పాండవులెవరు?
ఓరి దేవుడో! ఈ బ్లాగులో నేను టపా రాసి సంవత్సరమైందా? ఎంతన్యాయం? అరిఝెంటుగా ఏదోకటి రాసెయ్యాలి. అరిఝెంటుగా రాసెయ్యాలనుకున్నాను కాబట్టి అవుడియాలేం లేవు. అందుకే ఈసారికిలా సర్దుకుపోండి. విషయమేమిటంటే నిన్నటి ఈనాడు పేపర్లో ఆంతర్యామి శీర్షికలో ఒక ఆసక్తికరమైన వ్యాసం చదివాను. ఇది నిజంగా పాండవుల పుట్టుకపై కొత్తచూపే. ఈ లంకె ఇంకో మూణ్ణెళ్ళు మాత్రమే పనిచేస్తుంది. వ్యాసంలోని ముఖ్యాంశాలను ఇక్కడ ఇస్తున్నాను:
- తటవర్తి రామచంద్రరావు
వ్యాసమహర్షి మహాభారతంలో భూమికి ప్రతిస్వరూపమైన కుంతిని సృష్టించాడు. కు అంటే భూమి. కుంతి అంటే భూ స్వరూపమే. కుంతికి పృధ అని మరో పేరుంది. అంటే పృధ్వి అని అర్థం.
ఆమె ముందు ప్రత్యక్షమైన సూర్యదేవుడు ఆమె నాభిని స్పృశించి ఆమె గర్భంలో ప్రవేశించి స్వర్ణకవచకుండలాలతో ఉన్న కర్ణుడికి జన్మకారకుడైనాడు. అంటే, సూర్యకిరణాల సహాయంతో భూమి మీద జీవరాశి ఉద్భవించిందనటానికి సంకేతం. వృక్షరాజ్యానికిది నాంది పలికింది. కర్ణ అంటే ధాన్యమని మరో అర్థం. అంటే కర్ణుడు వృక్షాలకు మూలమైన విత్తనాలకు సంకేతం. నీళ్ళు లేనిదే విత్తనం మొలకెత్తదు. అందుకే కుంతి కర్ణుడిని బుట్టలో పెట్టి నదిలో వదిలింది. ఆ బుట్టను అధిరథుడు చూసి కర్ణుణ్ని ఒడ్డుకు తెచ్చాడు. అధిరథుడంటే సారథి అని అర్థం. కర్ణుడి జీవితానికి అతను నిజంగానే సారథి. ఆ తరవాత కర్ణుడు అంగరాజు అయ్యాడు. అంటే శరీరాంగాలకు రాజు అయ్యాడు. శరీరాన్ని పోషించేది ఆహారం కనుక దానికి మూలాధారమైనాడు. మనకు ఆహారంగా లభ్యమయ్యే కూరలకు, పళ్ళకు, ధాన్యానికి పైన రక్షణగా తొక్క, బెరడు, పొట్టు లాంటివేవో ఒకటి ఉంటాయి. కర్ణుడి కవచం దానికి సంకేతం. ప్రతి చెట్టునుంచీ పళ్ళు వేలాడతాయి. కర్ణుడి కుండలాలు వాటికి చిహ్నాలు.
సూర్యశక్తితో ప్రథమపుత్రుడి ద్వారా వృక్షజాతికి జన్మనిచ్చిన కుంతి, జంతుజాతిలో అత్యుత్తముడిగా పుట్టిన మనిషికి కావాల్సిన అయిదు శక్తులకు పంచపాండవుల ద్వారా జన్మకారకురాలైంది.
బుద్ధికి యుధిష్ఠిరుడు, మనస్సుకు భీముడు, ప్రాణానికి అర్జునుడు, కాళ్ళుచేతులకు నకుల సహదేవులు సంకేతాలు. ఒకరి తరవాత ఇంకొకరు పుట్టటంలో కూడ ఒక అర్థం ఉంది. తల్లి గర్భం నుంచి ముందు బయటకు వచ్చేది బిడ్డతల. అక్కడే బుద్ధి ఉండేది. తరవాత వచ్చేవి కనుబొమలు. వాటిమధ్యనే కేంద్రీకృతమయ్యేది మనస్సు. తరవాత చెవులు, ముక్కు, నోరు బయటకు వస్తాయి. ప్రాణాధారమైన ఊపిరికి అవే ఆలవాలాలు. అక్కడితో మనిషి పుట్టుకకు నాంది జరిగింది. అయితే, ఆ శరీరం పనిచేయటానికి కాళ్ళు చేతులు కావాలి. అవి రెండు రెండుగా ఉండటమే కాకుండా ఒకేలా ఉంటాయి. నకుల సహదేవులు కవలలుగా పుట్టటం కూడా దానికే సంకేతం!
పైన చెప్పినట్లు మనిషి జీవితానికి అవసరమైన సృష్టి కుంతీపుత్రుల రూపంలో జరిగిందని వ్యాసమహర్షి తన మహాభారతకథ ద్వారా మనకు సూచించాడు. భూమిని రక్షించుకోకపోతే భవిష్యత్తులో మనిషి మనుగడకు ప్రమాదం సంభవిస్తుందని అంతా గుర్తించాల్సిన సమయమిది!













4 వ్యాఖ్యలు:
నిజంగానే కొత్తగా ఉంది. అసలు మనవాళ్ళు వేదాలూ, పురాణాల్లో జ్ఞానాన్నంతా ‘కోడీకరిస్తే’, దాన్ని ‘డీ-కోడికరించే’ ‘కీ’మాత్రం సంస్కృతంలో ఉండిపోయి కాలక్రమంలో చచ్చిపోయింది. ఇది మన ఖర్మమో!, కాలానికే తెలిసిన మర్మమో!!
aahaa
OhO
raabhaNaasura vyaaKya adurs
మహేష్ గారూ!
చాలా బాగా చెప్పారు.
ఒరెమూనా!
'రాభణాసుర' వ్యాఖ్య ఏమిటి?
Let's come together on http://www.apjunction.com to bring all the Telugu people unite on one platform and find Telugu friends worldwide to share our thoughts and create a common bond.
Let's also show the Mightiness of Telugu people by coming together on http://www.apjunction.com
Post a Comment