Monday, 17 July 2006

ఆమె ఎవరు?

ఆమె ఒక శాస్త్రవేత్త.
ఆమె వెండితెర వేలుపు.
ఆమె ఒక సాహసి.
ఆమె ఒక సౌందర్యరాశి.


శాస్త్రవేత్తగా ఆమె ఘనత: frequency hopping: మొదట ఆమె మరొక శాస్త్రవేత్తతో కలిసి రహస్య కమ్యూనికేషన్ వ్యవస్థ (Secret Communication System)ను కనిపెట్టారు. తర్వాత అదే వ్యవస్థను మరొక అడుగు ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు కనిపెట్టిన ఫ్రీక్వెన్సీ-హాపింగ్ ప్రస్తుతం మనం విరివిగా వాడుతున్న ఉపకరణాలు -వైర్లతో పనిలేని ఫోన్లు, విఫి ఇంటర్నెట్ కనెక్షన్ లాంటివాటికి ఆధారభూతమైంది. (frequency hopping రేడియో సంకేతాలు జామ్ అయ్యే అవకాశాన్ని కనిష్ట స్థాయికి తగ్గిస్తుంది.)
వెండితెర మీద: ఆమె 33 ఐరోపా మరియు హాలీవుడ్ సినిమాలలో నటించి ప్రేక్షకుల మతులు పోగొట్టింది.
ఆమె సాహసం: హాలీవుడ్ చరిత్రలో పూర్తి నగ్నంగా వెండితెర మీద కనిపించిన మొట్టమొదటి నటి ఆమే! చిత్రం: ఎక్స్టసీ (1933)
ఆమె అందం: The Heavenly Body (1944)చిత్రంలో




ఆమె పేరు: హెడీ లమర్

మన అంకెలు-అ ఆ లు

మనం రోజూ రాసే అంకెలు ఎలా ఏర్పడ్డాయో చూడండి:

ఒక గీత గీస్తే ఒకటి.
రెండు అడ్డగీతలు రాసే తొందరలో కలిసిపోగా ఏర్పడిందే 2.
మూడు అడ్డగీతలే 3.
రెండు నిలువు, రెండు అడ్డ గీతలు కలిసి 4.
ఐదు మన అరచేతి ఔట్ లైన్. బొటనవేలు విడిగానూ, మిగిలిన నాలుగు వేళ్ళనూ కప్పుతూ ఒక చంద్రవంక. మొత్తం 5 వేళ్ళు.
ఇక తెలుగు అంకెలు:

ఒకటిని సూచించడానికి మన వాళ్ళు నిలువు గీత ఎందుకు గీయలేదో తెలియదు గానీ అడ్డగీత సూటిగా ఎందుకు గీయలేదో మాత్రం తెలుసు. ఏమిటంటే పూర్వకాలంలో కాగితం లేదు కదా? తాటాకులే కదా గతి? ఆ తాటాకుల్లో పోగులు అడ్డగీతల్లాగ పైకి బాగా కనబడేవి. ఒకటికి గుర్తుగా గీసే గీత ఆ గీతల్లో కలిసిపోకుండా స్పష్టంగా కనబడ్డానికి రవంత వంపు తిప్పే వాళ్ళు. 5ను చూడండి. 4 పక్కన ఒక నిలువు గీత. అంతే మన అంకెల మర్మం.
అ ఆ లు:

మనం అ అని పలికినప్పుడు తెరుచుకునే దవడకు గుర్తుగా అర్ధచంద్రాకారాన్ని మొదట అ అనే శబ్దానికి గుర్తుగా వాడడం మొదలు పెట్టారు. అదే శబ్దాన్ని కాస్త పొడిగిస్తే అదే "ఆ". అందుకే ఆ అర్ధచంద్రాకారాన్ని పొడిగిస్తున్నట్లు తోకలాంటిది తగిలించారు.

(తిరుమల రామచంద్ర రాసిన "మన లిపి పుట్టుపూర్వోత్తరాలు" నుంచి నాకు గుర్తున్నంత వరకు)

6 నుంచి 9వరకు (నా ఊహ):
1 ని దిగ్గొడితే 6
2 కు తోక తెగ్గోస్తే 7
3 ను మూసేస్తే 8
4 ను సవరిస్తే 9
ఈ పోలికలు కాకతాళీయమేనా?

Sunday, 16 July 2006

భవిష్యదర్శనం

"ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు?" అని అందరికీ తెలిసినా తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆరాటం చాలా మందికి ఉంటుంది. అలాంటి వారు భవిష్యదర్శనం కోసం జ్యోతిశ్శాస్త్రానో(రాశిఫలాలు), సంఖ్యాశాస్త్రాన్నో, హస్తసాముద్రికాన్నో, ప్రశ్న చెప్పేవారినో, సోది చెప్పేవారినో, చిలక జోస్యాన్నో నమ్ముతూ ఉంటారు.

చివరి మూడింటినీ వదిలేస్తే మొదటి మూడింటి మీద మార్కెట్లో బోలెడన్ని పుస్తకాలున్నాయి. అంటే వీటిని నమ్మేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారన్నమాట. వీటిలో ఖగోళశాస్త్రం మీద ఆధారపడింది జ్యోతిశ్శాస్త్రం. మనిషి మీద గ్రహాలు, నక్షత్రాల ప్రభావాన్ని అంచనా వేసి చెబుతుంది. మనిషి మీద గ్రహాల ప్రభావం ఉందన్నది సుస్పష్టం. అయితే ఇది మనిషికీ, మనిషికీ మారుతూ ఉంటుంది. ప్రతి అమావాస్య, పున్నమి రోజుల్లో 'వాయి ' (వాయువు) సోకేవాళ్ళు అంటే 'ఫిట్స్ ' వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు - గతంలోనూ, ఇప్పుడూ కూడా! మిగతా రోజుల్లో వాళ్ళు ఆరోగ్యంగానే ఉంటారు. అంటే వాళ్ళ ఆరోగ్యం మీద సూర్యచంద్రుల -కనీసం చంద్రకళల- ప్రభావం ఉన్నట్లే కదా?

ఇంకో ఆసక్తికరమైన విశేషమేమిటంటే రష్యా రాజధాని మాస్కోలోని ఒక ప్రాంతంలో భూమి ప్రతి పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఉబ్బి, కొన్ని గంటల తర్వాత మామూలైపోతుందట. ఇది తెలుగుతో బాటు అనేక భాషల్లోకి అనువదించబడిన "ఖగోళశాస్త్రం-విజ్ఞానం-వినోదం" అనే రష్యన్ పుస్తకంలో ఉంది. రాసింది జ్యోతిష్కులు కాదు. రష్యన్ శాస్త్రవేత్తలు. గ్రహస్థితుల ప్రభావం గట్టినేల మీదే అంత బలంగా కనబడుతున్నప్పుడు సుతి మెత్తని మనిషి మెదడు మీద ఎందుకుండకూడదు?

ఈ గ్రహచారం అప్పుడే పుట్టిన శిశువు మెదడు మీద కలిగించే ప్రభావం ఆ శిశువు భవిష్యజ్జీవితాన్ని శాసిస్తుందని ఒక నమ్మకం. కాదనడమెందుకు? కానీ...
ఆ ప్రభావం ఎలా ఉంటుంది?
ఉన్నా అది పన్నెండు రకాలుగానే ఉంటుందా?
అట్లైతే ప్రపంచంలో పన్నెండు రకాల మనుషులే ఉండాలి కదా?
సాధారణంగా ఎవరి జాతకమైనా సౌరమానంలో ఒకరకంగాను, చాంద్రమానంలో ఇంకొక రకంగాను ఎందుకుంటుంది?

ఇవి సమాధానం లేని ప్రశ్నలు.

ఇంకో చమత్కారమేమిటంటే జాతకాల మీద ఉన్న ఏ పుస్తకమైనా తీసుకోండి. దాంట్లో మీకు తోచిన రాశి (మీ స్వంత రాశే కానక్ఖర్లేదు, ఏ రాశైనా ఫర్వాలేదు)ని ఎంచుకుని ఏముందో పూర్తిగా చదవండి. దాంట్లో కనీసం ఒకటి రెండు అంశాలైనా అచ్చం మీ గురిచే చెబుతున్నట్లనిపిస్తాయి. మీ రాశిలో మీకు వర్తించని అంశాలు కూడా చాలానే ఉంటాయి. ఈ రాశిఫలాలన్నీ తొలితరం జ్యోతిష్కులు తమ కంటికి కనిపించే వాస్తవాలకు, కనబడని గ్రహగతులకు తర్కరహితంగా ముడిపెట్టి రాసినవి. పై పెదవి చీలి ఉండే జన్యుపరమైన లోపాన్ని గ్రహణ దర్శనంతో ముడిపెట్టి గ్రహణం మొర్రి అనడం లాంటివే ఇవి కూడా. అందుకే ఆధారపడదగ్గవి కాదు. (జాతకాల మీదున్న మంచి పుస్తకాల్లో ఒక్కో రాశి కిందా ఒకటి రెండైనా "వ్యక్తిత్వ వికాస" సలహాలుంటాయి. అదొక ప్రయోజనం.)

పూర్వకాలం నుంచి మనవాళ్ళకో నమ్మకముంది. ఉత్తరం వైపు తలపెట్టి ఎప్పుడూ పడుకోవద్దని. దాని వెనకుండే వినాయకుడి కథ ఎలా ఉన్నా ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఆ నమ్మకాన్నే సమర్థిస్తుంది: భూమికి ఉత్తరధృవం, దక్షిణధృవం ఉన్నాయి కదా? ఆ రెండు దిక్కుల్లోనే భూగోళం యొక్క విద్యుదయస్కాంత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాని మూలంగా మనం ఉత్తరం వైపు గానీ, దక్షిణం వైపు గానీ తలపెట్టుకుని ఎక్కువసేపు పడుకుంటే భూ-అయస్కాంతక్షేత్ర ప్రభావం వల్ల మనకు నిద్ర లేచిన తర్వాత నీరసంగా, తలదిమ్ముగా ఉండడం, ఉత్సాహం లేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయట. ఈ విషయం ఒకసారి నేను THE HINDU Science & Technology విభాగంలో చదివాను.

ఇక ఇతర శాస్త్రాలకొస్తే సంఖ్యాశాస్త్రం బొత్తిగా ఆధారపడదగ్గది కాదు. మనం దశాంశమానం కాకుండా అష్టాంశమానాన్ని పాటిస్తే ఏడురకాల మనుషులే ఉండేవాళ్ళు-సంఖ్యాశాస్త్రాన్ని బట్టి చూస్తే. అలాగే షోడశమానాన్ని పాటిస్తే పదహైదు రకాల మనుషులుండేవాళ్ళు. ఇలాంటి శాస్త్రాన్నెలా నమ్మడం? పైన పేర్కొన్న మిగతా పద్ధతులూ అంతే!

Thursday, 13 July 2006

దశావతారాలు-2

దశావతారాల్లో మొదటి ఐదు అవతారాలు జీవ పరిణామ క్రమాన్ని సూచిస్తే తర్వాతి ఐదు అవతారాలు సామాజిక పరిణామ క్రమాన్ని సూచిస్తాయి:
పరశురామ:
సామాజిక పరిణామం ప్రాథమిక దశలో ఉన్నప్పుడు, మనుషుల్లోని పశుప్రవృత్తి పూర్తిగా సమసిపోనప్పుడు, ఆటవిక న్యాయం ఇంకా రాజ్యమేలుతున్నప్పుడు ధర్మసంస్థాపన కోసం కలుపు మొక్కల్ని నిర్దాక్షిణ్యంగా ఏరిపారేయడానికి ఆయుధం పట్టక తప్పదు. పరశురాముడు చేసింది అదే! (ధర్మసంస్థాపనకు) అడ్డొచ్చిన వాళ్ళందరినీ నరికిపారేశాడు. తర్వాత నిదానంగా ప్రజాపతుల ఆధ్వర్యంలో ధర్మబద్ధమైన పాలన, శాంతిభద్రతలు నెలకొన్నాయి. అంతే కాదు. తప్పుచేసినవారిని దేవుడే శిక్షిస్తాడంటూ తనను వారింపజూసిన మునులతో "దేవుడనేవాడు ఆకాశం నుంచి ఊడిపడడు. మనలో ఒకడిగా ఉంటూనే తప్పు చేసినవారిని శిక్షించి ధర్మాన్ని నిలబెడతాడు. ఐనా నేను దేవుణ్ణి కానని మీకెలా తెలుసు?" అని గర్జించిన పరశురాముడు బహుశా ప్రపంచసాహిత్యంలో మొట్టమొదటి విప్లవవీరుడు.

తర్వాతిది రామావతారం. "యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానామ్ సృజామ్యహమ్" అంటూ పట్టాలు తప్పిన బండిని తిరిగి పట్టాలెక్కించడమే శ్రీరాముడు చేసింది. ఇలాంటి ప్రమాదాలు అరుదుగా మాత్రమే జరిగే అవకాశమున్న త్రేతాయుగమది. ఏది ధర్మం, ఏది అధర్మం అన్న విషయంలో కూడా అస్పష్టత/గందరగోళమేమీ లేదు.(రామావతారం గురించి, రామాయణం గురించి ఇంకొక జాబు రాస్తాను.)

తర్వాతిది ద్వాపరయుగంలోని శ్రీకృష్ణావతారం. ఈ యుగంలో ధర్మం రెండు పాదాల మీదే కుంటుకుంటూ, గెంటుకుంటూ నడుస్తుందని చెప్తారు. ఇది ధర్మానికి, అధర్మానికి మధ్య సంధికాలం. ఏది ధర్మం, ఏది అధర్మం అనే విషయంలో కూడా స్పష్టత లేదు. అంతా అస్పష్టత, అయోమయమే. ఈ గందరగోళం; ధర్మాధర్మాల మధ్య ఊగిసలాట ప్రతి మనిషి ప్రవర్తనలోనూ మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఒక సందర్భంలో ఉత్తములనిపించినవారి ప్రవర్తనే ఇంకొక సమయంలో హీనంగా అనిపిస్తుంది. దీనికి మినహాయింపు బహుశా విదురుడొక్కడేనేమో? అలాంటి పరిస్థితుల్లో దేవుడే దిగివచ్చినా వాళ్ళ మధ్య నెగ్గుకురావడానికి మాయోపాయాలు, బలప్రయోగం తప్పనిసరి. కృష్ణుడంతటివాడికే తప్పలేదు! :(

మహాభారత యుద్ధంలో పద్దెనిమిది రోజుల్లో పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యం నిర్మూలమైంది. (అక్షౌహిణి అంటే 109350 కాల్బలం, 65610 గుర్రాలు, 21870 రథాలు, అన్నే ఏనుగులు అట) ఆ కాలంలోనే దానికి ముందూ ఆ తర్వాతా కూడా ఎన్నో యుద్ధాలు జరిగాయి. అంటే దేశంలోని యువకులు, ఆరోగ్యవంతుల్లో చాలా మంది చనిపోయి ఉండాలి. దాంతో సహజంగానే ఉత్పాదకత పడిపోతుంది. (పాండవబీడు అనే మాట అందుకే పుట్టింది. మిగిలింది బీడే. భూమిని సాగుచేసేవాళ్ళూ లేరు. పన్నులు కట్టేవాళ్ళూ లేరు. ఖజానా ఖాళీ. అంత పెద్ద యుద్ధం జరిగాక ఇంకేం మిగిలుంటుంది? అందుకే రాజసూయ యాగం పేరు చెప్పి ఇతరరాజ్యాల మీద పడ్డారు - దోచుకోవడానికి.) పోయినవాళ్ళు పోగా మిగిలినవాళ్ళలో కాస్త తెలివో బలమో ఉన్నవాళ్ళు ఉత్పాదకవనరులపై ఆధిపత్యం కోసం తమకు చేతనైన మార్గాల్లో ప్రయత్నించడం వల్ల మళ్ళీ అరాచకం మొదలై ఉంటుంది. ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి బుద్ధుడు రావలసి వచ్చింది.

ఇతర చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే క్రీ.పూ.6వ శతాబ్దంలో ఉత్తరభారతదేశంలో గంగా-యమునా నదీతీరాల వెంబడి నగరీకరణ భారీ స్థాయిలో జరిగింది. పెద్దపెద్దపట్టణాలు వెలిశాయి. ఒకవైపు పట్టణ సంస్కృతిలో తప్పనిసరిగా ఉండే జీవనపోరాటాలు, విచ్చలవిడితనం, అనైతికత, నేరప్రవృత్తి; ఇంకొక వైపు పెరిగిపోతున్న జంతుబలులు, పూజల పేరుతో జరిగే అర్థం పర్థం లేని తంతూతతంగాలు ప్రజల్లో అలజడి, అశాంతి పెరిగిపోవడానికి కారణాలయ్యాయి. పర్యవసానమే ప్రజలు బుద్ధుడి బోధలపట్ల ఆకర్షితులు కావడం.

ఇంతకంటే భారీస్థాయిలో అశాంతి రేగినప్పుడు, నేరాలు - ఘోరాలు అదుపు చెయ్యలేని స్థాయికి చేరినప్పుడు మళ్ళీ పరశురాముడు చేసినపనే చెయ్యవలసివస్తుంది. ఆ రెండో పరశురాముడే కల్కి.

పురాణాల్లో నాకు నచ్చిన పాత్ర పరశురాముడు.

Sunday, 9 July 2006

మెడ ముడి (నెక్ టై) - 2

చలిదేశాలవాళ్ళు శరీరంలోని వేడిమి బయటికి పోయే దార్లన్నిటినీ బలంగా మూసేస్తే తప్ప చలిని తట్టుకోలేరు. అందుకే చేతులకు గ్లవ్సు, కాళ్ళకు షూసే గాక మెడ దగ్గర చొక్కా కాలరు రెండు కొసల్నీ కలిపి ఒక గుడ్డపేలికతో గట్టిగా ముడి పెట్టుకుంటారు. అప్పుడే వాళ్ళకు వెచ్చగా ఉంటుంది. ఐతే అలా ముడేశాక గొంతు కింద వేలాడే గుడ్డ ముక్క ఇబ్బందిగానో ఎబ్బెట్టుగానో అసహ్యంగానో ఉంటుందని ఇతరులు (అనగా వేడి దేశాలవాళ్ళు) ఎక్కడ అనుకునిపొతారో అని దాన్నొక ఫాషన్ కింద మార్చేశారు. (అది, ముఖ్యంగా బౌ టై, క్రైస్తవ చిహ్నమైన శిలువను పోలి ఉంటుంది.) మనలో కొందరు వెర్రివాళ్ళు అది ఫాషనేనని, ఆ గుడ్డ పేలిక కట్టుకోకపోవడం అనాగరికమమేనని నమ్మి గొంతుకురి బిగించుకుంటున్నారు. మనది అసలే ఉష్ణదేశం. వేడి ఎక్కువ. మన శరీరాలకు వీలైనంత ఎక్కువ గాలి తగలడం అవసరం. లేకపోతే వంట్లో నిరంతరం ఉత్పత్తయ్యే వేడికి లోపలే ఉడికి ఛస్తాం. మన లాయర్లు ధరించే నల్ల కోట్లు కూడా చలిదేశం వాళ్ళైన బ్రిటీషు వాళ్ళు వాళ్ళ దేశంలోని వాతావరణ పరిస్థితులకు అనువుగా ఉండేటట్లు ఏర్పాటు చేసుకున్నదే. ఆ కాలంలో ఎవడో బుర్రలేని మూర్ఖుడు ఇక్కడా అదే పద్ధతిని ప్రవేశపెడితే రాజకీయ స్వాతంత్ర్యం వచ్చి 60 యేళ్ళైనా మన లాయర్లు, జడ్జీలు ఆ నల్లకుంపట్లలోనే నిలువునా ఉడికిపోతున్నారు. ఈ మెడముడులు, నల్లగౌన్ల మూలంగా కలిగే అసౌకర్యమొకవైపు, ఆ అసౌకర్యాన్ని అధిగమించడానికి కృత్రిమంగా కల్పించుకునే చల్లదనం కోసం అదంగా ఖర్చయ్యే విద్యుత్ శక్తి మరోవైపు. దీన్ని మన పాలకుల కంటే ముందుగా జపాన్ పాలకులు గుర్తించారు. గత నెలలో వాళ్ళు మెడముడులను పీకి అవతల పారేశారు. జపాన్ ప్రధాని కొయిజుమి "మెడముడి లేకపోవడం వల్ల ఇప్పుడు నాకెంతో హాయిగా, ఉల్లాసంగా ఉంది." అని సంబరంగా ప్రకటించారు. వాళ్ళను చూసైనా మనవాళ్ళు మేలుకుంటారా?

చలి (మెడముడి-1)

వాతావరణంలో ఉష్ణోగ్రత బాగా పడిపోయినప్పుడు అది మన శరీరం నుంచి వేడిమిని లాగేసుకుంటుంది. మన శరీరానికేమో ఉష్ణోగ్రత 98.4 సెంటీగ్రేడు డిగ్రీలకంటే తక్కువకు పడిపోతే పని జరగక పోవడమే కాదు తేడా మరీ ఎక్కువైతే ప్రమాదం కూడా. ఆ ప్రమాదం జరగకుండా ఉండాలంటే
1. మన శరీరంలోని వేడిని వాతావరణానికి అందనీయకుండా జాగ్రత్తపడాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే మనం చలి రాత్రుల్లో దుప్పట్లు, స్వెట్టర్లు కప్పుకుంటాం (వేడిని పుట్టించే విద్య దుప్పటికి తెలియదు పాపం! వంట్లోని వేడి బయటికి పోకుండా అడ్డుకోవడానికి మాత్రమే పనికొస్తుందది). లేదా
2. బయటి వాతావరణాన్ని (కనీసం మన వంటికి అంటే గాలిని) వెచ్చజెయ్యాలి. అందుకే మనం రూం హీటర్లో, చలిమంటలో వేసుకుంటాం.
3. మనం పై పనులు రెండూ చెయ్యలేదనుకోండి, మన శరీరమే నేరుగా రంగంలోకి దిగుతుంది. తాను కోల్పోతున్న వేడిని వెన్వెంటనే భర్తీ చేసుకోవడానికి కండరాలను అధిక వేగంతో చలింపజేస్తుంది. అదే వణుకు. మనకు వణుకు పుట్టినప్పుడు కండరాల మధ్య జరిగే రాపిడితో మన శరీరంలో అధికంగా వేడిమి పుట్టి శరీరం చల్లబడకుండా కాపాడుతుంది. ఐతే ఇది అత్యవసర ఏర్పాటు. ఎక్కువ సేపు వణకాలంటే ఎక్కువ శక్తి ఖర్చవుతుంది. ఇంకో తమాషా ఏమిటంటే లావుగా ఉండేవాళ్ళ కంటే సన్నగా ఉండేవాళ్ళకే ఎక్కువ చలేస్తుంది. దీనికి రెండు కారణాలున్నాయి: 1. లావుగా ఉండేవాళ్ళ శరీరపు పరిమాణానికి, ఉపరితల వైశాల్యానికి గల నిష్పత్తి సన్నటివాళ్ళ నిష్పత్తి కంటే ఎక్కువగా ఉంటుంది. శరీర పరిమాణాన్ని(బరువును) బట్టి వేడిమి పుట్టే వేగం మారుతుంది. నేరుగా గాలి తగిలే చర్మపు వైశాల్యాన్ని బట్టి వేడిమి కోల్పోయే వేగం మారుతుంది. అందుకే సన్నటివాళ్ళు కోల్పోయే ఉష్ణం భర్తీ కావడానికి లావుపాటివాళ్ళకంటే ఎక్కువ సేపు పడుతుంది. 2. సాధారణంగా లావుపాటివాళ్ళ శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ కొవ్వులో కొంత భాగం చర్మం క్రింద పేరుకుని ఉష్ణాన్ని బయటికి పోనీయకుండా అడ్డుకోవడమే గాక ఒకవేళ వణకాల్సి వచ్చినా శక్తినందించడానికి ఉపయోగపడుతుంది. (చలికాలంలో మనం ఏదైనా పని చేసేటప్పుడు చలెందుకు అనిపించదో అర్థమైందా?)

రాశుల పేర్లు

ఆకాశంలో రాత్రి పూట మీకెప్పుడైనా చుక్కల దారుల్లో మేక, ఎద్దు లాంటి ఆకారాలేమైనా కనబడ్డాయా? నేనెప్పుడు చూసినా సరళరేఖలు, కోణాలు, త్రిభుజాలు, బహుభుజాల్లాంటి రేఖాగణిత ఆకారాలే తప్ప తేళ్ళూ ఎండ్రకాయలూ నాకెప్పుడూ కనబడలేదు. అసలు విషయమేమిటంటే అక్కడ మనం ఏయే ఆకారాలు ఊహించుకుంటే ఆయా ఆకారాలు కనబడతాయి. రాశులకు ఆ పేర్లు రావడానికి వెనుక ఒక రహస్యముంది. ఆ రహస్యం తెలుసుకోవాలంటే మనం చరిత్రలో కాస్త వెనక్కెళ్ళాలి.
నక్షత్రాలను 12 రాశులుగా విడగొట్టింది, రాశులకు ఆ పేర్లు పెట్టింది బాబిలోనియన్లు. ఆయా రాశులకు, వాటికి పెట్టిన పేర్లకూ భూమి మీద తాము చేసే పనులతో చక్కగా లంకె పెట్టారు. ఎట్లాగంటే సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు మేకలు ఈనేవట. (కుక్కలకు ఉన్నట్లే మేకలకూ ఒక ఋతువుందా? నాకు తెలియదు. ఒకవేళ గతంలో ఉన్నా మేకలు మనిషితో సావాసం చేసి చెడిపోలేదు కద? ;) ).
సూర్యుడు వృషభరాశిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎద్దులను నాగలికి కట్టి నేల దున్నే వాళ్ళు. వృషభం తర్వాతిది మిథునం. నెలరోజుల పాటు వ్యవసాయప్పనులతో అలసిపోయినవారికి ఆటవిడుపు. కర్కాటక రాశిలో ఉన్నప్పుడు సూర్యుడు పీతలాగ వెనక్కి వెనక్కి నడుస్తాడు. అంటే అప్పటి వరకూ రోజురోజుకూ కాస్త కాస్త ఉత్తరానికి నడుస్తున్న సూర్యుడు దక్షిణానికి తిరుగుతాడు - అదే దక్షిణాయనం. (అప్రస్తుత ప్రసంగం: విశ్వనాథవారు వెనక్కి నడవగా నడవగా వేదకాలం ఇంకా వెనక్కెనక్కి పోయిందట - నన్ను తాకొద్దంటూ: తిలక్ కవిత్వానికి నా వ్యాఖ్యానం.) తులారాశిలో ఉన్నప్పుడు శరద్విషువత్తు Autumnal equinox: రోజులో పగలు, రాత్రి సరిగ్గా సమాన కాలం (పన్నెండేసి గంటలు) ఉంటాయనడానికి గుర్తు తక్కెడ. ధనూరాశి విల్లంబులు, ఇతర ఆయుధాలు ధరించి వేటకు వెళ్ళడానికి అనువైన సమయం. కుంభ రాశిలో ఉన్నప్పుడు కుండపోతగా వానలు కురుస్తాయి. తర్వాతి నెల మీనరాశి: చేపలవేటకు అనువైన సమయం.
ఆ కాలంలో వాళ్ళు పెట్టుకున్న పేర్లనే తర్జుమా చేసి యావత్ప్రపంచమూ వాడుకుంటోంది ఈనాటికీ.

(డా|| మహీధర నళినీమోహన్ రాసిన "కేలండర్ కథ" ఆధారంగా)

చక్కని చుక్క రోహిణి:

(ఇది ఇన్ని రాశుల యునికి... అనే పోస్టుకు కొనసాగింపు)
సూర్యోదయమప్పుడు ఏ చుక్క (నక్షత్రం) చంద్రుడికి దగ్గరగా ఉందనే దాన్ని బట్టి ఆ రోజు నక్షత్రం నిర్ణయమవుతుంది. పున్నమి రోజు చంద్రుడు ఏ చుక్కతో ఉంటే ఆ నెల పేరును ఆ చుక్క పేరు మీదుగా పెట్టేశారు మనవాళ్ళు: చిత్రా నక్షత్రమైతే చైత్రం, విశాఖ ఐతే వైశాఖం, ఇలా వరసగా. (పున్నమి నుంచి పున్నమికి దాదాపు 30 రోజులు. చైత్రమాసంలో పున్నమి రోజు చిత్రా నక్షత్రం వస్తే 27 రోజుల తర్వాత 28వ రోజు మళ్ళీ చిత్రా నక్షత్రం వస్తుంది. 29 వ రోజు స్వాతి, 30 వ రోజు విశాఖ. అదే వైశాఖ పున్నమి. ప్రతి సంవత్సరం ఇదే వరస!) ఈ చుక్కలన్నిట్లోకీ రోహిణీ మరింత చక్కని చుక్క. ఆ రోహిణీ నక్షత్రానికి పున్నమి చంద్రుడితో గడిపే అవకాశం కార్తీక మాసంలో గానీ రాదు. ఆ నెలలో పున్నమి పూర్తవకుండానే కృత్తికా నక్షత్రం వెళ్ళిపోయి రోహిణి వచ్చేస్తుంది. అప్పుడు చంద్రుడెంతగా వెలిగిపోతాడంటే అంత ప్రకాశవంతమైన వెన్నెల సంవత్సరం మొత్తం మీద మరే నాడూ ఉండదు. అసలు కార్తీక మాసానికే వెన్నెల మాసమని పేరు.
ఇక సూర్యుడి విషయానికి వస్తే సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉన్నాడనేదాన్ని బట్టి కార్తె నిర్ణయమవుతుంది. సంవత్సరానికి మొత్తం 27 కార్తెలు. ఎప్పుడు ఏ కార్తె వచ్చేదీ కాలెండర్ లో చూసి తెలుసుకోవచ్చు. (ఈ సంవత్సరం రోహిణీ కార్తె మే 25 నుంచి జూన్ 8 వరకు ఉండింది.) రోహిణీ కార్తెలో సూర్యుడెంతగా వెలిగిపోతాడో చెప్పనవసరం లేదు: "రోహిణీ ఎండలకు రోళ్ళు పగులుతాయి" అనే సామెతే ఉంది.
(అయ్యవారొచ్చేదాకా అమావాస్య ఆగనట్లే మా రాయలసీమలో ఎండలు అమ్మగారొచ్చేదాకా ఆగవనుకోండి...అది వేరే విషయం.)

Saturday, 8 July 2006

Powers of ten

భళా వీవెన్, భళా! మంచి కూడలి ఏర్పాటు చేశారు!!
powers of ten ని ఈ powers of ten తో పోల్చి చూడండి.

(ఈ రెండవ లింకు http://praveenspen.blogspot.com లో ఉన్నట్లు కూడలి లో తెలిసింది. :)

అరవయ్యో ఏట చందమామ

1947 జూలై నెలలో తెలుగులో మొదలైన చందమామ ఈ నెలలో అరవయ్యో ఏట (షష్టిపూర్తి సంవత్సరం - వజ్రోత్సవమని కూడా అనవచ్చు)అడుగు పెట్టింది. ఇది ఆసియా ఖండంలోనే మరే పిల్లల పత్రికా సాధించని ఘనవిజయమని ఈ నెల సంపాదకీయంలో పేర్కొన్నారు. ఇది చందమామ ప్రచురణకర్తలకే కాదు యావదాంధ్రులకూ గర్వకారణమైన విషయమే.
ప్రస్తుతం చందమామ 14 భాషలతో బాటు 5 ద్విభాషా ఎడిషన్లలో కూడా వెలువడుతోంది. ఇది ప్రపంచంలో మరెక్కడా కానరాని విశిష్టత. చందమామ గురించి మరిన్ని విశేషాలను వికీపీడియా లో చదవండి.
ప్రస్తుతం అది అక్కడ విశేష వ్యాసంగా ప్రదర్శితం కావడం కాకతాళీయమే అయినా "రాయాలి రాయాలి" అని కొన్ని నెలలుగా నేను అనుకుంటున్న ఆ వ్యాసం ఈ వజ్రోత్సవ శుభవేళకల్లా సిద్ధం కావడానికి కారకుడు మాత్రం వీవెన్. వీవెన్ చెప్పిన ఒక చందమామ కథ సాహిత్యం గ్రూపులో చదివిన వెంటనే ఆపుకోలేనంత ఆవేశమొచ్చి వికీపీడియాలో ఆ వ్యాసానికి నేను శ్రీకారం చుట్టడమూ, వెన్వెంటనే వైఙాసత్య, కిరణ్, చదువరి, ప్రదీపు తదితరులంతా తలా ఓ చెయ్యి వేసి దాన్ని పూర్తి చెయ్యడమూ జరిగాయి:

వీవెన్ చెప్పిన చందమామ కథ:

అనగనగా ఒక ఊరిలో సోమయ్య అనే వాడు ఉండేవాడు.వాడు పనీపాటా ఏమీ లేక జులాయిగా
తిరుగుతూ ఉండేవాడు.అంతేకాక, కనపడిన వాళ్ళందరిని తిక్క ప్రశ్నలు వేసి
విసిగించేవాడు.వీడంటే ఊళ్ళోనివారందరికీ చిరాకే!
ఓరోజు, సోమయ్య అడవిమార్గం గుండా పక్క ఊరికి బయలుదేరాడు. ఎవరూ కనబడక వీడికి ఏమీ
తోచట్లేదు.అలా వెళ్తూ ఉండగా, గొర్రెలు మేపుకొంటున్న పిల్లలు కనిపించారు.భలే
దొరికారు అనుకొని వారి దగ్గరకు వెళ్ళాడు.పిల్లలకి సోమయ్య సంగతి తెలియడంతో,
అందరూ పారిపోయారు, ఒక్క గోపీ తప్ప.
గోపీ కి వీడంటే కోపం.
ఎలాగైనా పగ తీర్చుకోవాలి అనుకొన్నాడు
సోమయ్య వచ్చి గోపీ ప్రక్కనే చెట్టుకి ఆనుకొని కూర్చొని, తన ప్రశ్నల దండకం
మొదలుపెట్టాడు.
"ఒరే అబ్బిగా, ఈ గొర్రెలు రోజుకి ఎంత గడ్డి తింటాయంటావ్?"
గోపీ వినయంగా, "ఏవండి, తెల్లవా? నల్లవా?" అని అడిగాడు.


సోమయ్య: తెల్లవైతే?
గోపీ: ఓ పది మోపులు
సో: మరి నల్లవో?
గో: అవి కూడా 10 మోపులే


సో: ఒక్కో గొర్రె నుండి ఎంత ఉన్ని వస్తుందంటావ్?
గో: తెల్లవా? నల్లవా?
సో: తెల్లవైతే?
గో: 5 కిలోలు
సో: మరి నల్లవో?
గో: అవి కూడా 5 కిలోలే!
ఆ జవాబులకి సోమయ్యకి చిర్రెత్తుకొచ్చింది.
ఇంతలో గోపీ సోమయ్యని వెక్కిరిస్తూ పరుగందుకొన్నాడు.


సోమయ్య గోపీ ని తిడుతూ, "ఒరే పిల్ల వెధవా, నీకేమైనా వెర్రివాడిలా
కనిపిస్తున్నానా?" అని అరిచాడు.
దానికి గోపీ మరింత వెక్కిరింతగా, "నాకేంటీ, ఊర్లో సగం మందికి నువ్వు వెర్రి
వాడివే?"
సోమయ్య ఉండబట్టలేక, "మరి మిగతా సగం మందికో?" అని అడిగాడు.
"వాళ్ళకి కూడా వెర్రివాడివే!" అని కేరింతలు కొడుతూ, సోమయ్యకి అందనంత దూరం
పారిపోయాడు.