Thursday 31 August, 2006

ఎయిడ్సు-ఎచ్.ఐ.వీ.

ఎయిడ్సు, దాని కారకమైన ఎచ్.ఐ.వీ.ల గురించి ఘనత వహించిన మన పార్లమెంటు సభ్యుల పరిజ్ఞానమెంతో ఈ మధ్యే బయటపడింది. అది చూసి మన ప్రధాని తన మొహం ఎక్కడ దాచుకోవాలో తెలియక "ఇబ్బంది" పడ్డారు. ఎయిడ్సు గురించి ప్రజల్లో అవగాహన కలిగించడానికి ప్రభుత్వాలు కోట్లు ఖర్చు చేసి ఎంత విస్తృతంగా ప్రచారం చేస్తున్నా ఇంకా చాలా మందికి వాటి గురించి స్పష్టమైన అవగాహన లేదనే చెప్పాలి. ఎచ్.ఐ.వి. ఎలా వ్యాపిస్తుందనే విషయం గురించి ప్రజలకు ఎలాంటి అపోహలు ఉన్నాయో తెలిపే ఈమెయిలొకటి నాకు రెండు వారాల కిందట వచ్చింది. దాన్ని గురించి నా బ్లాగులో రాయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. అయితే అందులో ఉన్న వైద్యసంబంధ సమాచారం పూర్తిగా నిజమో కాదో నాకు తెలియదు. అందుకే సాధికారంగా నిర్ధారించుకోవడానికి ఆ విషయంపైనే పరిశోధనలు చేస్తున్న తెలుగు బ్లాగరి ఇస్మాయిల్(చింతు) గారిని అభ్యర్థించాను. ఆయనకు తీరిక లేకపోయినా నా అభ్యర్థనను మన్నించి ఆధారిత డాక్యుమెంట్లతో సహా వివరంగా సమాధానమిచ్చారు. మొదటి మెయిల్ సారాంశాన్ని, దానికి అంశాల వారీగా ఇస్మాయిల్ గారి ప్రతిస్పందనను క్లుప్తంగా నా ఇంగ్లీషు బ్లాగులో పోస్టు చేశాను. తెలుసుకోగోరిన వాళ్ళు అక్కడ చూడవచ్చు.

Monday 28 August, 2006

పుస్తక సమీక్షలు-బ్లాగు సమీక్షలు


ప్రస్తుతం పుస్తక సమీక్షలెలా ఉంటున్నాయో ఈ ఒక్క కార్టూను చూస్తే తెలుస్తుంది. రాబోయే కాలంలో పత్రికల్లోని పుస్తకసమీక్షలు ఈ కార్టూనులో చూపినట్లే ఉంటాయేమో? (ఒక పుస్తకం అట్ట మీద ఆ పుస్తకం గురించి 300 పదాల పరిచయవాక్యాలుంటే దాని మీదొచ్చిన సమీక్షను 200 పదాలతో సరిపెట్టేశారట!!)

పుస్తక సమీక్షల పరిస్థితే అలా ఉండగా ఇంకొక వైపు బ్లాగుల గురించి సవివరమైన సమీక్షలు రాస్తున్న భాస్కర రావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన ఇప్పటి వరకు తెలుగు మహిళా బ్లాగరులందరి బ్లాగుల గురించి సమీక్షలు రాశారు. తాను చదివిన మంచి పుస్తకాల గురించి తన బ్లాగులో చర్చించే వి.బి.సౌమ్య గారి బ్లాగును ఈరోజు ఆయన సమీక్షించారు. ఆయన సమీక్షలు మహిళా బ్లాగరుల బ్లాగులకే పరిమితం కాలేదు. చరసాల, చావా కిరణ్, త్రివిక్రమ్ లాంటి వారి బ్లాగుల మీద కూడా సుదీర్ఘమైన సమీక్షలు రాశారు. ఆయన చేస్తున్న కృషికి నా హృదయపూర్వక అభినందనలు.

అపహాస్యం పాలౌతున్న సెన్సార్ సర్టిఫికెట్లు

ఈ మధ్య మన సెన్సారు బోర్డు వారు ఎడాపెడా A సర్టిఫికేట్లు, U/A సర్టిఫికేట్లు ఇచ్చి పారేస్తున్నారు. మన ఎగ్జిబిటర్లు, దర్శకనిర్మాతలు, టీవీ ఛానెళ్ళవారు ఆచరణలో ఆ సర్టిఫికెట్లను అంతే ఉత్సాహంగా "పారేస్తున్నారని" నాకు ఈ మధ్యే తెలిసివచ్చింది. అసలు విషయం చెప్పబోయే ముందు ఈ సెన్సార్ సర్టిఫికేట్ల గురించి కొన్ని వివరాలు:

ఎవరైనా నిరభ్యంతరంగా చూడదగ్గ సినిమాలకు U సర్టిఫికెటు,
మితిమీరిన శృంగారం, అశ్లీలత, అసభ్యత, బూతులు, లేదా హింసాత్మక సన్నివేశాలు ఉండడం వల్ల పిల్లలు చూడకూడని సినిమాలకు A సర్టిఫికెటు,
పెద్దవారి తోడు లేకుండా చూస్తున్నప్పుడు పిల్లలు భయపడే అవకాశముందనిపించిన హార్రర్ సినిమాలకు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళతో కలిసి మాత్రమే చూడదగ్గ సినిమాలకు U/A సర్టిఫికెటు ఇస్తారు.

హాస్యం పేరుతో పచ్చిబూతుమాటల్ని విరివిగా వాడిన ఒక సినిమా U/A సర్టిఫికెటుతో విడుదలైంది కొన్ని నెలల కిందట. అంటే చిన్న పిల్లలు ఆ బూతు మాటల్ని పెద్దల పర్యవేక్షణలో మాత్రమే నేర్చుకోవాలని అ సర్టిఫికెటు ఇచ్చినవారి ఘనమైన అభిప్రాయమనుకోవాలా? సెన్సారైన సినిమాలకు కూడా ప్రచారం చేసుకోవడానికి వాడుకునే స్టిల్స్, క్లిప్పింగులకు ఫిల్మ్ ఛాంబర్ నుంచి అనుమతి పొందాలి. కానీ సదరు సినిమావారిచ్చిన టీవీ ప్రకటనల్లో కూడా బూతు మాటలే ఉన్నాయి. :(

దీని తలదన్నే సంఘటనొకటి రెండు మూడు వారాల కిందట జరిగింది. (దీని గురించి అప్పుడే బ్లాగకపోవడానికి కారణం "విక్రమార్కుడు" సినిమాకు U/A సర్టిఫికెటు వచ్చిందని ఇన్నిరోజులూ నేను అపోహ పడ్డమే.)
వాస్తవమేమిటంటే "విక్రమార్కుడు" సినిమాకు వచ్చింది A సర్టిఫికెటు. అంటే అది పిల్లలెవరూ చూడగూడని సినిమా. A సర్టిఫికెటు ఎందుకొచ్చిందో నాకు తెలియదు. నేనా సినిమా చూడలేదు. ఐతే రెండు మూడు వారాల కిందట ఆ సినిమా "చూసి వచ్చిన" చిన్నపిల్లలతో ఆ సినిమా హీరో రవితేజ, దర్శకుడు ? చాలా సేపు ఆ సినిమా గురించే మాట్లాడారు. ఒక ఆదివారం మధ్యాహ్నం ఆ సన్నివేశం మొత్తం ఒక టీవీ ఛానెల్ వారు (మా టీవీ?) చక్కగా ప్రసారం చేశారు. చాలా మంది చూసే ఉంటారు. కానీ ఎవరూ అభ్యంతరపెట్టినట్లు దాఖలాల్లేవు.

ఇంతకూ సెన్సార్ బోర్డ్ వారి బాధ్యత తమకు తోచిన సర్టిఫికెట్ ఇవ్వడంతో తీరిపోతుందా? U/A, A సర్టిఫైడ్ సినిమాలు ప్రదర్శించే థియేటర్ల వాళ్ళు టికెట్లిచ్చేతప్పుడు, హాల్లోనూ చిన్న పిల్లలను గమనించి తగిన చర్య తీసుకోవలసిన బాధ్యత ఆ థియేటర్ల యాజమాన్యానికి లేదా? ఇంత బాధ్యతారహితంగా, ఇంత బహిరంగంగా చట్టాన్ని ఉల్లంఘించి తాము చూడగూడని ఆ సినిమాను చూసిన పిల్లలతో కలిసి ఇద్దరు బాధ్యత గల పెద్దమనుషులు నిర్లజ్జగా పాల్గొన్న ఆ కార్యక్రమాన్ని టీవీ ఛానెళ్ళ వాళ్ళు ఇంత బాహాటంగా ప్రదర్శించినా పట్టించుకున్నవాళ్ళే లేరు!
ఇంతకూ సెన్సార్ బోర్డ్ ఎందుకున్నట్లు? ఆ సర్టిఫికెట్లు ఎందుకిస్తున్నట్లు?

Saturday 26 August, 2006

రాబందుల రెక్కల చప్పుడు...


రాబందుల రెక్కల చప్పుడు ఇక వినిపించదా? ఆకాశవిహంగాల్లో రారాజు..రాబందు. ఇది వేటాడే పక్షి. దీన్ని మరే జీవీ వేటాడదు. మరి అలాంటప్పుడు వీటి జాతి దినదినం అభివృద్ధి చెందాలి. కానీ అలా జరగడం లేదు. పైగా ఆందోళన కలిగించేటంత వేగంగా తగ్గిపోతోంది. ఇంకొన్నాళ్ళు పోతే ఈ పక్షి పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. భూమిపై వాటి మనుగడ ప్రశ్నార్థకమైంది. ఇందుకు కారణం డైక్లోఫెనాక్ అనే సూదిమందు. అదేమిటి? ఆకాశంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఎగిరే ఆ పక్షులకు సూదులెవరేస్తారు? ఎలా వేస్తారు? అని ఆశ్చర్యపోకండి. సాధారణంగా రోగాల బారినపడిన గేదెలు, కుక్కలు ఇతర జంతువులకు చికిత్స చేసేందుకు ఎక్కువగా డైక్లోఫెనాక్ అనే సూదిమందును వాడుతారు. చికిత్స చేసినా అవి బతకకపోతే వాటి కళేబరాలను బయట పడేస్తారు. అలా చనిపోయిన జంతువుల కళేబరాలను రాబందులు తింటాయి. (రాబందులే గనక లేకపోయినట్లైతే ఈ శవాల మూలంగా వ్యాధులు ప్రబలకుండా ఉండడానికి చనిపోయిన వాటన్నిటినీీ పూడ్చిపెట్టడమో, లేక కాల్చివేయడమో చేయవలసి వచ్చేది.) ఆ మాంసంలోని డైక్లోఫెనాక్ ప్రభావం వల్ల రాబందుల మూత్రపిండాలు దెబ్బతింటున్నాయి. అందువల్లే అవి త్వరగా చనిపోయి వాటి జాతి అంతరించిపోతోందని గుర్తించారు. ముఖ్యంగా భారత్, నేపాల్, పాకిస్తాన్ దేశాల్లో వేల సంఖ్యలో చనిపోయాయి. ప్రస్తుతం ఈ సూదిమందు మీద మన దేశంలో నిషేధం ఉన్నప్పటికీ అది నామమాత్రంగానే అమలవుతోంది.

రాబందులు అంతరించిపొయే ప్రమాదాన్ని గుర్తించిన కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంట్రల్ జూ అథారిటీ వాటి సంరక్షణ చర్యల్లో భాగంగా రాబందుల సంతానాభివృద్ధికి సహజ వాతావరణాన్ని కల్పించేందుకు హైదరాబాదులోని నెహ్రూ జంతుప్రదర్శనశాలతోబాటు రాజస్థాన్ రాష్ట్రంలో కూడా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక నగరంలో వన్యప్రాణుల కృత్రిమ గర్భధారనకు కృషి చేస్తోన్న సీసీఎంబీ పావురాలు, జింకలు, దుప్పులు, కుందేళ్ళతో బాటు రాబందుల వీర్యాన్ని కూడా సేకరించింది.(ఆధారం: 23-8-2006 నాటి ఈనాడు హైదరాబాదు జిల్లా పత్రికలో వచ్చిన వార్తాకథనం)

మీకు తెలుసా?
మీరొక వింత గమనించారా? రాబందులకు తలమీదగానీ, మెడమీదగానీ అసలు బొచ్చే ఉండదు. ఎందుకో ఊహించండి:
ఎందుకంటే శవాలే రాబందుల ప్రధాన ఆహారం కాబట్టి. జంతువుల కళేబరాలను తింటున్నపుడు అవి తమ తలలను ఆ శవాల లోపలికి -ముఖ్యంగా పక్కటెముకల మధ్యలోకి- బాగా లోతుగా చొప్పించ వలసివస్తుంది. అలా తరచుగా చెయ్యడం వల్ల వాటికి బొచ్చు గనక ఉన్నట్లైతే ఆ బొచ్చులో శవాల మాంసఖండాలు చిక్కుకుపోయి, వాటిని తొలగించేవాళ్ళు లేక అక్కడే కుళ్ళిపోయి, రాబందుల అనారోగ్యానికి, తద్వారా చావుకు దారితీసేవి. అంటే రాబందుల తల మీద, మెడ మీద బొచ్చు లేకపోవడం డార్విన్ చెప్పిన నాచురల్ సెలక్షన్ అన్నమాట!

Saturday 19 August, 2006

జానపదం-2

జనుల కోరిక మేరకు మళ్ళీ జానపదం: :)


**************************************
బృందగేయం - కలుపు పాట - హాస్యప్రధానం
తోడిస్వరాలు - దేశాది తాళం
**************************************

ఓరి మగడా! వయ్యారి మగడా
నా ఏలుపడే పాటుసూడు ఓరి మగడా
గొట్లూరు సెరువు కింద ఓరి మగడా
నేను వరిమడి నాటబోతి ఓరి మగడా

వరిమడి నాటబోతి ఓరి మగడా
నేను గెనుం వార మునుం పడితి ఓరి మగడా
గెనుం వార మునుం పడితె ఓరి మగడా
నన్నెండ్రకాయ తేలు గుట్టె ఓరి మగడా ||ఓరి||

ఎండ్రకాయ తేలు గుట్టె ఓరి మగడా
నాకు ఒళ్ళు సర్తుబోసినాది ఓరి మగడా
నాకు ఉలవపిండి పట్టెయ్ ర ఓరి మగడా
నువ్వు రాత్రంత మేలుకోర ఓరి మగడా ||ఓరి||

నాకు వరికూడు వండిపెట్టర ఓరి మగడా
నువ్వు రాగిసంగటి పాంకోర ఓరి మగడా
నాకు గోదుం రొట్టెలు కాల్సి పెట్ర ఓరి మగడా
నువ్వు జొన్నరొట్టెల్ పాంకోర ఓరి మగడా ||ఓరి||

నేను ఉంటానొ పోతానొ ఓరి మగడా
నన్ను ఉయ్యాలలూపించు ఓరి మగడా
నేను సస్చానొ బతుకుతానొ ఓరి మగడా
నాకు సంది బిందె జేయించు ఓరి మగడా ||ఓరి||

నన్నిష్టం జూసే మగనివైతె ఓరి మగడా
నన్నిసనకర్ర తిసర్రాద ఓరి మగడా
నువ్వు కోరుకున్న మగనివైతె ఓరి మగడా
నాకు కోన్నిగోసి పెట్టరాద ఓరి మగడా ||ఓరి||

నువ్వు సేసుకున్న మగనివైతె ఓరి మగడా
నాకు శాపలొండి పెట్టరాద ఓరి మగడా
నువ్వు అక్కరగల్ల మగనివైతె ఓరి మగడా
నన్ను ఆసపట్ల కంపరాద ఓరి మగడా ||ఓరి||


ఈ పాటలోని కొన్ని పదాలకు అర్థాలు-వివరణలు:
ఏలు = వేలు
పాటు = కష్టం
గొట్లూరు = అనంతపురం జిల్లాలోని ఒక గ్రామం
గెనుం/గెనెం/గనిమ = గట్టు; చేలలో వేసే చిన్నకట్ట
మునుం = వరుస; పైరు కోతకు, కలుపుతీతకు ఏర్పరచుకునే వరస
సర్తు = చెమట
పాముకోవడం = (ఆత్రంగా) తినడం
సందిబిందె = ఒక ఆభరణం (అదేమిటో నాకూ తెలీదు )
'అక్కర' అనే మాటకుండే నానార్థాల్లో "శ్రద్ధ", "చెలిమి" ఇక్కడ ధ్వనిస్తున్నాయి.

Tuesday 15 August, 2006

స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు



బాలగంగాధర తిలక్ గురించి క్లుప్తంగా:


బాలగంగాధర తిలక్ ని భారతజాతీయోద్యమ పిత గా పేర్కొంటారు. ఆయనకు ముందు జాతీయోద్యమం లేదని కాదు. కానీ ఆయన జాతీయోద్యమాన్ని కొత్తదారులు పట్టించాడు. దేశవ్యాప్తంగా సామాన్యప్రజల్ని ఆ ఉద్యమంలో పాల్గొనేటట్లు చేయడంలో ఆయన పాత్ర అద్వితీయమైనది. అందుకే ఆయన్ను భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేగిన అశాంతికి మూలకారకుడు (Father of India's unrest)గా భావిస్తారు. అప్పటివరకు కాంగ్రెస్ ప్రతి సంవత్సరం డిసెంబర్ చివరివారంలో మూడు రోజులపాటు సమావేశమై బ్రిటిష్ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలను "pray, pitition, protest" చెయ్యడానికే పరిమితమైంది. తిలక్ దాని గురించి చాలా ఘాటైన విమర్శలు చేశాడు: "మీరు సంవత్సరానికొకసారి మూడు రోజులపాటు సమావేశమై కప్పల మాదిరి బెకబెకలాడడం వల్ల ప్రయోజనం లేదు." అని, "అసలు కాంగ్రెస్ సంస్థ అడుక్కునేవాళ్ళ సంఘం (beggars' institution)" అన్నాడు. కాంగ్రెస్ సమావేశాలను 3-day tamaashaa గా అభివర్ణించాడు. "స్వరాజ్యం నా జన్మహక్కు. దాన్ని నేను పొంది తీరుతాను." అని గర్జించాడు.
ఆయన పాశ్చాత్యవిద్యావిధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిచాడు - అది భారతీయ సాంస్కృతికవారసత్వాన్ని అగౌరవపరచి భారతీయ విద్యార్థులను చిన్నబుచ్చేవిధంగా ఉందని. ప్రజలకు మంచి విద్యను అందించడం ద్వారానే వాళ్ళను మంచి పౌరులుగా మార్చవచ్చనే ఉద్దేశం ఆయనది. ప్రతి భారతీయుడికి/రాలికి భారతీయ సంస్కృతి గురించి, భారతదేశపు ఔన్నతాన్ని గురించి బోధించాలని ఆయన ఆశయం. అందుకే అగార్కర్, విష్ణుశాస్త్రి చిప్లుంకర్ లతో కలిసి "దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ" ని స్థాపించాడు.

ఆ తర్వాత తాను నడిపిన పత్రికలు "మరాఠా", "కేసరి" లలో మొద్దు నిద్రపోతున్న భారతీయులను మేల్కొల్పడానికి పదునైన భాషలో బ్రిటిష్ పాలనలోని వాస్తవ పరిస్థితులను గురించి వివరంగా రాశాడు. బాల్యవివాహాలను నిరసించి వితంతు వివాహాలను స్వాగతించాడు. జాతీయస్ఫూర్తిని రగల్చడానికి వీలున్న ఏ అవకాశాన్నీ ఆయన వదిలిపెట్టలేదు. మొట్టమొదటిసారిగా శివాజీ ఉత్సవాలను, గణపతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా ప్రజలను సమీకరించడం, వారిని జాతీయోద్యమం వైపు నడిపించడం ఆయనే మొదలుపెట్టాడు. తన పత్రికల్లో ప్రజలను రెచ్చగొట్టే రాతలు రాసినందుకు 1897లో ఆయనకు ఒకటిన్నరేళ్ళు కారాగారశిక్ష పడింది. విడుదలయ్యాక ఆయన స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఈ లోపల కాంగ్రెస్ పార్టీ మితవాదులు - అతివాదుల విభేదాల వల్ల రెండుగా చీలిపోయింది.
1906లో దేశద్రోహం నేరం క్రింద ఆయనకు ఆరేళ్ళు ప్రవాసశిక్ష విధించారు. కారాగారంలో ఉన్నప్పుడే ఆయన "గీతారహస్యం" అనే పుస్తకం రాశాడు. ఆయన చరిత్రకారుడు కూడా. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని ఆయన అభిప్రాయం. 1916 ఏప్రిల్ లో హొమ్రూల్ లీగ్ ను స్థాపించి దాని లక్ష్యాలను వివరిస్తూ మధ్యభారతదేశంలో గ్రామగ్రామానా తిరిగాడు. అనీబిసెంటు అదే సంవత్సరం సెప్టెంబర్ లో మొదలుపెట్టి హోమ్రూల్ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసింది. ఆ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో ఒక కోర్టుకేసులో ఆయన లండనుకు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడే, అంటే 1917 ఆగస్టులో అప్పటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ మాంటేగు "బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమైన భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి వీలుగా అన్ని పాలనాంశాల్లో భారతీయులకు అధిక ప్రాధాన్యాన్నివ్వడమే ప్రభుత్వ విధానమని" బ్రిటిష్ ప్రభుత్వం తరపున ప్రకటించాడు. బాధ్యతాయుత ప్రభుత్వమంటే ఎవరికి బాధ్యత వహించే ప్రభుత్వమో, అధిక ప్రాధాన్యమంటే ఎంత ప్రాధాన్యమో, అసలు అది ఎప్పుడిస్తారో ఏదీ స్పష్టంగా లేదు. కానీ బ్రిటిష్ ప్రభుత్వ నిజాయితీని నమ్మిన అనీబిసెంటు ఆ ప్రకటనతో ఉద్యమాన్ని అపేసి ప్రభుత్వానికి తన మద్దతు ప్రకటించింది. అలా ఇద్దరు నాయకులదీ చెరొకదారీ కావడంతో హోమ్రూల్ ఉద్యమం చల్లబడిపోయింది. కానీ ప్రజల్లో తిలక్ రగిలించిన స్ఫూర్తి మాత్రం కొనసాగింది. అందుకే 1920లో తిలక్ చనిపోయినప్పుడు జాతీయోద్యమం చుక్కాని లేని నావ అవుతుందని చాలా మంది భయపడ్డారు.
"గాంధీ అని ఇంకొకాయన ఉన్నాడు గానీ....అబ్బే! తిలక్ ముందర ఏపాటి?" అనుకున్నారు. కానీ "నాయకులు చరిత్రను సృష్టించరు. చరిత్రే నాయకులను సృష్టిస్తుంది." అనే మాటను నిజం చేస్తూ అతి సామాన్యుడిగా జీవితం ప్రారంభించిన గాంధీ తిలక్ మరణంతో ఏర్పడ్డ శూన్యాన్ని అసామాన్యంగా భర్తీ చెయ్యడమే గాక మహాత్ముడి స్థాయికి ఎదిగాడు.

జై హింద్!

Sunday 13 August, 2006

మనం మాట్లాడే ఇంగ్లీషు

చదువరిగారి బ్లాగులో ఎన్నోవాడు?, భావ దారిద్ర్యం, భావ దాస్యం అనే పోస్టులు చదివాక:

తెలుగు బ్లాగరులందరం "ఎన్నవ" అనే మాటను ఇంగ్లీషులో how manieth అనడం మొదలుపెడదాం. ఎవరికైనా అభ్యంతరమా? (దీన్ని యర్రపురెడ్డి రామనాథ రెడ్డి సూచించారు.)

ఆంగ్లభాషలోని కొన్ని పదబంధాలను గుడ్డిగా అరువు తెచ్చుకుని యథాతథంగా వాడెయ్యడం వల్ల మనం భారతీయుల్లా కాకుండా ప్రపంచమంటే ఒక్క ఐరోపా మాత్రమే అని నమ్మేవాళ్ళలా మాట్లాడుతున్నామా అనిపిస్తుంది.. ఉదాహరణకు "Rome was not built in a day." అనే మాటను పదేపదే వినడం, వాడ్డం వల్ల "అబ్బో! రోం నగరం ఎంత పాతదో! దాన్ని ఎన్నాళ్ళు కట్టారో?" అనుకుంటాం. రోం నగరం గురించి ప్రచారంలో ఉన్న పుక్కిటి పురాణాలను నమ్మినా ఆ నగరాన్ని 2,300 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు తెలుస్తుంది. అదే రోం నగరం కంటే నాలుగింతలు పెద్దదీ, చారిత్రక ఆధారాల ప్రకారమే పాతరాతియుగం నుంచి జనావాసాలున్నదీ, పురాణాల ప్రకారం 5,000 సంవత్సరాల క్రితమే నిర్మించబడిందీ, గత వెయ్యేళ్ళ కాలంలో కనీసం పది సార్లు దశలవారీగా నగర నిర్మాణం, విస్తరణ జరిగిందీ అయిన మహానగరం గురించి "Delhi was not built in a day." అని సగర్వంగా చెప్పుకోవచ్చన్న విషయమే మనకు తెలీదు!

ఆంగ్ల భాష ప్రభావం వల్ల ఇప్పటి మన రచయితలకు, పాత్రికేయులకు; వాళ్ళ పుణ్యమా అని సామాన్య జనానికి చాణక్యుడి పేరు కంటే మాకియవెల్లి పేరే బాగా తెలుసు. కాళిదాసును షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అంటారు. ఇలాంటి "షేక్స్పియర్ ఆఫ్ "అనే "బిరుదు" ప్రతి దేశంలో ఒక కవికి ఉంటుంది. అంటే షేక్స్పియర్ ప్రపంచస్థాయి కవి అని, వీళ్ళంతా వారి వారి దేశాల స్థాయిలోనే కవులు అని చెప్పకనే చెప్తున్నారన్నమాట. కనీసం "కాళిదాసు ఏ కాలం వాడు? షేక్స్పియర్ ఏ కాలం వాడు? షేక్స్పియర్ కంటే కొన్ని శతాబ్దాల ముందే అంత గొప్ప సాహిత్యాన్ని సృష్టించిన మన దేశపు మహాకవికి షేక్స్పియర్ తో పోల్చిచెబితే తప్ప మనదేశంలో గుర్తింపు ఉండదా?" అనే ఆలోచనలు లేకుండా మనం గుడ్డిగా సముద్రగుప్తుడిని "Nepolian of India" అని, ఇలా ప్రతి రంగంలోనూ భారతీయ ప్రముఖులను యూరోపియన్ ప్రముఖులకు డమ్మీలుగా మనమే చిత్రించడానికి అలవాటు పడిపోయాం. చాణక్యుడి ఎత్తుల్ని సైతం Machiavellian Tactics అనే అనువదిస్తారు. ఏం? Chanakya's Tactics అని ఎందుకనకూడదు?

నా అభిప్రాయం ఎప్పుడూ ఒక్కటే: మనం వాడే భాష మన భావాలను స్పష్టంగా ప్రతిబింబించాలి. అలా చెయ్యలేనప్పుడు అది ఎంత గొప్ప భాషైనా మనకు పనికిరాదు. అందుకే మనం వాడే భాషను మన అవసరాలకు తగినట్లు మార్చాలి. ఆంగ్లభాష ప్రపంచంలోని వివిధ దేశాల్లో అనేక మార్పులకు లోనయింది. మనం కూడా అవసరమైన మార్పులు చేయాలి.

అవసరమైన మార్పులు కొన్ని:

బంధుత్వాల్లో పెద్ద-చిన్న తేడాలను తెలిపే పదాలు:
అన్న-తమ్ముడు (elder brother-younger brother సరిపోవు. పెద్దన్న-చిన్నన్న-పెద్దతమ్ముడు-చిన్నతమ్ముడు తేడాలను తెలిపే విధంగా ఉండాలి.)
అక్క-చెల్లెలు
cousin, uncle-aunt ల దశావతార విన్యాసాలు ఇక చాలు. విడివిడిపదాలు కావాలి.
బియ్యానికి, అన్నానికి మధ్య గల తేడా స్పష్టంగా తెలియాలి.

ఇలాంటి మార్పులు జరిగేవరకూ ఆ భాష అసంపూర్ణమే.

Thursday 10 August, 2006

హిందీ భాష

మనదేశంలో ప్రాచీనకాలంలో ప్రజలు ఒకరితొ ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టినప్పుడు సహజంగా ఏర్పడిన భాష ప్రాకృతం. అంటే "ప్రకృతి" సహజంగా రూపొందిందని అర్థం. ఆ భాషకు పదాల ఉచ్చారణకు, వాక్యనిర్మాణానికి సంబంధించి కొన్ని సూత్రాలు, నియమాలు ఏర్పరిచి "సంస్కరిస్తే" అది సంస్కృతమైంది. సంస్కరించబడింది సంస్కృతం. (క్రీస్తు పుట్టడానికి 500 ఏళ్ళక్రితం పాణిని రాసిన సంస్కృత వ్యాకరణగ్రంథం అష్టాధ్యాయి ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత ప్రామాణిక వ్యాకరణగ్రంథం). ప్రజల భాష ఐన ప్రాకృతానికి మరో రూపమే పాళీ భాష. బుద్ధుడి కాలం నుంచి మధ్యయుగంలో విదేశీ దండయాత్రలు మొదలయ్యేవరకు ఉత్తరభారతదేశమంతటా అదే ప్రజల భాష. తురుష్క సుల్తానుల కాలంలోనూ, మొఘలు చక్రవర్తుల కాలంలోనూ తురుష్క, పర్షియన్, తదితర పశ్చిమాసియా, ఐరోపా దేశాలవారి సాంగత్యంతో ప్రజల భాష పూర్తిగా మారిపోయింది. అనేక పరభాషాపదాలు వచ్చి చేరాయి. కొన్ని సంస్కృత పదాలు, కొన్ని ప్రాకృతపదాలు, కొన్ని విదేశీ పదాల కలయికతో ఒక కొత్త భాష పుట్టింది. అదే హిందీ! మొదట్లో హిందీ భాషకు ఒక లిపి అంటూ లేదు. అందుకే మన రాజ్యాంగంలో 343వ ఆర్టికల్లో "Official language of the Union.—(1) The official language of the Union shall be Hindi in Devanagari script." అని ప్రత్యేకంగా పేర్కొన్నారు.

348. Language to be used in the Supreme Court and in the High Courts and for Acts, Bills, etc.—(1) Notwithstanding anything in the foregoing provisions of this Part, until Parliament by law otherwise provides—

(a) all proceedings in the Supreme Court and in every High Court,

(b) the authoritative texts—

(i) of all Bills to be introduced or amendments thereto to be moved in either House of Parliament or in the House or either House of the Legislature of a State,

(ii) of all Acts passed by Parliament or the Legislature of a State and of all Ordinances promulgated by the President or the Governor of a State, and

(iii) of all orders, rules, regulations and bye-laws issued under this Constitution or under any law made by Parliament or the Legislature of a State,
.
.
.
.
.
.
.
shall be in the English language.

ఇలా హిందీని నామమాత్రపు అధికారభాషగా ప్రకటించాక ఆ భాషతో పెద్దగా పరిచయం లేని దక్షిణాది రాష్ట్రాలవాళ్ళు - మరీ ముఖ్యంగా తమిళులు - అభ్యంతరం తెలిపారు. దాని ఫలితమే త్రిభాషాసూత్రం: ఎవరి మాతృభాషను వాళ్ళు నేర్చుకుంటారు. మనదేశం బహుభాషాసమాజం కాబట్టి ఆంగ్లభాష అనుసంధానభాషగా ఉంటుంది. ప్రతి రాష్ట్రంలోనూ బళ్ళలో పిల్లలకు వారి మాతృభాష, ఆంగ్లభాషకు తోడు ఇంకొక భాష నేర్పాలి. దక్షిణాది రాష్ట్రాల్లో ఆ ఇంకొక భాష హిందీ కాగా హిందీ అధికారభాషగా ఉండే రాష్ట్రాల్లో ఏదైనా ఒక దక్షిణాది భాష ఉంటుంది. ఐతే ఈ త్రిభాషాసూత్రాన్ని అమలు చేస్తున్న ఏకైక ఉత్తరాది రాష్ట్రం హర్యానా కాగా వాళ్ళు నేర్చుకుంటున్న దక్షిణాది భాష తెలుగు. ఇక్కడ మనం మొక్కుబడిగా హిందీ నేర్చుకున్నట్లే అక్కడ వాళ్ళు తెలుగు నేర్చుకుంటారు.

దీన్ని బట్టి తెలిసేదేమిటి? పేరుకు హిందీ అధికారభాషే గానీ ఆచరణలో హిందీతో సహా అన్ని భారతీయ భాషల పరిస్థితీ ఒకటేనని.

Tuesday 1 August, 2006

జట్టిజాం పాటలు

కె. మునయ్య రాసిన "రాయలసీమ రాగాలు" (తెలుగు అకాడెమీ ప్రచురణ) నుంచి:


వెన్నెలరేలలో స్త్రీలు మండలాకారంలో నిలబడి ఉభయపార్శ్వాలలో ఉద్దికత్తెలతో ఒద్దికలు చెడకుండా ఒకసారి కుడితట్టునకు, ఇంకొకసారి ఎడమతట్టునకు తిరిగి ఆయా వైపులనుండే వారి అరచేతులను తమ అరచేతులతో తట్టుతూ గుండ్రంగా అడుగులు వేసి తిరుగుతూ పాడుతూ ఆడే ఆటనే "జట్టిజాము" అంటారు. జానపద స్త్రీలు వెన్నెలరాత్రుల్లో ఆడే ఆట కాబట్టి జట్టిజాముగా మారిందని నా ఊహ (జట్టి అనే మాట యక్ష శబ్దభవమైన జక్కిణి రూపాంతరం కావచ్చు). ఈ క్రీడకు ఎలాంటి వాయిద్యాలుండవు. చేతి చరుపులు, కరకంకణ నిక్వాణాలే వారి పాటలకు వాయిద్యాలు. పెన్నుద్దికత్తె పాట పాడగా మిగతా ఉద్దులు ఆ పాట అందుకుని పాడతారు. యుగళగీతాలు ఉద్దులు ఉద్దులుగా పాడుకుంటారు. జట్టిజాంలో భక్తిరసప్రధానమైన గేయాలే కాక హాస్య, శృంగార, పురాణ వీరరస గేయాలు కూడా చోటు చేసుకున్నాయి.

"జట్టిజాం" రూప నిష్పత్తిని గురించి ఆచార్య తూమాటి దోణప్పగారు కూడా ఒక వివరణ ఇచ్చియున్నారు. "సంస్కృతంలో చేతికోల అనే అర్థమిచ్చే యష్టి శబ్దం ప్రాకృతంలో జట్టిగా మారింది. అట్లే ప్రహారమనే అర్థం గల యమ శబ్దం ప్రాకృతంలో జామ అయింది. రెంటిని జోడింపగా జట్టిజామ, దాన్నుంచి తెలుగులో జట్టిజాం - మొదట కోలాటంలో వలె చేతికోలలతో ఆడే ఆట కాలక్రమంలో ఉత్తచేతులతో ఆడడం మిగిలిందేమో? వెన్నెలవెలుగులో మండలాకారంలో నిలబడి ఇరువైపులా ఉండే ఉద్దికత్తెలతో ఒద్దికలు చెడకుండా ఒకసారి కుడివైపుకు, ఇంకొకసారి ఎడమవైపుకు పార్శ్వం నాలుగు భంగిమల్లో ఓరగా తిరిగి ఆయా వైపులనుండే వారి అరచేతులను తన అరచేతులతో తట్టుతూ పాటలు పాడుట ఇది."

కడప జిల్లా ప్రాంతాల్లో వలయాకారంగా అడుగులు వేసి తిరుగుతూ తరుణులు జట్టిజాము వేయడం కూడా వాడుకలో ఉంది.

ఒక జట్టిజాం పాట:


కొత్తగా పెళ్ళైన పడుచు జంట. కొత్తపెళ్ళాం పరువంలోని ఒంపుసొంపులకు, ఒయ్యారాలకు, నయగారాలకు మురిసిపోయినాడు ఆ మగడు. వళ్ళు మరచిపోయినాడు. తన సంతోషాన్ని మనసులో దాచుకోలేకపోయినాడు. అందుకే తన ముద్దులభార్య అందాన్ని హద్దు తెలియనంతగా అందంగా, మధురంగా తన మాటల్లో వర్ణించినాడు. తన అందానికి వివశుడై, తన వశమై పోయినాడని తెలుసుకున్న ఆ వగలాడి వాడిని ఎలాంటి కోరికలు కోరిందో, వాడిని చెవులు పట్టి ఎలా ఆడిస్తుందో సున్నితమైన ప్రణయ భావాల హాస్యపు విరిజల్లులు కురిపించే ఈ పాట చూడండి:
*****************************
బృందగేయం - జట్టిజాం పాట - ప్రణయప్రధానం
దాంపత్యప్రణయం
ఖరహరప్రియ స్వరాలు - ఆదితాళం

*****************************


అతడు: తుమ్మేదలున్నాయేమిరా - దాని కురులు
కుంచెరగులపైన - సామంచాలాడేవేమిరా

ఆమె: ఏటికిపోరా - శాపల్ తేరా
బాయికి పోరా - నీల్లూ తేరా
బండకేసి తోమర మగడా
సట్టీ*కేసి వండర మగడా
శాపల్ నాకూ - శారూ నీకూ రా
ఒల్లోరే మగడా! బల్లారం మగడా
బంగారం మగడా... అహ
శాపల్ నాకూ - శారూ నీకూ రా
అహ తుమ్మేద...

ఆమె: కూలికిపోరా - కుంచెడు తేరా
నాలికి పోరా - నల్దుం** తేరా
వత్తా పోతా - కట్టెల్ తేరా
కట్టం నీకు కమ్మల్ నాకూ రా
ఒల్లోరే మగడా! బల్లారం మగడా
బంగారం మగడా...
కట్టం నీకు కమ్మల్ నాకూ రా
తుమ్మేద...

ఆమె: రోలూ తేరా - రోకలి తేరా
రోటి కాడికి నన్నెత్తుకపోరా
కులికి కులికిదంచర మగడా
శాటలకేసి సెరగర మగడా
శాటలకేసి సెరగర మగడా
బియ్యం నాకు - తవుడు నీకూ రా
ఒల్లోరే మగడా! బల్లారం మగడా
బంగారం మగడా...
బియ్యం నాకు - తవుడు నీకూ రా
తుమ్మేద...

ఆమె: రెడ్డీయేమో దున్నను పాయ
రెడ్డీసాని ఇత్తను పాయ
నాల్గుకాల్ల కుందేల్ పిల్లా
నగతా నగతా సంగటి తెచ్చె
సంగటి నాకు - సూపుల్ నీకూ రా
ఒల్లోరే మగడా! బల్లారం మగడా
బంగారం మగడా...
సంగటి నాకు - సూపుల్ నీకూ రా
తుమ్మేద...

*సట్టి(చట్టి) = కుండ
**నల్దుం = నాలుగు తూములు (8 శేర్లు)