Monday 25 June, 2007

కవితలు రాయడమే నేరమా?

ఈ రాజకీయనాయకుల వాచాలతకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. మొన్న శరద్ పవార్, లాలూ ప్రసాద్ యాదవ్, నిన్న ఎ.బి.బర్ధన్.

“The President said he was deeply wounded by the attack on him after he decided to accept our offer to contest. He has been deeply hurt by the statement of those in high positions. The kind of boorish and churlish language that has been used amounts to denigration of the high post of President and does not befit the high positions held by those [Union Ministers] who have used such language.”

వాళ్ళ అతివాగుడుకు రాష్ట్రపతి నొచ్చుకున్నారని తెలిసీ - ఆయన పోటీ చెయ్యబోనని తేల్చి చెప్పిన తర్వాత కూడా - "రాష్ట్రపతి పని కవితలు రాయడం కాదు" అంటూ ఇంకా ఏమేమో వాగుతున్నాడొకాయన. కవితలు రాయడమే కలామ్ గారు చేసిన తప్పన్నట్లు మాట్లాడుతున్నాడీ సిగ్గులేని పెద్ద మనిషి. ఉన్నతపదవుల్లో ఉన్నవారి గురించి ఇంత హేళనగా, దురుసుగా మాట్లాడ్డమేనా ఈ రాజకీయనాయకుల సంస్కారం? వీరిదే మరో అమృతవాక్కు: రాజకీయానుభవం లేనివాళ్ళు రాష్ట్రపతిగా ఉండతగరట! రాజకీయులే నేరం చేసినా....క్షమించాలి, ఈ పుణ్యభూమిలో రాజకీయులేం చేసినా, ఏం వాగినా అది నేరం కాదుకదా? స్వార్థప్రయోజనాల కోసం, మూర్ఖపు పట్టుదలలు నిలుపుకోవడం కోసం ప్రజాభీష్టానికి, ప్రజాశ్రేయస్సుకు వ్యతిరేకంగా పనిచెయ్యడం రాజకీయులకే కదా సాధ్యం?

అసలు రాష్ట్రపతి చేయవలసిన పనేమిటి? రాజకీయులు తీసుకునే నిర్ణయాల్లో దేశప్రజలకు ఏది మేలు చేస్తుందో, ఏది రాజ్యాంగస్ఫూర్తికి అనుగుణంగా ఉందో, ఏది విఘాతం కలిగిస్తుందో తెలుసుకోవడానికి రాజకీయానుభవం అవసరమా? కలామ్ గారిని వీళ్ళు కేవలం కవితలు రాసేవాడిగానే చూస్తున్నారంటే వీళ్ళ గురించి ఏమనుకోవాలి? లేక...కవితలు రాయడాన్ని వీళ్ళు అనర్హతగా భావిస్తున్నారనుకోవాలా? అసలు ప్రజాస్వామ్యదేశంలో ప్రజల మనోభావాలను తుంగలో తొక్కిన ఈ రాజకీయ నాయకులు ఇలా ఈ దేశపు ప్రథమ పౌరుడు, సర్వసైన్యాధ్యక్షుడిపై ఇలా అవాకులు, చెవాకులు పేలుతున్నా వీళ్ళను అదుపు చేసేవాళ్ళే లేరా? తాము విమర్శిస్తున్నది సాక్షాత్తూ ఈ దేశాధ్యక్షుణ్ణే అనే స్పృహ వీరికేమాత్రమైనా ఉందా? ఈ దేశంలో ఇంకా గౌరవాన్ని నిలుపుకున్న పదవి రాష్ట్రపతి పదవొక్కటే. రాజకీయులు ప్రస్తుతం దాని గౌరవాన్నీ దిగజార్చే పనిలో ఉన్నారు.
అసలు ఈ రాష్ట్రపతి, ఉపరాష్ట్రతి పదవులకు సంబంధించి ఏది సంప్రదాయం, ఏది కాదు అనేవిషయం గురించి కూడా అధికారంలో ఉన్నవాళ్ళు తమ వాదనకు ఏది అనుకూలంగా ఉంటే దానికి "సంప్రదాయం" అని పేరు పెట్టి అడ్డగోలుగా వాదించేస్తున్నారు.

స్వాతంత్ర్యమొచ్చిన నాటి నుంచి తొలి పాతికేళ్ల కాలంలో రాజకీయనాయకులెవరూ రాష్ట్రపతులు కాలేదు. ఇప్పుడేమో రాజకీయనాయకులకు తప్ప ఇతరులకు ఆ అర్హత లేదంటున్నారు. ఈ కొత్త 'సంప్రదాయం' ఎక్కణ్ణించి వచ్చింది?

ఒకే వ్యక్తి రాష్ట్రపతిగా రెండుసార్లు ఉండకూడదంటున్నవాళ్ళు ఆమేరకు రాజ్యాంగసవరణ ఇన్నేళ్ళూ ఎందుకు చెయ్యలేదు? అవున్లే, 'సంప్రదాయం' అని పేరు పెడితే, అవసరమొచ్చినప్పుడు తమకు నచ్చిన విధంగా వాడుకోవచ్చు, అవసరం లేనప్పుడు "ఈ ఒక్కసారికీ" అని మినహాయించుకోవచ్చు, లేదా "అబ్బే, అదసలు సంప్రదాయమే కాదు! ఒకవేళ సంప్రదాయమే ఐనా పాటించనక్ఖర్లేదు" అని చేతులు దులుపుకోవచ్చు. రాజ్యాంగసవరణ చేస్తే ఆ అవకాశముండదు కదా?

Sunday 17 June, 2007

చెప్పుకోండి చూద్దాం

మొన్న రానారెకు పుట్టిన నవ్వే ఈపొద్దు నాకూ పుట్టింది. (అసలు ఇది ఎప్పుడో... పుట్టాల్సిన నవ్వ!) కాచుకోండి:

1. "కుయ్యో మొర్రో" అనడం అందరికీ తెలుసు. పోతన కూడా శ్రీమహావిష్ణువు గజేంద్రుడి "కుయ్యాలించి సంరంభియై" సిరికింజెప్పక పరిగెత్తుకొచ్చినాడని రాసినాడు. మరి కుయ్యి అంటే ఏమిటి?
2. అబాపురి = ?
3. అబ్బి = ?
4. అమ్మి = ?
5. ఓదె = ?
6. కూసం ? (కుబుసం కాదు)
7. తీటగందెరాకు ?
8. పదును ? (పదను కాదు)
9. బెట్ట ?
10. మడవ ?
11. మాసూళ్ళు ?
12. మెట్టు ? (stair కాదు)
13. లెక్క ? (గణిత సంబంధ పదం కాదు)
14. వారు ? (ఏకవచనమే!)
15. సరివాల ?



అసలివన్నీ తెలుగు పదాలేనా అన్న అనుమానం కూడా మీకు వచ్చి ఉండొచ్చు... (ముగ్గురు నలుగురికి తప్ప)! నవ్వ మాదిరే ఇవి కూడా (మొదటిది తప్ప) కడప జిల్లాలోని వాడుక పదాలు. వాటిలో కూడా వ్యవసాయ సంబంధ పదాలు ఎక్కువగా ఉన్నాయి.
(2, 7, 15 పదాల ఉచ్చారణలో తేడాలుండవచ్చు)

Thursday 7 June, 2007

ద్రౌపది ప్రేమ

స్వాతి కుమారి రాసిన కవిత గురించి సాహిత్యం గుంపులో రాస్తూ రానారె "మహాభారతంలో ద్రౌపది ఒకసారి కృష్ణుని అడుగుతుందిట - (బహుశా కర్ణునికూడా భర్తగా పొందాలనే తన కోరికను వెల్లడించే సన్నివేశంలో)" అన్నారు. ద్రౌపది కర్ణుణ్ణి కూడా భర్తగా పొందాలనుకోవడమేమిటి? నేనిది ఎక్కడా చదవలేదు, వినలేదు - ఒక్క దానవీరశూరకర్ణ సినిమాలో తప్ప. సినిమాలు వ్యాపారదృక్పథంతో తీసేవి (అన్నీ కాకపోయినా చాలా మట్టుకు). వాస్తవఘటనలను ఆధారంగా చేసుకుని తీసినవాటిలో కూడా వాస్తవాలకంటే అతిశయోక్తులు, వక్రీకరణలే ఎక్కువ. ద్రౌపది విషయానికి వస్తే ఆమెకు కర్ణుడి మీద ఆ దృష్టి ఎంతమాత్రమూ లేదనేందుకు తిరుగులేని ఆధారం స్వర్గారోహణపర్వంలో ఉంది. పాండవులు రాజ్యం వారసులకు అప్పగించి ద్రౌపదీసమేతంగా హిమాలయాల్లో పడి పోతున్నప్పుడు ముందుగా ద్రౌపది నేలకూలుతుంది. అయినా అర్జునుడితో సహా నలుగురు పాండవులు తిరిగైనా చూడకుండా స్వర్గం వైపు వెళ్తుంటే భీముడు ఆమె చనిపోయినందుకు విలపిస్తూ 'ఎందుకిలా జరిగింది?' అని అడిగితే యుధిష్టిరుడు ఇలా అంటాడు: "ఆమెకు మిగిలిన తన భర్తలకంటే అర్జునుడి మీదే ప్రేమ ఎక్కువ. (అదే ఆమె చేసిన పాపం. అందుకే ఆమె చచ్చిపోయింది)". అసలు ద్రౌపది ప్రేమించిందీ, పెళ్ళాడాలనుకున్నదీ అర్జునుడొక్కణ్ణే. అప్పటివరకూ బ్రతికాడో చచ్చాడో తెలియని అర్జునుడు కట్టెదుట కనిపించేసరికి ఆనందపరవశురాలైన అయిన ఆమె 'అతణ్ణి పెళ్ళాడాలంటే మమ్మల్నందరినీ కూడా పెళ్ళాడకతప్పదు' అని యుధిష్టిరుడు పెట్టిన నిబంధనకు తలొగ్గింది. 'ఇదెక్కడి అన్యాయం?' అని అప్పుడే నిలదీయకుండా పరిస్థితులతో రాజీపడింది. అలాంటామె తన ప్రేమను జీవితాంతం ఐదుగురు భర్తలకు "సమానంగా" పంచి ఇవ్వడం ఎలా సాధ్యమౌతుంది? అలా ఉండాలనుకోవడం ఘోరమైన అన్యాయం కాదా?
ఆమె కర్ణుణ్ణి కోరుకున్నమాటే నిజమైతే ఇక్కడ యుధిష్టిరుడి సమాధానమెలా ఉండేదో మీరే ఊహించవచ్చు. ఒక పరపురుషుణ్ని కోరుకున్న పాపానికి అసలు ఆమెను స్వర్గలోక ఛాయలకైనా రానిచ్చి ఉండేవారు కాదు.

ఇంతకూ అక్కడ రానారె అడిగిన ప్రశ్నకు సమాధానం నాకు తెలియదు. మీకేమైనా తెలిస్తే చెప్పండి.

Sunday 3 June, 2007

మన నగరాలు

రోము నగరానికి 2760 ఏళ్ళు నిండాయని సంవత్సరం పాటు ఉత్సవాలు నిర్వహించారు. అవి ఇటీవలే ముగిశాయి. ఈ లెక్క చారిత్రక ఆధారాలను బట్టి కాదు-రోమన్ కావ్యాల ప్రకారం. ఈ సందర్భంగా మన నగరాల గురించి చరిత్ర ఏం చెబుతుందో విందాం:

ముందుగా ఢిల్లీ గురించి:

ఢిల్లీలో పురానా ఖిల్లా అని ఒక కోట ఉంది. (ఢిల్లీలో లెక్కలేనన్ని కోటలున్నాయి. శతాబ్దాల పాటు అనేక పాలకుల/రాజవంశీకులకు రాజధానిగా ఉంది కాబట్టి అది సహజమే! అందువల్ల ఢిల్లీని కోటల నగరం - city of forts - అని కూడా అంటారు.) ఆ పురానా ఖిల్లా సమీపంలో పేరుకు తగినట్లే కనీసం మూడువేలయేళ్ల కిందటికాలానికి చెందిన పాతరాతియుగం నాటి జనావాసాలు బయటపడ్డాయి. అలా కాక మనం మహాభారతంలోని ఇంద్రప్రస్థాన్నే నేటి ఢిల్లీ నగరంగా తీసుకుంటే ఆ నగరం క్రీ.పూ.3150 నాటిదనుకోవాలి. అంటే దాదాపు 5150 సంవత్సరాలనాటి నగరమన్నమాట. ఈ నగరం మౌర్యుల కాలం (క్రీ.పూ.౩౦౦) నుంచి దినదినప్రవర్ధమానమౌతూ వచ్చింది.

తోమార రాజవంశీకులు ఇక్కడ క్రీ.శ. 736లో లాల్ కోట్ పేరుతో నగరాన్ని నిర్మించారు. అప్పట్నుంచి ఈ నగరాన్ని లెక్కలేనన్ని సార్లు విస్తరించడం జరిగింది - ఒక్కో పాలకుడు ఒక్కోవైపు. అలాంటి విస్తరణల్లో అతి ముఖ్యమైనవి మధ్యయుగంలోని ఢిల్లీ సుల్తానులు/మొఘలు చక్రవర్తుల కాలంలో జరిగిన ఏడు భారీ విస్తరణలు. అవి ఒక్కొక్కటీ ఏకంగా ఒక్కో నగరాన్నే సృష్టించి ఢిల్లీలో కలిపేశాయి. వాటిని 7 cities of Delhi అంటారు. ఆ తర్వాత బ్రిటిష్ కాలంలో ఎడ్వర్డ్ లుటియెన్స్ అనే ఆర్కిటెక్టు కొత్త ఢిల్లీకి రూపకల్పన చేశాడు. దాని కేంద్రభాగంలో గొప్ప వాణిజ్యకేంద్రాలుగా విలసిల్లుతున్న ప్రాంతాలు: కన్నాట్ సర్కిల్, కన్నాట్ ప్లేస్. ఇక ఇండియా గేటుకెదురుగా పార్లమెంటు భవన సముదాయాన్నానుకుని రైసీనా హిల్ మీద రాచఠీవితో వెలిగే రాష్ట్రపతిభవన్ లో అబ్దుల్ కలామ్ తర్వాత కొలువుదీరబోయేది ఎవరా అని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

కలకత్తా నగరం: కలకత్తా నగర నిర్మాతగా జాబ్ చార్నాక్ అనే ఆంగ్లేయుడి పేరును చెప్పుకున్నారు చాలా ఏళ్ళ పాటు. ఐతే కలకత్తా నగరానికి కూడా సుదీర్ఘమైన (రెండువేలయేళ్ళ పైబడిన) చరిత్ర ఉందని, జాబ్ చార్నాక్ ను కలకత్తా నగర నిర్మాతగా పేర్కొనడం తప్పని ఒక చరిత్రకారుడు కలకత్తా హైకోర్టులో కేసువేసి, సరైన ఆధారాలతో నిరూపించడంతో ఆ మేరకు చరిత్రపుస్తకాలన్నిటిలోనూ మార్పులు చెయ్యమని హైకోర్టు తీర్పునిచ్చింది.

ముంబాయిదింకో చరిత్ర: మన దేశంలో ప్రతి ఊరికీ ఒక గ్రామదేవత ఉన్నట్లే ఈ నగరానికీ ఒక దేవత ఉంది. ఆమె పేరు మహా అంబ లేక ముంబాదేవి. నగరంలోని ముంబాదేవి ఆలయంలో ఇప్పటికీ పూజలందుకుంటోంది. ఎలా పుట్టిందో తెలియని "బాంబే" అనే అపభ్రంశపు పేరును మార్చి తిరిగి ఆమె పేరుమీదుగానే ఈ నగరానికి ముంబాయి అని పేరుపెట్టారు. ఇది ఏడు దీవుల మీద నిర్మించబడిన నగరం. క్రీ.పూ. 250లో టాలెమీ దీన్ని Heptanesia లేక సప్తద్వీపనగరం అన్నాడు. ఉత్తరముంబాయిలో రాతియుగం నాటి ఆవాసాలున్నట్లు ఆధారాలున్నాయి. 1534లో దీన్ని బహదూర్ షా అనే గుజరాత్ నవాబు నుంచి ఆక్రమించుకున్న పోర్చుగీసువారు 1661లో ఈ నగరాన్ని కట్నం కింద బ్రిటిష్ రాజుకివ్వడం, ఆయన దాన్ని 1668లో ఈస్టిండియా కంపెనీకి లీజుకివ్వడం (సంవత్సరానికి 10 పౌండ్లకు!) తెలిసిన విషయాలే.