అనుమానం రాకమానదు.

Sunday 5 November, 2006

కార్తీక పున్నమి



ఈ రోజు కార్తీకపున్నమి. మిగతా నెలలకంటే కార్తీకమాసంలో వెన్నెల ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటుంది. ఇక కార్తీకపున్నమికి ఉన్న ప్రత్యేకత విడిగా చెప్పనక్ఖర్లేదు. ఐతే ఈరోజు ఇంకోరకమైన వెన్నెలను తనివితీరా అస్వాదించాం తెలుగువికీపీడియనులందరం. ఈరోజు ఈనాడులో వికీపీడియా గురించి ముఖపత్రకథనం రావడంతో ఒక్కదెబ్బతో తెవికీ గురించి లక్షలాదిమందికి తెలియడమేగాక ఒక్కరోజులోనే వందమందికి పైగా కొత్త వికీపీడియనులు చేరారు. వీళ్ళలో ఎంతమంది స్థిరంగా తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడతారో చూడాలి. నిన్నంటే నిన్న చింతుగారు తన బ్లాగులో తెలుగువికీ వీరవిహారం గురించి రాయడం, కొన్ని గంటల తేడాలో ఈనాడులో ఈ కథనం రావడం ఆశ్చర్యానందాలు కలిగిస్తోంది.