Wednesday 12 November, 2008

తెలుగు పతాక ఆవిష్కరణ, తెలుగు శాసనాల మ్యూజియం

సి.పి.బ్రౌన్ 210వ జయంతి సందర్భంగా నేడు సి.పి. బ్రౌన్ భాషాపరిశోధక కేంద్రంలో తెలుగు పతాకం ఆవిష్కరణ జరుగుతోంది. భారత జాతీయ పతాకాన్ని రూపొందించిందే ఒక తెలుగువాడైనప్పుడు ఆ తెలుగువారి పతాకం ఇంకెంత గొప్పగా ఉంటుందో చూడాలనే ఆసక్తితో తెలుగు నేలకు వచ్చి నిరాశ చెందిన సి.పి. బ్రౌన్ చుట్టం గురించి జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారి కథ "తెలుగు పతాకం" నిరుడు సాహిత్యనేత్రం నిర్వహించిన కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందింది. తెలుగు భాష ప్రస్తుత స్థితిని, ప్రసార మాధ్యమాల్లో తెలుగు స్థాయిని చక్కగా విశదీకరించిన ఆ కథను, ఆయన ఆ కథ రాయడం వెనకున్న నేపథ్యం గురించి మీరు చదివే ఉంటారు. ఇప్పుడు అలాంటివారు నిరాశ చెందకుండా మనం వారికి తెలుగు పతాకాన్ని చూపించొచ్చు. ఈ ఆవిష్కరణోత్సవానికి ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి, సాహిత్యనేత్రం సంపాదకులు శశిశ్రీ, శ్రీకృష్ణదేవరాయ, యోగి వేమన విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సెలర్లు హాజరౌతున్నారు. ఈనాడులో వచ్చిన వార్త:

నేడు తెలుగు పతాక ఆవిష్కరణ
కడప నగరం, న్యూస్‌టుడే : తెలుగుభాషకు ప్రాచీన హోదా లభించిన నేపథ్యంలో బ్రౌన్‌ 210వ జయంతిని పురస్కరించుకొని బ్రౌన్‌ గ్రంథాలయంలో బుధవారం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వీసీ రామచంద్రారెడ్డి చెప్పారు. ఈసందర్భంగా తెలుగు పతాకాన్ని ఆవిష్కరించనున్నామన్నారు. సాయంత్రం 6 గంటలకు సభ మొదలువుతుందని ముఖ్యఅతిథిగా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వీసీ పి.కుసుమకుమారి రానున్నారన్నారు. విశిష్ఠ అతిథిగా కలెక్టర్‌ ఎం.టి.కృష్ణబాబు, గౌరవ అతిథులుగా డా. జానుమద్ది హనుమచ్ఛాస్త్రి, ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి, శశిశ్రీ హాజరవుతున్నారు. గ్రంథాలయానికి పుస్తకాలు ఇచ్చిన వారిని సత్కరించనున్నామని చెప్పారు. ఇంకా విలేకరుల సమావేశంలో తెలుగుభాష పరిశోధకుడు కట్టా నరసింహులు, పీఆర్వో డా. మూలె మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.

బ్రౌన్ జయంతిని పురస్కరించుకొని కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో సి.పి. బ్రౌన్ మెమోరియల్ సెంటర్, తెలుగు శాసనాల మ్యూజియం కూడా నెలకొల్పుతున్నారు. తెలుగుకు ప్రాచీన భాషగా గుర్తింపు వచ్చిన నేపథ్యంలో సి.పి. బ్రౌన్ మెమోరియల్ సెంటర్ ప్రాచీన భాషా పరిశోధనాకేంద్రంగా పనిచేస్తుందని, విశ్వవిద్యాలయం బ్రౌన్ రచనలన్నింటినీ ఆధునీకరించి, డిజిటైజ్ చేస్తుందని, ఇందుకోసం బ్రౌన్ లేఖలు, డైరీలను చెన్నై మ్యూజియం నుంచి ఇక్కడికి తెప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని యోగి వేమన విశ్వవిద్యాలయం వీసీ ఆర్జుల రామచంద్రారెడ్డి చెప్పారు. వివరాలు హిందూలో.

3 comments:

రవి వైజాసత్య said...

అర్జుల రామచంద్రారెడ్డి అంటే హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ప్లాంట్ జెనెటిక్స్ ఆచార్యులుగా పనిచేసిన మా మాష్టారేనా?

Anonymous said...
This comment has been removed by a blog administrator.
త్రివిక్రమ్ Trivikram said...

ఔను రవీ,

ఆయనే! ఎన్వికీలో చూడండి:

http://en.wikipedia.org/wiki/Arjula_Ramachandra_Reddy