ఈ సాయంత్రం నాకు చాలా ఉత్సాహాన్నిచ్చింది. దానికి కారణం ఇంటర్నెట్లో తెలుగు గురించి తెలిస్తే ప్రజల్లో ఎంతటి ఆసక్తి కలుగుతుందో ప్రత్యక్షంగా తెలియడం; పుట్టపర్తివారికి జరిగిన అపచారానికి హైదరాబాదులోని సాహిత్యాభిమానులు, ప్రముఖులు ఒకేలా స్పందించడం. ఐతే మనం వాడే భాష విషయంలో పాటించవలసిన జాగ్రత్తలతో తయారు చేసిన ప్రతిజ్ఞ గురించి మాత్రం తక్షణ స్పందన తెలియలేదు. దానికి ఇంకా సమయం పడుతుంది. అసలేం జరిగిందంటే:
నిన్న ఉదయం నాకొక ఈమెయిల్ వచ్చింది. సాహిత్య, కళారంగాల్లోని ప్రముఖులకు ఈ సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయంలో జరగనున్న సన్మాన కార్యక్రమానికి రావలసిందని. పంపినవారు బహుమతిగ్రహీతల్లో ఒకరైన ప్రముఖ రచయిత 'వసుంధర '.
దాంతో నాకొక ఆలోచన వచ్చింది: పుట్టపర్తివారికి జరిగిన అపచారాన్ని నిరసిస్తూ తెలుగుబ్లాగరుల తరపున చదువరిగారు తయారుచేసిన పిటీషను గురించి, తెలుగుబ్లాగులు, తెవికీల గురించి నలుగురికీ తెలియజెప్పడానికి ఈ సమావేశాన్ని ఒక వేదికగా వాడుకుంటే ఎలా ఉంటుందని. నేనీ విషయం ప్రస్తావించిందే తడవుగా చదువరిగారు ఆఘమేఘాల మీద 300 కరపత్రాలు తీసి నాకు అందజేశారు. (పిటీషను 100 ప్రతులు, తెలుగుబ్లాగులు, తెవికీల పరిచయవాక్యాలు 100 ప్రతులు, భాష విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించిన ప్రతిజ్ఞ 100 ప్రతులు). నేను వాటినందుకుని సమావేశస్థలికి చేరుకుని వచ్చినవారందరికీ పంచడం మొదలుపెట్టాను.
"ఇంటర్నెట్లో తెలుగు..." అని వాసన తగలగానే అక్కడున్న విద్యార్థులంతా ఆసక్తిగా వివరాలడగడం ప్రారంభించారు. నేను చెబుతూండగా అటుగా వచ్చిన విలేకరి ఒకరు నా గురించి వివరాలడిగారు. నేనీ పని తెలుగుబ్లాగరుల తరపున చేస్తున్నాని తెలుపగా, ఆయన తెలుగు బ్లాగరులు తయారు చేసిన వివరాలకు, ప్రతిజ్ఞకు తనకున్న పరిచయాల ద్వారా విస్తృతప్రచారం చేయిస్తానని అడక్కుండానే ముందుకు రావడమేగాక రాష్ట్రవ్యాప్తంగా తెలుగు భాష పట్ల స్పృహ ఒక ఉద్యమ స్థాయిలో రావాలని, ఏబీకేప్రసాద్ లాంటివాళ్ళ సహకారంతో అందుకు తగిన కార్యక్రమాలు రూపొందించుకుని అమలు చేయాలని అనడమేగాక బ్లాగరుల సమావేశాలకు వస్తాననీ, పత్రికల్లో (కనీసం తమ పత్రిక ఆంధ్రప్రభలో) బ్లాగుల గురించి, ఇంటర్నెట్లో తెలుగు వ్యాప్తి గురించి మనం రాసినవి ప్రచురింపజేస్తానని అన్నారు. ప్రసారమాధ్యమాల్లో తెలుగు దీనస్థితి గురించి కూడా నా అభిప్రాయంతో ఆయన ఏకీభవించారు.
విద్యార్థులు కానివాళ్ళు పుట్టపర్తి వారికి జరిగిన అపచారానికి ఆగ్రహం వ్యక్తం చేయడమేగాక మనం చేస్తున్న పనిని అభినందించారు. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుల ఛాంబర్లో కరపత్రాలు అందజేసి విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాలకు వాటి ప్రతులను పంపించమని అక్కడివారిని కోరాను. వారు విషయం తెలుసుకుని సంతోషించి సభకు వచ్చినవారందరికీ వెంటనే పంచెయ్యమని ప్రోత్సహించారు. త్వరలోనే కరపత్రాలన్నీ అయిపోయాయి. ఇంకో వందేసి ప్రతులు తీసుకువచ్చి ఉంటే బాగుండేదనిపించింది.
ఇక సభలో ముందుగా మాట్లాడిన వేటూరి సుందరరామమూర్తి మాట్లాడిన తీరు చూస్తే ఆయన పుట్టపర్తివారికి జరిగిన అపచారాన్ని మంత్రిగారి సమక్షంలో అందరికీ ఎత్తిచూపడానికే సభకు వచ్చినట్లు నాకు అనిపించింది. ఆయన ప్రొద్దుటూరు గురించి చెబుతూ "ఇద్దరు మహాకవుల విగ్రహాలు గల ఊరు ప్రొద్దుటూరు." అని చెప్పారు. ఆ ఇద్దరూ శివతాండవకర్త పుట్టపర్తి, శివభారతకర్త గడియారం వెంకటశేషశాస్త్రి. తర్వాత మాట్లాడిన మంత్రి రోశయ్య కూడా "ఇంతటి అపచారానికి పాల్పడినవారెవరో నాకు తెలియదు గానీ (తెలియకపోతే తెలుసుకోండి సార్! పూర్తిపేరు నంద్యాల వరదరాజుల రెడ్డి. వరుసగా నాలుగోసారి శాసనసభ్యత్వం వెలగబెడుతున్నాడు.) ఎవరు చేసినా ఇది చాలా నీచమైన పని." అని కాసేపు తిట్టి తప్పనిసరిగా దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్ళి, అక్కడ పుట్టపర్తివారి ఒక్క విగ్రహమే ఉండేలా చూస్తానన్నారు. తమ పిల్లల చేత మమ్మీ, డాడీ అని పిలిపించుకోవాలని ఉబలాటపడేవాళ్ళను రోశయ్య సున్నితంగా విమర్శించారు.
అది విన్న నాకు ఈ మధ్యే ఒకసారి FM రేడియోలో నేను విన్న సంభాషణ గుర్తొచ్చింది:
లంగరమ్మ (అక్కినేని నాగేశ్వరరావుతో): మీ పిల్లలు, మనవలు మిమ్మల్ని ఏమని పిలుస్తారు?
అక్కినేని: అమ్మ-నాన్న, అమ్మమ్మ-తాతయ్య.
లంగరమ్మ: ఒకవేళ ఎవరైనా మమ్మీ-డాడీ అనో, గ్రాండ్మా-గ్రాండ్పా అనో పిలిస్తే?
అక్కినేని (తీవ్రంగా): దవడ పగిలిపోతుంది.
పుట్టపర్తి సర్కిల్ లో పుట్టపర్తివారి ఒక్క విగ్రహమే ఉండేలా చూస్తానని కడప కలెక్టరు కూడా ఏబీకేప్రసాద్ తదితరులకు హామీ ఇచ్చినట్లు సభ పూర్తయ్యాక రచన సంపాదకులు శాయి ద్వారా నాకు తెలిసింది.
ఈ సమావేశానికి కారా మాస్టారు రావడం ఇంకొక విశేషం.