Tuesday 15 August, 2006

స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు



బాలగంగాధర తిలక్ గురించి క్లుప్తంగా:


బాలగంగాధర తిలక్ ని భారతజాతీయోద్యమ పిత గా పేర్కొంటారు. ఆయనకు ముందు జాతీయోద్యమం లేదని కాదు. కానీ ఆయన జాతీయోద్యమాన్ని కొత్తదారులు పట్టించాడు. దేశవ్యాప్తంగా సామాన్యప్రజల్ని ఆ ఉద్యమంలో పాల్గొనేటట్లు చేయడంలో ఆయన పాత్ర అద్వితీయమైనది. అందుకే ఆయన్ను భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేగిన అశాంతికి మూలకారకుడు (Father of India's unrest)గా భావిస్తారు. అప్పటివరకు కాంగ్రెస్ ప్రతి సంవత్సరం డిసెంబర్ చివరివారంలో మూడు రోజులపాటు సమావేశమై బ్రిటిష్ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలను "pray, pitition, protest" చెయ్యడానికే పరిమితమైంది. తిలక్ దాని గురించి చాలా ఘాటైన విమర్శలు చేశాడు: "మీరు సంవత్సరానికొకసారి మూడు రోజులపాటు సమావేశమై కప్పల మాదిరి బెకబెకలాడడం వల్ల ప్రయోజనం లేదు." అని, "అసలు కాంగ్రెస్ సంస్థ అడుక్కునేవాళ్ళ సంఘం (beggars' institution)" అన్నాడు. కాంగ్రెస్ సమావేశాలను 3-day tamaashaa గా అభివర్ణించాడు. "స్వరాజ్యం నా జన్మహక్కు. దాన్ని నేను పొంది తీరుతాను." అని గర్జించాడు.
ఆయన పాశ్చాత్యవిద్యావిధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిచాడు - అది భారతీయ సాంస్కృతికవారసత్వాన్ని అగౌరవపరచి భారతీయ విద్యార్థులను చిన్నబుచ్చేవిధంగా ఉందని. ప్రజలకు మంచి విద్యను అందించడం ద్వారానే వాళ్ళను మంచి పౌరులుగా మార్చవచ్చనే ఉద్దేశం ఆయనది. ప్రతి భారతీయుడికి/రాలికి భారతీయ సంస్కృతి గురించి, భారతదేశపు ఔన్నతాన్ని గురించి బోధించాలని ఆయన ఆశయం. అందుకే అగార్కర్, విష్ణుశాస్త్రి చిప్లుంకర్ లతో కలిసి "దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ" ని స్థాపించాడు.

ఆ తర్వాత తాను నడిపిన పత్రికలు "మరాఠా", "కేసరి" లలో మొద్దు నిద్రపోతున్న భారతీయులను మేల్కొల్పడానికి పదునైన భాషలో బ్రిటిష్ పాలనలోని వాస్తవ పరిస్థితులను గురించి వివరంగా రాశాడు. బాల్యవివాహాలను నిరసించి వితంతు వివాహాలను స్వాగతించాడు. జాతీయస్ఫూర్తిని రగల్చడానికి వీలున్న ఏ అవకాశాన్నీ ఆయన వదిలిపెట్టలేదు. మొట్టమొదటిసారిగా శివాజీ ఉత్సవాలను, గణపతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా ప్రజలను సమీకరించడం, వారిని జాతీయోద్యమం వైపు నడిపించడం ఆయనే మొదలుపెట్టాడు. తన పత్రికల్లో ప్రజలను రెచ్చగొట్టే రాతలు రాసినందుకు 1897లో ఆయనకు ఒకటిన్నరేళ్ళు కారాగారశిక్ష పడింది. విడుదలయ్యాక ఆయన స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఈ లోపల కాంగ్రెస్ పార్టీ మితవాదులు - అతివాదుల విభేదాల వల్ల రెండుగా చీలిపోయింది.
1906లో దేశద్రోహం నేరం క్రింద ఆయనకు ఆరేళ్ళు ప్రవాసశిక్ష విధించారు. కారాగారంలో ఉన్నప్పుడే ఆయన "గీతారహస్యం" అనే పుస్తకం రాశాడు. ఆయన చరిత్రకారుడు కూడా. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని ఆయన అభిప్రాయం. 1916 ఏప్రిల్ లో హొమ్రూల్ లీగ్ ను స్థాపించి దాని లక్ష్యాలను వివరిస్తూ మధ్యభారతదేశంలో గ్రామగ్రామానా తిరిగాడు. అనీబిసెంటు అదే సంవత్సరం సెప్టెంబర్ లో మొదలుపెట్టి హోమ్రూల్ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసింది. ఆ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో ఒక కోర్టుకేసులో ఆయన లండనుకు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడే, అంటే 1917 ఆగస్టులో అప్పటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ మాంటేగు "బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమైన భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి వీలుగా అన్ని పాలనాంశాల్లో భారతీయులకు అధిక ప్రాధాన్యాన్నివ్వడమే ప్రభుత్వ విధానమని" బ్రిటిష్ ప్రభుత్వం తరపున ప్రకటించాడు. బాధ్యతాయుత ప్రభుత్వమంటే ఎవరికి బాధ్యత వహించే ప్రభుత్వమో, అధిక ప్రాధాన్యమంటే ఎంత ప్రాధాన్యమో, అసలు అది ఎప్పుడిస్తారో ఏదీ స్పష్టంగా లేదు. కానీ బ్రిటిష్ ప్రభుత్వ నిజాయితీని నమ్మిన అనీబిసెంటు ఆ ప్రకటనతో ఉద్యమాన్ని అపేసి ప్రభుత్వానికి తన మద్దతు ప్రకటించింది. అలా ఇద్దరు నాయకులదీ చెరొకదారీ కావడంతో హోమ్రూల్ ఉద్యమం చల్లబడిపోయింది. కానీ ప్రజల్లో తిలక్ రగిలించిన స్ఫూర్తి మాత్రం కొనసాగింది. అందుకే 1920లో తిలక్ చనిపోయినప్పుడు జాతీయోద్యమం చుక్కాని లేని నావ అవుతుందని చాలా మంది భయపడ్డారు.
"గాంధీ అని ఇంకొకాయన ఉన్నాడు గానీ....అబ్బే! తిలక్ ముందర ఏపాటి?" అనుకున్నారు. కానీ "నాయకులు చరిత్రను సృష్టించరు. చరిత్రే నాయకులను సృష్టిస్తుంది." అనే మాటను నిజం చేస్తూ అతి సామాన్యుడిగా జీవితం ప్రారంభించిన గాంధీ తిలక్ మరణంతో ఏర్పడ్డ శూన్యాన్ని అసామాన్యంగా భర్తీ చెయ్యడమే గాక మహాత్ముడి స్థాయికి ఎదిగాడు.

జై హింద్!

3 comments:

Anonymous said...

చాలా బాగుంది త్రివిక్రమ్ . దీనిని వికీ లో చేర్చండీ

త్రివిక్రమ్ Trivikram said...

థాంక్స్ కిరణ్! వికీ లో చేర్చాను. కాకపోతే అక్కడ ఈ వ్యాసాన్ని ఇంకా విస్తరించవలసి ఉంది. :)

Anonymous said...

Jai Hind!!!