Showing posts with label సాహిత్యం. Show all posts
Showing posts with label సాహిత్యం. Show all posts

Thursday, 16 October 2008

జ్ఞాన పీఠం

"జ్ఞాన పీఠ అవార్డు ఇవ్వడానికి తెలుగు భాషను పరిశీలించే సమయం వచ్చింది" అన్నారు 'చంద్రిమ' బ్లాగులో రాసిన జ్ఞాన పీఠము తెచ్చినారము జ్ఞానులెవ్వరొ తెలుపుడీ! టపాలో చంద్రమోహన్ గారు.

నాకు తెలిసి అలాంటిదేమీ లేదు, ఒకసారి ఒక భాషవారికి ఇచ్చాక మూడు సంవత్సరాల పాటు ఆ భాషను పరిశీలించరు. అంటే గత మూడేళ్లలో అవకాశం రాని భాషలన్నిటికీ "సమయం" వచ్చినట్లే. నిన్న మొన్నటి దాకా భారతదేశంలో ఇతర భాషల్లో అసలు మంచి సాహిత్యమే రానట్లు దాదాపు ప్రతి మూడేళ్లకొకసారీ జ్ఞానపీఠాన్ని ఆనవాయితీగా ఎగరేసుకుపోతూ వచ్చిన కన్నడిగుల మీద నా ఉక్రోషాన్ని నమ్మ బెంగళూరు టపాలో చూపించాను. అది హాస్యానికనుకున్నారేమో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. (ఇప్పటి వరకూ కన్నడానికి ఏడు పీఠాలు వస్తే హిందీకి మాత్రం ఆరుసార్లు పీట వేశారు.) నాకు తెలిసిన కన్నడిగులను ఈ సప్తపీఠాల గురించి అడిగితే వాటిలో సాహిత్యేతర కారణాల వల్ల వచ్చినవి కూడా కొన్ని ఉన్నాయని అంగీకరించారు. కానీ కన్నడంలో ఆ పీఠమెక్కవలసినవారు ఇంకా చాలామంది ఉన్నారని కూడా వాక్రుచ్చారు!

విశ్వనాథ సత్యనారాయణ కోసం ఆ పీటనెత్తుకొచ్చింది అప్పటి జ్ఞానపీఠ అవార్డుల కమిటీ అధ్యక్షుడుగా ఉన్న బెజవాడ గోపాలరెడ్డి. ఒక ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు - ఆ పీటను తీసుకు రావడానికి తాను గట్టి కృషే చేశానని (ఆయన విశ్వనాథకు వీరాభిమాని లెండి).సినారెకు వచ్చినప్పుడు ఆ కమిటీ అధ్యక్షుడుగా ఉన్నది పి.వి. నరసింహారావు అనుకుంటా. అంటే కేవలం సాహిత్యానికే పరిమితం కాకుండా రాజకీయాల్లో ఆరితేరిన వారు ఆ కమిటీ అధ్యక్షులుగా ఉండి సామ, దాన, భేదోపాయాలను ప్రదర్శిస్తే తప్ప ఆ పీఠం తెలుగు నేలకు రాలేదన్నమాట. జ్ఞానపీఠాన్ని మళ్ళీ తెలుగునేలకు రప్పించే రహస్యం ఇదేనా? ఏమో!

విషయానికి వస్తే చంద్రిమ బ్లాగులో అడిగిన ప్రశ్నకు నేను సమాధానం అక్కడే రాసినా అది ఎందుకనో కనబడలేదు. అందుకే అక్కడ అడిగిన ప్రశ్నకు నా సమాధానం ఇక్కడ రాస్తున్నాను: కాళీపట్నం రామారావు.

Wednesday, 2 July 2008

చెప్పుకోండి చూద్దాం



ఈ బ్లాగులో అప్పుడప్పుడూ వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ఫోటోలు చూపించి ఆ ఫోటోల్లోని వ్యక్తులెవరో చెప్పుకోండి చూద్దాం అని ఒక క్విజ్ లాగ నడుపుదామని నాకొక ఆలోచన వచ్చింది. శాస్త్రవేత్తగా మారిన ఒక హాలీవుడ్ నటి హెడీ లమర్ గురించి దాదాపు రెండేళ్ళ కిందట "ఆమె ఒక శాస్త్రవేత్త. ఆమె వెండితెర వేలుపు. ఆమె ఒక సాహసి. ఆమె ఒక సౌందర్యరాశి." అని అడిగి సమాధానం కూడా నేనే చెప్పేశాను. ఆ తర్వాత ఈ క్విజ్ ఆలోచన వచ్చింది గానీ ఇప్పటిదాకా ఆచరణలో పెట్టలేదు. ఇప్పుడు కాచుకోండి: ఈ ఫోటోలోని వ్యక్తి ఒక ప్రముఖ తెలుగురచయిత. ఈయనెవరో చెప్పుకోండి చూద్దాం.



క్లూలు కావాలా? ఐతే ఒకటి అందుకోండి: ఈయన వాసికెక్కిన రచయిత. మల్లాది వెంకటకృష్ణమూర్తి కాదు కాబట్టి ఈయన ఫోటోలు ఈయన పుస్తకాలపైనేగాక అంతర్జాలంలో కూడా కనబడుతాయి.







Wednesday, 5 March 2008

చందమామ - పాఠకాదరణలో సమస్యలు

తెలుగుబ్లాగు గుంపులో "తెలుగువారి అభిమానాన్ని చూరగొన్న చందమామను నెట్‍లో చూస్తూవుంటే ఎంతో ఆనందం కలిగింది. ఆనాడు నాగిరెడ్డి, చక్రపాణి ద్యయం ప్రారంభించిన చందమామ ఈనాటికీ పెద్దలను, పిల్లలను కూడా అలరిస్తోంది." అన్న దూర్వాసుల పద్మనాభం గారి మాటలకు నెటిజెన్ సమాధానం: "మీరన్నట్టు అలరిస్తు ఉన్నట్టయితే అది మూతపడేది కాదు."

అలరించడంలో మొదట్లో లేని సమస్యలు ఇప్పుడు కొన్ని ఉన్నాయి:

1. కంటెంటులో నవ్యత తగ్గిపోవడం: రచనల క్వాలిటీ పరంగా 1950-60 లలో చందమామ ఉచ్ఛస్థితిలో ఉండేది. తర్వాత క్రమంగా పడిపోతూ వచ్చింది. ప్రస్తుతం చందమామలో ఒక జానపద సీరియల్, ఒక పౌరాణిక సీరియల్, జాతక కథ పాత చందమామల్లో వచ్చినవే మళ్ళీ వేస్తున్నారు. నిజానికి ఇదో drawback కాదు. ఎందుకంటే అవి ఈ తరం పిల్లలకు పరిచయం లేనివి కావడం వల్ల మళ్ళీ వెయ్యడంలో తప్పు లేదు. ఐతే అవి కాస్తా పుస్తకాల రూపంలో అందరికీ అందుబాటులోకి వచ్చాక పేజీలు ఎలా నింపుతారనేది వేచి చూడాలి. (గతంలో 64 పేజీలున్న చందమామ ఇప్పుడు 76 పేజీలు ఉంటోంది.) ఇంకో వైపు తెలిసిన కథలనే చందమామలో చదవాలనుకునే నాలాంటి వాళ్ళం కూడా ఉన్నాం. :-) చక్కటి నుడికారంతో అచ్చుతప్పులు అసలుండని చందమామలో తెలిసిన కథలైనా మళ్ళీ మళ్ళీ చదవడం నాకిష్టం. ఇది పాత చందమామ కథల్లోనే సాధ్యం. ప్రస్తుతం చందమామ భాషలో కూడా మార్పు వచ్చింది. ఇతర భాషల నుంచి తెలుగులోకి అనువదించుకోవడం ఎక్కువై, భాషలోని మాధుర్యం చాలా వరకూ తగ్గిపోయింది. అంతేగాక అప్పుడప్పుడూ ఆ అనువాదం కృతకంగా కూడా ఉంటోంది. మరిన్ని వివరాలకు తెవికీలోని చందమామ వ్యాసం చూడండి.

(కంటెంటులో నవ్యత తగ్గిపోవడమనేది నిజానికి ఒక్క చందమామ సమస్యే కాదు. మొత్తమ్మీద భారతదేశంలో బాలసాహిత్యం ప్రపంచ వ్యాప్తంగా బాలసాహిత్యంలో వస్తున్న పోకడలను, అవి తెస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడం లేదు. అందుకే ఈ సమస్య. ఐతే కొత్తదనం కోసం చందమామ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. పిల్లల కోసం పిల్లల చేతే కథలు రాయించి, వాటికి పిల్లల చేతే బొమ్మలు వేయించడం అలాంటి ప్రయత్నాల్లో ఒకటి.)

2. ప్రత్యామ్నాయ విజ్ఞాన, వినోద సాధనాలు ఇప్పుడు లెక్కకు మిక్కిలిగా ఉండడం. చందమామ 1947 జూలైలో మొదలైంది. ప్రైవేటు టీవీ ఛానెళ్ళు 1990లలో మొదలయ్యాయి. తర్వాత పదేళ్లకు కంప్యూటరు (గేమ్సు), ఇంటర్నెట్టు ప్రాచుర్యంలోకి వచ్చాయి. వీటి పోటీని తట్టుకోవడం ఒక పిల్లల పత్రికకు చాలా కష్టం. (చందమామ ఆగిపోయింది ఆ దశలోనే. తర్వాత కొంతకాలానికే మరో పిల్లల పత్రిక బొమ్మరిల్లు కూడా మూతపడింది.) ఐనా ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడంలో చందమామ ఎప్పుడూ వెనుకబడలేదు.

3. పిల్లలను పాఠ్యపుస్తకాలు తప్ప కథల పుస్తకాలు చదివేటట్లు తల్లిదండ్రులు ప్రోత్సహించకపోవడం. (ఒక చిన్న ఉదాహరణ: తమ పిల్లలకు ప్రతివారమూ టీవీలో భాగవతం సీరియల్ చూపించడం కంటే భాగవతం పుస్తకం కొనివ్వడం అన్ని విధాలా మంచిదనే ఆలోచన ఈ కాలపు తల్లిదండ్రుల్లో చాలా మందికి రావడం లేదు. పిల్లల పత్రికలు/పుస్తకాల మీద పెట్టే ప్రతి పైసా వాళ్లకు దండగమారి ఖర్చుగానే అనిపిస్తుంది. వాళ్లలో చాలా మంది ప్రతివారం 10 రూపాయలు పెట్టి వారపత్రిక కొనగలిగే 'స్థితిమంతులే' కానీ నెలకు 10 రూపాయలు పెట్టి పిల్లల పత్రిక కొనడానికి వాళ్లకు చేతులు రావు.)

Monday, 9 April 2007

మోసపోయిన వరూధిని

కొత్తపాళీ గారి బ్లాగులో సుగాత్రి "అమాయకంగా" అడిగిన ప్రశ్న: "వరూధిని చివరికి మోసపోయింది అన్నారేమిటండీ? పాపం...నిజంగానే మోసపోయిందా?" అని.

వరూధినీప్రవరాఖ్యుల కథ అందరికీ తెలిసిందేననుకుంటున్నాను. వరూధిని వక్షమ్మీద చెయ్యేసి గోళ్ళు గుచ్చుకునేంత బలంగా తోసేసిన తర్వాత ప్రవరాఖ్యుడు తన నిష్టాగరిష్టత చేత అక్కడ మాయమై ఇక్కడ ఇంట్లో వచ్చి పడ్డాడు కదా? ఆ తర్వాతి కథేమిటంటే...

గంధర్వలోకంలో ఎప్పటి నుంచో వరూధినిని ప్రేమిస్తున్న వాడొకడున్నాడు. ఐతే వాడు వరూధిని కంటికి ఆనలేదు. వాడికి ఇక్కడ హిమవన్నగం మీద జరిగిన సంఘటన ఎలా తెలిసిందో తెలిసింది. దాంతో వాడు "Everything is fair in war and love" అనుకుంటూ అచ్చం ప్రవరాఖ్యుడిలా వేషం మార్చుకుని వరూధిని చెంతకు చేరాడు. ఆ అమాయకురాలు వాడు నిజంగానే ప్రవరుడనుకున్నది. కానీ మోసం ఎంతో కాలం దాగదు కదా? పైగా నిద్రపోయేటప్పుడు, శృంగారంలో అసలు రూపాలు బయటపడతాయంటారు. వాడిది దొంగవేషమని తెలుసుకున్న వరూధిని వాణ్ణి వదిలించుకుంది. కానీ ఈలోపే జరిగిన ప్రణయఫలంగా వరూధినికొక కొడుకు పుట్టాడు. వాడిపేరు స్వరోచి.

ఇదిలా ఉండగా ఆ వరూధినికొక తమ్ముడున్నాడు. వాడి పేరు ఇందీవరాక్షుడు. వాడికొక కూతురు. పేరు మనోరమ. వాడు ఒక ముని దగ్గర దొంగతనంగా ఆయుర్వేదం నేర్చుకుని, పోతూ పోతూ ఆయన్నే ఎగతాళి చేసేసరికి ఆయనకు కోపమొచ్చి వాణ్ని రాక్షసుడైపొమ్మని శపిస్తాడు. వీడు బావురుమని వేడుకోగా నువ్వు ఎప్పుడైతే తెలియక నీ సొంత కూతుర్నే మింగబోతావో అప్పుడే ఒక వీరుడి వల్ల నీకు శాపవిమోచనం కలుగుతుంది అని అనుగ్రహిస్తాడు. ఆ వీరుడే వరూధిని కొడుకైన స్వరోచి. ఆ స్వరోచి కొడుకే మనువు. ఆ మనువు పుట్టుక వెనకున్న కథే స్వారోచిష మనుసంభవం (స్వరోచి కొడుకైన మనువు పుట్టుక) లేక మనుచరిత్ర.

కొసమెరుపేమిటంటే ఇంతా చేసి ఆ మనువు పుట్టింది మనోరమ కడుపున కాదు!

Friday, 16 March 2007

క్లాసిక్ అనగా...

తెలుగులో నేను అదీ ఇదీ అని లేకుండా అన్ని రకాల పుస్తకాలూ చదువుతాను. ఇంగ్లీషులో ఒకప్పుడు షేక్స్‌పియర్ నాటకాల నుంచి లేటెస్ట్ బూతు నవలల దాకా అన్ని రకాలూ (రకానికి ఒకటి రెండు చొప్పున) చదివాను. ఇది పదేళ్ళ కిందటి సంగతి. తర్వాత నా స్నేహితుడు లక్కీ నాకు బహుమతిగా ఇచ్చిన Midnight's Children చదువుదామని మొదలుపెట్టి మధ్యలోనే మానేశాను. ఆ పుస్తకం గత ఐదేళ్ళుగా నా పుస్తకాల అరలో అలాగే పడి ఉంది. ఆ తర్వాత గత సంవత్సరం ప్రపంచంలో ఇంగ్లీషొచ్చిన ప్రతివారూ కలవరించిన పుస్తకం, ఇంగ్లీషు పుస్తకాల సమీక్షల్లో ప్రపంచప్రఖ్యాతి పొందిన TLS (Times Literary Suppliment) చేత "un-putdownable book" గా ప్రశంసించబడిన Da vinci code బలవంతాన వారం రోజులపాటు ప్రయత్నించి నలభై పేజీలు చదివి పక్కన పడేశాను. అది సంవత్సరం నుంచి పలకరించే నాథుడు లేక దుమ్ముకొట్టుకుపోయింది. ఇంగ్లీషు పుస్తకాలు చదివే అలవాటు తప్పిపోయిందా అంటే నాన్-ఫిక్షన్ ఇప్పటికీ అమితాసక్తితో చదువుతూనే ఉన్నాను. అంటే ఇంగ్లీషులో ఫిక్షన్ చదవడం నా వల్ల కావడం లేదా? ఇది నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇటీవల ఒక ప్రముఖ రచయితతో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు Da vinci code చదవలేక పక్కనపడేసిన విషయం ప్రస్తావించాను. దానికి ఆయన "చదవాలంటే ముందు మనకు దాని మీద ఆసక్తి పుట్టాలి. Da vinci code మనకు తెలిసిన జీవితాలకు గానీ, మన సంస్కృతికి గానీ సంబంధం లేని రచన కావడం కూడా ఆ ఆసక్తి కలగకపోవడానికి కారణం కావొచ్చు." అన్నారు. అదే నిజమేమో? నేను డావిన్సీ కోడ్ చదవనంత మాత్రాన కొంపలేం మునిగిపోవు. కానీ ఏ ఆర్కే నారాయణో, రస్కిన్ బాండో, మనోజ్ దాసో రాసిన పుస్తకాలు చదవడానికి ప్రయత్నించి విఫలమైతే అది నిజంగా ఆందోళన పడాల్సిన విషయమే! మరి Midnight's children సంగతేంటి? అది మన దేశాన్ని గురించి రాసిందే కదా? ఐనా నేను దాన్ని చదవలేకపోవడమేమిటి? దీనికి కారణం ఇటీవలే తెలిసింది: సాల్మన్ రష్దీ, బిల్ క్లింటన్ లాంటివాళ్ళ రచనలు చదవడం కష్టమేనట. ఇది నా ఒక్కడి సమస్య కాదట. చాలామంది చదవడం మొదలుపెట్టి పూర్తిచెయ్యకుండానే వదిలేస్తారట.

Midnight's children ఒక క్లాసిక్. ఈ వార్త చదవగానే "Classic is a book which everyone praises but noone reads." అన్న ఫన్నీ కోట్ గుర్తొచ్చింది.

Saturday, 17 February 2007

నేను-తను

-సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

ఒక అభిప్రాయం మా మధ్య పెఠిల్లున విరిగినప్పుడు-
మేమిద్దరం చెరో ధ్రువం వైపు విసిరేయబడతాము
ఆమె మొహం నాకేదో నిషిద్ధ వర్ణచిత్రంలా గోచరిస్తుంది
చేయి చాచితే అందే ఆమె దూరం
మనస్సులో యోజనాలై విస్తరించుకొంటుంది

ఉల్లిపొరై మామధ్య లేచిన భేదభావానికి
నా అహం ఉక్కుపూత పూసేందుకు నడుం బిగిస్తుంది
మౌనంగా మా మధ్య చెలియలికట్టలా పడుకుని ఉన్న పాపకు ఇటువైపు
నా గుండె కల్లోలసాగరమై ఎగిసిపడుతుంటుంది
నా మనస్సు విరిగిన అభిప్రాయశకలాల్ని కూర్చుకుంటూ
ఆమె కత్తివాదర వెనుక గయ్యాళితనాన్ని కొలుస్తుంటుంది

టైం కి డ్యూటీ కొచ్చి తట్టి సైగచేసే నిద్రను
మెలకువ కసరుకొంటుంది
ఎంతకూ నిద్రలేవని ఆమెలోని దాసిత్వాన్ని
నాలోని పురుషత్వం శంకిస్తుంటుంది
అప్పుడు-అభిప్రాయం కాదు సమస్య-
అది విరిగిన క్షణాలు మెదడులో వేరుపురుగులవ్వడం
అంతకంతకూ ఆమె నిశ్చల మౌనతటాకమౌతోంటే
నేననుకొంటున్న ఆమెలోని అహం కరిగి
నా పాదాలకేసి ప్రవహించనదుకు
నాలోని మరో నేను అసహనాన్ని పిచ్చిగా కౌగిలించుకుంటుంటాను
ఇప్పుడు-భేదభావం కాదు ప్రశ్న-
ఆమె అబలత్వం తీవై సాగి సాగి
చివురుల అరచేతుల్తో నా అహాన్ని స'మర్ది'స్తూ
నాపైకి ఎగబాకలేదనే!

క్షణక్షణానికి ఆమె మౌనం మీద వేయిచబడుతోన్న నా అహం
బేలగా మారి బీటలు వారేందుకు సిద్ధమౌతుంది
ఆమె చలిగాలి అలై నా ఒంటరితనాన్ని స్పర్శిస్తే
జలదరించి వర్షించాలని ఉంటుంది

మనోగవాక్షలలోంచి దూకివచ్చిన చంద్రబింబం
కన్నీటిబిందువై మా మధ్య కేర్ మన్నప్పుడు
ఆమెలోని మాతృత్వం పాపకేసి నదిలా కదిలి
అసంకల్పితంగా నన్ను ఆడతనమై తాకుతుందా-
నేను నీటిబుడగనై పేలిపోతాను
ఎర్రనీటి ఏటినై ఉరకలెత్తుతాను
ఆమెను నా గుండెల సుడిగుండాల్లో పసిపాపలా తిప్పుతాను
నేనే ఆమెనై అబలనై పసిపాపనై గారాలు పోతాను

Monday, 22 January 2007

సన్నపురెడ్డి నవలల సవ్వడి

ఒకే సంవత్సరం జరిగిన 3 నవలల పోటీల్లో ఒకే రచయిత రాసిన నవలలకు ప్రథమ బహుమతులు లభించడం అపూర్వం, అనితర సాధ్యం. అది 2006లో సన్నపురెడ్డి సాధించిన ఘనత. ఈయన రాసిన ఆ మూడు నవలలు:
తోలుబొమ్మలాట 2006 ఆటా పోటీలలో ప్రథమ బహుమతి (ఈ నవల సాహిత్యనేత్రం అక్టోబర్ 2006 సంచికలోను, ఆటా వారి 9వ ఆటా మహాసభల ప్రత్యేక సంచికలోను ప్రచురితమైంది).
పాలెగత్తె 2006లో స్వాతివారపత్రిక నిర్వహించిన నవలలపోటీలో ప్రథమ బహుమతి
చినుకుల సవ్వడి 2006లో నిర్వహించిన చతుర నవలపోటీలో ప్రథమ బహుమతి
సాధించాయి.
ఎవరీ సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి?
ఈయన ఒక మారుమూల పల్లెటూరిలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు.
1980లలో కవితలు రాయడం మొదలుపెట్టాడు. 1980లలో వచ్చిన అత్యుత్తమ కవితలను ఏర్చికూర్చిన కవితాసంకలనం "కవితా! ఓ కవితా!!" లో ఈయన రాసిన 2 కవితలు చోటు సంపాదించుకున్నాయి. తర్వాతి కాలంలో రచన మాసపత్రికలో ఈయన కవితలు చదివిన యండమూరి వీరేంద్రనాథ్ "(ఇంత) బాగా రాయగలవాళ్ళు ఎక్కువగా ఎందుకు రాయరో నాకు అర్థం కాదు." అని రాశాడు. (స్వతహాగా కవి కావడం వల్లేనేమో నిండుకుండ నెత్తినపెట్టుకుని అడుగులేస్తూ ఉంటే నీళ్ళు చిందినంత సహజంగా సన్నపురెడ్డి రచనల్లో కవిత్వం ఒలుకుతూ ఉంటుంది.) 1990ల ప్రారంభంలో కథలు రాయడం ప్రారంభించిన ఈయన అచిరకాలంలోనే విస్మరించరాని కథారచయిత గుర్తించబడ్డాడు. సన్నపురెడ్డి కథలను రెండురకాలుగా విభజించవచ్చు: మంచి కథలు, గొప్ప కథలు. ఈయన రాసిన కథలు రాతిపూలు, కథాసాగర్, విశాలాంధ్ర తెలుగుకథ మొదలైన కథాసంకలనాల్లో చోటు సంపాదించుకున్నాయి.

ఇక ఈయన రాసిన తొలి నవల కాడి 1998లో ఆటా వారు నిర్వహించిన నవలల పోటీలో ద్వితీయబహుమతి పొందదమేగాక చిరస్థాయిగా నిలిచిపోగల అతికొద్ది తెలుగు నవలల్లో ఒకటిగా గుర్తించబడింది. తర్వాత ఆయన స్వాతివారపత్రిక లో పాండవబీడు అనే నవల రాశాడు. అప్పటికే నా దృష్టిలో స్వ+అతి గా మారిన స్వాతి వారపత్రికను నేను కేవలం ఈ సీరియల్ కోసమే చదివేవాడిని. ఆ సీరియల్ ముగిసినవెంటనే అదీ మానేశాను. మళ్ళీ దానిజోలికి పోలేదు. ఇప్పుడు మళ్ళీ పాలెగత్తె కోసం మొదలుపెట్టాల్సి వచ్చేలా ఉంది.

బహుమతులు పొందిన సన్నపురెడ్డి కథలు:

1996లో అప్పజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్ వారి కథలపోటీలో అంతు కథ ప్రథమ బహుమతి పొందింది.
అదే సంవత్సరం సాహిత్యనేత్రం నిర్వహించిన కథలపోటీలో చనుబాలు కథ ప్రథమబహుమతి పొందింది.
ఇవే కాకుండా ఈయన తడి, కొత్తదుప్పటి, ఒక్కవానచాలు, గిరగీయొద్దు, ఒక్కవానచాలు, దిగంబరం, ఊరిమిండి లాంటి కథలు రాశాడు.
తెలుగు భాష, సాహిత్యాలకు ఆయన చేసిన సేవకు 2004, 2006 సంవత్సరాలలో అధికారభాషాసంఘం ఆయనను ఘనంగా సత్కరించింది.

1996లో రాతిపూలు సంకలకర్తలు ఈయన గురించి ఇలా అన్నారు:

చాలామంది రచయితలకు లేని వైవిధ్యభరిత జీవితానుభవం ఉన్న రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి - అటువంటి గ్రామీణ జీవితానుభవసారం ఉండబట్టే "కవిత్వాన్నీ, కథనీ కోపుయాస లేని ఎద్దులుగా సాహిత్య వ్యవసాయాన్ని" చేస్తున్నాడు.
కవితల్లో వ్యక్తీకరించలేని భావాల్ని కథల్లో, కథల్లో ఇమడ్చలేని సున్నితవ్యక్తీకరణల్ని కవితల్లో ఒదిగిస్తున్నారు వెంకటరామిరెడ్డి.
పుట్టింది, పెరిగింది, ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నది కడప జిల్లా కలసపాడు మండలం బాలరాజుపల్లె కుగ్రామం కావడంతో తన కథలకూ, కవితలకూ అవసరమైన మూలబీజాల్ని ఆ గ్రామీణం నుండే ఏరుకోగలుగుతున్నాడు. అక్కడి బడుగుజీవులైన రైతుల, రైతుకూలీల బతుకువెతల్ని తన కళ్ళలో నింపుకుంటూ, తన కళ్ళ దర్పణాల్లో వాళ్ళ జీవిత ప్రతిబింబాల్ని పాఠకలోకానికి స్పష్టంగా చూపించగలుగుతున్నారు.
అంతేకాకుండా పల్లె ప్రజల నెత్తుటిలో మలేరియా క్రిమిలా వ్యాపించిన హీనరాజకీయాల్ని - వాళ్ళ బతుకుల్నిండా చీడై కమ్ముకున్న కరువు గురించి - ప్రభుత్వ సవతి ప్రేమను గురించి ఆవేదన చెందుతూ వాటికి ఆస్కారమిచ్చిన మూలాల గురించి నిరంతరం అన్వేషిస్తూ ఉన్న అరుదైన రచయిత వెంకటరామిరెడ్డి.

Tuesday, 31 October 2006

సాహిత్య నేత్రం-మరో మంచి పత్రిక

అనిల్ చీమలమఱ్ఱి తన బ్లాగులో పేర్కొనని మరో మంచి పత్రిక సాహిత్య నేత్రం.


సాహిత్య నేత్రం త్రైమాస పత్రిక. ఇది పదేళ్ళ కిందట మొదలైంది. దీంట్లో ప్రతి సంచికలోనూ అద్భుతమైన కథలు, కవితలు , సాహితీ వ్యాసాలు, విశ్లేషణలు వచ్చేవి. ఉత్తమాభిరుచిగల వారందరి ఆదరణా పొందినా ఆర్థికంగా నిలదొక్కుకోలేక రెండేళ్ళ కాలంలో 9 సంచికలు వెలువడి ఆగిపోయింది. అయితే పట్టు వదలని విక్రమార్కుడు శశిశ్రీ పదేళ్ళ తర్వాత ఇపుడు దాన్ని డిసెంబరు 2005 నుంచి తిరిగి నడిపిస్తున్నాడు.

ఈ పత్రిక ప్రత్యేకతలు: ఇప్పుడు సరికొత్త ఆకర్షణ ప్రతి సంచికలోనూ ఒక మంచి తెలుగు కథను ఇంగ్లీషులోకి అనువదించి ప్రచురించడం. (మన దురదృష్టమేమిటంటే ప్రపంచ, దేశ భాషల్లోని ఉత్తమసాహిత్యాన్ని తెలుగువాళ్ళకు పరిచయం చేసేవాళ్ళు, తేటతెలుగులోకి అనువదించేవాళ్ళు, ప్రచురించేవాళ్ళు ఉన్నారు గానీ మన సాహిత్యాన్ని ఇతరభాషలవారికి పరిచయం చేసే ప్రయత్నాలెవరూ సీరియస్ గా చెయ్యడం లేదు. ఒక తెలుగుకవి గుంటూరు శేషేంద్రశర్మ నోబెల్ పురస్కారానికి నామినేట్ అవడానికి కారణం తన రచనలన్నిటినీ ఆయన ఆంగ్లంలో రాయడం లేదా తెలుగులో రాసినా వెంటనే ఆంగ్లంలోకి తనే స్వయంగా అనువదించుకోవడం. నోబెల్ దాకా ఎందుకు? మనకు దక్కిన జ్ఞానపీఠాలెన్ని? రెండు (అవి కూడా జ్ఞానపీఠ్ అవార్డుల కమిటీ అధ్యక్షుడుగా పి.వి.నరసింహారావు ఉన్నప్పుడు ఒకటి, బెజవాడ గోపాలరెడ్డి ఉన్నప్పుడు ఇంకొకటి) కాగా కన్నడానికి ఏడు. తేడా ఎక్కడుందో తెలియడం లేదూ??)

ఈ పత్రికను మార్కెట్లోకి విడుదల చెయ్యడం లేదు. ప్రతులు కావలసినవారు శశిశ్రీ (సంపాదకుడు), సాహిత్య నేత్రం త్రైమాస పత్రిక, డోర్నెంబరు 21-107, ఏడురోడ్లకూడలి, కడప - 516001 ఆం.ప్ర., ఫోన్: 93474 10689 ను సంప్రదించవచ్చు. విడిప్రతి 12/-.

పత్రిక సలహామండలి:

కాళీపట్నం రామారావు
డా||వై. బాలశౌరిరెడ్డి (సుప్రసిద్ధ హిందీ రచయిత, అనువాదకుడు. ఈయన హిందీ చందమామకు నలభయ్యేళ్ళపాటు సంపాదకుడుగా పనిచేశాడు.)
డా||జానమద్ది హనుమచ్ఛాస్త్రి (ప్రసిద్ధ సాహితీవేత్త, బహుగ్రంథకర్త)
డా||కేతు విశ్వనాథరెడ్డి
డా||పాపినేని శివశంకర్
వల్లంపాటి వెంకటసుబ్బయ్య
సింగమనేని నారాయణ
షేక్ హుసేన్ సత్యాగ్ని
మాకం అశోక కుమార్
బి.కె.ఆర్. మూర్తి

Sunday, 1 October 2006

చిన్నకథ

తెలుగుపీపుల్.కామ్‌లో సౌమ్య గారు "చిన్నకథ నిడివి ఇంత ఉండాలి అనేం రూలు లేదు కావొచ్చు గానీ...ఎలా చూసినా ఇది చాలా చిన్నదండీ చిన్నకథ కేటగిరీకి." అన్నారు. అంటే రూలు లేకపోయినా తనకొక అభిప్రాయముంది: కథ కనీసం ఇన్ని లైన్లుండాలని. కథ గురించి నా అభిప్రాయాలు వేరు. కథ చిన్నదా పెద్దదా అని కాక అది నాలో కలిగించిన అనుభూతి చిన్నదా పెద్దదా అనే చూస్తాను నేను. ఒక కథ చెత్తకథా, మామూలు కథా, మంచి కథా లేక గొప్ప కథా అనేది తేల్చుకోవడానికి నాకదే గీటురాయి. (ఐతే కథకు క్లుప్తతే ప్రాణం అని చాలామంది నమ్ముతారు.) అనవసరమైన సోదంతా మానేసి సూటిగా విషయం చెప్పేవాళ్ళు నాకు బాగా నచ్చుతారు.

కథంటూ మొదలయ్యాక దిక్కులు చూడ్డం మానేసి సూటిగా లక్ష్యం వైపు పరుగెత్తాలి. నవలారచన విశాలమైన మైదానంలో గుర్రపుస్వారీ లాంటిదైతే కథారచన తాడుమీదనడక లాంటిదంటారు. రచయిత దృష్టి చెప్పదలచుకున్న పాయింటు నుంచి ఏ మాత్రం పక్కకు తప్పినా కథ కుప్పకూలిపోతుంది. అందుకే కథారచయితకు కథ రాసేటప్పుడు తన మీద తనకు గొప్ప అదుపు ఉండాలి. ఈ విషయంలో స్వర్గీయ సొదుం జయరాం చాలా గొప్పవాడని, ఆయన కథల్లో అనవసరమైన సన్నివేశం గానీ, అనవసరమైన వాక్యం గానీ, అనవసరమైన మాటగానీ ఉండవని రచయితలు, విమర్శకులు, సాహితీపత్రికల సంపాదకులు గొప్పగా చెబుతారు. ఆయన రాసిన కథలు చాలా మటుకు రెండుపేజీల్లోపలే ముగుస్తాయి. అయితేనేం? అవి నిస్సందేహంగా చాలాగొప్ప కథలు. కొడవటిగంటి కుటుంబరావు ప్రశంసలు పొందిన కథకుడాయన. రెండేళ్ళ కిందట ఆయన కథలకు రాచకొండ రచనాపురస్కారం వచ్చింది. (సొదుం జయరాం కథలు: ప్రచురణ బండ్ల పబ్లికేషన్స్, విజేత కాంపిటీషన్స్ జనరల్ బుక్స్ సీరీస్).

కేతు విశ్వనాథరెడ్డి ముప్ఫయ్యేళ్ళ కిందట కడప నుంచి వెలువడిన లిఖిత మాసపత్రిక మనోరంజనిలో (సాహిత్యనేత్రం సంపాదకుడు శశిశ్రీ ఈ పత్రికను నడిపారు) "మారుచీరె" అనే కార్డుకథ రాశారు. అది తెలుగుపీపుల్ లోని దాట్ల గారి కథ కంటే చిన్నది. ఐనా ఆ కథ గొప్పదనానికొచ్చిన లోటేమీ లేదు. పాత్రల పేర్లు నాకు గుర్తుండవు. ఈ కథలోని పాత్రల పేర్లు అచ్చమ్మ, బుచ్చమ్మ అనుకుందాం.
ఒకే కాలేజీలో చదివే అచ్చమ్మ ధనవంతుల పిల్ల, బుచ్చమ్మ పేదరాలు. కాలేజీ వార్షికోత్సవమప్పుడు వేసిన నాటికలో అచ్చమ్మ పేదరాలి వేషం, బుచ్చమ్మ ఒక మగవాడి వేషం వేశారు (పేద హీరోయిన్, ధనిక హీరో వేషాలనుకుంటా). స్టేజీ మీద కట్టుకోవడానికి అచ్చమ్మ దగ్గర పాతచీరె లేదు. బుచ్చమ్మ ఎలాగూ మగవాడి వేషం వేస్తోంది కాబట్టి ఆమె చీరె అచ్చమ్మ తీసుకుంది. నాటిక పూర్తయ్యాక బుచ్చమ్మ తన చీరివ్వమని అచ్చమ్మను అడిగింది. దానికి అచ్చమ్మ "ఆ చీరె మళ్ళీ కట్టుకుంటావటే? సహజత్వం కోసం దానికున్న చిరుగులను పెద్దవి చేశానే." అంది. సమాధానంగా "నాకున్న మారుచీరె అదొక్కటేనే." అంటున్న బుచ్చమ్మ గొంతు వణికింది.
కథంతా ఇంతే.

ఇటీవలి సంవత్సరాల్లో రచనలో ఛాయామల్లిక్ మైక్రోకథలు కొన్ని రాశారు. వాటిలో ఒకటి చాక్లెట్-రేపర్: పెళ్ళైన కొత్తలో ఒకనాటి రాత్రి భర్త తన పట్టుచీరను లుంగలు చుట్టిపారేస్తూంటే భార్య "అయ్యో!" అని బాధపడుతుంది. దానికి భర్త "నాకు రేపర్ కంటే చాక్లెట్టే ముఖ్యం." అంటాడు. ముప్ఫయ్యేళ్ళ తర్వాత: భార్య "మీ చాక్లెట్ పాడైపోయిందండీ" అని బాధపడుతుంది. దానికి భర్త "ఇంతకాలం నేను చాక్లెట్ అనుకొన్నదీ రేపరేనని ఇప్పుడు తెలుసుకున్నాను. అసలైన చాక్లెట్ నీ వ్యక్తిత్వమే." అంటాడు.

కొడవటిగంటి కుటుంబరావు రాసిన అనేక గల్పికలు - గొప్ప ఎడ్యుకేటివ్ వాల్యూస్ ఉన్నవి - సగం పేజీలోనే ముగుస్తాయి. చందమామలో సింగిల్ పేజీ కథలు ప్రత్యేక ఆకర్షణ. కాదంటారా?

"వసుంధర"

"ఒక అందమైన సాయంత్రం" టపాలో కిరణ్ అడిగారు - ధర్మనిధి పురస్కారం పొందిన వసుంధర, చందమామ కథల రచయిత వసుంధర ఒకరేనా అని. అవును, ఒకరే. వారి గురించి నాకు తెలిసిన కొన్ని వివరాలు:

జొన్నలగడ్డ రాజగోపాలరావు-రామలక్ష్మి దంపతులు వసుంధర కలం పేరుతో రాస్తున్న జంటరచయితలు. రాజగోపాలరావు గారు రసాయనశాస్త్రవేత్తగా పనిచేసి రిటైరయ్యారు. భువనేశ్వర్లో చాలాకాలం పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాదులోనే మకాం. వారుంటున్న ఇంటిపేరు శ్రీవాణీగిరిజానిలయం. (శ్రీ అంటే లక్ష్మిదేవి, వాణి అంటే సరస్వతి, గిరిజ అంటే పార్వతి అని అందరికీ తెలిసిన విషయమే. ముగ్గురమ్మల నిలయమన్నమాట వారి ఇల్లు). వసుంధరతో బాటు బాబి, కమల, సైరంధ్రి, రాజా, రాజకుమారి, శ్రీరామకమల్, యశస్వి, కైవల్య, మనోహర్ వారి కలం పేర్లు.

వీరు ఒక్క చందమామలోనే వెయ్యికి పైగా కథలు రాశారు. వాటిలో కథల ప్రయోజనం, అపకారికి ఉపకారం, మొదలైనవి సుప్రసిద్ధం. వీరి కథల్లో పిల్లలకు విలువైన సందేశం గానీ, అద్వితీయమైన చమత్కారం గానీ తప్పనిసరిగా ఉంటాయి. బొమ్మరిల్లులో నూరుకట్ల పిశాచం కథలు, మరికొన్ని ఇతర కథలు రాయడంతోబాటు లోకజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు-జవాబులు, ఈ శతాబ్దపు చివరి దశాబ్దం, లాంటి ఇతర శీర్షికలు కూడా చాలాకాలం నిర్వహించారు. రామలక్ష్మి గారు ఆ పత్రికకు పేరులేని సంపాదకురాలిగా పనిచేశారని చదివాను. ఆమె వసుంధరలో భాగస్వామిగానే కాకుండా విడిగా కూడా చాలా కథలు, నవలలు రాశారు.

ఇక పెద్దలకోసం వారు రాసిన కథలను, నవలలను ప్రచురించని పత్రికలు తెలుగులో దాదాపుగా లేవనే చెప్పవచ్చు. ఈ కథలు ఇంకో వెయ్యిదాకా ఉంటాయి. వాటిలో "ఒక్క అపనలోనే రెండొందలుంటాయి." (అపన: అపరాధపరిశోధన అనే పేరుగల పత్రిక) ఈ కథల్లోనుంచి ఎంపికచేసిన కొన్ని కథలు రెండు సంపుటాలుగా వచ్చాయి: రసికరాజతగువారముకామా?, చిరునవ్వు వెల ఎంత?(హాస్యకథల సంపుటి) వీటిలోని కొన్ని కథలు చదివితే 'ఇలాంటి విశేషాలు అందరి జీవితాల్లోనూ ఉంటాయి. వాటిని కథలుగా మలచగల దృష్టి ఉండాలేగానీ ఎవరైనా కథలు రాయొచ్చు' ననే ధైర్యమొస్తుంది. (నిజంగా వీరు చాలామందిని కథలు రాయమని ప్రోత్సహించారు, కొందరిని వేధించారు కూడా: తీరుబాటు అనే కథలో ఆ విషయం వివరిస్తారు.) కానీ అధిక శాతం కథలు అద్భుతమనిపిస్తాయి. అలాంటి కథలు రాయడం మాత్రం నిజంగా అనితరసాధ్యం.

మనకు ఎప్పుడైనా ఎవరైనా వ్యక్తులమీద గానీ , పరిస్థితుల మీద గానీ కోపమో, చిరాకో, అసహ్యమో, అభిమానమో, అబ్బురపాటో, అవేశమో, ఆక్రోశమో, నవ్వో, ఇలా ఎలాంటి భావమైనా కలిగితే దాన్ని మాటల్లోనో, చేతల్లోనో చూపిస్తాం. వీరు మాత్రం దాని మీద కథ రాసేస్తారు అని కూడా అనిపిస్తుంది వీరి కథలు చదివితే. తాము చెప్పదలచుకున్న ఏ విషయాన్ని గురించైనా కథో, నవలో రాయగల ప్రతిభ వీరికి ఉంది.

అలాగని వీరు కథలు మాత్రమే రాసి ఊరుకోలేదు. రచన మాసపత్రికలో సాహితీవైద్యం(సా.వై.), కథాపీఠం, కథాప్రహేళిక, నిషిద్ధాక్షరి, దొరకునా ఇటువంటిసేవ, లాంటి శీర్షికలు నిర్వహించారు. సా.వై. శీర్షిక కొన్ని వందలమంది రచయితలను తయారుచేసింది, ఇంకా చేస్తోంది. ఇలాంటి శీర్షికానిర్వహణ ఏ భాషలోనైనా అపూర్వం కాగా ఆ శీర్షికను దశాబ్దం పైగా ఏకధాటిగా నిర్వహిస్తున్నారు. ఇన్ని పనులు చేయడానికి వీరికి సమయమెలా సరిపోతుంది? ప్రతిరోజూ ఒక నిర్ణీతసమయంలో ఏదో ఒకటి రాయాలి అని నిశ్చయించుకుంటే ఎన్నైనా రాయవచ్చు అనేది వీరి అనుభవం.

వీరు రాసిన నవలలు నేను ఎక్కువ చదవలేదు. నేను చదివిన నవలల్లో నాకు అద్భుతంగా అనిపించినవి అద్దం ముందు పిచికలు, ఆడపడుచు, సూర్యనమస్కారం, శ్రీరామునిదయచేతను, మొక్కలు పిలుస్తున్నాయి, మొదలైనవి. వీరి నవలలు కొన్ని సినిమాలుగా కూడా వచ్చాయి.

వీటితోబాటు వీరు అప్పుడప్పుడూ కవితలు కూడా రాస్తారు.

Friday, 8 September 2006

కాళిదాసు కంచుబొమ్మ

గత సంవత్సరం (2005) చైనా ప్రభుత్వం నుంచి మన విదేశాంగశాఖవారికి వచ్చిన ఒక అభ్యర్థన వారిని తెల్లబోయేలా చేసింది. గందరగోళంలోకి నెట్టింది. చైనీయులు కోరింది క్రీ.శ. ఆరవ శతాబ్దానికి చెందిన ఒక మహనీయుడి కాంస్యవిగ్రహం కావాలని. ఆయనెలా ఉంటాడో ఎవరికీ తెలియదు. కనీసం రేఖాచిత్రాలు కూడా లేవు. అలాంటివాడి ప్రతిమ చేసివ్వమని అడిగితే ఏం చెయ్యడం? ఎలా ఇవ్వడం? అసలు చైనీయులకు ఆ విగ్రహంతో ఏం పనిబడింది?

చైనా ప్రభుత్వం తమ దేశప్రజల్లో సాంస్కృతిక అవగాహనను పెంచడానికిగాను షాంఘై థియేటర్ స్ట్రీట్ లో కాళిదాసు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించింది. ఐతే సమస్యేమిటంటే కాళిదాసు బొమ్మలు కాదుగదా కనీసం ఆయన రూపురేఖావిలాసాదులెలాంటివో తెలిపే వర్ణనలైనా ఎక్కడా లేవు. చైనీయుల అభ్యర్థనను మన విదేశాంగశాఖ వారు భారతదేశ సాంస్కృతిక సంబంధాల మండలి (ICCR)కి, ఆ మండలి మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వమేమో ఉజ్జయినిలో ఉండే కాళిదాసు అకాడెమీకి పంపించారు. ఆ మహాకవి, నాటకకర్త క్రీ.శ. ఆరవ శతాబ్దంలో ఉజ్జయినిలోనే నివసించాడని నమ్ముతున్నారు.

కాళిదాసు రచనలను మనోవిశ్లేషణాత్మక దృక్పథంతో అధ్యయనం చేసిన నిపుణులు ఆయన చాలా అందగాడని తేల్చారు. (ఆయన పేరు మీద ప్రచారంలో ఉన్న అనేక కథలు; సాహిత్య, చారిత్రక గాథలు దీనికి అనుగుణంగానే ఉన్నాయి.) ఈ అంచనాల ఆధారంతో చివరికి తల నుంచి రొమ్ము వరకు గల ఒక 30 అంగుళాల కంచుబొమ్మను తయారుచేయించారు. ఇలాంటి ప్రయత్నం జరగడం మనదేశంలో ఇదే మొదటిసారి. ఈ విగ్రహాన్ని సాంస్కృతిక సంబంధాల మండలికి చెందిన విగ్రహ తయారీ నిపుణుల సంఘం ఆమోదించాక విదేశాంగశాఖ గత జూన్ నెల చివరి వారంలో చైనాకు పంపింది. ఆ విగ్రహాన్ని నిన్ననే షాంఘై థియేటర్ స్ట్రీట్ లో ఆవిష్కరించారు.

అక్కడ కొలువుదీరనున్న 19 మంది జగత్ప్రసిద్ధుల్లో ఆసియా ఖండానికి చెందిన ఒకేఒక వ్యక్తి మహాకవి కాళిదాసు.

మొదటివార్త ట్రిబ్యూన్ లో

తాజావార్త ఈరోజు హిందూ (ప్రింట్ ఎడిషన్)లో

Monday, 28 August 2006

పుస్తక సమీక్షలు-బ్లాగు సమీక్షలు


ప్రస్తుతం పుస్తక సమీక్షలెలా ఉంటున్నాయో ఈ ఒక్క కార్టూను చూస్తే తెలుస్తుంది. రాబోయే కాలంలో పత్రికల్లోని పుస్తకసమీక్షలు ఈ కార్టూనులో చూపినట్లే ఉంటాయేమో? (ఒక పుస్తకం అట్ట మీద ఆ పుస్తకం గురించి 300 పదాల పరిచయవాక్యాలుంటే దాని మీదొచ్చిన సమీక్షను 200 పదాలతో సరిపెట్టేశారట!!)

పుస్తక సమీక్షల పరిస్థితే అలా ఉండగా ఇంకొక వైపు బ్లాగుల గురించి సవివరమైన సమీక్షలు రాస్తున్న భాస్కర రావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన ఇప్పటి వరకు తెలుగు మహిళా బ్లాగరులందరి బ్లాగుల గురించి సమీక్షలు రాశారు. తాను చదివిన మంచి పుస్తకాల గురించి తన బ్లాగులో చర్చించే వి.బి.సౌమ్య గారి బ్లాగును ఈరోజు ఆయన సమీక్షించారు. ఆయన సమీక్షలు మహిళా బ్లాగరుల బ్లాగులకే పరిమితం కాలేదు. చరసాల, చావా కిరణ్, త్రివిక్రమ్ లాంటి వారి బ్లాగుల మీద కూడా సుదీర్ఘమైన సమీక్షలు రాశారు. ఆయన చేస్తున్న కృషికి నా హృదయపూర్వక అభినందనలు.

Tuesday, 23 May 2006

జీవిత చరిత్రలు

నాకు బాగా నచ్చిన జీవిత చరిత్రలు:

సత్యశోధన - మహాత్మా గాంధీ
Wings of Fire - అబ్దుల్ కలామ్
హంపీ నుంచి హరప్పా దాకా - తిరుమల రామచంద్ర

Friday, 19 May 2006

కవితా సౌరభాలు

నేను మళ్ళీ మళ్ళీ చదువుకునే కవితలు:

అమృతం కురిసిన రాత్రి
మహాప్రస్థానం
ముత్యాల సరాలు
ఎంకి పాటలు
కవితా! ఓ కవితా!!
ఆధునిక మహాకావ్యాలు:
పెన్నేటిపాట
శివతాండవం

నిలిచే నవలలు ఏవి?

"నిలిచే నవలలు ఏవి? (ప్రముఖుల ప్రత్యేక నవలా విశ్లేషణలు)" అనే పేరుతో 2001లో ఒక పుస్తకం వచ్చింది:
సంపాదకుడు: జయంతి పాపారావు

అందులో కాలపరీక్షను తట్టుకుని "నిలిచే నవలలు" గా తాము భావించిన 20 నవలల గురించి 20 మంది ప్రముఖ సాహితీవేత్తల వివరణాత్మక విశ్లేషణలున్నాయి.

ఆ ఇరవై నవలలు - నవలా రచయితలు (బొద్దుగా ఉన్నవి నేను చదివిన నవలలు):

శ్రీ రంగరాయ చరిత్ర (నరహరి గోపాల కృష్ణమ చెట్టి)
మాలపల్లి (ఉన్నవ లక్ష్మినారాయణ)
మంచీ-చెడూ (శారద)
కాలాతీత వ్యక్తులు (పి.శ్రీదేవి)
మరల సేద్యానికి (శివరామ కారంత్)

బ్రతుకు భయం (ఇది బెదిరిన మనుషులు నవలకు సీక్వెల్) (కొడవటిగంటి కుటుంబరావు)
అంపశయ్య (నవీన్)
స్వీట్ హోం (రంగనాయకమ్మ)
దారిపొడుగునా (చెరబండ రాజు)
మా పల్లె (చెరబండ రాజు)

వేలాడిన మందారం (జ్వాలాముఖి)
మూడు కథల బంగారం (రావి శాస్త్రి)
మూడు కథల బంగారం - విమల (రావి శాస్త్రి)
వసంత మేఘం (పులి ఆనంద మోహన్)
ఇల్లు (రావి శాస్త్రి)

రేగడివిత్తులు (చంద్రలత)
మీ రాజ్యం మీరేలండి (స్వామి)
పంచమం (చిలుకూరి దేవపుత్ర)
కాడి (సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి)
అంటరాని వసంతం (జి. కళ్యాణ రావు)


ఇందులో లేని గొప్ప నవలలు కొన్ని (నేను చదివినవి):

చదువు
( రచయిత కొడవటిగంటి కుటుంబరావు వ్రాసిన చదువు, జీవితం, అరుణోదయం, గడ్డురోజులు లాంటి నవలల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషణ ఎక్కువగా ఉండగా, బెదిరిన మనుషులు , బ్రతుకు భయం లలో మనోవిశ్లేషణ ఎక్కువగా ఉంది.) ఇక మనోవిశ్లేషణ నవలలుగా జగత్ప్రసిద్ధి పొందిన నవలలు:

అసమర్థుని జీవయాత్ర,
చివరకు మిగిలేది,
అల్పజీవి.

ఇంకొన్ని నవలలు:

అనుక్షణికం
కొల్లాయి గట్టితేనేమి?
పుణ్యభూమీ కళ్ళుతెరు!
మైదానం
స్వేచ్ఛ


ఈ మధ్య చదివిన మంచి నవల: ఈ తరం స్త్రీ (విద్యావంతులైన మధ్య తరగతి స్త్రీల - గృహిణులు, ఉద్యోగినుల - సమస్యలను చర్చించిన నవల)

యండమూరి రచనలు

తెలుగు సాహిత్య చరిత్రలో యండమూరిదో విశిష్ట స్థానం.
ఆయన రచనల్లో నేను చదివిన వాటి గురించి నా అభిప్రాయం:

ది బెస్ట్ ఆఫ్ యండమూరి వీరేంద్రనాథ్: ఒకటి రెండు కథలు అస్పష్టంగా, అర్థం కాకుండా ఉన్నాయి. అర్థమైనవన్నీ చాలా బాగున్నాయి. కొన్ని కథలు అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తప్పక చదవవలసిన పుస్తకం.

వెన్నెల్లో ఆడపిల్ల: రొమాంటిక్ థ్రిల్లర్
ఆనందోబ్రహ్మ: "సరళ ‌లలితమైన పదాల సన్నజాజి పందిరి"
అంతర్ముఖం: గొప్ప రచన
డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు: గెలవడానికి కావలసింది పట్టుదల, తెలివితేటలేనని చెప్పే చక్కటి పుస్తకం
డబ్బు మైనస్ డబ్బు: చెత్త నవల
కాసనోవా: చక్కటి శిల్పంతో వ్రాసిన మంచి థ్రిల్లర్
తులసీదళం & తులసి: ఈ నవలలను సరిగ్గా అర్థం చేసుకోని వాళ్ళు, పాఠకుల తెలివితేటలను తక్కువగా అంచనా వేసినవాళ్ళు అనవసరంగా వివాదం సృష్టిచారు.
ప్రియురాలు పిలిచె: "ప్రేమకు థర్డ్ డైమెన్షన్"
ప్రేమ: "మృదుమధుర మంజుల నవలానాదం"
ధ్యేయం: ఇలాంటి నవలలే అవసరం
చీకట్లో సూర్యుడు: అంతా బాగానే ఉంది గానీ ఫ్యూచరాలజీలో పాస్టాలజీ కి సంబంధించిన బాల్యవివాహాలను మిక్స్ చేయడమే పంటికిందరాయిలా తగులుతూ ఉంటుంది. చిన్న వయసులో గర్భం వస్తే పుట్టేది అష్టావక్రలే గానీ డిజైనర్ బేబీలు కాదు.
అతడు ఆమె ప్రియుడు: వికృతీకరించిన 'ఏకవీర'
వెన్నెల్లో గోదావరి: మంచి నవల
యుగాంతం: నేను చదివిన మొట్టమొదటి సైన్స్ బేస్డ్ ఫిక్షన్. చక్కటి మనో విశ్లేషణ.

Monday, 15 May 2006

పుస్తకాల బ్లాగు

నేను చూసిన ఇంగ్లీషు పుస్తకాల బ్లాగు ఒకటి: Book-O-Holics
ఇలాంటి బ్లాగు తెలుగులో ఎవరైనా వ్రాస్తున్నారేమో నాకు తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి. తెలుగులో ఇలాంటి బ్లాగుల అవసరం చాలా ఉంది.

పుస్తకాల పురుగు

వీవెన్ పుస్తకాల పురుగును నా మీదకు ఉసిగొలిపాడు. ఈ పురుగు చేత నేను ఇంకో ఇద్దరిని కుట్టించాలట. సరే, ఈ పురుగును నేను భలే బుడుగు, నవీన్ నంబూరి ల మీదకు వదులుతున్నాను. ఇక నేను ఇటీవల చదివిన పుస్తకం 'అంపశయ్య '. ఈ పుస్తకం ఎంత ప్రసిద్ధమంటే ఈ పేరు రచయితకే ఇంటి పేరుగా మారిపోయింది. ఇది వెయ్యేళ్ల తెలుగు సాహిత్య చరిత్ర లో (1000 నుంచి 1999 మధ్య కాలంలో) వచ్చిన వంద గొప్ప గ్రంధాల్లో ఒకటని అంటారు.

తెలుగు సాహిత్యంలో చైతన్య స్రవంతి అంత విరివిగా వాడుకలోకి రాలేదు. అటువంటి చైతన్య స్రవంతిని సమర్థవంతంగా వాడుకున్న నవలల్లో ఇదొకటి. అయితే నవల మొదట్లోనే ఈ చైతన్య స్రవంతిలో మనకు వినిపించే కొన్ని మాటలు అసభ్యంగా అనిపిస్తాయి. అలాంటి మాటలు, సన్నివేశాలు తర్వాత కూడా అక్కడక్కడా ఎదురవుతూనే ఉంటాయి. అలాంటి వాటిని వదిలేస్తే ఇది నిజంగా ఒక అద్భుతమైన నవల. ఈ నవల గొప్పదనమంతా ఈ నవల ముగింపులోనే ఉంది. వాస్తవిక నవలల్లో ఇలాంటి విప్లవాత్మకమైన ముగింపు అదీ అత్యంత సహజంగా అనిపించేలా తీసుకురావడం అనితర సాధ్యమేమో!

మొదట్లో భయస్థుడు, ప్రతి విషయంలో ఊగిసలాడే మనస్తత్వం గల రవి నవల చివరలో ఇలా అనుకుంటాడు: "తన మీద దెబ్బ పడడం, తను కూడా శత్రువు మీద దెబ్బ వేయడం తనలోని ఆత్మ స్థైర్యాన్ని పెంచుతున్నది....తను నమ్మిన భావం కోసం, తను నమ్మిన ఆదర్శం కోసం, తన స్వాతంత్ర్య పరిరక్షణ కోసం తను ముందు ముందు ఇట్లాంటి దెబ్బలెన్నైనా తినడానికి వెనుకాడడు.ఇవ్వాళ్టి సంఘటన తనను అందుకు పూర్తిగా సిద్ధం చేసింది."

ఈ పరివర్తనను తీసుకురావడానికి రచయిత చైతన్య స్రవంతి ని చక్కగా వాడుకున్నారు. ఈ నవల చదివితే పిరికి వాళ్లలో సైతం ఇలాంటి కదలిక ఏర్పడి తీరుతుంది.

Wednesday, 12 April 2006

మొల్ల

1. 2-4-2006 న వార్త దినపత్రిక ఆదివారం అనుబంధంలో ద్వా.నా.శాస్త్రి వ్రాసిన ఆర్టికల్ ఇది:

"ఘనమగు సంస్కృతము జెప్పగా రుచియగునే" అని సంస్కృతాధిపత్యాన్ని నిరసించిన కవయిత్రి మొల్ల.
"కందువ మాటల సామెతలందముగా గూర్చి చెప్ప నది తెలుగునకుం
పొందై రుచియై వీనుల విందై" ఉంటుందని తెలుగు భాషాఅభిమానాన్ని ప్రకటించిన కవయిత్రి మొల్ల.
"గూఢ శబ్దములను గూర్చిన కావ్యమ్ము మూగచెవిటి వారి ముచ్చటగును" అంటూ తెలుగు కవిత్వానికి సారళ్య అవసరాన్ని నొక్కి చెప్పిన కవయిత్రి మొల్ల.
"శ్రీకంఠ మల్లీశు వరము చేత నెఱి కవిత్వంబు చెప్పగా నేర్చుకొంటి" అంటూ భక్తికి పట్టం కట్టిన కవయిత్రి ఆమె.
"తప్పులెంచకుడు కవుల్" అనగల వినయ సంపద గల కవయిత్రి ఆమె.
వాల్మీకి రామాయణాన్ని కథాప్రధానంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పినట్లు గానే వ్రాసిన కవయిత్రి మొల్ల.
మొల్ల కడప జిల్లా గోపవరం గ్రామం లో జన్మించినట్లుగా చాల మంది నిర్ణయించారు.
నెల్లూరు దగ్గర గోపవరం ఉన్నా గానీ అక్కడ శ్రీకంఠ మల్లేశ్వరస్వామి ఆలయం లేదు. మొల్ల తాను శ్రీ కంఠ మల్లేశ్వరుని వరం చేతనే కవిత్వం నేర్చుకున్నానని స్వయంగా చెప్పింది. శ్రీరామాలయమూ గోపవరంలోనే ఉంది. తరతరాలుగా జనం చెప్పుకునే మొల్ల బండ ఉంది. గ్రామస్థులు ఈ బండకు పూజ చేయడం ఉంది. శ్రీ కృష్ణదేవరాయలు గోపవరం లో బస చేసినట్లుగా స్థానికులు చెప్పుకొంటూ ఉంటారు. మొల్ల పూర్వీకులు ఆత్మకూరుకు చెంది ఉంటారనీ, అందుకే ఆతుకూరు ఇంటిపేరు అయిందనీ కొందరి అభిప్రాయం. కుమ్మరి కులానికి చెంధిన మొల్ల ఈ ప్రాంతానికి చెందినదనడానికి గోపవరం దగ్గర కుమ్మరి కులాలవారూ ఉనారు. మొల్ల నివసిచిన ఇల్లుగా గోపవరంలో పాడుబడిన ఇల్లు ఉంది. పెద్దన కూడా గోపవరం వచ్చినట్లుగా కొందరు వృద్ధుల కథనం.


ఇంత చారిత్రక ప్రాధాన్యం గల గోపవరం లో శ్రీకంఠమల్లేశ్వరుని దేవాలయం జీర్ణావస్థలో ఉంది. విగ్రహం ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ, దుమ్ములో ఉంది. ఈ దేవాలయాన్ని పునరుద్ధరించాలి. రామాలయంలోని విగ్రహాలను ఎవరో ఎత్తుకుపోయారు. రాముని పటం మాత్రమే ఉంది."మొల్ల బండ"కు పరిరక్షణ లేదు. ఇటీవల మొల్ల జయంతి సందర్భంగా గోపవరంలో మొల్ల విగ్రహావిష్కరణ జరిగింది.దానికి మూల కారకులు విద్వాన్ గానుగపెంట హనుమంత హనుమంత రావు గారు.ఈయన కృషి వల్లనే మొల్ల సాహితీ పీఠం స్థాపించ బడింది. శాలివాహన సంఘం మొల్ల కవితా వ్యాప్తికి నడుం బిగించింది. గానుగపెంట హనుమంత హనుమంత రావు గారు మొల్ల పై చిన్న పుస్తకం కూడా వ్రాశారు.

అయితే మొల్ల కు తగిన న్యాయం లభించిందా? అన్నది ప్రశ్న. ట్యాంక్ బండ్ పై మొల్ల విగ్రహం ప్రతిష్ఠించడమొక్కటే చెప్పుకోదగినది. మొల్ల రామాయణం 1917 లో వావిళ్ళ వెంకటేశ్వర్లు గారు అచ్చు వేశారు.కందుకూరి కవుల చరిత్ర వ్రాసే నాటికి మొల్ల రామాయణం అసలు ప్రతి దొరకలేదేమో ? కానీ ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం లో మొల్ల గురించి టూకీ గా మాత్రమే వ్రాశారు. అంటే సమగ్ర విశ్లేషణ చేయదగ్గ కవయిత్రిగా భావించలేదన్న మాట. మొల్లకు న్యాయం జరగాలంటే గోపవరమ్ లో శ్రీకంఠమల్లేశ్వరుని దేవాలయాన్ని పునరుద్ధరించాలి.రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన చేయడం, మొల్ల బండకు ప్రాధాన్యమిచ్చి కాపాడడం తక్షణం చేపట్టాలి.గోపవరం మండలాన్ని మొల్ల మండలంగా మార్చాలన్న వినతిని కడప జిల్లా పరిషత్ చేర్మన్ అంగీకరించారు.రాజకీయ నాయకుల, పురుషుల పేర్లతో జిల్లాలు, వీధులు ఉంటాయి.స్త్రీల పేర్లతో ఎందుకుండవో అర్థం కాదు.గోపవరాన్ని మొల్ల మండలంగా మారిస్తే అదొక చారిత్రక ఘటన అవుతుంది. తెలుగు విశ్వ విద్యాలయం మొల్ల రామాయణాన్ని వ్యాఖ్యానంతో ముద్రించడం అవసరం. రాయలసీమ అంటే బాంబుల సీమ కాదు ముఠాకకషలకు పుట్టినిల్లు కాదు.అని ఈ తరానికి, రాబోయే తరాలకు చెప్పవలసి ఉంది. మొల్ల, అన్నమయ్య, తిమ్మక్క, వేమన, పోతులూరి వంటి ఎందరో మహానుభావులు జన్మించిన నేలగా, బ్రౌన్ నడయాడిన నేలగా, విస్తృతంగా ప్రచారం చేయవలసి ఉంది. మన సాహితీ అవశేషాలను భద్రపరచవలసి ఉంది. గోపవరాన్ని చారిత్రక పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయవలసి ఉంది.

2. 13-3-2006 న ఈనాడు కడపలో వచ్చిన వార్త~:

మొల్ల ఊరు..మరచి పోయారు


అనాదరణకు గురవుతున్న పెద్ద గోపవరం
నేడు జయంతి

శ్రీకృష్ణాదేవరాయల కొలువులోని హాస్యకవి తెనాలి రామలింగనికి సమకాలీనురాలుగా భావిస్తున్న రచయిత్రి మొల్ల తెలుగు రామాయణంతో చరిత్రలో సుస్థిర స్థానం పొందింది. ఆమె పాద ముద్రికలు బద్వేలు మండలం పెద్దగోపవరంలో నిలచి ఆ ఘనతను చాటుతున్నాయి. ఆమె జ్ఞాపికలను పదికాలాల పాటు నిలిపే ప్రయత్నం మాత్రం జరగడం జరగడం లేదు.

వాల్మీకి రామాయణానికి తెలుగు వన్నెలద్దిన మహిళా కవితామూర్తి మొల్ల నేటికీ స్మరణీయురాలే.కానీ తెలుగు జాతికి ఖ్యాతి తెచ్చిన ఆమె నివాసగ్రామమైన బద్వేలు నియోజకవర్గంలోని పెద్దగోపవరం మాత్రం నిరాదరణకు గురవుతోంది. చారిత్రక ప్రాధాన్యమున్న ఈ ప్రాంతాన్ని అటు పురావస్తు శాఖ అధికారులు గానీ, ఇటు పర్యాట శాఖ అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. ఆదికవి వాల్మీకి 24 వేల శ్లోకాల్లో రచించిన రామాయణాన్ని ఆమె తేట తెలుగులో 871 పద్యాలతో కావ్యంగా రచించి చెరగని ముద్ర వేసుకొంది. ఆ మహాయజ్ఞాన్ని ఆమె అయిదు రోజుల్లో పూర్తి చేసినట్లు దక్షిణ హిందూ స్థానపు కవుల చరిత్రలో కావలి వెంకటరామస్వామి పేర్కొని ఆమె ఘనతను కొనియాడారు. గుర్తుగా ఆమె కూర్చొని కవిత్వం రాసిన బండ మాత్రం ఏటా పండుగల సందర్భంగా పూజలను అందుకొంటోంది. ఈమె ఆరధ్య దైవమైన శ్రీకంఠ మల్లేశ్వరస్వామి ఆలయం నేచదరమైంది. ఆమె పూజించిన శివలింగం కాలగర్భంలో కలసి పోగా పానుమట్టం మాత్రమే మిగిలింది. వినాయకుడు, తదితర దేవతామూర్తి విగ్రహాలకూ ఇదే దుస్థితి పట్టింది.

శివకేశవుల బేధం ఉన్న రోజుల్లో ఇద్డరూ ఒకటేనని సమాజానికి చాటిచెప్పిన మహనీయురాలు ఆమె. రాముడిని, వేణుగోపాలుడ్నీ, శ్రీకంఠమల్లేశ్వరుడినీ ఆరాధించి ఆధ్యాత్మికంలో ఉన్న గొప్పదనాన్ని చాటింది. ఈ ఆలయాలు ఇప్పటికీ ఆమె జ్ఞాపికలుగా గ్రామంలో నిలిచాయి.

మొల్ల మాండలికాలపై సాహిత్య శోధనలు చేయాలి
మొల్ల తాను రచించిన రామాయణంలో గోపవరం ప్రాంత ప్రజలు మాట్లాడుకొనే పదాలనే కవిత్వంలో వాడిందని, వీటిపై సాహిత్య పరిశోధనలు జరిపించాలనికవయిత్రి మొల్ల సాహిత్య పీఠం గౌరవాధ్యక్షులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఏటా మార్చి 13న ఆమె జయంతిని జరుపుతున్నామని తెలిపారు. మొల్ల నివసించిన ఇంటిని స్మారక మందిరంగా మార్చాలని కోరారు.18,19 శతాబ్దాలలో కందుకూరి వీరేశలింగం పంతులు, బద్వేలుకు చెందిన ఆధునిక కవులు జంగా నరసింహశాస్త్రి, జనమంచి శేషాద్రి శర్మ, యాదాటి నరసింహశర్మ తదితరులు మొల్ల రామాయణం గూర్చి చర్చించారని తెలిపారు.

Wednesday, 15 February 2006

Twamevaaham

There are some wonderful short stories in Telugu which deal with the sensitive issue of the kind of relationship that exists or that should exist between man and woman, lovers or spouses.
Chalam wrote several stories and novels including the great shocker called "Mydanam".
Kodavatiganti Kutumba Rao wrote "ADavalasina Abaddham" in which he placed love over and above the marital relationship, which solely depends on the nuptial ceremony. The hero in it risks his marital life in his quest for true love but in the end, wins both birds at one shot.
There are some other great stories I have read about true love and understanding between wife and husband. I don't remember the names but one was written by Chaya Mallik and another one by Sannapu Reddy Venkatarami Reddy (both published in Rachana several years ago) the details of which I can provide later.
But the reason why I am writing this is the story I have read in 6-11-2005's Eenadu Adivaram magazine.
You too read the story and post your comments: The Story