Showing posts with label పురాణాలు. Show all posts
Showing posts with label పురాణాలు. Show all posts

Tuesday, 3 June 2008

పాండవులెవరు?

ఓరి దేవుడో! ఈ బ్లాగులో నేను టపా రాసి సంవత్సరమైందా? ఎంతన్యాయం? అరిఝెంటుగా ఏదోకటి రాసెయ్యాలి. అరిఝెంటుగా రాసెయ్యాలనుకున్నాను కాబట్టి అవుడియాలేం లేవు. అందుకే ఈసారికిలా సర్దుకుపోండి. విషయమేమిటంటే నిన్నటి ఈనాడు పేపర్లో ఆంతర్యామి శీర్షికలో ఒక ఆసక్తికరమైన వ్యాసం చదివాను. ఇది నిజంగా పాండవుల పుట్టుకపై కొత్తచూపే. లంకె ఇంకో మూణ్ణెళ్ళు మాత్రమే పనిచేస్తుంది. వ్యాసంలోని ముఖ్యాంశాలను ఇక్కడ ఇస్తున్నాను:

భూమాత స్వరూపమే కుంతి
- తటవర్తి రామచంద్రరావు

వ్యాసమహర్షి మహాభారతంలో భూమికి ప్రతిస్వరూపమైన కుంతిని సృష్టించాడు. కు అంటే భూమి. కుంతి అంటే భూ స్వరూపమే. కుంతికి పృధ అని మరో పేరుంది. అంటే పృధ్వి అని అర్థం.

ఆమె ముందు ప్రత్యక్షమైన సూర్యదేవుడు ఆమె నాభిని స్పృశించి ఆమె గర్భంలో ప్రవేశించి స్వర్ణకవచకుండలాలతో ఉన్న కర్ణుడికి జన్మకారకుడైనాడు. అంటే, సూర్యకిరణాల సహాయంతో భూమి మీద జీవరాశి ఉద్భవించిందనటానికి సంకేతం. వృక్షరాజ్యానికిది నాంది పలికింది. కర్ణ అంటే ధాన్యమని మరో అర్థం. అంటే కర్ణుడు వృక్షాలకు మూలమైన విత్తనాలకు సంకేతం. నీళ్ళు లేనిదే విత్తనం మొలకెత్తదు. అందుకే కుంతి కర్ణుడిని బుట్టలో పెట్టి నదిలో వదిలింది. ఆ బుట్టను అధిరథుడు చూసి కర్ణుణ్ని ఒడ్డుకు తెచ్చాడు. అధిరథుడంటే సారథి అని అర్థం. కర్ణుడి జీవితానికి అతను నిజంగానే సారథి. ఆ తరవాత కర్ణుడు అంగరాజు అయ్యాడు. అంటే శరీరాంగాలకు రాజు అయ్యాడు. శరీరాన్ని పోషించేది ఆహారం కనుక దానికి మూలాధారమైనాడు. మనకు ఆహారంగా లభ్యమయ్యే కూరలకు, పళ్ళకు, ధాన్యానికి పైన రక్షణగా తొక్క, బెరడు, పొట్టు లాంటివేవో ఒకటి ఉంటాయి. కర్ణుడి కవచం దానికి సంకేతం. ప్రతి చెట్టునుంచీ పళ్ళు వేలాడతాయి. కర్ణుడి కుండలాలు వాటికి చిహ్నాలు.

సూర్యశక్తితో ప్రథమపుత్రుడి ద్వారా వృక్షజాతికి జన్మనిచ్చిన కుంతి, జంతుజాతిలో అత్యుత్తముడిగా పుట్టిన మనిషికి కావాల్సిన అయిదు శక్తులకు పంచపాండవుల ద్వారా జన్మకారకురాలైంది.

బుద్ధికి యుధిష్ఠిరుడు, మనస్సుకు భీముడు, ప్రాణానికి అర్జునుడు, కాళ్ళుచేతులకు నకుల సహదేవులు సంకేతాలు. ఒకరి తరవాత ఇంకొకరు పుట్టటంలో కూడ ఒక అర్థం ఉంది. తల్లి గర్భం నుంచి ముందు బయటకు వచ్చేది బిడ్డతల. అక్కడే బుద్ధి ఉండేది. తరవాత వచ్చేవి కనుబొమలు. వాటిమధ్యనే కేంద్రీకృతమయ్యేది మనస్సు. తరవాత చెవులు, ముక్కు, నోరు బయటకు వస్తాయి. ప్రాణాధారమైన ఊపిరికి అవే ఆలవాలాలు. అక్కడితో మనిషి పుట్టుకకు నాంది జరిగింది. అయితే, ఆ శరీరం పనిచేయటానికి కాళ్ళు చేతులు కావాలి. అవి రెండు రెండుగా ఉండటమే కాకుండా ఒకేలా ఉంటాయి. నకుల సహదేవులు కవలలుగా పుట్టటం కూడా దానికే సంకేతం!

పైన చెప్పినట్లు మనిషి జీవితానికి అవసరమైన సృష్టి కుంతీపుత్రుల రూపంలో జరిగిందని వ్యాసమహర్షి తన మహాభారతకథ ద్వారా మనకు సూచించాడు. భూమిని రక్షించుకోకపోతే భవిష్యత్తులో మనిషి మనుగడకు ప్రమాదం సంభవిస్తుందని అంతా గుర్తించాల్సిన సమయమిది!

Thursday, 7 June 2007

ద్రౌపది ప్రేమ

స్వాతి కుమారి రాసిన కవిత గురించి సాహిత్యం గుంపులో రాస్తూ రానారె "మహాభారతంలో ద్రౌపది ఒకసారి కృష్ణుని అడుగుతుందిట - (బహుశా కర్ణునికూడా భర్తగా పొందాలనే తన కోరికను వెల్లడించే సన్నివేశంలో)" అన్నారు. ద్రౌపది కర్ణుణ్ణి కూడా భర్తగా పొందాలనుకోవడమేమిటి? నేనిది ఎక్కడా చదవలేదు, వినలేదు - ఒక్క దానవీరశూరకర్ణ సినిమాలో తప్ప. సినిమాలు వ్యాపారదృక్పథంతో తీసేవి (అన్నీ కాకపోయినా చాలా మట్టుకు). వాస్తవఘటనలను ఆధారంగా చేసుకుని తీసినవాటిలో కూడా వాస్తవాలకంటే అతిశయోక్తులు, వక్రీకరణలే ఎక్కువ. ద్రౌపది విషయానికి వస్తే ఆమెకు కర్ణుడి మీద ఆ దృష్టి ఎంతమాత్రమూ లేదనేందుకు తిరుగులేని ఆధారం స్వర్గారోహణపర్వంలో ఉంది. పాండవులు రాజ్యం వారసులకు అప్పగించి ద్రౌపదీసమేతంగా హిమాలయాల్లో పడి పోతున్నప్పుడు ముందుగా ద్రౌపది నేలకూలుతుంది. అయినా అర్జునుడితో సహా నలుగురు పాండవులు తిరిగైనా చూడకుండా స్వర్గం వైపు వెళ్తుంటే భీముడు ఆమె చనిపోయినందుకు విలపిస్తూ 'ఎందుకిలా జరిగింది?' అని అడిగితే యుధిష్టిరుడు ఇలా అంటాడు: "ఆమెకు మిగిలిన తన భర్తలకంటే అర్జునుడి మీదే ప్రేమ ఎక్కువ. (అదే ఆమె చేసిన పాపం. అందుకే ఆమె చచ్చిపోయింది)". అసలు ద్రౌపది ప్రేమించిందీ, పెళ్ళాడాలనుకున్నదీ అర్జునుడొక్కణ్ణే. అప్పటివరకూ బ్రతికాడో చచ్చాడో తెలియని అర్జునుడు కట్టెదుట కనిపించేసరికి ఆనందపరవశురాలైన అయిన ఆమె 'అతణ్ణి పెళ్ళాడాలంటే మమ్మల్నందరినీ కూడా పెళ్ళాడకతప్పదు' అని యుధిష్టిరుడు పెట్టిన నిబంధనకు తలొగ్గింది. 'ఇదెక్కడి అన్యాయం?' అని అప్పుడే నిలదీయకుండా పరిస్థితులతో రాజీపడింది. అలాంటామె తన ప్రేమను జీవితాంతం ఐదుగురు భర్తలకు "సమానంగా" పంచి ఇవ్వడం ఎలా సాధ్యమౌతుంది? అలా ఉండాలనుకోవడం ఘోరమైన అన్యాయం కాదా?
ఆమె కర్ణుణ్ణి కోరుకున్నమాటే నిజమైతే ఇక్కడ యుధిష్టిరుడి సమాధానమెలా ఉండేదో మీరే ఊహించవచ్చు. ఒక పరపురుషుణ్ని కోరుకున్న పాపానికి అసలు ఆమెను స్వర్గలోక ఛాయలకైనా రానిచ్చి ఉండేవారు కాదు.

ఇంతకూ అక్కడ రానారె అడిగిన ప్రశ్నకు సమాధానం నాకు తెలియదు. మీకేమైనా తెలిస్తే చెప్పండి.

Monday, 12 February 2007

ఆ ఐదుగురు

మహాభారతంలో ఐదుగురిని మహావీరులుగా పేర్కొన్నారు. వాళ్లైదుగురూ వాళ్ళలోవాళ్ళు కొట్టుకుచావల్సిందే తప్ప వేరెవ్వరూ వాళ్ళనేమీ చెయ్యలేరట. వాళ్లైదుగురు: భీముడు, దుర్యోధనుడు, జరాసంధుడు, కీచకుడు, బకాసురుడు. వీళ్లు నిజంగా అంత మొనగాళ్ళా?

ముందుగా బకాసురుడి సంగతి చూద్దాం. వీడు వీరోచితకృత్యాలు చేసినట్లు ఎక్కడాలేదు. వాడు చేసిందల్లా ఏకచక్రపురమనే అగ్రహారంలోని వాళ్ళను బెదిరించి పొట్టపోసుకోవడం. వాడి తిండి, ఆకారం చూసి ఆ అగ్రహారంలోని బ్రాహ్మలు వాడినెదిరించడానికి భయపడినట్లు అనిపిస్తుంది. వాణ్ణెదిరించేవాడెవరూ లేనంతవరకు మాత్రమే వాడి ఆటలు చెల్లాయి. బకాసురుడి జీవితకాలంలో వాడి వీరత్వానికి ఒకే ఒక సవాలు ఎదురైంది - భీముడి రూపంలో. ఆ ఒక్కసారీ వాడు దారుణంగా ఓడిపోయాడు. భీముడు బండెడు కూడు తిని భుక్తాయాసమైనా తీర్చుకోకుండానే వాడితో తలపడి చంపేశాడంటేనే వాడి వీరత్వమేమిటో స్పష్టమైపోతుంది.

భీముడికి చిన్నప్పట్నుంచి ఏ విషయంలోనైనా తన Id impulses ను అదుపులో పెట్టుకునే అలవాటులేదు. అందుకే తానున్నది అజ్ఞాతవాసంలోనైనా కీచకుడు తన భార్యను అవమానించాడనే కోపావేశంతో ఉన్న భీముడు వాడి శవాన్ని ఆనవాలైనా పట్టడానికి వీల్లేకుండా ఒక మాంసపుముద్దగా చేసిపారేశాడు. బేసిగ్గా బకాసురుడు, కీచకుడు ఒకలాంటివాళ్ళే. రెండే తేడాలు:
1. మొదటివాడికి కడుపే కైలాసం. రెండోవాడి ఆకలి వేరు.
2. మొదటివాడికి ఎటువంటి అధికారహోదా లేదు. రెండోవాడికి అధికారమదం, బలగర్వం ఉన్నాయి.
కీచకుడు వీరుడే. కొన్ని యుద్ధాలు గెలిచాడు. కానీ మహావీరుడంటే మాత్రం ఆలోచించాల్సిందే! నిజంగా కీచకుడు గొప్ప వీరుడే ఐతే విరాటరాజ్యం "దోమకుత్తుకంతే" ఎందుకుంటుంది? వీళ్ళిద్దరి గురించీ రాసినవాటిలో అతిశయోక్తులే ఎక్కువ.

దుర్యోధనుడు: వీడిది వజ్రకాయం. ధర్మబద్ధంగా ఐతే భీముడైనా, వాడి తాతైనా వీడిని గెలవలేకపోయేవాళ్ళు.(ఈ తాత గురించి ఇంకోసారి చెప్పుకుందాం.) పైగా వీడు గదాయుద్ధంలో మెళకువలు నేర్చుకున్నది(అడ్వాన్సుడు కోర్సు చేసింది) బలరాముడి దగ్గర. ఈ బలరాముడికి సరిజోడీ ఐనవాడు జరాసంధుడు.

జరాసంధుడు: చర్వితచర్వణం కాకుండా జరాసంధుడి గురించి ముందుగా నేను రాసింది ఇక్కడ చదవండి. అక్కడ "నమ్మశక్యంగా లేదు" అని ఎందుకు రాశానో మాత్రం ఇక్కడ వివరిస్తాను:
కృష్ణుడు భీమార్జునులను వెంటబెట్టుకుని గిరివ్రజానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో గమనిస్తే చాలు - జరాసంధుడెలాంటివాడో తెలిసిపోతుంది:
వాళ్లు రావడమే దొడ్డిదారిన వచ్చారు. రావడంతోటే భేరీలను పగలగొట్టి విధ్వంసానికి పాల్పడ్డారు. వేరే ఎవరైనా ఐతే ఆ పని చేసినందుకు వాళ్ళను తన్నితగలేసేవాళ్ళు. ఐనా జరాసంధుడు వాళ్ళను ఆదరంగానే చూశాడు. తప్పుచేసి తన చేతికి చిక్కిన శతృవులనే ఏమీ చెయ్యకుండా వదిలినవాడుగా కనిపిస్తాడు జరాసంధుడు ఇక్కడ. ఆ ఆదరాన్ని కూడా తృణీకరించి వాళ్ళు అతణ్ణి అవమానించారు. మీరెవరని అడిగినప్పుడు వాళ్ళు తాము బ్రాహ్మణులమని చెప్పుకున్నారు. అప్పుడు వాళ్ళను చూసి జరాసంధుడు ఇలా అంటాడు: "మీ చేతులు ఆయుధాలు ప్రయోగించడానికి అలవాటుపడినవాళ్ళలా కాయలుకాచి ఉన్నాయి గానీ బ్రాహ్మణుల చేతుల్లా లేవు. ఐనా మీరెవరన్నది నాకనవసరం..." అని వాళ్ళకు అతిథులకు చేయదగిన మర్యాదలన్నీ చేస్తాడు.

చివరకు తామెవరో చెప్పి యుద్ధం చేస్తామన్నప్పుడు కూడా "18 సార్లు నా దెబ్బకు తట్టుకోలేక పారిపోయినవాడివి నువ్వు నాతో ఏం పోరాడుతావ్?" అని కృష్ణుణ్ణీ, మరీ అర్భకుడుగా ఉన్నాడని అర్జునుణ్ణీ వదిలేసి బుద్ధిపూర్వకంగానే భీముణ్ణి ఎంచుకుంటాడు. ఛాయిస్ తనకే ఇచ్చారు కదాని ముందుగా కృష్ణార్జునులను ఒకరి తర్వాతొకరిని రమ్మని చావచితక్కొట్టినా, లేక చంపిపారేసినా అడిగే దిక్కులేదు. ఐనా వాళ్ళు అంతదూరం వచ్చారంటే అది అతడి ధర్మనిరతి మీద వాళ్ళకున్న నమ్మకమే. ఇంతటి ధర్మపరుడు నరబలులిస్తాడంటే నమ్మడమెలా? అందునా సాటి రాజులను? పైగా అతడు నిజంగా నరబలులే ఇస్తున్నట్లైతే వీళ్ళు తన చిరకాల శతృవులని, ఇప్పుడు ఒంటరిగా చిక్కినారని తెలిసీ ముగ్గురినీ బంధించి అదే వరసలో బలి ఇవ్వకుండా ఎందుకు వదిలేసినట్లు? ప్రతీకారం తీర్చుకుంటారేమోనని భయమా? భీమార్జునులే చచ్చినాక పాండవుల వైపు కసిదీర్చుకునే వీరుడెవడున్నాడని? మహా ఐతే కృష్ణుణ్ణి కోల్పోయిన బలరాముడు దండెత్తివచ్చేవాడు. జరాసంధుడికి బలరాముడి వీరత్వం మీద ఏ కాస్త గౌరవమున్నా మథుర మీద అన్నిసార్లు దండెత్తేవాడే కాదుగద? ఐనా ఆ బలరాముడే జరాసంధుణ్ణి జయించగలిగితే వీళ్ళకీ తిప్పలెందుకు? జరాసంధుణ్ణి చంపడానికి చీకట్లో వెళ్ళడమే ఒక సూచన - అధర్మమార్గంలో చంపారనడానికి.

Sunday, 24 December 2006

కలలు నిజమాయె(నా?)

సాధారణంగా మనం వింటూ ఉంటాం: మన ఇతిహాసాల్లో - ముఖ్యంగా మహాభారతంలో - రాసినవి "నిజంగా జరిగి ఉంటే అద్భుతం. జరగనట్లైతే వాటిని ఊహించగలిగిన కవుల కల్పన మహాద్భుతం." అని.

ఈ రోజు ఈనాడు ఆదివారంలో వచ్చిన ఒక వ్యాసంలోని కొన్ని అంశాలు:
రామాయణంలో రావణాసురుడికి పుష్పక విమానం ఉండేది. అది ఏవియేషన్‌... అనగా ఆకాశయానం! తన కంటే ముందు కుంతికి కొడుకు పుట్టాడనే ఆక్రోశంతో గర్భవిచ్ఛిత్తికి పాల్పడింది గాంధారి. ఛిద్రమైన పిండాన్ని వ్యాసుడి సూచనతో కుండల్లో పెట్టి జాగ్రత్తచేశారు. అలా పుట్టినవారే కౌరవులు. వాళ్లని టెస్ట్‌ట్యూబ్‌ బేబీలనొచ్చా?

అనకూడదు. టెస్ట్ ట్యూబ్ బేబీలనేది పూర్తిగా వేరే వ్యవహారం. ఇక్కడ కౌరవుల పిండం ఏర్పడడంలో సాంకేతికత ప్రమేయమేమీ లేదు. గాంధారి గర్భధారణ మామూలుగానే జరిగింది. ఐతే కౌరవులు పూర్తిస్థాయిలో పిండం ఎదగకుండానే పుట్టినవాళ్ళు. అంటే ప్రీ మెచ్యూర్ బేబీలన్నమాట. వాళ్లను నేతికుండల్లో పెట్టి పెంచారు. ఆ నేతి కుండలను నేటి ఇన్‌క్యుబేటర్లతో పోల్చవచ్చు.

ఐతే మహాభారతంలోనే అంతకు రెండు తరాల ముందు పుట్టిన టెస్ట్ ట్యూబ్ బేబీ ఒకరున్నారున్నారండోయ్! ఆయనే ద్రోణుడు. ఆ ద్రోణుణ్ణే దానవీరశూరకర్ణ సినిమాలో "నీచమైన మట్టికుండలో పుట్టితివికదా?" అని ఈసడిస్తాడు దుర్యోధనుడు. ద్రోణుడికంటే ముందు అదే పద్ధతిలో పుట్టినవాళ్ళు అగస్త్యుడు, వసిష్ఠుడు. ఇద్దరికిద్దరూ గొప్ప ఋషులు. ఈ వసిష్ఠుడు రఘువంశానికి కులగురువు. అగస్త్యుని గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి.



వినాయకుడికి ఏనుగు తల అతికించాడు శివుడు... ఇది ప్లాస్టిక్‌సర్జరీ. ప్రస్తుతానికి తలలు మార్చలేం కానీ తెగినవేళ్లూ కాళ్లూ అతికించే దశలో ఉన్నాం. మంచి అభివృద్ధే!

అబ్బా...? అలాగా?!

మన పురాణాలన్నిట్లో కనిపించే మాయమవడం, ప్రత్యక్షమవడం, అణిమాది అష్టసిద్ధులూ... అన్నీ కథలూ, కల్పితాలేనంటారా. మరీ అంత తొందరపడి కొట్టిపారేయకండి.

చిత్తం!

Saturday, 7 October 2006

రామాయణం-మహాభారతం

"మన ప్రవర్తన ఎలా ఉండాలి?" అనే ప్రశ్నకు సమాధానం రామాయణమైతే "లోకం పోకడ ఎలా ఉంది?" అనే ప్రశ్నకు సమాధానం మహాభారతం.

మన ప్రవర్తన ఎలా ఉండాలో రామాయణంలోని పాత్రలు చెబుతాయి:

అన్నదమ్ముల అనుబంధం: రామ-లక్ష్మణులు
స్నేహం: సుగ్రీవమైత్రి
తండ్రీకొడుకుల అనుబంధం: దశరథ-రాములు
యజమాని-సేవకులు: రామ-హనుమ
పాలకుడు-ప్రజలు: రాముడు-అయోధ్య ప్రజలు

ఐతే భార్యాభర్తల అనుబంధమెలా ఉండాలో తెలుసుకోవడానికి మాత్రం రామాయణంలో వెదక్కండి. ఒక ఆదర్శవంతుడైన పాలకుడిగా ఉండాలో, లేక ఒక మంచి భర్తగా ఉండాలో నిర్ణయించుకోవలసిన పరిస్థితి ఎదురైనప్పుడు రాముడు ఒక మంచి పాలకుడిగా ఉండడానికే నిశ్చయించుకున్నాడు. ఎటుతిరిగీ తన తప్పేమీ లేకుండా ఆ నిర్ణయానికి బలైపోయింది మాత్రం సీత. (సీత-ద్రౌపదుల గురించి వివరంగా ఇంకొకసారి)

ఇక మహాభారతం విషయానికొస్తే అది అన్నదమ్ముల బిడ్డల (దాయాదుల) మధ్య ఆస్థి (రాజ్యం) కోసం జరిగిన గొడవ. ఇలాంటి గొడవ రామాయణంలో వాలి-సుగ్రీవుల మధ్య జరిగినట్లనిపించినా అక్కడి పరిస్థితులు వేరు. సుగ్రీవుడు తనను చంపడానికి కుట్ర పన్నాడని వాలి బలంగా నమ్మాడు. సుగ్రీవుడి సదుద్దేశాన్ని ఋజువుచేసే ఆధారాలేమీ లేవు. పైగా వాలి తిరిగొచ్చేటప్పటికి సుగ్రీవుడు వాలి భార్యతో ఉంటూ, వాలి రాజ్యాన్ని పాలిస్తున్నాడు. అందుకే వాలి సుగ్రీవుడి మీద ద్వేషం పెంచుకున్నాడు. ఇక తను చెప్పేది ఏ మాత్రమూ నమ్మక వాలి నేరుగా తనను చంపవస్తే పారిపోవడమో ఎదురు తిరగడమో తప్ప సుగ్రీవుడికి గత్యంతరం లేదు.

మహాభారతంలో నాకు కౌరవులు-పాండవుల మధ్య మౌలికంగా ఎటువంటి తేడా కనబడలేదు. వాళ్ళు చేసింది అధర్మమైతే వీళ్ళూ తక్కువేమీ చెయ్యలేదు. వీళ్ళు వీరులైతే వాళ్ళ వైపు అంతకంటే గొప్ప వీరులున్నారు. ధర్మరాజుగా పిలవబడే యుధిష్ఠిరుడు జూదం ఆడేటప్పుడు ఎంతటి హీనస్థితికైనా దిగజారుతాడని ఒకసారి కాదు రెండుసార్లు ఋజువైంది. ఇతర విషయాల్లో కూడా అతడి ప్రవర్తన నాకేమీ ఉదాత్తంగా అనిపించలేదు. అతడికి ధర్మం తెలుసు. కానీ తనకు తెలిసిన ధర్మాన్ని అతడు పాటించడంలోనే వచ్చింది తేడా.

జూదం సప్తవ్యసనాల్లో ఒకటి. తప్పుడుపని అన్న తర్వాత ఎవరుచేసినా తప్పే. జూదం యుధిష్ఠిరుడి అతిపెద్ద బలహీనత - తనతోబాటు తోడబుట్టినవాళ్ళను, కట్టుకున్న పెళ్ళాన్ని సైతం తాకట్టు పెట్టేంత. (అందులోనూ అతడు పందెంగా ఒడ్డిన ద్రౌపది అతడొక్కడికే భార్య కాదు! ఆమెను ఒడ్డేముందు ఆమె ఆమోదం, ఆమె ఇతర భర్తల అంగీకారం తీసుకోవాలనే కనీస బాధ్యత కూడా మరిచిపోయేటంతగా ఆ వ్యసనానికి బానిసైనాడు). దీన్ని ఎవరైనా ఏ రకంగా సమర్థిస్తారో నాకర్థం కాదు. అందులోనూ ఇవే పందాలు ఒడ్డి ఓడిపోవడం వెంటవెంటనే రెండుసార్లు జరిగింది. మొదటిసారి ఓడిపోయినప్పుడు ద్రౌపదికి ధృతరాష్ట్రుడు ఇచ్చిన వరాలతో దాస్యవిముక్తి పొందిన వాడు, మళ్ళీ వెంటనే గుడ్డిగా జూదానికి సిద్ధపడ్డమేమిటో! బలహీనతలున్నవాళ్ళు బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉండతగరు. కేవలం దృష్టి లోపం వల్ల ధృతరాష్ట్రుడు రాజ్యపాలనకు అనర్హుడైతే, వ్యసనపరుడు కాబట్టి యుధిష్ఠిరుడూ అనర్హుడే కావాలి.

ఇక అందరికీ తెలిసినా గుర్తించడానికి ఇష్టపడని, కుంటిసాకులు చెప్పే విషయాలు(చారిత్రక దృక్పథంతో చూసినప్పుడు కృష్ణుడు భగవదవతారమనే విషయాన్ని కాసేపు మరిచిపోదాం):

భీష్ముడి చావు: యుద్ధభూమిలో రాత్రిపూట శతృశిబిరానికి వెళ్ళి "బాబ్బాబు! నువ్వు చచ్చిపో! లేదా కనీసం నిన్నెలా చంపాలో నువ్వే చెప్పు." అని దేబిరించినవాడు యుధిష్ఠిరుడు.

ద్రోణుడి చావు: 'మిన్ను విరిగి మీదపడినా సరే వీడు అబద్ధమాడడు' అని నమ్మించి అతిఘోరమైన అబద్ధంతో గురువు ప్రాణాలనే బలిగొన్నవాడు యుధిష్ఠిరుడు. (యుద్ధంలో గెలవాలంటే గురువును చంపక తప్పదని ముందే తెలుసు. కానీ చంపించడానికి అవలంబించిన పద్ధతే అనైతికం.)

అది అనైతికం కాదనే వాళ్ళు ఒక్కసారి నిష్పాక్షికంగా ఆలోచించండి: ద్రోణుడికి వినబడేలా చెప్పదలచుకున్నదేమో పచ్చి అబద్ధం. ఆ అబద్ధాన్ని కూడా ధైర్యంగా చెప్పలేని పిరికివాడు, అబద్ధాన్ని నిజంలా భ్రమింపజేయడానికి మరింత కుటిలత్వానికి పాల్పడినవాడు యుధిష్ఠిరుడు.

ఇక కర్ణుడి చావులోనూ, దుర్యోధనుడి చావులోనూ జరిగింది అధర్మమే. "నిరాయుధుల మీద ఆయుధాన్ని ప్రయోగించరాదు." ఇది యుద్ధనీతి. భీష్ముణ్ణీ, ద్రోణుణ్ణీ ఆయుధం ప్రయోగించలేని స్థితిలోకి నెట్టీ, కర్ణుణ్ణి నిరాయుధుడుగా ఉన్నప్పుడూ చంపడం జరిగింది. వాళ్ళలో ఏ ఒక్కరు చనిపోకపోయినా యుద్ధఫలితం తారుమారై ఉండేది.

ఇక గదాయుద్ధంలో ప్రథమ నియమం: గదను నాభి క్రిందిభాగంలో ప్రయోగించరాదు. దుర్యోధనుణ్ణి చంపిందేమో గదతో తొడలు విరగ్గొట్టి. చిన్నప్పుడు భీముణ్ణీ, పెద్దయ్యాక లక్క ఇంట్లో పాండవులందరినీ చంపబూనడం, మాయాజూదం కౌరవులు చేసిన నేరాలైతే, వాటిని సాకులుగా చూపి పాండవులు చేసిన తప్పుడు పనులు అంతకంటే ఎక్కువే. యుద్ధం ధర్మబద్ధంగా జరిగి ఉన్నట్లైతే పాండవులు తుక్కుతుక్కుగా ఓడిపోయుండేవాళ్ళు.

మహాభారతయుద్ధం చరిత్రే. అందులో అనుమానం లేదు. ఐతే స్వర్గారోహణపర్వం లాంటివి కేవలం కవుల కల్పన. "ఒక్క విజయం వంద తప్పుల్ని కప్పేస్తుంది." అన్నట్లు కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు పొందిన అంతిమ విజయం వారిలోని లోటుపాట్లను కప్పేసి వారిని హీరోలను చేసింది.

Thursday, 13 July 2006

దశావతారాలు-2

దశావతారాల్లో మొదటి ఐదు అవతారాలు జీవ పరిణామ క్రమాన్ని సూచిస్తే తర్వాతి ఐదు అవతారాలు సామాజిక పరిణామ క్రమాన్ని సూచిస్తాయి:
పరశురామ:
సామాజిక పరిణామం ప్రాథమిక దశలో ఉన్నప్పుడు, మనుషుల్లోని పశుప్రవృత్తి పూర్తిగా సమసిపోనప్పుడు, ఆటవిక న్యాయం ఇంకా రాజ్యమేలుతున్నప్పుడు ధర్మసంస్థాపన కోసం కలుపు మొక్కల్ని నిర్దాక్షిణ్యంగా ఏరిపారేయడానికి ఆయుధం పట్టక తప్పదు. పరశురాముడు చేసింది అదే! (ధర్మసంస్థాపనకు) అడ్డొచ్చిన వాళ్ళందరినీ నరికిపారేశాడు. తర్వాత నిదానంగా ప్రజాపతుల ఆధ్వర్యంలో ధర్మబద్ధమైన పాలన, శాంతిభద్రతలు నెలకొన్నాయి. అంతే కాదు. తప్పుచేసినవారిని దేవుడే శిక్షిస్తాడంటూ తనను వారింపజూసిన మునులతో "దేవుడనేవాడు ఆకాశం నుంచి ఊడిపడడు. మనలో ఒకడిగా ఉంటూనే తప్పు చేసినవారిని శిక్షించి ధర్మాన్ని నిలబెడతాడు. ఐనా నేను దేవుణ్ణి కానని మీకెలా తెలుసు?" అని గర్జించిన పరశురాముడు బహుశా ప్రపంచసాహిత్యంలో మొట్టమొదటి విప్లవవీరుడు.

తర్వాతిది రామావతారం. "యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానామ్ సృజామ్యహమ్" అంటూ పట్టాలు తప్పిన బండిని తిరిగి పట్టాలెక్కించడమే శ్రీరాముడు చేసింది. ఇలాంటి ప్రమాదాలు అరుదుగా మాత్రమే జరిగే అవకాశమున్న త్రేతాయుగమది. ఏది ధర్మం, ఏది అధర్మం అన్న విషయంలో కూడా అస్పష్టత/గందరగోళమేమీ లేదు.(రామావతారం గురించి, రామాయణం గురించి ఇంకొక జాబు రాస్తాను.)

తర్వాతిది ద్వాపరయుగంలోని శ్రీకృష్ణావతారం. ఈ యుగంలో ధర్మం రెండు పాదాల మీదే కుంటుకుంటూ, గెంటుకుంటూ నడుస్తుందని చెప్తారు. ఇది ధర్మానికి, అధర్మానికి మధ్య సంధికాలం. ఏది ధర్మం, ఏది అధర్మం అనే విషయంలో కూడా స్పష్టత లేదు. అంతా అస్పష్టత, అయోమయమే. ఈ గందరగోళం; ధర్మాధర్మాల మధ్య ఊగిసలాట ప్రతి మనిషి ప్రవర్తనలోనూ మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఒక సందర్భంలో ఉత్తములనిపించినవారి ప్రవర్తనే ఇంకొక సమయంలో హీనంగా అనిపిస్తుంది. దీనికి మినహాయింపు బహుశా విదురుడొక్కడేనేమో? అలాంటి పరిస్థితుల్లో దేవుడే దిగివచ్చినా వాళ్ళ మధ్య నెగ్గుకురావడానికి మాయోపాయాలు, బలప్రయోగం తప్పనిసరి. కృష్ణుడంతటివాడికే తప్పలేదు! :(

మహాభారత యుద్ధంలో పద్దెనిమిది రోజుల్లో పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యం నిర్మూలమైంది. (అక్షౌహిణి అంటే 109350 కాల్బలం, 65610 గుర్రాలు, 21870 రథాలు, అన్నే ఏనుగులు అట) ఆ కాలంలోనే దానికి ముందూ ఆ తర్వాతా కూడా ఎన్నో యుద్ధాలు జరిగాయి. అంటే దేశంలోని యువకులు, ఆరోగ్యవంతుల్లో చాలా మంది చనిపోయి ఉండాలి. దాంతో సహజంగానే ఉత్పాదకత పడిపోతుంది. (పాండవబీడు అనే మాట అందుకే పుట్టింది. మిగిలింది బీడే. భూమిని సాగుచేసేవాళ్ళూ లేరు. పన్నులు కట్టేవాళ్ళూ లేరు. ఖజానా ఖాళీ. అంత పెద్ద యుద్ధం జరిగాక ఇంకేం మిగిలుంటుంది? అందుకే రాజసూయ యాగం పేరు చెప్పి ఇతరరాజ్యాల మీద పడ్డారు - దోచుకోవడానికి.) పోయినవాళ్ళు పోగా మిగిలినవాళ్ళలో కాస్త తెలివో బలమో ఉన్నవాళ్ళు ఉత్పాదకవనరులపై ఆధిపత్యం కోసం తమకు చేతనైన మార్గాల్లో ప్రయత్నించడం వల్ల మళ్ళీ అరాచకం మొదలై ఉంటుంది. ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి బుద్ధుడు రావలసి వచ్చింది.

ఇతర చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే క్రీ.పూ.6వ శతాబ్దంలో ఉత్తరభారతదేశంలో గంగా-యమునా నదీతీరాల వెంబడి నగరీకరణ భారీ స్థాయిలో జరిగింది. పెద్దపెద్దపట్టణాలు వెలిశాయి. ఒకవైపు పట్టణ సంస్కృతిలో తప్పనిసరిగా ఉండే జీవనపోరాటాలు, విచ్చలవిడితనం, అనైతికత, నేరప్రవృత్తి; ఇంకొక వైపు పెరిగిపోతున్న జంతుబలులు, పూజల పేరుతో జరిగే అర్థం పర్థం లేని తంతూతతంగాలు ప్రజల్లో అలజడి, అశాంతి పెరిగిపోవడానికి కారణాలయ్యాయి. పర్యవసానమే ప్రజలు బుద్ధుడి బోధలపట్ల ఆకర్షితులు కావడం.

ఇంతకంటే భారీస్థాయిలో అశాంతి రేగినప్పుడు, నేరాలు - ఘోరాలు అదుపు చెయ్యలేని స్థాయికి చేరినప్పుడు మళ్ళీ పరశురాముడు చేసినపనే చెయ్యవలసివస్తుంది. ఆ రెండో పరశురాముడే కల్కి.

పురాణాల్లో నాకు నచ్చిన పాత్ర పరశురాముడు.

Friday, 19 May 2006

వామనావతారం

వామనావతారాన్నే త్రివిక్రమావతారమని కూడా అంటారు. ఈ అవతారం నిజానికి మనిషి ఈ భూమి మీద అవతరించినప్పటి నుంచి సాధించిన ప్రగతిని మన కళ్ళ ముందుంచుతుంది. మొదట్లో వామనుడు బలి చక్రవర్తిని మూడడుగుల నేల అడిగేటప్పుడు కూడా అమాయకమైన పిల్లవాడిగా కనిపిస్తాడు. మనిషి కూడా ఈ భూమ్మీద అవతరించినప్పుడు అనేకానేక ఇతర జంతువులతో పోలిస్తే బలహీనుడు, అర్భకుడు. అయితే సామాజిక జీవనం మొదలయ్యాక గడచిన మూడు వేల సంవత్సరాల కాలంలో అతడు సాధించిన ప్రగతి ఊహించడానిక్కూడా సాధ్యం కానంత వేగంగా కన్నుమూసి తెరిచేంతలో జరిగినట్లుగా జరిగిపోయింది. మనిషి భూతలాన్నంతటినీ తన స్వాధీనంలోకి తెచ్చుకోవడంతో ఆగిపోక నదీనదాలు, ఎడారులు, కొండలు, సముద్రాలతో బాటు భూగర్భాన్ని, సముద్రగర్భాన్ని శోధించి సాధించి ఊరుకోక ఆకాశంలోకి చూపు సారించి అంతరిక్షాన్ని కూడ అందుకున్నాడు. ఈ ప్రగతి అంతా గడచిన శతాబ్దంలోనే కదా సాధిచింది? సృష్టి ఆరంభమైన తర్వాత గడచిన యుగాలతో పోల్చి చూసుకుంటే అంతా రెప్పపాటులో జరిగిపోయినట్లుగా లేదూ? త్రివిక్రమావతారంలో వర్ణించింది కూడా సరిగ్గా అదే. అప్పటివరకూ అమాయకంగా కనిపించిన వామనుడు చూస్తూండగానే "ఇంతింతై వటుడింతయై మరియు దానింతై..." భూమిని, ఆకాశాన్ని, అంతరాళాన్ని ఆక్రమించేస్తాడు!

అంతే కాదు! ఈ వామనావతార ఘట్టంలో గజేంద్ర మోక్షం లో వలెనే రసగుళికల్లాంటి పద్యాలున్నాయి. మచ్చుకు కొన్ని రుచి చూడండి:

"వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగములందు పలికి బొంకవచ్చు, నఘము రాదధిప!"
(శుక్రాచార్యుడు బలి చక్రవర్తితో)
"ఆదిన్ శ్రీసతి కొప్పుపై, తనువుపై, అంశోత్తరీయంబుపై, పాలిండ్లపై.." భావం: వచ్చినవాడు నిజంగానే విష్ణువైతే లక్ష్మిదేవి శరీరాన్ని తాకి ధన్యమైపోయిన ఆ చేతిని నా ముందు దానం కోసం చాచడం నిజంగానే జరిగితే దానం చేయబోతున్న నాది దాని మీద పైచేయి అవబోతూంటే నాకు అంతకంటే ఏం కావాలి?(బలి చక్రవర్తి శుక్రాచార్యుడితో)
"కారే రాజుల్? రాజ్యముల్ గలుగవే? వారేరీ? సిరి మూటగట్టుకొని పోవంజాలిరే?"(బలి చక్రవర్తి శుక్రాచార్యుడితో)
"ఇంతింతై వటుడింతయై మరియు దానింతై..." విశ్వరూపాన్ని ఇంకెవరూ ఇంత గొప్పగా వర్ణించలేరు అనిపించే విధంగా ఉంది ఇక్కడ త్రివిక్రమావతార వర్ణన.

Saturday, 13 May 2006

దశావతారాలు-1

కపిల మహర్షి, నరనారాయణులు, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరుడు - వీళ్ళు కూడా విష్ణు అవతారాలే కదా?మరి దశావతారాల్లో వీళ్ళు లేకపోవడమేమిటి?

దశావతారాల ఉద్దేశ్యం కేవలం ముఖ్యమైన అవతారాలను ఏకరువు పెట్టడమే కాదు: సృష్టి పరిణామ క్రమాన్నీ, సామాజిక పరిణామక్రమాన్నీ వివరించడమే దశావతారాల ముఖ్య ఉద్దేశ్యం. అవును, దశావతారాల్లోనే సృష్టి పరిణామ క్రమమంతా ఇమిడి ఉంది:

నీరు లేనిదే ప్రాణి పుట్టుక సాధ్యం కాదు. ఎందుకంటే ప్రాణం జలం అంటే నీటిలోనే పుట్టింది. అందుకే ఇప్పుడు కూడా శాస్త్రవేత్తలు సుదూర గ్రహాల్లో జీవ సంచారం ఉందో లేదో తెలుసుకోవడానికి ముందుగా అక్కడ నీళ్ళు ఉన్నాయో లేవోననే చూస్తారు. ఆ నీటిలో మన కంటికి కనిపించనంత సూక్ష్మమైన ఏక కణ రూపం లోనే ప్రాణుల పుట్టుక మొదలైందని సైన్స్ చెబుతోంది. ఒకసారి ప్రాణి అంటూ ఏర్పడ్డాక తర్వాత తర్వాత మరింత సంక్లిష్టమైన, బహుకణజీవులు త్వరత్వరగా ఏర్పడ్డాయి.

దశావతారాల్లో మొదటిదైన మత్స్యావతారంలో సరిగ్గా ఇలాగే ఉంది. మనువు సముద్రంలో స్నానం చేసి, సూర్యనమస్కారం చే స్తూ, ఆర్ఘ్యం వదలడానికి దోసిట్లోకి నీళ్ళు తీసుకుంటే అందులోకి అత్యంత సూక్ష్మమైన చేప వస్తుంది. దాన్ని తిరిగి సముద్రంలోకి వదలబోతే అది మనువును వేడుకుంటుంది: "సముద్రంలో ఉండే పెద్ద చేపలు తనను బతకనివ్వవనీ, తనను కాపాడమనీ." ఆయన దాని మీద జాలి పడి తన కమండలంలోనే ఉంచుకుంటే అది ఆయన ఆశ్రమం చేరే లోపల కమండలం పట్టనంత పెద్దదైపోతుంది. అక్కణ్ణుంచి తీసి తొట్టిలో వదిల్తే కొద్ది సేపట్లోనే ఆ చేప మరింత పెద్దదై తొట్టి కూడా పట్టదు. అక్కణ్ణుంచి ఒక చిన్న కొలనులోకీ, ఆ తర్వాత ఒక చెరువులోకీ మార్చవలసి వస్తుంది. చివరికి దాన్ని మళ్ళీ సముద్రంలోనే వదిలేస్తాడు.

దశావతారాల్లో రెండవది ఉభయచరమైన తాబేలు (కూర్మావతారం). సముద్రంలో పుట్టిన జీవుల్లో కొన్ని మెల్ల మెల్లగా భూమ్మీదకు వ్యాపించడానికి చేసిన ప్రయత్నంలోని ఒక ముఖ్యమైన దశ. ఉభయచరజీవులకు తాబేలు ప్రతినిధి.

ఇక మూడవది పూర్తిగా నేల మీద జీవించడానికి అలవాటు పడ్డ నాలుగు కాళ్ల జంతువు: వరాహం

మనిషి పుట్టింది కోతి నుంచి - అంటే ఒక జంతువు నుంచి. దీన్ని సూచించేదే సగం జంతువు-సగం మనిషి లక్షణాలు గల నరసింహావతారం. ఇది దశావతారాల్లో నాలుగవది.

తర్వాతి (5వ) అవతారమే పూర్తి స్థాయి మనిషి లక్షణాలు గల మొట్టమొదటి అవతారం. అదే వామనావతారం.
ఇక ఇక్కడ నుంచి మిగిలిన ఐదు అవతారాలూ సామాజిక పరిణామ క్రమాన్ని సూచిస్తాయి.
(అది ఇంకొక పోస్టులో.)

Saturday, 22 April 2006

నాలుగు బై మూడు

చిన్నప్పట్నుంచి, రామాయణంలో నాకు సరిగా అర్థం కానిదొకటుంది. దశరథుడి పట్టమహిషి కౌసల్య, ముద్దుల భార్య కైకేయి కాగా ఇలాంటి ప్రత్యేక హోదాలేమీ లేని మామూలు రాణి సుమిత్ర. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసినపుడు అగ్నిదేవుడిచ్చిన పాయసాన్ని లెక్కప్రకారమైతే మూడు భాగాలే చేయాలి - ఉన్నది ముగ్గురు రాణులే కాబట్టి. కానీ దశరథుడు ఆ పాయసాన్ని రాణుల మధ్య పంచిన తీరు చూస్తే ఎవరికైనా నవ్వు వస్తుంది. అంతే కాదు, దశరథుడు పూర్తిగా ముసలివాడైపోయాడనీ, అందుకే ఆ పంచడం కూడా అంతా అవకతవకగా చేశాడనీ కూడా అనిపిస్తుంది. ఆ వ్యవహారం ఎంత గందరగోళంగా జరిగిందో చూడండి:

ఉన్నది ముగ్గురు రాణులైతే, పాయసాన్ని ముందుగా రెండు భాగాలు చేశాడు. సరే, బాగానే ఉంది, ఒక భాగాన్ని కౌసల్యకిస్తాడు పట్టపు రాణి కాబట్టి. ఇదీ బాగానే ఉంది.
మిగిలిన సగాన్ని ఏం చేశాడయ్యా అంటే మళ్ళీ రెండు భాగాలు చేశాడు. ఆ రెండు భాగాల్ని సుమిత్రకూ, కైకేయికీ ఇవ్వాలా? ఊహూ, ఒక సగాన్ని అలాగే ఉంచి ఇంకో సగాన్ని వారిలో ఒకరికి ఇచ్చాడు. ఆ ఒక్కరూ ఎవరూ? లెక్క ప్రకారమైతే కైకేయి కావాలి - ముద్దుల భార్య కాబట్టి. కానీ ఆమెకివ్వలేదు - సుమిత్రకిచ్చాడు. ఎందుకనేది నాకు ఈ నాటికీ అర్థం కాలేదు. పోనీ ఆ మిగిలిన సగాన్నైనా కైకేయికివ్వొచ్చు కదా? ఊహూ... దాన్ని మళ్ళీ సగం చేశాడు. చేసి, సుమిత్రకూ, కైకేయికీ ఇచ్చాడు. సుమిత్రకు ఇంతకు ముందే ఇచ్చిన మాట మరిచి పోయాడా లేక కౌసల్యకే మళ్ళీ ఇవ్వబోయి సుమిత్రకిచ్చాడా? ఇది నా ఊహకు అందడం లేదు. ఇది ఇంకోలా జరిగి ఉంటుందా అని సరదాగా ఆలోచిస్తే నాకిలా అనిపించింది:

దశరథుడు పాయసం మొత్తాన్ని రెండే భాగాలు చేసి కౌసల్యకు, కైకేయికి ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. అయితే సుమిత్రకు ఇవ్వకుండా తామే తినడానికి మనసొప్పక వాళ్ళిద్దరూ తమ భాగంలో నుంచి కొంత భాగాన్ని సుమిత్రకిచ్చారు. అలా ఆమె రెండు భాగాలు పొందడం వల్ల ఇద్దరు పిల్లలు పుట్టారు.

అయితే, ఈ రహస్యం వాల్మీకి మహర్షికి తెలియలేదు. ఏం జరిగిఉంటుందా అని అలోచించి, సవతులు అంత సఖ్యంగా ఉంటారని అనుకోక పోవడం వల్ల ఆయనకు తోచిన విధంగా కథ అల్లి మనకు చెప్పి ఉంటాడు.

Sunday, 16 April 2006

కృష్ణ లీలలు

కృష్ణతత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం ఎవరి వల్లా అయే పని కాదు. ఒక్కొక్కరికి ఒక్కో సందర్భంలో ఒక్కో విధం గా గోచరిస్తూ ఉంటుంది. "యదా యదాహి ధర్మస్య..." అన్న నోటితోనే చివరాఖరి మాటగా "సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజః..." (18 వ అధ్యాయం 66 వ శ్లోకం) అనడం మామూలుగా చూస్తే ధర్మగ్లానికి దన్నుగా నిలిచినట్లే అనిపిస్తుంది. కానీ ఇక్కడ సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే విధి నిర్వహణలో పుత్ర ధర్మం, భ్రాతృ ధర్మం, స్నేహ ధర్మం, శిష్య ధర్మం, మొ. వాటిని వదిలేసి నడచుకోమని కదా అర్థం?

అలాగే గోపిక లను జీవాత్మలుగానూ, వారి కుటుంబాలతో వారికి గల అనుబంధాలను ఆత్మకు జీవుడితో గల బంధాలు గానూ, వారికి కృష్ణుడి పై గల ప్రేమను జీవాత్మ (భవబంధాలను వదిలించుకుని) పరమాత్మలో లీనం కావడానికి చేసే ప్రయత్నంగానూ అనుకుంటే అబ్బురమనిపిస్తుంది. కృష్ణుడు గీతాబోధ చేసినప్పుడు గురువులకే గురువై, జ్ఞాన బోధ చేసిన బ్రాహ్మణుడైనాడు. బాణాసురుడి లాంటి వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు క్షాత్ర తేజంతో వెలిగాడు. వైశ్యులు చేయదగిన రాయబారం తాను వహించి వైశ్యుడైనాడు. చివరికి బావ బండి (రథం) తోలి పెట్టి శూద్ర ధర్మమూ పాటించాడు. ఎందుకు? ఏ ధర్మమూ (విధి నిర్వహణ) తక్కువది కాదు. అని చెప్పడానికి... కాదు కాదు చేసి చూపడానికి.

లీలామానుష విగ్రహుడైన ఆయన "ఎంతవారలైనా అనువుగాని చోట అధికులమనరాదు" అని మనకు చెప్పడానికే కొన్ని కొన్ని సందర్భాలలో పైకి అమాయకంగానూ, పిరికిగానూ కనిపించినట్లనిపిస్తుంది. తాను పుట్టిన కొన్ని నిమిషాల్లోపే యమునా నదిని చీల్చి దారి చేసుకున్న వాడు అంతకు కాసేపటి క్రితమే చిద్విలాసంగా చూస్తూ తన సమక్షంలోనే వసుదేవుడి చేత గాడిద కాళ్ళెందుకుపట్టించాడు? వసుదేవుడి ఉదంతమూ, జరాసంధుడి ఉదంతమూ అనువుగాని చోట అధికులమనరాదు అని మనకు చెప్పడానికే తప్ప ఆయన వల్ల కాక కాదు - అని నా అభిప్రాయం. ఇక ఈ బ్లాగులో మొదటి పోస్టెందుకలా వ్రాశానంటారా?

తన భక్తుల చేత అప్పుడప్పుడూ నిందలు పడడం కూడా ఆయనకు వినోదమే అనిపిస్తుంది. "ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు?" అని తిట్టినప్పుడు రాముడి రూపంలో ముసి ముసి నవ్వులు ఒలకబోసిందీ ఆయనే. ఇక ఆయన చేసిన పనుల్లో మామూలుగా అర్థం కానివి, అయోమయంగా అనిపించేవి అక్కడ వ్రాశాను. పాండవుల చేత అధర్మ యుద్ధం చేయించడము, కర్ణుడి విషయంలో అన్యాయంగా ప్రవర్తించడము ఇప్పటికీ నాకు అర్థం కాని విషయాలే.

P.S.: And the best thing about our epics is that they are open to a thousand interpretations.

Friday, 3 March 2006

రామ పాదుకలు

వనవాసంలో ముళ్ళదారుల వెంట నడుస్తున్నప్పుడు సీత రాముడి పాదాలవంక చూసి భరతుడి గురించి ఇలా అనుకున్నదట: "ఏం తమ్ముడు? సరిగ్గా ఊరు దాటి అడవిలో అడుగు పెట్టేటప్పుడే వచ్చి ఉత్త కాళ్ళతో పొమ్మని పాదరక్షలు గుంజుకొని పోయినాడు".
- పుట్టపర్తి నారాయణాచార్యులు
(భరతుడికి ఏ దురుద్దేశమూ లేని మాట నిజమే. కానీ, తను వాళ్ళను వెనక్కి తీసుకెళ్ళాలని వచ్చాడే తప్ప వాళ్ళు రాకపోతే ఏం చెయ్యాలో ఆలోచించుకుని రాలేదు. పాదుకలిమ్మని అప్పటికప్పుడు అడిగి తీసుకున్నాడు. బదులుగా రాముడికివ్వడానికి తన దగ్గర రాజోచితమైన పాదుకలే తప్ప నిరాడంబరమైన పాదుకలు లేవు. అవి రాముడెలాగూ తీసుకుని ఉండడు. అందుకే రాముడు అడవిలో ఉత్త కాళ్ళతో తిరగ వలసి వచ్చిందని కవి భావన.)

Monday, 20 February 2006

కైకేయి

కైకేయి స్వగతం:
దండకారణ్యంలో రాక్షసుల ప్రాబల్యం విపరీతంగా పెరిగిపోతోంది. దక్షిణ ప్రాంతం నుంచి వాళ్ళు తండోపతండాలుగా వచ్చి అక్కడ స్థావరాలేర్పరచుకుని బీభత్సం సృష్టిస్తున్నారు. రాముడు తాటకను పరిమార్చిన తర్వాత కొంత కాలం స్తబ్ధుగా ఉన్న రాక్షసులు మెల్లగా విజృంభిస్తున్నారు. ఈ ప్రమాదాన్ని మొగ్గలోనే త్రుంచివేయకపోతే రాజ్యభద్రతకే ముప్పు వాటిల్లవచ్చు.

నా సాయంతో దేవాసుర సంగ్రామంలో గెలిచిన దశరథుడు ఇప్పుడు ముసలి వాడై మునుపటి చేవ తగ్గినా ముంచుకొస్తున్న ముప్పును గుర్తించడం లేదు. ముసలితనం ఎక్కువయ్యే కొద్దీ దశరథుడు అసలేదీ పట్టించుకోవడమే లేదు. లేకపోతే ఒక వైపు పెనుముప్పు ముంచుకొస్తూంటే ఇంకొక వైపు ఇంతలా సంబరాల్లో మునిగి తేలుతాడా? వేగులు తెచ్చిన సమాచారాన్నైనా వినిపించుకోడా? దండకారణ్యంలో శాంతిని నెలకొల్పే సత్తా ఒక్క రాముడికే ఉంది. కానీ దశరథుడు రాముణ్ణి అడవికి, అందునా రాక్షసులనెదుర్కోవడానికి పంపిస్తాడా? వట్టి మాట! గతంలో విశ్వామితృడొచ్చి అడిగినప్పుడే పంపలేదు. ఇప్పుడు, ఒక ఆడదాన్ని, నేనడిగితే పంపిస్తాడా? ఈ రఘు వంశం వాళ్ళకు ఆడదాని అభిప్రాయాలకు విలువివ్వడం తెలుసా? తెలిస్తే హరిశ్చంద్రుడు అలా చేసే వాడా?

ఇప్పుడు నేనేం చేయాలి? ఎవరి మనసుకు ఎంత కష్టం కలిగినా సరే! రాముణ్ణి తాత్కాలికంగా నైనా అడవికి పంపించాలి. దశరథుడు ఈ ముసలితనంలో రాముణ్ణి ఎడబాసిన దుఃఖంతో రాజ్యపాలన సరిగా చెయ్యలేడు. రాముణ్ణి విడిచి ఉండలేని లక్ష్మణుడు రాముడు కూర్చోవలసిన సింహాసనం మీద తా ను కూర్చోలేడు. ఇక మిగిలిందెవరు? భరత శతృఘ్నుల్లో భరతుడే సమర్థుడు. కానీ ఇవన్నీ ఎవరు నమ్ముతారు? కైకేయి ఇలా చేయమని సలహా ఇచ్చిందని వింటే తన కొడుక్కు రాజ్యం కట్టబెట్టడానికే ఇలా చేస్తోందంటారు. రాజ్యక్షేమం కంటే నాకేదీ ఎక్కువ కాదు.జనం ఇప్పుడే కాదు, యుగయుగాలుగా నన్నే ఆడిపోసుకోనీ. ఇప్పుడిలా మొండిగా వ్యవహరించడమే అన్ని విధాలుగా శ్రేయస్కరం.

Tuesday, 14 February 2006

జరాసంధ

మహాభారతంలో నా దృష్టిని అమితంగా ఆకర్షించిన యోధాగ్రేసరుడు జరాసంధుడే. జరాసంధుడి పాలనలో ప్రజలు కష్టాలపాలైనట్లు నాకు గుర్తు లేదు..అయితే అతడు వందల మంది రాజులను బందీలుగా పట్టుకున్నాడట-శివుడికి బలి ఇవ్వడానికి! నమ్మశక్యంగా లేదు. ఆ కథల కల్పన కృష్ణుడిని దేవుడి అవతారంగా చూపడానికీ, అతడి ప్రత్యర్థులను కౄరులుగా చూపడానికీ జరిగిన ప్రయత్నంగా అనిపిస్తుంది. ఎందుకంటే అతడు కృష్ణుడి ఆధిపత్యాన్ని మాత్రం ఎప్పుడూ అంగీకరించలేదు. వాళ్ళిద్దరి రాజ్యాల మధ్య దాదాపు 20 సార్లు (18 సార్లా? 21/24/28?????? పాత చందమామలు తిరగేయాలి) హోరాహోరీ యుద్ధం జరిగింది. అయితే జరాసంధుణ్ణి నేరుగా ఎదుర్కొనే సాహసం కృష్ణుడెప్పుడూ చేయలేదు. మహాబలశాలి అయిన బలరాముణ్ణి ఉసిగొలిపే వాడు.
ఈ బలరాముడు కల్లు ప్రియుడు, హలధారి. కోపమొచ్చి ఆ హలంతో హస్తినాపురాన్నే పెళ్ళగించాడట ఒకసారి. ఇంకొక సారి అదే హలంతో పిల్లలు పలక మీద పిచ్చిగీతలు గీసినంత సుళువుగా యమునానది మార్గాన్ని ఇష్టమొచ్చినట్లు మార్చిపారేశాడట. ఈ బలరాముడే జరాసంధుడికి సరిజోడీ. ఎటూ తేలకుండా ఇద్దరూ రోజుల తరబడి కొట్టుకునే వారు. ఈ జరాసంధుణ్ణి జయించే మార్గం తోచక కృష్ణుడు కొట్టుకునే వాడు. చివరకు "యమునాతీరమునా.. సంధ్యాసమయమునా.." హాయిగా ఉండలేక మథురనొదిలేసి ఎక్కడో దూరానున్న ద్వారకకు పారిపోయిందీ జరాసంధుడికి భయపడే!
వీణ్ణీ, వీడితో బాటుగా దుర్యోధనుడినీ తనకు అడ్డు రాకుండా తొలగించుకోవడానికి అతడాలోచించిన మార్గాల్లో అద్భుతమైన దాన్నే అమలు చేశాడు...వీళ్ళను ఓడించడానికి అవసరమైన భుజబలశాలురు, చిరకాలం తన చెప్పుచేతల్లో ఉండిపోయే బుద్ధిహీనులుగా పాండవులను సరిగ్గా గుర్తించాడు.
కర్ణుడి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నాడో చూడండి: ఎంతసేపూ కర్ణుణ్ణి ఇటువైపు వచ్చేయమంటూ తనే వెళ్ళి చెప్పడమో లేక ఆ పిచ్చి తల్లిని చెప్పమనడమో చేస్తాడే గానీ పాండవులకు మాత్రం విషయం తెలియకుండా జాగ్రత్త పడతాడు - కర్ణుడే తమ పెద్దన్న అని తెలిస్తే పాండవులు ఎక్కడ తనను వదిలేసి అతడితో కలిసి దుర్యోధనుడి పంచన చేరుతారో అని భయపడి.
చివరకు అన్నీ కృష్ణుడనుకున్నట్లుగానే జరిగాయి-జరాసంధుడి చావు, కౌరవుల పతనం, తన మాట వినే పాండవులకు రాజ్యాధికారం.