Friday 29 December, 2006

మహారచయితకు నివాళి

ఆ కలం సృష్టించిన మాటలు, పాటలు కోట్లాది మంది సినీ ప్రేక్షకుల మీద మత్తు మందు చల్లి తమ వశం చేసుకున్నాయి. పుట్టబోయేవారిని కూడా చేసుకుంటాయి.
ఏదైనా మ్యాజిక్కో, మంత్రమో చేసినట్లు అభినయించాలంటే చిన్న పిల్లలు సైతం అసంకల్పితంగా అనే మాట "హాం ఫట్". ఆ మాటను మనకు పరిచయం చేసింది పాతాళభైరవిలో మాంతికుడు (ఎస్వీరంగారావు). మరి పుట్టించిన అపరబ్రహ్మ ఎవరు?
"డింగరీ", "గురూ", "ఘాటుప్రేమ", "ధైర్యే సాహసే లక్ష్మీ", "నరుడా ఏమి నీ కోరిక?"
అసమదీయులు - తసమదీయులు
వీరతాళ్ళు (ఈనాటి పతకాల లాంటివి)

"ఇవేం మాటలు? ఇంతకు ముందెక్కడా లేవే?" అన్నవారిని "ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి?" అని ఎదురు ప్రశ్నించిన మాటల మరాఠీ ఎవరు?
"జనం కోరేది మనం సేయడమా? మనం సేసేది జనం సూడడమా?" ఈ మాటలు పలికింది నేపాళమాంత్రికుడు. ఈ సందిగ్ధం మాత్రం సినిమాలు తీసేవారందరిదీ.
"సాహసం శాయరా డింభకా! రాకుమారి లభించును రా!"
"మహాజనానికి మరదలు పిల్లా! గలగలలాడవే గజ్జెలకోడీ"
"రసపట్టులో తర్కం కూడదు"
"మాకు తల్పం వద్దు గిల్పం కావాలి....కంబళి వద్దు గింబళి కావాలి"
"శాకాంభరీదేవి వరప్రసాదం - ఆంధ్రుల అభిమాన శాకం.....గోంగూర!"

ఈ జాబితాలో వందలు వందల మాటలున్నాయి. చెప్పుకుంటే తనివితీరదు. ఆ మాటలు నెమరేసుకున్నా చాలు. ఐనా ఆ మహనీయుడిని గురించి "మాటల్లో" చెప్పడానికి మనమెంతవారం? 75 యేళ్ళ తెలుగుసినీచరిత్రలో ఎవరెస్టు శిఖరం లాంటి మాటల-పాటల రచయిత పింగళి నాగేంద్రరావు గారి నూట ఆరవ జయంతి ఈరోజు (29 డిసెంబరు).

Sunday 24 December, 2006

కల నిజమాయెగా!

"కల నిజమాయెగా! కోరిక తీరెగా!!"

అని చందమామ అభిమానులు పరవశించి పాడుకునే రోజు ఎంతో దూరంలో లేదు. తి.తి.దే. వాళ్ళు పాత చందమామలను అమూల్య భారతీయ వారసత్వ సంపదగా గుర్తించి డిజిటలైజ్ చేస్తున్నరని తెలిసినప్పటినుంచి అవి మనకందుబాటులోకి వచ్చేది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నా లాంటివారికిది శుభవార్త. వీటిని జనవరి 23వ తేదీ తిరుపతిలో ఆవిష్కరించి, చందమామ సంపాదకులు విశ్వనాథరెడ్డికి అందజేస్తామని తి.తి.దే. వాళ్ళు తెలిపారు. ఇవి మార్కెట్లోకి వస్తే పాత చందమామలకోసం హైదరాబాదులోని పాతపుస్తకాల షాపుల్లో వెదకడం; హిందూ లో, ఇంటర్నెట్లో ప్రకటనలివ్వడం లాంటి అవస్థలు తప్పుతాయి. :) ఇది నిజంగానే మొన్న ౧౬వ తేదీ హిందూలో వచ్చిన ఒక ప్రకటన:
Chandamama

Interested in old/very old Chandamama (Telugu) magazines. If any body interested to gift/sell at reasonable price, contact K.S.Kumar, Ph.98666-96564.


(పాత చందమామలు ఒక అగ్నిప్రమాదంలో కాలిపోయాయట. వాళ్ళ ఆఫీసులో ప్రతి సంచికా ఒకటో రెండో ప్రతులు మాత్రమే ఉన్నట్లున్నాయి. అందుకే అవి కావాలనుకున్నవాళ్ళకు ఇన్ని తిప్పలు.)

ఈరోజు ఈనాడులో వచ్చిన వార్త:



సీడీల్లో 'చందమామ'
ముందుకొచ్చిన తితిదే
ఇప్పటికే లక్ష పేజీల నిక్షిప్తం
(60 యేళ్ల కాలంలో వచ్చిన తెలుగు చందమామలు దాదాపు 45 వేల పేజీలు ఉండవచ్చు)
చెన్నై - న్యూస్‌టుడే

తెలుగు వారి అభిమాన పుస్తకం.. ఆ కథల మాధుర్యానికి మురిసిపోని తెలుగు వారంటూ ఉండరు.. కేవలం ఒక్క తెలుగు వారినే కాకుండా 13 భాషల్లో అందరినీ ఆకట్టుకున్న గొప్ప పత్రిక చందమామ. ఇప్పుడు ఆ పుస్తకాలను డిజిటలైజ్‌ చేసి కంప్యూటర్లు, సీడీల్లో నిక్షిప్తం చేయడానికి తిరుమల-తిరుపతి దేవస్థానం ముందుకొచ్చింది. తిరుపతిలోని ఎస్వీ డిజిటల్‌ గ్రంథాలయంలో ఈ పనులు జోరుగా సాగుతున్నాయి. 13 భాషల్లో ఉన్న మూడు లక్షల పుస్తకాలను పూర్తిగా సీడీల్లోకి నిక్షిప్తం చేస్తామని ఆ గ్రంథాలయ డైరక్టర్‌ భూమన్‌ చెప్పారు. చెన్నైలో శనివారం ఆయన 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఇప్పటికే లక్ష పేజీలను సీడీల్లో నిక్షిప్తం చేశామన్నారు. వీటిని జనవరి 23వ తేదీ తిరుపతిలో ఆవిష్కరించి, చందమామ సంపాదకులు విశ్వనాథరెడ్డికి అందజేస్తామన్నారు. చందమామ పత్రికలో వచ్చే కథలు ఎంతో విలువైనవని చెప్పారు. ఈ కథల కోసం అంతర్జాతీయంగా ఎన్నో ప్రముఖ ఛానెళ్లు డిమాండ్‌ చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇందులో హనుమాన్‌ కథను సీడీల్లో నిక్షిప్తం చేయడానికి అనుమతిస్తే రూ. ఏడు కోట్లు చెల్లిస్తామని డిస్నీ ఛానెల్‌ చందమామ యాజమాన్యాన్ని కోరిందని.. వారు అందుకు తిరస్కరించి తమ విశిష్టతను చాటారని తెలిపారు.

కలలు నిజమాయె(నా?)

సాధారణంగా మనం వింటూ ఉంటాం: మన ఇతిహాసాల్లో - ముఖ్యంగా మహాభారతంలో - రాసినవి "నిజంగా జరిగి ఉంటే అద్భుతం. జరగనట్లైతే వాటిని ఊహించగలిగిన కవుల కల్పన మహాద్భుతం." అని.

ఈ రోజు ఈనాడు ఆదివారంలో వచ్చిన ఒక వ్యాసంలోని కొన్ని అంశాలు:
రామాయణంలో రావణాసురుడికి పుష్పక విమానం ఉండేది. అది ఏవియేషన్‌... అనగా ఆకాశయానం! తన కంటే ముందు కుంతికి కొడుకు పుట్టాడనే ఆక్రోశంతో గర్భవిచ్ఛిత్తికి పాల్పడింది గాంధారి. ఛిద్రమైన పిండాన్ని వ్యాసుడి సూచనతో కుండల్లో పెట్టి జాగ్రత్తచేశారు. అలా పుట్టినవారే కౌరవులు. వాళ్లని టెస్ట్‌ట్యూబ్‌ బేబీలనొచ్చా?

అనకూడదు. టెస్ట్ ట్యూబ్ బేబీలనేది పూర్తిగా వేరే వ్యవహారం. ఇక్కడ కౌరవుల పిండం ఏర్పడడంలో సాంకేతికత ప్రమేయమేమీ లేదు. గాంధారి గర్భధారణ మామూలుగానే జరిగింది. ఐతే కౌరవులు పూర్తిస్థాయిలో పిండం ఎదగకుండానే పుట్టినవాళ్ళు. అంటే ప్రీ మెచ్యూర్ బేబీలన్నమాట. వాళ్లను నేతికుండల్లో పెట్టి పెంచారు. ఆ నేతి కుండలను నేటి ఇన్‌క్యుబేటర్లతో పోల్చవచ్చు.

ఐతే మహాభారతంలోనే అంతకు రెండు తరాల ముందు పుట్టిన టెస్ట్ ట్యూబ్ బేబీ ఒకరున్నారున్నారండోయ్! ఆయనే ద్రోణుడు. ఆ ద్రోణుణ్ణే దానవీరశూరకర్ణ సినిమాలో "నీచమైన మట్టికుండలో పుట్టితివికదా?" అని ఈసడిస్తాడు దుర్యోధనుడు. ద్రోణుడికంటే ముందు అదే పద్ధతిలో పుట్టినవాళ్ళు అగస్త్యుడు, వసిష్ఠుడు. ఇద్దరికిద్దరూ గొప్ప ఋషులు. ఈ వసిష్ఠుడు రఘువంశానికి కులగురువు. అగస్త్యుని గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి.



వినాయకుడికి ఏనుగు తల అతికించాడు శివుడు... ఇది ప్లాస్టిక్‌సర్జరీ. ప్రస్తుతానికి తలలు మార్చలేం కానీ తెగినవేళ్లూ కాళ్లూ అతికించే దశలో ఉన్నాం. మంచి అభివృద్ధే!

అబ్బా...? అలాగా?!

మన పురాణాలన్నిట్లో కనిపించే మాయమవడం, ప్రత్యక్షమవడం, అణిమాది అష్టసిద్ధులూ... అన్నీ కథలూ, కల్పితాలేనంటారా. మరీ అంత తొందరపడి కొట్టిపారేయకండి.

చిత్తం!

Thursday 21 December, 2006

ఎట్టకేలకు జెస్సికాకు న్యాయం

మను శర్మకు జీవిత ఖైదు: ఢిల్లీ హైకోర్టు తీర్పు
వికాస్ యాదవ్, టోనీలకు నాలుగేళ్ల జైలు, ఎదురు తిరిగిన సాక్షులకు నోటీసులు


మోడల్ జెస్సికాలాల్ హత్య కేసులో ఎట్టకేలకు న్యాయం గెలిచింది. ప్రజాస్వామ్య సౌధానికి గల నాలుగు మూలస్థంభాల్లో (Executive, Judiciary, Legislature and The Media) రెండు - మీడియా, న్యాయవ్యవస్థ - సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా పనిచేసి కాస్త ఆలస్యంగానైనా న్యాయాన్ని నిలిపిన ఘట్టమిది.

ఒక రెస్టారెంట్లో పని చేస్తున్న జెస్సికా లాల్ ను తుపాకితో కాల్చిచంపిన మను శర్మకు ఢిల్లీ హైకోర్టు బుధవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 1999 ఏప్రిల్ 29వ తేదీ రాత్రి తానడిగిన మద్యపానీయం రెస్టారెంట్లో లేదని అన్నందుకు అతడు జెస్సికా లాల్‌ను కాల్చిచంపాడని అభియోగం. ''ఇది సమాజపు అంతరాత్మను కదిలించిన కేసే. అయినప్పటికీ మను శర్మకు గరిష్ఠ శిక్ష (ఉరి) విధించలేం. దీనిని అత్యంత అరుదైన కేసుగా భావించలేం'' అని జస్టిస్ ఆర్.ఎస్.సోధీ, జస్టిస్ పి.కె.భాసిన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించిన వికాస్ యాదవ్, అమర్‌దీప్‌సింగ్ గిల్ (టోనీ)లకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.2,000 చొప్పున జరిమానా విధించింది.

నటుడు శ్యాన్ మున్షీ, వ్యాపారవేత్త ఆండ్లీబ్ సెహగల్ సహా ఎదురు తిరిగిన 32 మంది సాక్షులకు నోటీసులు జారీ చేసింది. మొదట ఇచ్చిన సాక్ష్యాన్ని మార్చడంపై వారు కోర్టుకు సరైన వివరణ ఇవ్వలేని పక్షంలో వారిని కూడా ప్రాసిక్యూట్ చేసే అవకాశాలున్నాయి. మను శర్మ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వినోద్ శర్మ కుమారుడు కాగా వికాస్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వివాదాస్పద నేత డి.పి.యాదవ్ కుమారుడు. కింది కోర్టు ఈ కేసులో అతణ్ని నిర్దోషిగా ప్రకటించడంపై గతంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. జెస్సికాకు న్యాయం జరగాలంటూ ఒక టీవీ ఛానల్‌కు లక్షలాది ఎస్ఎంఎస్‌లు వచ్చిపడ్డాయి.

మను శర్మ ఇంతకుముందెప్పుడూ ఎలాంటి నేరాలూ చేయనందువల్ల అతడికి తక్కువ శిక్ష విధించాలని అంతకుముందు ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే కోర్టు ఈ అభ్యర్థనను తోసిపుచ్చింది. టోనీ ఒక బహుళ జాతి సంస్థలో పని చేస్తున్నందున అతడిపై కరుణ చూపాలని న్యాయవాది కోరగా బెంచ్ ఆగ్రహంగా స్పందించింది. ''ఇలాంటి వాదన చేయడం నీకు వ్యతిరేకంగా పరిణమిస్తుంది'' అని వ్యాఖ్యానించింది.

ఈ కేసులో దోషులకు శిక్ష పడడం సంతోషంగా ఉందని జెస్సికా సోదరి సబ్రినా లాల్ చెప్పారు. మను శర్మకు మరణ శిక్ష పడాలని తానెప్పుడూ కోరుకోలేదన్నారు. ''మరణ శిక్ష పట్ల నాకు నమ్మకం లేదు. నా సోదరిని చంపినందుకు శిక్ష అనుభవించాల్సింది మను శర్మే. అంతేగానీ అతడి మరణం ద్వారా అతడి కుటుంబ సభ్యులు బాధపడాలని నేను కోరుకోవడం లేదు'' అని చెప్పారు. హైకోర్టు తీర్పు పటిష్ఠంగా ఉందని, సుప్రీంకోర్టు కూడా దానిని సమర్థిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఒకరికి శిక్ష పడడం తనకెప్పుడూ సంతోషం కాదని ఈ కేసులో సాక్షి అయిన బినా రమణి అన్నారు. ఈ కేసులో శిక్ష పడిన వికాస్ యాదవ్... నితీశ్ కతారా హత్య కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు. కోర్టు తీర్పుపై కతారా తల్లి నీలం హర్షం వ్యక్తం చేశారు. జెస్సికా కుటుంబం న్యాయం కోసం చాలాకాలం ఎదురుచూడాల్సి వచ్చిందని ఆమె అన్నారు. ఈ తీర్పు వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం బలపడిందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వి.ఎన్.ఖరే వ్యాఖ్యానించారు. ఎదురు తిరిగిన సాక్షులకు నోటీసులివ్వడమనే కొత్త సంప్రదాయాన్ని ఆయన స్వాగతించారు.

(ఈనాడులో వచ్చిన వార్త ఆధారంగా)

Thursday 14 December, 2006

!?


RIDING IN STYLE? A young woman gets adventurous riding a two-wheeler sitting cross-legged at Jummerat Bazar Road in Hydearabad on Tuesday. - Photo G. Krishnaswamy
(From yesterday's The Hindu)

Tuesday 12 December, 2006

నువ్వసలు...

(చిట్టికథ)
అయ్యేయెస్ ఆఫీసర్ అభయాకర్ కు తానో జీనియస్ నని ప్రగాఢవిశ్వాసం. అతడి నమ్మకం అతడికుంటే ఏ నష్టమూ లేకపోయేది. కానీ తన సంతానాన్ని కూడా మేథాశక్తిలో తనంతవాళ్ళను చేయాలనీ, తన వంశాన్ని మేథావుల వంశంగా తీర్చిదిద్దిన ఘనత తనకే దక్కాలనీ ఆరాటపడ్డాడు. చాలాకాలం సంతానం లేకపోవడం వల్ల ఆ అవకాశం కూడా అతడికి ఆలస్యంగానే చిక్కింది. అందుకే కొడుకు పుట్టినప్పటి నుంచే వాడి మేథస్సుకు మెరుగుపెట్టేవిధంగా ట్రెయినింగ్ మొదలుపెట్టాడు.

తన కొడుకుకు మూడేళ్ళు వచ్చేవరకూ ఆగి మొదటిసారిగా వాడి తెలివితేటలకో చిన్న పరీక్ష పెట్టాడు.

రెండు పరీక్షనాళికలు - ఒకటి సన్నది, ఇంకొకటి వెడల్పుది - తీసుకుని రెండింటిలోనూ అతిజాగ్రత్తగా రెండేసి స్పూన్ల నీళ్ళు పోసి దేంట్లో ఎక్కువ నీళ్ళున్నదీ చెప్పమన్నాడు. ఆ పిల్లవాడు అమాయకంగా సన్నటి నాళిక చూపెట్టాడు - దాంట్లో నీళ్ళు ఎక్కువ లోతుగా ఉండడం చూసి.

దాంతో ఆ మేథావి హతాశుడయ్యాడు. "నాలాంటి జీనియస్ కు ఇలాంటి మందబుద్ధా కొడుకుగా పుట్టడం? వాటే షేమ్? వీడసలు నా కొడుకేనా? ఎందుకైనా మంచిది. డి.ఎన్.ఏ. టెస్ట్ చేయిస్తే అసలు విషయం తేలిపోతుంది కదా?" అనుకున్నాడు.

డి.ఎన్.ఏ. టెస్టు చేయించడమా, మానడమా అన్న డైలమాతోనే ఏడేళ్ళు గడిచిపోయాయి. ఆ ఏడేళ్ళూ ఆ కొడుకు ఆలనా పాలనా వాళ్ళమ్మే చూసుకుంది. ఆ తండ్రి ఆ డైలమాలోనే మునకలేస్తూ వుండిపోయాడు.

"ఏమైనా సరే, చివరిసారిగా ఇంకోసారి ప్రయత్నిస్తాను. ఫలితం అలాగే వస్తే డి.ఎన్.ఏ. టెస్టు తప్పనిసరి" అని దృఢంగా నిశ్చయించుకుని ఆ అయ్యేయెస్ ఆఫీసర్ కొడుకును పిలిచి మళ్ళీ అవే పరీక్షనాళికలతో అదే ప్రశ్న మళ్ళీ అడిగాడు.

ఆ పిల్లాడు "నాలాంటి ప్రాడిజీని ఇంత పిచ్చి ప్రశ్న అడుగుతున్నాడు. ఈయనసలు నా తండ్రేనా? వాటేషేమ్?" అనుకున్నాడు.

(స్వీయరచన: ఫిబ్రవరి 2004 చతురకతల్లో ప్రచురితం)

Thursday 7 December, 2006

చందమామ జ్ఞాపకాలు-2

క్రింది టపాలో ప్రస్తావించిన పద్మపాదుడు-పింగళుల కథ:

ముగ్గురు మాంత్రికులు - నేను చిన్నప్పుడు చందమామ చదవడం మొదలుపెట్టినరోజుల్లో చందమామలో వస్తూండిన జానపద ధారావాహిక. దీనికి సమాంతరంగా నడిచిన పౌరాణిక ధారావాహిక వడ్డాది పాపయ్య రాసిన "విష్ణుకథ" (పోతన భాగవతానికి సంక్షిప్తరూపం). ఆరోజుల్లో బాలమిత్రలో గండభేరుండదీవి వస్తూ ఉండేది. ముగ్గురు మాంత్రికుల్లో కథానాయకుడైన పింగళుడు మాంత్రికుడు కాదు. అతడొక మామూలు జాలరి యువకుడు. అన్నదమ్ములైన ముగ్గురు మాంత్రికులు మహామాంత్రికుడైన మహామాయుడి సమాధిలోని అపూర్వ వస్తువులు - మంత్రదండం, మహిమగల ఉంగరం, బంగారుపిడిగల ఖడ్గం - సాధించుకుని రావడానికి ఒకరి తర్వాతొకరు బయలుదేరుతారు. వారిలో ఆఖరివాడైన పద్మపాదుడొక్కడే పింగళుడి సాయంతో అర్హతపరీక్షలో నెగ్గి ప్రాణాలతో బయటపడి చాణక్యుడి వలె తాను వెంట ఉండి ప్రణాళికలు వేసి సమయానికి తగిన సలహాలిస్తూ చంద్రగుప్తుడిలాంటి పింగళుణ్ణి మహామాయుడి సమాధిలోకి పంపుతాడు. ఆ సమాధి ఒక మహాసౌధం. మొదట అది నీళ్ళలో మునిగి ఉంటుంది. పద్మపాదుడు ఆ నీటిని ఇంకిపోయేలా చేసి దాన్ని బయటపడేస్తాడు. దానికి ఏడు ద్వారాలుంటాయి. ఒక్కో ద్వారం దగ్గరా తన మంత్రశక్తులతో మహామాయుడు సృష్టించుకున్న మాయలను పింగళుడు తన ధైర్యసాహసాలతో ఛేదించి సమాధిలోనికి ప్రవేశించి అపూర్వ వస్తువులను సంగ్రహించడం ప్రధాన కథ. మహామాయుడి శిష్యులు వీళ్ళను మహామాయుడి సమాధి వరకూ వెళ్ళనివ్వకుండా దారిలో తమ మాయలతో ఆటంకాలు కల్పించబోవడం, వీళ్ళు వాటిని ఛేదించుకుంటూ ముందుకు పోవడం, పనిలో పనిగా భల్లూకపర్వతాల్లో మహామాయుడిచేత బందీగా మారిన ఒక మాయావియైన రాక్షసుడొకణ్ణి (పేరు గుర్తురావడం లేదు...భల్లూకకేతుడా?) రక్షించడం, వాడు వారికిి నమ్మకస్థుడుగా మారడం, ఇంటిదగ్గర దుర్మార్గులైన పింగళుడి అన్నలకు, అహంకారియైన సేనానికి బుద్ధిచెప్పడం (ఈ సన్నివేశం బాగా నవ్వు తెప్పిస్తుంది),...అలా సాగిపోతుంది కథ.

మామూలుగా మాంత్రికులంటే జడలు, గడ్డాలు, మీసాలు పెంచి, మంత్రదండం చేతబూని విచిత్ర వేషధారణతో ఉంటారని ఊహిస్తాం. (వాళ్ళ మంత్రశక్తి అంతా ఆ జడల్లోనో, మంత్రదండంలోనో ఉంటుందని ఒక నమ్మకం.) కానీ ఇందులో పద్మపాదుడు ఏ రకమైన జడలు, జులపాలు గానీ, కనీసం గడ్డం, మీసాలు కూడా లేకుండా, ఒంటిమీద కూడా కేవలం డ్రాయరూ, బనీనుతో తలమీదుండే ఆ కొద్ది జుట్టు కూడా కనిపించకుండా అంటుకుపోయే టోపీ పెట్టుకుని ఉంటాడు. ఆ ఆలోచన బొమ్మలేసిన చిత్రాదో, సంపాదకులదో లేక రచయితదో మరి?