Sunday 1 April, 2007

జైనమతంలో అహింస

అన్ని మతాలూ అహింస గురించి చెప్పినా అహింసను మరీ ఆచరణసాధ్యం కానంత తీవ్ర స్థాయికి తీసుకెళ్ళింది మాత్రం జైనమతమే. జైనమతం ప్రజాదరణ పొందలేకపోవడానికి కూడా అదే కారణమేమో? ఎందుకంటే గాలి పీలిస్తే గాల్లోని సూక్ష్మజీవులు చచ్చిపోతాయని మూతికి గుడ్డ కట్టుకుంటారు. నీళ్ళు వడగట్టుకుని తాగడం సరే, అడుగు తీసి అడుగువేసేటప్పుడు కాలికింద పడి సూక్ష్మజీవులు చచ్చిపోతాయని నెమలీకలతో చేసిన పొరకతో నడిచినంతమేరా అడుగేసేముందు నేలను ఊడ్చుకుంటూపోతారు. ఇలాంటివాళ్ళు నేలను చీల్చి దున్నే వ్యవసాయం ఏం చేస్తారు చెప్పండి? అందుకే జైనులు బతకడానికి వ్యాపారాలు (వడ్డీ వ్యాపారంతో సహా) చేయవలసిందేగానీ వ్యవసాయం చేయడానికి లేదు. వ్యవసాయం చెయ్యకపోతే తిండెలా వస్తుంది? జనాలెలా బ్రతుకుతారు? ఈ విపరీతధోరణి వాళ్ళు జీవులను ఏకేంద్రియ నుంచి పంచేంద్రియ వరకు చేసిన వర్గీకరణలో కూడా కనబడుతుంది:
జైనమతం పంచ భూతాలకు సంబంధించిన జీవుల గురించి ఇలా చెప్తుంది: పృథ్వీకాయ, అప్కాయ, తేజోకాయ, వాయుకాయ, వనస్పతికాయ జీవులు. ఇవి ఏకేంద్రియ జీవులట (స్పర్శజ్ఞానం మాత్రమున్నవి). అవి వాటినెవరైనా తాకితే గుర్తుపడతాయట.
రాళ్ళు, మట్టి, గవ్వల్లాంటివి పృథ్వీకాయ జీవులు.
నీటికున్న వేర్వేరు రూపాలు మంచు, ఆవిరి, నీరు, వానలాంటివి అప్కాయ జీవులు.
మంట, మెరుపు, బూడిద లాంటివి తేజోకాయ జీవులు.
గాలి, పెనుగాలి, తుఫాన్ లాంటివి వాయుకాయ జీవులు.
ఇక వృక్ష సంబంధమైన వనస్పతిక జీవుల్లో మొక్కలు, పొదలు, చెట్లు, వాటి బెరడు, కాండం, ఆకులు, విత్తనాలు...వీటిలో ఒక్కోదానిలో ఒక్కో ఆత్మే ఉంటుందట. అందుకని ఇవి ఏకకాయజీవులు. ఉర్లగడ్డలు, కంద, చేమ, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, మొదలైనవి అసంఖ్యాక ఆత్మలు గల బహుకాయజీవులు. ఈ రెండు రకాలూ వనస్పతిక జీవులే.

ఈ ఐదు రకాల జీవుల్లో ఒక్కో జీవికీ 4 ప్రాణాలు (స్పర్శ, శ్వాస, శరీరం, ఆయుష్షు) ఉంటాయట. ఇక పంచేంద్రియజీవులకు 10 ప్రాణాలుంటాయని వాళ్ళ నమ్మకం. ఈ ఏకేంద్రియ జీవులు కూడా పదార్థాన్ని ఆహారం, శరీరం, ఇంద్రియాలు, శ్వాసోశ్వాసలు అనే నాలుగు మార్గాల ద్వారా స్వీకరించి దాన్ని శక్తిగా మార్చుకుని బతుకుతాయట.

1 comment:

సత్యసాయి కొవ్వలి Satyasai said...

వాళ్ళు నేలకింద పండే దుంపకూరలు, ఉల్లి,వెల్లుల్లి, మసూర్ గింజల్లాంటివి కూడా తినరు. నన్నడిగితే సాటి మనిషిని పీడించకుండా ఉన్నవాడే నిజమైన శాకాహారీ, అహింసాపరుడూ అంటా.