Wednesday 21 March, 2007

శాసనవ్యవస్థ-న్యాయవ్యవస్థ

గత ఐదు రోజులుగా సభాకార్యక్రమాలు బొత్తిగా సాగకపోవడం వల్ల లోక్ సభ బడ్జెట్ సమావేశాలను ఒకరోజు ముందుగానే ముగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. శుభం! ఘనత వహించిన మన పార్లమెంటు సభ్యులు -బాహాబాహీ, కచాకచి, ముష్టాముష్టి- అవసరమైతే ఎంతకైనా తగుదుమని ఈ సమావేశాల్లో మరోసారి నిరూపించారు. సరిగ్గా ఈ సమావేశాలు జరుగుతున్నప్పుడే శాసనమండలి ఎన్నికలు (చదువుకున్నోళ్ళ ఓట్లు) జరిగాయి. రాష్ట్రస్థాయిలో ఎగువసభ అవసరమా అన్న విషయం పక్కనపెట్టి ఈ ఎన్నికల్లో పోటీకి నిలిచిన అభ్యర్థులను బట్టి చూస్తే ఒక్కో నియోజకవర్గంలో అర్హులైన అభ్యర్థులు ఒకరికంటే ఎక్కువమందే నిలిచినట్లనిపించింది. ప్రథమప్రాధాన్యత ఓటును ఎవరికి వెయ్యాలన్నది నిర్ణయించుకోవడం కాస్త కష్టమనిపించింది...(దిగువసభ ఎన్నికల్లో ఎవరో ఒకరికి ఓటెయ్యాల్సిరావడం ఎంత కష్టమో అంత కష్టం కాదులెండి). దిగువసభలైన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో "None of the above " ఆప్షన్ ఎప్పటికి వస్తుందో ఏమో?

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశపు పౌరుడినైన నాకు రాజ్యాంగ, ప్రభుత్వ పాలనాపరమైన విషయాల్లో మన (ప్రజలెన్నుకున్న) చట్టసభల మీదకంటే ఉన్నత న్యాయస్థానాల మీదే నమ్మకం, గౌరవం ఎక్కువ. ఐతే సాధారణ కేసులను సైతం పరిష్కరించడంలో జరిగే అసాధారణ జాప్యం న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని పోగొడుతోంది. మొత్తానికి ఎవరూ వాళ్ళు చెయ్యాల్సిన పనిని సక్రమంగా చెయ్యడం లేదన్నమాట. :( మచ్చుకు ఇటీవల కడపలో జరిగిన ఒక సంఘటన:

http://www.hindu.com/2007/03/04/stories/2007030411470400.htm

25 యేళ్ళ కిందట తమ సర్వస్వం కోల్పోయిన సోమశిల మునకప్రాంతాల వారికి నష్టపరిహారం ఇంకా అందలేదు. ఐనా నష్టపరిహారం కోసం వాళ్ళు ఏ మాత్రం ఆగ్రహించక, ఎంతో ఓపికతో ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. వారికిచ్చే నష్టపరిహారం పాతికేళ్ళ కిందటి లెక్కలప్రకారం. పరిష్కరించిన కేసులు 700, మిగిలి ఉన్నవి 1907. విషయం తెలుసుకున్న హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ అధ్యక్షుడు బిలాల్ నజ్కీ "25 యేళ్ళ కిందట తమ సర్వస్వం కోల్పోయినవారికి నష్టపరిహారం ఇంకా అందించలేని వ్యవస్థలో తానూ ఒకడినైనందుకు సిగ్గుపడుతున్నా"నని అన్నారు. పరిహారం కోసం ఇంకా ఎంతో సహనంతో ఎదురుచూస్తున్న బాధితుల ఔదార్యానికి సెల్యూట్ చెయ్యాలని అనడమేకాదు, ఈ నెలాఖర్లోగా మిగిలిన కేసులు పరిష్కరించకపోతే ఇక ఇక్కడి బాధితులకు తన మొహం చూపించలేనని, జీవితంలో మళ్ళీ ఇక్కడికి రాబోనని అన్నారు. ఇక్కడ శాశ్వత లోక్ అదాలత్ ప్రారంభించడానికి వచ్చిన హైకోర్టు న్యాయమూర్తులకు బార్ అసోసియేషన్ సన్మానం చేయబోగా సన్మానాలకు తాము అర్హులం కామంటూ వారిని వారించి తమకు అందవలసిన పరిహారం ఇన్నేళ్ళుగా అందకపోయినా ఎంతో ఆదరాభిమానాలతో తమను ఆహ్వానించిన లబ్ధిదారులే అందుకు నిజంగా అర్హులని పేర్కొంటూ లబ్దిదారులను శాలువాలతో సన్మానించారు.


పెండింగ్ అప్పీళ్ళను పరిష్కరించడానికి దేశంలోనే ప్రప్రథమంగా ఒక జిల్లా కోర్టులో హైకోర్టు బెంచ్ లోక్ అదాలత్ నిర్వహించింది ఇక్కడే.

No comments: